వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ

ఘటన నించి వెనక్కి లాగి దృష్టిని సంఘటన మనిషి చేతస్సులో పుట్టించే ప్రకంపనల మీద కేంద్రీకరించడం, వాటిల్లోంచి మాటలు ఏరుకుని కవిత్వం అల్లటం – స్థూలంగా ఇదీ మొదటి ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో తెలుగులో భావకవిత్వానికి సమాంతరంగా హిందీలో వచ్చిన ఛాయా వాద కవుల తత్త్వం అని హిందీ సాహితీ పరులు చెప్తారు.

ప్రకంపనలు అనగానే జ్ఞాపకం వచ్చేది శ్రీ శ్రీ మహా ప్రస్థానానికి 1940లో యోగ్యతా పత్రం ఇస్తూ చలం అన్న మాటలు:

“తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం… హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే [శ్రీశ్రీ కే] తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు -ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు- అతని హృదయంలోంచి మన హృదయంలోకి directగా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవలనిపిస్తుంది.”

ఆరు దశాబ్దాలు గడిచిన తరువాత, ఇస్మాయిల్ తన కవిత్వం గురించి వ్రాస్తూ ఇట్లా అంటాడు:

“పదిహేనేళ్ళ తపస్సు తర్వాత నేను గ్రహించిందేమిటంటే కవిత్వం అనుభవంలోంచి పుడుతుందనీ, కవి ప్రత్యక్షానుభవంలోంచి ఉద్భవించే కవిత్వమే నిజమైన కవిత్వమని, అభిప్రాయాలు, సిద్ధాంతాల వంటి మేధో వ్యాపారపు సరుకులతో కవిత్వం తయారు కాదనినూ. కవి అంతశ్చేతనా, భౌతిక ప్రపంచమూ కలిసేది అనుభవ రంగంలోనే. ఈ రెంటి స్పర్శ వల్లా రగుల్కున్న మంట వెలుగులోనే కవి బహిః ప్రపంచం, మనః ప్రపంచాల అద్భుతాల్ని తిలకించగలడు. జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని. ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.”

హృదయం కంపించటం అంటే ఏమిటి? చేతస్సు అంటే ఏమిటి? ఎట్లా ఉంటుంది, అందులో కవి ఎక్కడ మునిగి ఎక్కడ తేలాలి? ఇస్మాయిల్ చెప్పిన మేధో వ్యాపారపు సరుకు అంటే ఏమిటి? అది (చలం మాటల్లో) కవి తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరే దాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావాలకి అడ్డు వస్తుందా? ఎట్లా వస్తుంది? యుద్ధంలో ఆ సరుకు కూడా ఒక పాత్రధారి కాకుండా పోతుందా? ఏది మిత్ర శక్తో ఏది వైరి గణమో కవి ఎట్లా తేల్చుకుంటాడు? అసలు శ్రీశ్రీకి చలం ఇచ్చిన యోగ్యతా పత్రం కవిత్వానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనం పైన ఆధార పడినదైతే, ఆరు దశాబ్దాల తరువాత ఇంకా ఆ నిర్వచనం మళ్ళీ దాదాపుగా అవే మాటల్లో ఇస్మాయిల్ చెప్తే మారినదేమిటి? మారనిదేమిటి?

శ్రీశ్రీ తన కవిత్వాన్ని తూచవద్దు అనుభవించి పలవరించమని చలానికి సలహా ఇచ్చాడని యోగ్యతా పత్రం మొదట్లోనే చలం చెప్తాడు. మహాప్రస్థానం తరువాత రోజుల్లో శ్రీశ్రీ కవితా దృష్టికి మేధో వ్యాపారపు సరుకు అడ్డు వచ్చింది అని ఒక అభిప్రాయం ఈ మధ్యన అక్కడక్కడా వినవస్తోంది. ఆ విమర్శ సరైనది కాదు అని అనే వాళ్ళూ ఉన్నారు. పై పేరాలో ఏకరువు పెట్టిన ప్రశ్నలకి సమాధానాలు లేకుండా శ్రీశ్రీ తన హృదయ ప్రకంపనల మీద పట్టు కోల్పోయాడో లేదో ఎట్లా నిర్ధారించాలో నాకు తెలియదు. ఇలాంటి ప్రశ్నల పట్ల సమిష్టి కృషి జరగడానికి కావలసిన వ్యవస్థ మన యూనివర్సిటీ సాహిత్య విభాగాల్లో ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు. అదెట్లా ఉన్నా తెలుగులో సామాన్య ప్రజలకి అందుబాటు లోకి వచ్చే చర్చలు మాత్రం గందరగోళాన్నే ఎక్కువగా సృష్టిస్తున్నాయని అనిపిస్తుంది. జరగవలసిన సంభాషణలు, పరిశోధనలూ చాలా మటుకు గాలికి చెదిరి పోతున్నాయని తోస్తుంది. నిర్ధారణగా చెప్పడానికి కావలసిన సరంజామా నా దగ్గర లేదు, కానీ ఇప్పటికైనా జరిగితే బాగుంటుంది అని నాకు అనిపించే రెండు సంభాషణల గురించి ఈ వ్యాసం. ఇది వ్రాయటం నాకు – అంటే ఒక పద్ధతిగా తెలుగు భాషని కానీ, దాని ద్వారా సాహిత్యాన్ని కానీ సాధన చేసి ఉండని వాడికి – సాహసమే. అందుకే ముందుగా కొంచెం సంజాయిషీ ఇచ్చుకుంటాను.

దాపరికం లేకుండా చెప్పాలంటే నేను మేధో వ్యాపారపు సరుకుని, అది కూడా వచన రూపంలోనే, ఇంగ్లీషు లోనే ఎక్కువగా చదువుతాను అని చెప్పక తప్పదు. ఏ భాషలోనైనా కవిత్వం నాకు ఎప్పుడయినా ఎక్కిందంటే అది కవిత్వం కైపు తెలిసిన మిత్రులు చదివి వినిపించినప్పుడే. అయితే పని/ శ్రమ/ పనితనం ఇట్లాంటి మాటలంటే నాకు మోజు. జమాపద్దులు వ్రాయటమైనా, పసిపిల్లలకు మూతులూ ముక్కులూ తుడవటమైనా, కవిత్వం వ్రాయటమైనా శ్రద్ధతో చేసే వాళ్ళ పట్ల నాకు ఆసక్తి. అందుకే కవులు, తమ పని గురించి వ్రాసుకునే వ్యాసాలు చెప్పుకునే మాటలూ వీలైనప్పుడు చదవడమో అడిగి చెప్పించుకోవడమో చేస్తుంటాను.

కవిత్వాన్ని ఒక పనిగా చూడవచ్చును అని నాకు నేర్పినది పదిహేను సంవత్సరాల క్రితం పరిచయమైన ఒక మైథిలీ బ్రాహ్మణ మిత్రుడు. పరిచయమైన రెండవ రోజునే ఈ మిత్రుడు శ్రీశ్రీ మహాప్రస్థానం వినాలని ఉంది అడిగి నాతో చదివి వినిపించుకుని, అందుకు బదులుగా రాత్రి తెల్లవారే దాకా హిందీ, మైథిలి భాషల్లో కవిత్వం చదివి వినిపించాడు. అన్నీ వివరంగా జ్ఞాపకం లేవు కానీ ఆ రాత్రి విన్న దాంట్లో నాకు ‘బాబా నాగార్జున’ అన్న కవి అల్లిన కవిత్వం లోని చాలా పంక్తులు ఇప్పటికీ ఆ మిత్రుడి స్వరంలోనే జ్ఞాపకం ఉన్నాయి. ఈ మధ్యన తెలుగులో కవిత్వం గురించి ముఖ్యంగా వెబ్ పత్రికలలో జరుగుతున్న చర్చలు చూస్తూండగా నాకు ఆ రాత్రి జ్జ్ఞాపకం వచ్చింది. ఆ పైన కొన్ని అనుమానాలు వచ్చాయి. అవి నివృత్తి కావాలనుకోవటంతో పాటుగా కాలంతో చెదిరిపోతున్న సంభాషణలను ఒక దగ్గర ప్రోవు చేసి ఉంచితే ఎప్పటికైనా పనికొస్తుంది అనే ఆలోచన ఈ వ్యాసం వ్రాసే సాహసం నాతో చేయిస్తోంది.

కవిత్వానికి కావలసిన సరుకు ఎంతో కొంత అంతస్సులోనించి రాకపోతే పుట్టేది ప్రచారమే కానీ కవిత్వం కాదు – అన్న మాట మనకు ఇవాళ చాలా కామన్ సెన్సికల్గా కనిపిస్తుంది. కానీ మనం అంతస్సు అని చెప్పుకుంటున్నది ఎప్పుడూ ఒక లాగే ఉండి ఉంటుందా? లేదా దీనికి ఒక చరిత్ర ఉందా? ఒక నైసర్గిక నక్షా గీయటం సాధ్యమవుతుందా? చలం [మనిషి] చేసే “అంతర్బహిర్ యుద్ధారావాలే”‘ కవిత్వం అంటాడు. బాహ్య ప్రపంచం చారిత్రకంగా భౌగోళికంగా ఎప్పుడూ అన్నీ చోట్లా ఒకేలా ఉండదు కదా? మరి అంతస్సు అన్నది ఎప్పుడూ అన్నీ చోట్లా ఒకేలా ఉంటుందా ? అంతస్సుకీ బాహ్య ప్రపంచానికీ మధ్య హద్దులో మరి? అవి కూడా మారుతూ ఉంటాయా?

ఇట్లాంటి ప్రశ్నలకు కొంత వరకు సమాధానాలు చూచాయగా పార్థా చటర్జీ(1986) పుస్తకంలో[1] దొరుకుతాయి. ఆయన చెప్పేదేమంటే ఒకానొక చారిత్రక సందర్భంలో, జాతీయోద్యమం రాజకీయ ఉద్యమంగా బలపడుతుండే తరుణంలో – భారతీయులు ఒక అంతర్ – బహిర్ అనే సరిహద్దుని రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నారు అని. పల్లె జీవనం – పట్టణ జీవనం, ఆధ్యాత్మిక జీవనం – భౌతిక జీవనం, స్త్రీ – పురుషులు, ఇల్లూ -వాకిలీ, ఇట్లాంటి రకరకాల ద్వయాల మీదకి అంతః ప్రపంచం – బాహ్య ప్రపంచం అనే ద్వయాన్ని ప్రొజెక్టు చేశారు అని ఆయన సూచిస్తారు. ఈ ప్రతిపాదనని అంగీకరిస్తే, ఇలాంటి ద్వయాలు కవుల ఊహాశక్తికి ఒక గొప్ప ఊపునిచ్చి ఉంటాయి అని మనం చెప్పుకోవటం తేలికే. (అందుకే కాబోలు, ఇస్మాయిల్ అరవై డెబ్భై సంవత్సరాల క్రితం మనకి కవిత్వమెక్కడదీ అంటాడు.) ప్రొజెక్టు చేయడానికి ఇవేవీ బల్ల పరుపుగా ఉండే ఉపరితలాలు కావు కాబట్టి ఈ పరస్పర విరుద్ధమైన ప్రతీకల జంటలు ఒక దానితో ఒకటి అల్లుకు పోయి ఉంటాయి అని చెప్పటం సబబు కావచ్చు. (భారత దేశాన్ని ఒక స్త్రీ మూర్తిగా ఊహించుకుంటే, ఆ స్త్రీ మూర్తిని కాపాడే పురుషులంతా ఆమె గర్భంలోనించి వచ్చిన బిడ్డలవుతారు. వలస పాలకులు బయటినించి వచ్చిన దుర్మార్గులవుతారు. బంకించంద్ర ఆనంద మఠ్ నవల వ్రాయటానికి ముందు భారత మాత ఎక్కడుండేదో ఏమిటో గానీ భరత మాత రూపు రేఖలు ఎట్లా దిద్ద బడ్డాయో తెలుసుకోవాలంటే సదన్ ఝా వ్రాసిన వ్యాసం చూడవచ్చును.)


మళయాళ మాత

ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ, ఆ తరువాత చరిత్రే ఇప్పటి వరకు ఎవరూ నిశితంగా ఆలోచించినట్టు కనపడదు. పంతొమ్మిదవ శతాబ్దపు ఆఖర్న కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత రాజకీయ ప్రచారాలకు భాషా పరమైన సంఘాలు ఏర్పడడం ముఖ్యం కావటంతో ఎక్కడికక్కడ భాషామతల్లులు పుట్టుకు వచ్చినట్టు కనపడుతుంది. ఆయా భాషలు మాట్లాడే ప్రజలుండే ప్రాంతాలలో – అంటే ఆ భాషల్లో ప్రభుత్వ ఉత్తర్వులు అందే ప్రాంతాలూ, పత్రికలు సర్క్యులేట్ అయ్యే ప్రాంతాలలో ఉండే వాళ్ళంతా ఆ తల్లులకి బిడ్డలయ్యారు. ఆ క్రమంలో తెలుగు తల్లి ఎట్లా పుట్టిందో, అట్లాగే మలయాళ తల్లి కూడా పుట్టింది (అప్పట్లో పెద్దగా పట్టింపులు ఉండేవి కాదు కాబట్టి పడమర దిక్కుకి ఉండాల్సిన వాలు తూర్పు దిక్కుగా కనపడుతోందని గమనించ గలరు). ఇంకా చాలా మందే ఉండి ఉంటారు.

ఇట్లాగ భరత మాత దగ్గరి నించి తెలుగు తల్లి వరకూ ఈ మాతలు అందరూ ఒకానొక రాజకీయ సందర్భంలో ఎట్లా పుట్టారో – ఏది అంతః ప్రపంచమో ఏది బాహ్య ప్రపంచమో నిర్వచించుకోవడానికి ఈ రకమైన మాతృ దర్శనాలు ఎట్లా ఉపయోగ పడ్డాయో మనమందరమూ మర్చిపోయాము. అందుకేనేమో కొంతమంది తెలుగు వాళ్ళకి ఈ మధ్యన పుట్టుకొచ్చిన తెలంగాణ తల్లి అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. కానీ నిజానికి కొత్తగా పుట్టుకొచ్చినదే అయినా ఈ తెలంగాణ తల్లి పద్ధతిగానే తెలుగు తల్లి ఎట్లా పుట్టిందో అట్లాగే పుట్టింది. ఎవరు బయటివారు ఎవరు లోపలి వారు, ఏది లోపలి ప్రపంచమూ ఏది బయటి ప్రపంచమూ అన్నది గుర్తించుకోవడానికీ, దాని మీద ఎంతో కొంత కవితావేశాలు అనుభవించడానికీ వీలు కల్పిస్తుంది.

మొత్తమ్మీద తెలుగు వాళ్ళ అంతర్బహిర్ ప్రపంచాలు రక రకాలుగా అల్లుకుపోయి ఉంటే, వీటిలో ఏది బయట ఏది లోపలా అన్నది ఎక్కడ ఎట్లా నిర్ధారించాలి – అన్న ప్రశ్నకు పార్థా చటర్జీ లాంటి రచయితలు సమాధానాలు చెప్పలేరు. ఎందుకంటే , బయట – లోపల అనే సరిహద్దు స్థల కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అందులో విభిన్న శక్తుల మధ్య ఒరిపిడి ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఏ శక్తులు మన సందర్భంలో ఎట్లా పని చేశాయి అన్న చరిత్రలు వ్రాయటం, నక్షాలు గీసుకోవటం మనమే చేసుకోవాలి.

మనం ఈ రోజున అంతస్సు అనుకుంటున్నది కలగా పులగమైన సామంత (భారతీయ) చరిత్ర పాయల్లోనించి పుట్టుకొచ్చినదే అని అనడంలో నా ఉద్దేశ్యం బ్రిటిష్ వారి వలస పాలనకు ముందు అంతస్సు, చేతస్సు, స్త్రీ పురుష ప్రతీకలూ ఇవేవీ భారతీయుల ఊహా ప్రపంచంలో లేవనే మూర్ఖపు వాదన చేయటం కాదు. కానీ పంతొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో ఆ ఊహా ప్రపంచపు నక్షా కచ్చితంగా తిరుగు లేకుండా మారిపోయిందనీ, ఆ మార్పుల ఫలితంగా కొత్త ప్రతీకల బంధాలూ తయారయినాయనీ, గుర్తించక తప్పదు. ఇదిలా ఉంటే, మొత్తంగా గత శతాబ్ద కాలాన్ని ఒక్క సారి విహంగవీక్షణంగా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యం బలహీన పడుతోంది అన్నది తెల్లంగా తెలుస్తున్న రోజుల నించీ కవులు తమకి ఏది ముఖ్యమో తెల్చుకోవడానికి అంతస్సు, బాహ్య ప్రపంచం అన్న మాటలని మర్మ సంకేతాలుగా వాడుతున్నట్టు అనిపిస్తుంది. అవి దేనికి సంకేతాలు అన్నది కవి సమయానికి చెందిన విషయం. నిర్దుష్టంగా కాలాతీతంగా లోపల అంటే ఇదీ, బయట అంటే అదీ అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే, ఎప్పటికప్పుడు ఆ మాటలకు అర్ధాలు కొత్తగా చెప్పుకోకపోతే కవుల మధ్య వివాదాలు చూసే వాళ్ళకి చాలా మార్మికంగా కనిపిస్తాయి.