తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం?

మన భాషను తెలుగు, తెనుగు, ఆంధ్రము అంటూ ప్రాచీన కాలం నుంచి వివిధ చోట్ల ప్రస్తావించడం మనకు సుపరిచితమే. తెలుగు, తెనుగు, ఆంధ్రము వీటిల్లో ఏది ప్రాచీనమయినది? మొట్టమొదట మన భాషను ఏ పేరుతో వ్యవహరించేవారు? మిగిలిన రెండు పేర్లు వ్యవహారంలోకి ఎందుకువచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఈ పదాలకున్న అర్థాలు ఏమిటి? దీనిపై నాటి సంప్రదాయ కవులు, వ్యాకర్తలు నుంచి ఆధునిక కాలపు చరిత్రకారులు, భాషవేత్తలు వెలువరించిన అభిప్రాయలను సంక్షిప్తంగా సరళంగా పరిచయం చేయడమే ఈ వ్యాసపు ముఖ్యోద్ధేశ్యం.

ఆంధ్రము

తెలుగు, తెనుగు, ఆంధ్రము అన్న మూడు పదాలు నేడు సమానార్థకాలుగా ఉపయోగిస్తున్నా, సంస్కృత వాఙ్మయంలో ఆంధ్రము అన్న శబ్దమే అత్యంత ప్రాచీనమైనది. తమకు చిక్కిన శత్రువులకు అంధత్వం శిక్షగా వేస్తారు కాబట్టి ఆంధ్రులన్నారని, అంద, అంధక అన్న ప్రాకృత శబ్ద సంస్కృతీకరణే ఆంధ్ర అని కొందరు అభిప్రాయపడుతున్నారు కాని ఈ ఊహలను బలపరిచే ఆధారాలు ఏవీ లేవు. ఆంధ్ర శబ్దం మొట్టమొదటగా క్రీ.పూ. 600 ప్రాంతం నాటి ఐతరేయ బ్రాహ్మణంలో జాతివాచకంగా కనిపిస్తుంది. విశ్వామిత్రుడు వెలివేసిన తన అవిధేయులైన పుత్రులే ఆంధ్రులు అని అందులో చెప్పబడింది.

ఏతేఽన్ధ్రాః పుండ్రాః శబరాః పులిందా మూతిబా ఇతి
ఉదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనాం భూయిష్ఠాః
(ఐతరేయ బ్రాహ్మణ 7.18.2)

పై వాక్యానికి కొందరు మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. పైన పేర్కొనబడిన జాతులతో విశ్వామిత్రుని కుమారులు కలిసిపోయారన్నది ఆ వ్యాఖ్య సారాంశం. అలా అయితే ఆంధ్రులు క్రీ.పూ. 600 మునుపే ఒక జాతిగా ఉనికిలో ఉన్నారని తెలుస్తుంది. ఆ ఆంధ్రులు మాట్లాడే భాషను ఆంధ్రము అన్నారు. ఇలా ఆంధ్రము అన్నది జాతిపరంగా సిద్ధించిన గౌణనామధేయము.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతులు, భాషలు, ప్రాంతాలను చూస్తే వాటి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఓ భాష మాట్లాడటం వలన ఆ భాష మీద ఆ జాతికి పేరు ఏర్పడిందా? లేక ఆ జాతీయులు మాట్లాడే భాష గనుక ఆ జాతి పేరుతో ఆ భాషనూ పిలిచారా? ఓ ప్రాంతంలో ఓ జాతి నివసిస్తున్నందువల్ల ఆ ప్రాంతం పేరు మీదగా ఆ జాతిని పిలుస్తున్నరా? జాతివల్లే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందా? వీటికి సమాధానం దొరకడం కష్టం. కాని వాటి మధ్య పరస్పర సంబంధం మాత్రం ఉంటుంది.

తెలుగు/తెనుగు, ఆంధ్రము రెండూ చాలా భిన్నమైనవి. నేటి వ్యవహారం ప్రకారం జాతీయత ఆంధ్రము, భాష తెలుగు. తెలుగుజాతి మనది అని వాడటం ఇటీవల కాలం నాటిది. నా దృష్టిలో, మనకుగల ఈ వైరుద్ధ్యానికి కారణం నేటి తెలుగు మాట్లాడే వారంతా ఏకజాతీయులు కాకపోవడం. అనాది కాలంగా అనేక జాతులు ఈ ప్రాంతంలో ఈ భాషలో మమేకమై పోయారు. ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్న జాతులే కాక పురాణాల ప్రకారం నాగులు, యక్షులు, అశ్మక మహిషకులు మొదలైన జాతులు కలసిపోయిన వారిలో ఉన్నారు. అలాంటి వారిలో ఆంధ్రులు ఒకరు. వారు సాధించిన రాజకీయ ఆధిపత్యం వల్ల ఆనాడు తెలుగుని ఆంధ్రము అని పిలిచి వుండవచ్చు. వారికి ఉన్న ఘనచరిత్రకి వారసులం అని చెప్పుకోవడం నేటి తెలుగువారు ఆంధ్రజాతీయతను అంగీకరించి వుండవచ్చు. కాని నేడు ఎవరు ఆంధ్రులు, ఎవరు తెలుగువారు, ఎవరు నాగులు, యక్షులని చెప్పలేము. శతాబ్దాల తరబడి ఒకే ప్రాంతంలో కలసి వున్నందున, యుగయుగాలుగా భిన్న ఆర్థిక రాజకీయ కారణాల వల్ల జరిగే సామాజిక పరివర్తన ఫలితంగా జాతిసాంకర్యంలో వాటి ఆనవాళ్ళు కొట్టుకుని పోయాయి. ఆంధ్రాది జాతులు వారి మాతృభాషను విడిచి తెలుగుభాషలో కలిసిపోయారు అంటే స్థూలంగా: 1. మిగిలిన జాతులకంటే తెలుగు మాట్లాడే జాతి సంఖ్య చాలా హెచ్చుగా ఉండేదని, 2. తెలుగువారు ఆ భాషను మొట్టమొదట నుంచి మాట్లాడుతున్న జాతి బహుశా, ఆంధ్రజాతి కంటే ప్రాచీనమైనదని, అనుకోవచ్చును. అందువల్లనే నేటికి కూడా శిష్టవ్యవహారములో మనజాతికి భాషకు ఆంధ్ర, ఆంధ్రము అని వ్యవహరిస్తూ వున్నా ఎక్కువమంది ప్రజలు ఆంధ్రమని వ్యవహరించడం లేదు.

తెలుగు – తెనుగు

ఆంధ్ర శబ్దం జాతివాచకంగా భాషావాచకంగా మనకు అర్వాచీనంగా సిద్ధిస్తే అంతకు ముందు మన భాషకు తెలుగు అనిగాని తెనుగు అనిగాని వ్యవహారంలో ఉండాలి. ఈ రెండు శబ్దాలలో ఏది ప్రాచీనమైన శబ్దమో తెలిస్తే మన భాషకు ఆది నుంచి వ్యవహారములో వున్న పేరేమిటో మనం తెలుసుకోవచ్చు. కాని ఈ శబ్దాల ప్రాచీనత మీద, వ్యుత్పత్తి మీద చాలా సందేహాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తెలుగు ప్రాచీనమన్నారు. మరికొందరు తెనుగు ప్రాచీనమని, తొలి తెలుగు సాహిత్యములో తెనుగన్న శబ్దమే కనిపిస్తుందని, తరువాత వచ్చిన సాహిత్యములో మాత్రమే తెలుగన్న శబ్దము కనిపిస్తుందని వాదించారు. వీరి వాదనలను పరిశోధనలను క్రోడీకరించి తెలుగు, తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనమో తెలుగుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం.

ముందుగా తెనుగు అన్న శబ్దాన్ని విచారిద్దాం.

తెనుగు

తొలి తెలుగు సాహిత్య గ్రంథాలలో తెనుగే ఎక్కువగా కనిపిస్తుంది. తొలి తెలుగు కావ్యం అని చెప్తున్న నన్నయ (క్రీ.శ 11వ శతాబ్ది) ఆంధ్రమహాభారతంలో తెనుగుభాష అనే అన్నాడు.

“దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్” (ఆదిపర్వం – 16)

“నానారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా…” (ఆదిపర్వం – 26)

తెలుగులో ఇప్పటి వరకు లభించిన గ్రంథాలలో ఇదే అతిప్రాచీనమైనది. ఇదే గ్రంథములో నన్నయ ఆదికవిగా తనను తాను ప్రకటించుకున్నాడు. దానితో చాలా మంది నేడూ ఏకీభవిస్తున్నారు. నన్నయ భారతం తరువాత మనకు లభిస్తున్న ప్రాచీన తెలుగు గ్రంథము నన్నెచోడుని కుమార సంభవము. ఈ గ్రంథములో కూడా తెలుగు భాషను తెనుగనే వ్యవహరించారు. నన్నెచోడుడు 12వ శతాబ్దికి చెందినవాడని చెప్తారు.

“దేశికవితఁ బుట్టించి తెనుంగున నిలిపి”
“సరళముగాగ భావములు జానుఁ దెనుంగున నింపు పెంపుతోఁ”
(కుమారసంభవము – పీఠిక)

నన్నయ, నన్నెచోడుడు ఆదికవులుగా మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. వీరిద్దరూ ఎక్కడా తెలుగు, తెలుంగు అన్నపదాలు వాడలేదు కేవలం తెనుగు శబ్దాన్ని మాత్రమే భాషాపరంగా ప్రయోగించారు. ఇంచుమించు నన్నెచోడుడికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుడు తన బసవపురాణములో కూడా తెనుగు శబ్దప్రయోగాన్ని చేశాడు.

“సరసమైన పరగిన జానుఁదెనుంగు” (బసవ. పు. ఏపు-4)

13వ శతాబ్ధికి చెందిన తిక్కన కూడా తన భారత అవతారికలో తెలుగుభాషను తెనుగనే సంభోదించాడు.

“బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబు లై పెంపునం దుదిముట్టన్‌” (విరాట్ పర్వం – 7)

“తెనుఁగుబాస వినిర్మింపఁదివురుటరయ” (విరాటపర్వం – 18)

కాని, పాల్కురికి సోమనాథుడు, తిక్కన తెనుగుతో పాటు తెలుగు శబ్దాన్ని కూడా వాడారు. అక్కడక్కడ తరువాతి కాలంలో కూడ కొందరు తెనుగు శబ్దాన్ని ప్రయోగించినా, తెలుగన్న పదమే మనభాషకు చివరకు స్థిరపడిపోయింది. ఇలా సాహిత్యపరంగా చూసి కొందరు తెనుగే ప్రాచీనం, తెనుగు నుంచి తెలుగు రూపాంతరం చెందింది అని భావిస్తారు.

న-ల అబేధాలు

తెలుగు – తెనుగు వేరు వేరు అర్థాలు కలిగివున్న పదాలు కావు, ఒకే ధాతుజాలు. ఒకదాని నుంచి మరొకటి రూపాంతరం చెందింది. తెలుగు – తెనుగులో తేడా, ల – న స్థానాలలో ఉన్న మార్పు మాత్రమే. తెలుగులో ల-కార, న-కారాలు దంతమూలియాలు. అందుచేత అవి పరస్పరం మారడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మార్పు మూలద్రావిడ భాషలో కూడా జరిగేదని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి నిరూపించారు.

  • లకారం నకారంగా మారిన కొన్ని పదాలు:

    లచ్చి – నచ్చి
    లంజ – నంజ
    లెగు – నెగు
    లాంగలి – నాగలి
    లేదు – నేదు
    లావు – నావు

  • నకారం నుంచి లకారంగా మారిన పదాలలో కొన్ని:

    మునగ – ములగ
    తెనగవాళ్ళు – తెలగవాళ్ళు
    చెనగు – చెలగు
    సెనగలు – సెలగలు
    మునుగు – ములుగు
    జన్మం – జలమం

కాబట్టి తెలుగు, తెనుగు శబ్దాల పరస్పర మార్పిడి వినియోగపరంగా చాలా ప్రసిద్ధికెక్కిన వర్ణపరిణామం. ఇవి ఒకదాని నుంచి ఒకటి రూపాంతరము పొందిన పదాలే తప్ప భిన్న ధాతుజాలు కావు. ఏ శబ్దం యే శబ్దంగా రూపాంతరము చెందిదో తెలిస్తే ఏది ప్రాచీన పదమో తేలిపోతుంది. ఒక పదం యెక్క ప్రాచీనతను, ప్రాచీన రూపాన్ని కనుక్కోవడంలో నేడు తులనాత్మక భాషాశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతోంది. పరిశీలించవలసిన పదాన్ని అదే భాషకుటుంబానికి చెందిన జ్ఞాతిపదాలను (cognates) తీసుకుని తుల్యం చేయడం ద్వారా ఏ రూపం నుంచి ఏ రూపానికి ఆ పదం వచ్చింది, వాటి మూలరూప పదం ఏమిటి అని నిర్థారిస్తారు. ఈ విధమైన తులనాత్మక పరిశీలనలో పదాల, భాషల ప్రాచీనతల నిర్థారణే కాకుండా మూలభాషా స్వరూపాన్ని కూడా పునర్నిర్మించగలుతాము. ఇలా తులనాత్మక అధ్యయనం ద్వారా ఫలితం రాబట్టాలంటే తెలుగు/తెనుగు అన్న శబ్దానికి అర్థమేమిటో తెలియాలి. తద్వారా అదే అర్థాన్ని కలిగివున్న సోదరపదాలను (cognates) తీసుకుని మూలరూప నిర్ణయం చేయవచ్చు.

తెలుగు శబ్దానికి ప్రాచీన కాలం నుంచి నేటివరకు చాలా మంది పండితులు వ్యుత్పత్తి చెప్పడానికి ప్రత్నించారు. ఆ వ్యుత్పత్తులు స్థూలంగా మూడు రకాలు: తెలుగు ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన సంస్కృత శబ్దమని కొందరు, అచ్చతెలుగైన ద్రావిడ పదమని కొందరు, ముండా భాషలనుంచి వచ్చిందని మరికొందరు ప్రతిపాదించారు.

త్రిలింగమే తెలుగు

ఇది తెలుగునాట చాలా ప్రసిద్ధి చెందిన వాదము. త్రిలింగము అనే సంస్కృత శబ్దం నుంచి తెలుగు పుట్టిందని, తెలుగునేలలో ఆబాలగోపాలము సైతం నమ్ముతున్న వ్యుత్పత్తి. ఆంధ్రదేశంలోని శ్రీశైలం, దాక్షారామం, కాలేశ్వరం అనే మూడు ప్రాచీన శైవక్షేత్రాలలోని శివలింగాలను త్రిలింగాలంటారు. ఈ మూడు పవిత్రలింగాల మధ్యప్రదేశమే త్రిలింగ దేశమని, ఆ దేశీయుల వ్యవహారిక భాషే త్రిలింగ భాషని, దాని వైకృతే తెలుంగు/తెలుగు అని ఈ వాద సారాంశము. ఈ వాదన చాలా ప్రాచీనమైనది. ఆంధ్ర దేశానికి చెందిన ప్రాచీన తెలుగు సంస్కృత కావ్యాలలో ఈ వ్యుత్పత్తి కనిపిస్తుంది.

అ) ప్రతాపరుద్రీయమ్ – విద్యానాథుడు

13వ శతాబ్దికి చెందిన విద్యానాథుడు తన ప్రతాపరుద్రీయమ్ సంస్కృత కావ్యనాటకములో మొట్టమొదటగా ఆంధ్రదేశాన్ని త్రిలింగదేశమని పేర్కొనడమే గాక అప్పటి దాని అధినేత అయిన ప్రతాపరుద్రుని ‘త్రిలింగ పరమేశ్వర’ అని సంబోధించాడు.

“యైర్దేశ స్త్రిభిరేషయాతిమహతీం ఖ్యాతింత్రిలింగాఖ్యయా
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాసశైలాః కృతాః”


“తేదేవాః ప్రసరత్ప్రసాదమధురా శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్వచ్ఛ్రేయసేజాగ్రతు”

– (ప్రతాపరుద్రీయమ్ – నాటకప్రకరణమ్ 5-22)

స్వామీ! త్రిలింగపరమేశ్వరా! ఎవరిచే, ఈదేశమునకు త్రిలింగమను పేరు వడసి మిక్కిలి ఖ్యాతిని చెందెనో, కాకతీయరాజుల కీర్తి వైభవముచే ఎవ్వరి (తెల్లని) కైలాసశైలము చేయబడినో, వ్యాపించిన యనుగ్రహముచే కమనీయులగు శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వర నివాసులైన ఆ దేవతలు నీ శ్రీయస్సు విషయమై ఎల్లప్పుడును జాగరూకులై యుండుదురు గాక!

ఆ) కావ్యాలంకార చూడామణి – విన్నకోట పెద్దన

15వ శతాబ్దికి చెందిన విన్నకోట పెద్దన (క్రీ.శ 1410 ప్రాంతం) తన కావ్యాలంకార చూడామణిలో

“ధర శ్రీపర్వత కాళేశ్వర దాక్షారామ సంజ్ఞవఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశంబరుదారఁ ద్రిలింగ దేశ మనఁ జనుఁ గృతులన్”
(9 -5)

“తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగుదేశ మఁనఁగ దేటపడియే
వెనుఁకఁ దెనుఁగు దేశమును నండ్రు కొంద ఱ
బ్బాసపంచగతులఁ బరఁగుచుండు”
(9-6)