ఛాయారూపం

చిమ్మ చీకట్లో
పద్యం ఆకాశం మీద పొడుస్తుంది.
చెట్లు నీడ తప్పించి చోటిస్తాయి

నువ్వు అస్తమానూ
అడుగుతుంటావ్
నా పద్యాల చుట్టూ
అంత చీకటి ఎక్కడిదని

ఇంద్రియాలు ఒకోసారి
మరీ ఎక్కువ దేదీప్యమానంగా ఉంటాయి
చీకటే కనిపిస్తుంది
మిగతా అంతా వెలవెల

ఏరు దాటేప్పుడు
పైకెత్తుకొన్న బట్టలు
లోలో నీటి కితకితలు
లోతు తగ్గేకొద్దీ
దాగిపోయే రహస్యాలు

ఎప్పుడైనా నక్క ఊళ
విన్నావా
నిశ్శబ్దంగా ఉన్న సింహాన్ని
ఆకాశంలో కుందేల్నేనా
చూసేవా

చీకటంటే మరేమీ కాదు
కాంతికి ఛాయారూపమే!


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...