జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం

“తమతమ లోనిచూడ్కి దము దార కనుంగొను మాడ్కి నింత గా
లము నిను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్”

మనమో కవిత చదివినప్పుడు అందులో కవి చెప్పదలచుకున్న విషయం ఒకోసారి వెంటనే అర్థం కాకపోవచ్చు. అప్పుడేం చేస్తాం? కవితని మళ్ళీ చదువుతాం (ఓపికుంటే!) ఒకోసారి అందులోని ఒకటి రెండు వాక్యాలు కీలకంగా అనిపిస్తాయి. ఆ వాక్యాల ఆధారంగా ఆ కవితకి మనదైన అర్థాన్ని ఊహించుకుంటాం. అస్పష్ట కవిత్వాన్ని కూడా ఇష్టంగా చదివేవాళ్ళకి ఇది అనుభవమే! సరిగ్గా అలాగే, పైనున్న రెండు వాక్యాలూ నాచన సోమన రచించిన ‘ఉత్తరహరివంశము’ మొత్తానికీ కీలకమైన వాక్యాలుగా నాకు కనిపించాయి. ఈ కావ్యం ద్వారా నాచన సోమన చెప్పదలుచుకున్న సారమంతా యీ రెండు వాక్యాలలోనూ నిక్షిప్తమై ఉందని నా ఊహ. ఇవి శివుడు శ్రీకృష్ణునితో అనే మాటలు.

అసలీ వ్యాసం మొదలుపెట్టినప్పుడు, నాచన సోమన పద్య నిర్మాణ విశేషాలని గురించి రాద్దామనుకున్నాను. పద్యాలని ఛందోబద్ధంగా నడిపించడం మాత్రమే కాకుండా, ఆయా ఛందస్సులలో దాగున్న నిర్మాణ విశేషాలకి అనుగుణంగా పద్యాలని నిర్మించి, వాటికొక ప్రత్యేకమైన నడకని సంతరించడం మొదటిసారి, ప్రస్ఫుటంగా కనిపించేది నాచన సోమనలోనే. అయితే ఆ విశేషాలని మాత్రమే ప్రస్తావించి ఊరుకుంటే అతనికి పూర్తి న్యాయం జరగదని అనిపించింది. ఎందుకంటే నాచన సోమన వ్యక్తిత్వం దానికన్నా మరింత విస్తృతమైనది. ఈ తరం సాహితీ ప్రియులకి ముందితని గురించి ఓ విపులమైన పరిచయం అవసరమని తోచింది. అంచేత యీ వ్యాసాన్ని ఆ దిశగా మళ్ళించాను.

తెలుగు సాహిత్యంతో ఏ కాస్తో పరిచయమున్న చాలామందికి శ్రీనాథుడు, పోతన, పెద్దన వంటి కవులు తెలిసినంతగా నాచన సోమన గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇతని కవిత్వం మిగతావాళ్ళ కవిత్వం లాగా ‘ప్రజాకర్షకం’ కాదు. దీనికే మనవాళ్ళు గంభీరంగా ఉండాలని ‘ప్రౌఢ’ కవిత్వం అని పేరు పెట్టారు. ఉత్తరహరివంశం మొదటిసారి చదివినప్పుడు కొఱుకుడు పడటం కష్టమే. మరైతే అంత కష్టపడి అసలెందుకీ కావ్యాన్ని చదవాలీ అనే సందేహం తెలుగు పాఠకుడన్నవాడికి తప్పకుండా కలిగి తీరుతుంది! కేవలం సరదా కోసం, ఎంతో శ్రమ పడి, నడుచుకుంటూ, పాకురుకుంటూ కొండలెక్కే వాళ్ళని (trekkersని) ఎందుకంత కష్టపడి కొండెక్కుతారు అని అడిగితే, వాళ్ళేమి సమాధానం చెప్పగలరు? ఆ పైకెక్కే పరిశ్రమ తర్వాత, ఎత్తైన కొండ మీదనుంచి చుట్టూ విశాలంగా కనిపించే ప్రపంచాన్ని చూడటంలో ఉన్న ఆనందం అనుభవిస్తే కాని తెలియదు కదా! ఇలాటి కవిత్వాన్ని చదవడం కూడా సరిగ్గా అలాటి అనుభూతినే ఇస్తుంది.

ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేశారు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం (literalగా!). సాధారణంగా మన కావ్యాలకి మొదట అవతారిక ఒకటి ఉంటుంది. ఇందులో, కవి కృతిభర్తల గురించిన సమాచారం, కావ్య రచనా నేపథ్యం మొదలైన విషయాలుంటాయి. ఈ కావ్యానికి అలాటి అవతారిక లేదు, లేదా మనకి దొరకలేదు. అలానే, సాధారణంగా కావ్యం చివర ఉండే గద్యలో అది సంపూర్ణమైనదని చెప్పబడుతుంది. ఈ కావ్యంలో అది కూడా లేదు! అందువల్ల మనకి దొరికిన యీ కావ్యం సంపూర్ణమేనా కాదా అన్న అనుమానం ఇంకా మిగిలే ఉంది. దానికి తోడు ఆ పేరొకటి, ‘ఉత్తర’హరివంశం అని! సంస్కృతంలో ఉన్నది ఒక్కటే హరివంశం. రామాయణానికి ఉత్తరరామాయణంలా దీనికి ఉత్తరహరివంశమేదీ లేదు. ఆ సంస్కృత హరివంశంలో కథలే తెలుగు ఉత్తరహరివంశంలో కనిపిస్తాయి, అన్నీ కావు, కొన్ని. మరి దీనికి ఉత్తరహరివంశం అని సోమన ఎందుకు పేరుపెట్టాడన్నది అంతు తేలని ప్రశ్న. దీని గురించి చాలామందే సాహితీ డిటెక్టివులు పరిశోధించారు.

హరివంశాన్ని ఎఱ్ఱన కూడా తెలుగులోకి అనువదించాడు. అతను హరివంశమనే పేరు పెట్టాడు కానీ, తన తెలుగు అనువాదాన్ని పూర్వ, ఉత్తర హరివంశాలుగా విభజించాడు. పోనీ ఎఱ్ఱన ఉత్తరహరివంశ భాగాన్నే సోమన తిరిగి రచించి, దానికలా పేరుపెట్టాడా అంటే అదీ కాదు! ఎఱ్ఱన ఉత్తరహరివంశ భాగంలో కనిపించే అన్ని కథలూ ఇందులో లేవు. పైగా, అందులో లేని కథ కూడా ఇందులో ఉంది. నాచన సోమన ఉత్తరహరివంశం మొదట్లోనే “హరివంశ ప్రథమ కథాంతరమున గల వింతలెల్ల దప్పక మదిలో దిరమయ్యెగదా” అని పూర్వ హరివంశ ప్రస్తావన ఉంది. వీటన్నిటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే, సోమన కూడా పూర్వ, ఉత్తర హరివంశాలని రచించాడని అనిపిస్తోంది. నాచన సోమన ఎఱ్ఱన హరివంశాన్ని చదివి ఉంటాడన్నది వాళ్ళ కావ్యాలని పరిశీలిస్తే స్పష్టంగా కనిపించే విషయం. ఎఱ్ఱన రచన సోమనకి సంతృప్తినివ్వక పోవడం చేత, సంస్కృత హరివంశాన్ని యథాతథంగా అనువదించకుండా, అందులో కొన్ని కథలని మాత్రం తీసుకొని తనదైన సంవిధానంతో తెలుగు హరివంశాన్ని తీర్చిదిద్దాడని నా ఊహ. ఇలాటప్పుడే అనిపిస్తుంది, టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అసలు నిజాలని తెలుసుకోగలిగితే ఎంత బాగుండునో అని!

సరే, ప్రస్తుతానికి పేరు గురించి పక్కన పెట్టి, సోమన కవిత్వంలోని ప్రత్యేకతలు ఏమిటని చూస్తే నాకు కనిపించిన ముఖ్య లక్షణాలు మూడు. ఒకటి వైవిధ్యం, రెండు వక్రత లేదా వైచిత్రి, మూడవది సూక్ష్మత. ఇతర కవులనించి ఇతణ్ణి వేరు చేసేవి కూడా యీ లక్షణాలే.

వైవిధ్యం

ఉత్తరహరివంశం ఆసాంతం వైవిధ్యభరితంగా సాగే కావ్యం. ఈ కావ్యంలో ఎంత గ్రాంధిక భాష కనిపిస్తుందో అంతే వాడుక భాష కూడా కనిపిస్తుంది. పూర్తి సంస్కృతంలో ఉన్న పద్యాలూ ఉన్నాయి. అచ్చ తెలుగులో సాగే పద్యాలూ ఉన్నాయి. పద్య రచనలోనూ, నిర్మాణంలోనూ కూడా చాలా వైవిధ్యం చూపించాడు సోమన. ఉదాహరణకి యీ పద్య శైలిని చూడండి:

నెయ్యము లేని సంగతియు, నిక్కము లేని వచోవిలాసమున్
వియ్యము లేని వైభవము, విందుల సందడి లేని ముంగిలిం
దియ్యము లేని చాగమును, ధీరత లేని యమాత్యకృత్యముం
గయ్యము లేని శూరతయు, గైకొని యూరక మెచ్చవచ్చునే!

ఇంతటి ప్రౌఢ కావ్యంలోనూ, నీతి శతకంలోని పద్యంలా ఉన్న శైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే, ఈ పద్యపాదం చూడండి: “నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కలు నాకు నిండునే”.

ఇవి నరకుడు ఊర్వశితో చెప్పే మాటలు. కృష్ణశాస్త్రి తన ఊహా ప్రేయసి అయిన ఊర్వశితో అనే మాటల్లా లేవూ! పద్య రచనలో ఎన్నో రకాల నడకలు ఉత్తరహరివంశంలో కనిపిస్తాయి. ముఖ్యంగా సీస పద్యాల విషయంలో ఎంతటి వైవిధ్యం చూపించాడో వివరించాలంటే, అదే ఓ వ్యాసం అవుతుంది. ఈ కావ్యంలో ముఖ్యంగా చెప్పుకోవలసినది అందులోని కథలు, వాటి కథనం, పాత్ర చిత్రణ – వాటిల్లో సోమన చూపించిన వైవిధ్యం. ఇందులో మొట్టమొదటి కథ నరకాసుర వధ, దుష్టశిక్షణ. నరకుడు విష్ణువు కుమారుడే. విష్ణువు వరాహావతారమెత్తినప్పుడు అతనికీ భూదేవికీ పుట్టిన వాడు. అయినా రాక్షసుడు, క్రూరుడు, అహంకారి. స్వర్గాన్ని ఆక్రమించడమే కాకుండా, మునులని కూడా హింసిస్తాడు. అందువల్ల శ్రీకృష్ణుడికి అతన్ని చంపక తప్పింది కాదు. పురాణ శైలిలో మొదలయ్యే కథనం ఊర్వశీ నరకుల సంభాషణలలో నాటకీయ శైలి సంతరించుకుంటే, నరకునితో సత్యభామా శ్రీకృష్ణులు చేసే యుద్ధం కావ్య శైలిలో సాగుతుంది. ఇక రెండవ కథ విప్ర సంతానాన్ని బ్రతికించడం, అంటే శిష్ట రక్షణ. ఈ కథలో ఉండేది శుద్ధ వేదాంతం. దీని వెంటనే వచ్చే కథ, కృష్ణుడు సంతానం కోసమై శివుని గురించి తపస్సు చేయడం. ఈ రెండు కథలు చాలావరకు పురాణ శైలిలో సాగుతాయి.