పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. అక్కరలు గురించి మోహన అభిప్రాయం:

    01/05/2016 2:30 pm

    వ్యాసమును చదివి తమ అమూల్యమైన అభిప్రాయములను తెలిపిన శ్రీమతి సుప్రభ, శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారలకు నా నమస్సులు. ఇది అక్కరలపై వ్యాసము కాబట్టి ఒకటికన్న ఎక్కువగా ఉదాహరణములను చూపలేకపోయినాను.

    శ్రీమతి దోనేపూడి లక్ష్మీకాంతమ్మ “తెలుగు కవిత్వంలో మధ్యాక్కర – ఒక పరిశీలన” అనే PhD సిద్ధాంత గ్రంథములో మధ్యాక్కరలను ఉపయోగించిన తెలుగు కవులపై ప్రత్యేకముగా కొన్ని ప్రకరణములను కేటాయించారు. అందులో ఆ కవులు వ్రాసిన కావ్యములనుండి ఎన్నియో ఉదాహరణములను కూడ ఇచ్చారు. క్రింది మొదటి ఏడు మధ్యాక్కరలను అక్కడినుండి గ్రహించి, ఉదాహరణములుగా ఇక్కడ పొందుపరచినాను. ఎనిమిదవది “వేదనామధ్యాక్కరలు” (లింకు) అనే పుస్తకమునుండి గ్రహించాను. తొమ్మిదవది శ్రీ రవిగారు నేను వ్రాసిన “ఛందస్సుకు ఒక కొండ – కొక్కొండ” (లింకు) వ్యాసమునకు ఒక అభిప్రాయములో తెలిపినారు. విశ్వనాథ మధ్యాక్కరలు ఇక్కడ లభ్యము (లింకు)

    1) తుమ్మల సీతారామమూర్తి చౌదరి – మహాత్మకథ

    ఓ యయ్య ప్రాయోపవేశమునకు – మూనకు, నీవు
    పోయిన మాకు స్వాతంత్ర్య మేల ప్ర-భుత్వ మదేల
    శ్రీయేల జీవిత మేల సౌహార్ద – సిద్ధికై శ్రమము
    సేయుదుమని కమ్మ నంపి రా యోగి-శేఖరు కడకు

    2) ఆరుద్ర – శుద్ధ మధ్యాక్కరలు

    పదమూడు మాత్ర లున్నట్టె – పాదార్ధముల వళ్లు పెట్టె
    తుది ప్రాస లందులో నిలుపు – తూకాన అవి రెండు కలుపు
    మొదలట్లు తొలి ప్రాస వుంచు – ముద్దుగా నాల్గాలపించు
    కుదురైన అందాల గములు – కొత్తవీ మధ్యాక్కరములు

    3) నాయని సుబ్బా రావు – విషాద మోహనం

    పోయిన సూర్యుండు వచ్చు – పోయిన చంద్రుండు వచ్చు
    పోయిన పదునాఱు కళలు – పూర్తిగా విధునకు వచ్చు
    పోయిన తారకత మినుకు – పూవుల గుత్తులు వచ్చు
    పోయిన మోహనా వినయ – భూషణా తిరిగి రావేమి

    4) కోవెల సుప్రసన్నాచార్య – పాంచాలరాయ శతకము

    ఎన్నడు వినుటయే కాని – యెన్నడు కనుటయే లేదు
    ఎన్నడు కాంచుట కాదు – యెన్న డూహించుట లేదు
    ఎన్నాళ్ల కెన్నాళ్ల కయ్యె – యిట్టి మీ దివ్య దర్శనము
    కన్నుల పండువు కాగ – కరుణాబ్ధి పాంచాలరాయ

    5) దాశరథుల బాలయ్య – శ్రీవాసరజ్ఞానసరస్వతీ మధ్యాక్కరలు

    ఒకచేత వీణ ధరించి చిరునవ్వు – లొలుకబోయుచును
    నొకచేతఁ బొత్తమ్ము గొనుచు నంచపై – నొప్పారి రావె
    ప్రకటింతు వేవేల నతులు సకల సౌ-భాగ్యంబు లీవె
    యిక నాకు జ్ఞానసరస్వతీ వాస-రేశ్వరీ దేవి

    6) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి (శాంతిశ్రీ) – సత్యశాయి మధ్యాక్కరలు

    తల్లి వందురు కొందరు మరి కొందరు – తండ్రి వందురు జ-
    గల్లీల కాని స్త్రీపురుష భేదమ్ము – కలద నీయందు
    తల్లివై లాలింతు వెంతొ తండ్రియై – దండింతు వంతె
    చల్లని మా తల్లి తండ్రి జయ సత్య-శాయీ నమోస్తు

    7) దోనేపూడి వెంకయ్య – చారిత్రకం
    (ఇతడు మధ్యాక్కరను free verse రూపములో యతిప్రాసలను ఎల్లప్పుడు పాటించక వ్రాసినారు)

    ఇష్టదైవము దేశమాత కావలె నీతరమ్మునకు
    ఇష్టకామ్యార్థము లొసగు నీదేవి యీనాడు మనకు
    సర్వ లోకము లేలు తల్లి స్వయముగా సాక్షాత్కరించె
    సర్వావతారాల మూలమౌ పరమావతారమ్ము
    శర్వాణి వాణి వైష్ణవి సకలదైవ సమ్మేళనమ్ము
    ఉర్విలో భరతోర్వి, ఈమె సేవయే ఉత్తమ పూజ

    8) జి. వి. సుబ్బా రావు – వేదనా మధ్యాక్కరలు

    హేమంత మానంద భావ – హేలా మనోజ్ఞమ్ము నగుచు
    చేమంతి విరబూచి నవ్వి – సీమంతినీ కేశ మొదిగి
    భామాంతర ప్రణయ మధు-వాను ప్రియుని హర్ష మొలికి
    హేమంత శీతల జ్యోత్స్న – యిముడదీ కవితాపథాన

    9) పుట్టపర్తి నారాయణాచార్యులు – శ్రీనివాసప్రబంధము

    పార్వతీ పరమేశ మదన – పరవశతావృత్తి జెల్లె
    యోర్వంగ రాక బెక్కేడు, – లుద్రిక్తులై సురలెల్ల
    శర్వుని భంగింపనెంచి, – శతధృతి తోడన గూడి
    పర్వెత్తిరుత్తాల సాల-పంక్తి తుషారాద్రి గుఱిచి

    విధేయుడు – మోహన

  2. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    01/05/2016 2:07 pm

    మాన్యులు శ్రీ కృష్ణమోహనరావు గారికి
    నమస్కారములతో,

    ఆదరపూర్వకమైన మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన విషయాలు:

    మొదటిది: రాయలు ‘ఆంధ్రకవి’ అనటం సాభిప్రాయమూ, విశేష హృదయధర్మమే కాని, ఇతరభాషాకవుల మధ్య వ్యవచ్ఛేదకంగా అన్న మాట కాదు. అది పాదపూరకం కాదు. పరివృత్తిని ఎంతమాత్రం సహింపని భావభావన. తెలుగువారిని ఉద్దేశించి తెలుగులో పద్యం చెబుతూ, ‘తెలుగు కవి ధూర్జటి’ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “ప్రౌఢకవి ధూర్జటి” అనవచ్చును కదా. అష్టదిగ్గజ కవులందరూ తెలుగువారే అయితే, “స్తుతమతి యైన ఆంధ్రకవి” (లేదా, ‘తెల్గు కవి’) అనవలసిన అవసరం అసలే ఉండదు. అక్కడ “ఆంధ్ర” శబ్దప్రయోగం కేవలం భాషాభిమానాన్ని మాత్రమే సూచిస్తున్నదన్నది ప్రతిపాద్యాంశం.
    రాయాస్థానంలో ఉన్నది అష్టదిగ్గజములా? నవరత్నములా? వారిలో అందరూ తెలుగువారు మాత్రమేనా? ఇతరులూ ఉన్నారా? అన్న విషయాన్ని అధికరించి అనేకవాదోపవాదాలున్నాయి. సంస్కృతాంధ్రతమిళకన్నడ కవులవి ఏవేవో పేర్లు విమర్శకుల పరిశీలనకు వచ్చాయి. ఆ కవులలో సుప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఉన్నారు. ఇదమిత్థమని తీర్పు చెప్పటం సాధ్యం కాదు. కనీసం అందుకు ఆవశ్యకమైన సాధనసామగ్రినైనా సమీచీనంగా సమీకరించటం ఈనాటికీ జరగలేదు.

    రెండవది: ఆముక్తమాల్యదలో ఆ వాక్యం ప్రస్తావింపబడిన తీరును బట్టి “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నిరుక్తికి రాజకీయ, సాంస్కృతిక కారణాలనేకం తప్పక ఉండి ఉంటాయని విశ్వసింపవచ్చును. అటువంటివేవో ఉండినందువల్లనే అదేదో తన మాటగా చెప్పక క్రీడాభిరామములోని ఆ మాటను త్రవ్వి తలకెత్తి, ప్రార్థితస్వప్నాన్ని భగవద్వాక్యంగా నిరూపింపవలసి వచ్చి ఉంటుంది. కారణం ఏదైనా, ఎంతో అభిమానం లేనిది అసలు ఆంధ్రకావ్యరచనకు ఉపక్రమణమే ఉండదు కదా.

    మూడవది: కావ్యరచన సాగుతున్న కాలంలో కవులు తత్తత్సన్నివేశాలను నలుగురికీ వినిపించటం వింతేమీ కాదు. అది నాడూ, నేడూ జరుగుతున్న దృగ్విషయమే. నా మటుకు నేనే ఎంతోమంది ప్రసిద్ధుల రచనలను అవి సుపరీక్షితాలూ, సుపరిష్కృతాలూ కాకముందే ఉక్తలేఖనదశలో విన్నాను. చదివాను. కావ్యం మానవసమర్పితమైతే, ఆ కావ్యాన్ని నలుగురికీ నాలుగు చోట్ల వినిపిస్తూ, ఎవరికి అంకితం ఇవ్వాలో వ్యక్తిని కుదుర్చుకోవటానికి ఆ రోజుల్లో ఎంతో కాలం పట్టేది. ఆ ‘కృతిభర్త’కు నలుగురి చేత చెప్పింపవలసి వచ్చేది. అంకితం పుచ్చుకొని ఏమివ్వగలడో, ఏమిస్తానంటాడో; అది తనకు అంగీకార్యమో, కాదో తెలుసుకోవాలి కదా. కృతి పూర్తయిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకొని, వంశచరిత్ర సేకరించి, కృత్యాదిని వ్రాయటానికి పడే ఆ అవస్థనే ‘కృతాద్యవస్థ’ అనేవారు. కృతాద్యవస్థ అంటే రచన మొదలుపెట్టేందుకు పడే అవస్థ కాదు; కృతి పూర్తయిన తర్వాత అవతారికను వ్రాసేందుకు పడే అవస్థ.

    శ్రీమహాభాగవతం రచన అద్భుతంగా సాగుతున్నదని విన్న తర్వాతనే కదా, రాజు పోతన గారిని దానిని తనకు అంకితం చేయాలని అడగటమూ, ఆయన ఇవ్వననటమూ జరిగింది? రచనాప్రక్రియ నిర్విఘ్నపరిసమాప్తి పర్యంతం రహస్యంగా ఉంటే ఈ వృత్తాంతాలే సంభవింపవు కదా.

    కావ్యరచన ఎంత గజగర్భపద్ధతి అయినా, అదేమీ ఐకాంతికమైన రహస్యవ్యాసంగం కానేరదు. రచనా ప్రారంభానికి పూర్వపు కృషి మాత్రమే కవికి ఆంతరంగికం. రచన సాగుతున్న దశ, రచన పూర్తయాక అంకితోత్సవానికి లేదా భగవత్సమర్పణకు మునుపు సూర్యాలోకం అన్నవి బహిర్ముఖీనములే. నిండుసభలో ఇంకా పూర్తి కాని కావ్యమధ్యసన్నివేశాన్ని గానంచేయటం గుణగౌరవాన్ని, అందుకొనబోయే గౌరవాన్ని గౌణీకరింపదు సరికదా, రచన సవ్యంగా కొనసాగటానికి, కావ్యప్రశస్తికి మరింత ఉల్లాసదోహదం కాగలుగుతుంది.

    కావ్యాన్ని పూర్తిచేసిన తర్వాతైనా, కావ్యరచనాకాలంలో నైనా కావ్యగానాన్ని కవి తానై స్వయంగా చేసి ఉండటమూ, ఇతరులు కోరగా చేసి ఉండటమూ రెండూ సహజమే. సాహిత్యసభ అన్నాక కొలువుతీరినవారు వారు వారు వ్రాస్తున్న విశేషాలనూ, నాటినాటికి వ్రాసిన విషయాలనూ తెలుసుకోక మానరు కదా. నిజంగా అష్టదిగ్గజాలలో ఉన్నవాడే అయితే, కావ్యాన్ని ఇంట్లో లేఖకులకు చెప్పి వ్రాయిస్తూ, రచన పూర్తయే దాకా శైలి, కథ, కవిత్వం, చమత్కారాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టటం అసలే వీలుకాదు. కావ్యగానాలు జరుగుతుండేవని, ధూర్జటి ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి కృష్ణరాయలు అప్పటికింకా సుముఖుడై ఉన్న 1523-1524 ప్రాంతాల కావ్యాన్ని మొదలుపెట్టి రచన సాగిస్తూ, అడిగినప్పుడు నలుగురికీ వినిపిస్తూ ఉండేవాడని, పరిస్థితులు తారుమారయిన కొంతకాలానికి పూర్తిచేసేనాటికి భవపరాఙ్ముఖుడుగా ఉన్నాడని ఊహ్యం.

    ధూర్జటి గారు అష్టదిగ్గజాలలో ఒకరా? అన్న విషయం అనుమేయమే కాని, ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేమని వ్రాశాను.

    కందుకూరి రుద్రకవి సాహిత్యజీవితమంతా క్రీస్తుశకం 1550 తర్వాత ప్రారంభమయింది. తొలిరచన నాటికి నలభై యాభై యేళ్ళవాడనుకొంటే, అష్టదిగ్గజకవులలో కాదు సరికదా, మామూలు ఆస్థానకవి కూడా అయివుండడు. ఆయన ఈశాన్య సింహాసనాసీనుడన్నది విశ్వసనీయం కాదు. సంస్కృతంలో ‘రాష్ట్రౌఢ వంశకావ్యం’ ఆయన కృతి అని తెలుగు సాహిత్య చరిత్రకారులు వ్రాసినది సరికాదు.

    ఈ లఘుప్రస్తావికను సహృదయంతో చదివి ఎంతో ఔదార్యంతో ఆశీర్వచస్సులను అందించిన పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి! _/|\_ !
    సౌజన్యమూర్తులు శ్రీ రంగ గారికి, శ్రీ రవి గారికి – ప్రణామాలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  3. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:

    01/05/2016 11:37 am

    అభిప్రాయాలలో వ్యాస రచయిత:
    “పాటలను పాడుకొనేటప్పుడు దాని నడక, లయ – వీటికి తగ్గట్లు పదములు అమరినప్పుడు మాత్రమే శ్రోతలకు గొప్ప అనుభూతి లభిస్తుంది. పదములను గాయకురాలికి తోచినట్లు ఎక్కడిక్కడ నఱికి పాడితే అనుభూతి కలగడము కాదు అసహ్యము కలుగుతుంది.”
    “చతురస్ర లఘువు + ద్రుతము ఈ రెంటిని ఆఱు మాత్రలుగా తీసికొంటే మొదటి ఆనందం పదము మనకు లభిస్తుంది, అర్ణవ, ఐతే ఈ నాలుగు మాత్రలు తఱువాతి చతురస్ర లఘువులు అవుతాయి. అప్పుడు హాయిగా దీనిని ధ్రువ తాళములో పాడుకొనవచ్చును.”

    In response to the essayist:

    అలా కుదరదు.
    ఎందుకంటే:
    కర్ణాటక సంగీతం లోని చతురశ్ర జాతి లఘువునకు నాలుగు అక్షరాలు. ద్రుతమునకు రెండక్షరాలు. విడివిడిగా లెక్కించాలి. చతురశ్రజాతి ధ్రువతాళం లో నాలుగు ఘాతలుంటాయి. తొడమీద చెయ్యి చరిచి ఘాత, వేళ్లు; ఘాత, ఉసి; ఇలా లెక్కించినా, తప్పట్లు కొట్టి లెక్కేసినా, కీ బోర్డ్ మీద మీట నొక్కుతూ లెక్కేసినా, ఆ తాళంలో 12341212341234 అని లెక్కిస్తారు.
    And
    కర్ణాటక సంగీత సంప్రదాయం లో, ఘాత కింది అక్షరం మిగిలిన వాటికన్నా కొంచెం గట్టిగా పలుకుతారు. కాబట్టి ప్రతిసారీ, పైనిచ్చిన వరసలో 1 మిగతా వాటికన్నా కొంచెం గట్టిగా ( In western music, it is accent) ధ్వనిస్తుంది.
    A. Suppose I am beating out this beat on a key board, on a single key – the middle c. To give a simple example,
    Middle c (‘స’) 14 సార్లు (keeping time in between same) నొక్కాలి. అందులో 1,5,7,11 నొక్కేటప్పుడు ‘స’ కొంచెం గట్టిగా ఒత్తాలి. అదీ చతురశ్రజాతి ధ్రువతాళం.
    B. ఇప్పుడు ‘అద్వైతం’ లోని మాటలు (మాత్రలు) కాగితం మీద రాసి; కీబోర్డ్ మీట/ల మీద 12341212341234 అంటూ లెక్కిస్తూ నొక్కితే

    ఆనం దం అర్ణవ మైతే
    అనురా గం అంబర మైతే
    An Accent will be on – ఆ, దం, అ, మై, అ, గం, అం, మై.

    లేక, (J.K.M. రాసిన) ‘రత్నాల సరము’ రెండు వరసలు బల్ల మీద దరువేస్తే

    సరసము ఖా సరోజ నయనా
    హరుసము తో నపూర్వ ముగనీ
    An Accent will be on – స, ఖా, స, న, హ, తో, న, ము.
    అదీ, చతురశ్రజాతి ధ్రువతాళం లో పలికిస్తే జరిగేది. కొన్ని పదాలు తునిగాయి. యతి ప్రాసలు దండగై పోయాయి. పైగా additional accents land on some letters. మరి 6 4 4 ఛందస్సులో సాహిత్యం రాసుకుని, దాన్ని 4 2 4 4 చతురశ్రజాతి ధ్రువతాళంలో ఇలా ముక్కలు చేసుకోటం ఈ వ్యాస రచయితకు నచ్చుతుందా? నచ్చదు. రత్నాల సరమన్నా మార్చుకోవాలి. తాళమన్నా మార్చుకోవాలి, లేదా పాట పాడటం గురించి తన అభిప్రాయాలు కొన్ని మార్చుకోవాలి.
    Lyla
    • కర్ణాటక సంగీతంలో – రాగం, స్వరం, తాళం కలిస్తే సంగీతం.
    • కర్ణాటక సంగీతంలో ప్రతి తాళం లో నిర్ణీత క్రియలుంటాయి. క్రియల మధ్య ఉండే కాలమే లయ.
    ( తేలిక భాషలో చక్కగా రాసిన తెలుగు సంగీత పుస్తకం – సంగీత విద్య ప్రకాశిక, ఆకొండి శ్రీనివాస రాజారావు. నాకు నచ్చింది.)

  4. మా ఆవిడ – మంగళసూత్రం గురించి ramani అభిప్రాయం:

    01/05/2016 6:54 am

    మంగళ సూత్రం అంతటి చవుకా కొనగలరా చేజారాక లాభం ఎంతొచ్చింది మాష్టారు…. ఒక ఎఫ్ డి తీసాకా 🙂 🙂

    మావైపు తెరిగింది అంటాము మీరు పెరిగింది అని రాసారు కదా మొదట అర్థం కాలేదు. బాగుంది మంగళసూత్రాల వేడుక, అన్ని వ్రతాలు మాంగల్య బలానికే కదా. ఎంత స్ట్రాంగ్ కాకపోతే డబ్బా మూతలు తీస్తాము చెప్పండి.

  5. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/04/2016 11:47 pm

    ఇక్కడ మరో యుద్ధం మొదలైంది కనక నేనూ ఓ సమిధ వేస్తున్నాను. ముందుగా కొన్ని జెనెరిక్ ప్రశ్నలు. శ్రీశ్రీ కి మహాకవి అని బిరుదు ఎవరిచ్చారు? ఒకట్రెండు కవితలు రాయగానే జ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చేయరు. మరింత ముఖ్యం గా చెప్పాల్సినదేమిటంటే అవార్డులు దృష్టిలో పెట్టుకుని రాస్తే అవార్డులు రావు. రాసేదానిమీద ఇంటరెస్టూ, ఇష్టం, శ్రద్ధా ముఖ్యం. అవన్నీ ఉంటే వద్దన్నా అవార్డులు వస్తాయి. మరి అవార్డులిచ్చేటప్పుడు కవిగారి “బయటి” వ్యసనాలు కూడా కమిటీ అంతర్గతంగా తప్పకుండా గుర్తుంచుకుంటుంది – అవి పనికిరాని విషయాలైనప్పటికీ వాటి వల్ల అవార్డు రాకపోవచ్చు. వింతేమీ లేదు. ఫలానా కవిగారు రోడ్డుమీద పోయే ప్రతీవాణ్ణీ అప్పులడిగి సిగరెట్లు కాలుస్తూ తాగుడికి బానిస అయ్యాడు అనేది జ్ఞానపీఠ్ అవార్డు రాకపోవడానికి తప్పకుండా సహకరించే విషయం – ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినాను. మీరే కమిటీలో ఉంటే మీరూ అలాగే ఆలోచిస్తారు. అందుకే రాసేవాడికి సభ్యతా, సంస్కారం అనేది జీవితంలో ఉండాలి. అయినా జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వాలంటే కవితలు సరిపోవు కదా? ఒక కావ్యం రాయాలి – ఒక మాస్తి, ఒక విశ్వనాథ అలా రాసారు కనక వాళ్ళకు ఇచ్చారు. మహా ప్రస్థానం రాసినందుకు నిజంగా శ్రీశ్రీకి జ్ఞానపీఠ్ ఇచ్చి ఉంటే తెలుగు సర్వనాశనం అయిపోయినందుకు అప్పట్లోనే పత్రికలు రాసి ఉండేవి. ఇది నా బోడి అభిప్రాయం.

    ఇకపోతే ఇక్కడ రాసినది వ్యాసమా, కధా అనేది సంపాదకులు వాళ్ల ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తారు. ఇలా కూడదూ అలా ఉండాలి అని చెప్పడానికి తెలుగులో కానీ మరే భాషలో కానీ రూల్స్ లేవు. వ్యాసం అంటే ఏమిటి? గూగిల్ చేస్తే రూల్స్ దొరుకుతాయా? దొరికితే మాత్రం ఆ రూల్స్ రాసినవారెవరు? వాళ్ళు బ్రహ్మ పదార్ధాలా? వాళ్ళూ మనుషులే కదా? అంటే ఒక సంపాదకుడు వాళ్ళు చేసే పత్రిక పని బట్టి నిర్ణయిస్తారు. మీకిష్టం ఉంటే చదవండి లేకపోతే లేదు. ఇలా ఉండాలి అని చెప్పడానికి మీకేమిటి క్వాలిఫికేషన్? మీరు ఎడిటరైతే మీ పుర్రెకి పుట్టినట్టూ మీరు చేస్తారు కదా? ఇది వ్యాసం కింద ప్రచురిస్తే ఇదో వ్యాసమా అనే పెద్దమనుషులు బయల్దేరతారు. మొత్తమ్మీద ఇదో తండ్రీ, కొడుకూ, గాడిద కధలా తయారవుతుంది. ఇంతా చేస్తే ఈమాట సంపాదకుల పని జీతంలేని నౌకరీ. చేతుల దురదా, వచ్చిన చెత్తా చదవడం అనేవి థేంక్ లెస్ ఉద్యోగాలు. తెలుగు మీద మమకారంతో చేస్తామని ఒప్పుకుని ఇలా రెక్కలు ఊడగొట్టుకునే వాళ్ళ మీద ఊరికే నోరు పారేసుకోవద్దు.

    సందర్భం వచ్చింది కనక మరో విషయం. మాగంటి గారు అట్టు గురించి. అది చదివి నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ పారడీ ఎందుకు రాయకూడదు? ఇస్మాయిల్ బతికున్న రోజుల్లోనే మాగంటి గారు రాసి ఉంటే దాన్ని ఎడిటర్లు ప్రచురించేవారని నేను ఘంఠాపధంగా చెప్పగలను. నన్ను అడిగితే నాకు అట్టు నా ఆదర్శమే చెట్టుకన్నా బావుంది.

    ఇప్పుడు మీలో ఒక్కోరికీ ప్రశ్నలు.

    కేశవులు గారు: ఎన్నారైలు ఏదో చేయట్లేదు – ఇక్కడ నూతులు చాలవన్నట్టూ …అన్నారు. నేను మొదట్లో ఎన్నార్టీ, ఆ తర్వాత ఎన్నారై. ఎప్పుడూ తెలుగు చదవడం రాయడం అనేవి మర్చిపోలేదు. నెలల తరబడి తెలుగుకి మొహం వాచి ఏమీ దొరకనప్పుడు ఆఖరికి కాయితం తీసుకుని పోతన పద్యాలు గుర్తున్నంతలో కాయితం మీద రాసుకుని తృప్తి చెందిన రోజులున్నాయి. తెలుగుకి ఏదో ఒక రకంగా కృషి ఎన్నారైలే చేయాలా? మాకేం పనిలేదా? మీరు ఎన్నారై అయితే ఏమి చేసుండేవారు? మీరు ఆంధ్ర దేశాలు రెండింటిలోనూ ఏదో ఒకచోట ఉంటే ఏం చేస్తారేం? తెలుగు మాట్లాడే దేశంలోనే ఉంటూ ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చునేకంటే ఎన్నారైలు ఈమాట పత్రిక నడుపుతున్నారు అదే మంచిది కదా? ప్రతీ దానికీ అమెరికా, తానా అని మామీద అరుచుకోవడం కంటే మీరు చేసిన కృషి ఏవిటో శేలవీయండి.

    కటకటా: ఈమాట చదవమని మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? సంపాదకులు మీ నోరు పెగిల్చి చేదు మాత్ర మింగించారా? టెంప్లేట్లు అంటున్నారు. అంటే అవేమిటో మీకు తెలుసా? ఏది వ్యాసం, ఏది కధ అనేది తేల్చడానికి ఎవరిది హక్కు? ఓ ముఖ్యమంత్రి కమిటీవేసి పెద్ద తెలుగు చదువుకున్న ప్రొఫెసర్లందరి చేతా చెప్పించాలా? ఈ ప్రొఫెసర్లకి డిగ్రీలు ఎలా వచ్చాయో మీకు తెలియదా? వాళ్ళ సిద్ధాంత గ్రంధాలు మీరు ఎప్పుడైనా చదివారా? పక్కనే ఉన్న అద్భుతమైన గ్రంధాలు వదిలేసి శ్రీశ్రీ రాసిన కవితలు (నేనుంటే, నీవుంటే, వాడుంటే, వీడుంటే.. ఇలా నాలుగు లైన్లు) వాటి మీద పి.హెచ్.డి చేసి పారేసి కమిటీలో కూర్చుంటారు. వీళ్ళా రూల్స్ చెప్పేది? వాళ్లకి మీటింగుల్లో తాగడానికింతా, తినడానికింతా అని ఇచ్చేస్తే మన ఇష్టం వచ్చినట్టు రాసి పెడతారనేది జగమెరిగిన సత్యం.

    లక్ష్మణ్ణగారు: ప్రతీ దానికీ ఒక ధన దృక్కోణం, ఋణ దృక్కోణం ఉంటాయండి. ఒక ప్రోబ్లెం ఓరియెంటెడ్ అప్రోచ్, ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ కూడాను. గంగ భువికి దిగకుండా అక్కడే ఆకాశంలో ఉండిపోతే ఏవిటి ప్రయోజనం? ఏనుగు లక్ష్మణ కవిగారి అనువాదం బాగానే ఉంది చదువుకుని సరదాగా అనుకోవడానికి. భువిమీదకి దిగేముందు గంగాదేవి “మరి నాలో పాపాలు ఎలా పోగుట్టుకోవాలి?” అని అడిగితే భగీరధుడు చెప్తాడు – అన్నిపాపాలనీ నాశనంచేసే తపస్సంపన్నులుంటారు కదా వాళ్ల స్నానంతో నీవు పవితృరాలివౌతావు అని. ఆకాశంలోనే ఉండిపోతే గంగాదేవికి హరుడి శిరస్సుమీద దిగినందుకు కలిగే పుణ్యం, ఆ తర్వాత అనేక పాపాత్ములని మార్చే అవకాశం లభించి ఉండేవి కాదు. “ఒక్క కుక్క ఆకలితో అలమటిస్తున్నా దాని ఆకలి తీర్చడం కోసం వేయి కోట్ల జన్మలెత్తమన్నా నేను సిద్ధం” అని స్వామి వివేకానంద అంటారు. అందుకే కాబోలు గంగ భగీరధుడి కోరికకి వప్పుకుంది. దానితో అనేక కోట్ల మంది ధన్యులౌతున్నారు యుగాల తరబడి. ఇది నా దృష్టిలో సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్. అదలా ఉంచితే ఈమాట బాగా దిగజారిపోయినట్టు మీకనిపించినట్టు చెప్పారు. పాత సంచికలు ఓ సారి తిరగేయండి. నాకు పెద్ద వ్యత్యాసం కనబళ్ళేదు మరి. ఓ వేమూరి గారి వ్యాసం/కధ మరొకరి కంప్యూటర్ సైన్స్ వ్యాసం వాళ్ళు రాస్తే భలే భలే అనే మీరే ఇలా అనడం వింతగా ఉంది. పోనీ మీరే చెప్పండి – ఏ విధంగా ఈమాట ని పైపైకి తీసుకెళ్ళొచ్చు? ఓ సొల్యూషన్ ఓరియెంటెడ్ అప్రోచ్ చూపించండి

    ఇదంతా చేసి నేను సంపాదకులని వెనకేసుకొస్తున్నాని అనుకోకండి. నేనూ వాళ్లమీద కత్తులు నూరుతూ ఉంటా. నేను రాసిన కధకి ఓ సారి వారి కామెంటు చూసి వళ్ళు మండిపోయిండి. “మీరు రాసినది ఎంత అసందర్భంగా ఉందో మీకు తెలియదు. రాస్తూ ఉండండి అనగనగరాగ మతిశయించుచుండు” అన్నారు మరి. చివరిగా మరో మాట. పాతకాలంలో అయితే పత్రికలో ఏదో ప్రచురిస్తే వేసుకునే వారు. దానిమీద వచ్చిన విమర్శలు ఆ పై సంచికలో వేసేవారు. ఆ తర్వాత అంతే. అయితే సంపాదకులనుంచి ఎటువంటి సమాధానం రాదు అప్పట్లో. దానికంటే ఇప్పుడు ఈమాట సంపాదకులు సమాధానం ఇస్తున్నారు కనీసం 24 గంటల్లో. ఏమిటి ఇక్కడ ఉన్న కష్టం మీ అందరికీ?

    పోనీ ఈమాట కట్టేయండి. దరిద్రం వదుల్తుంది. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టూ మీరు నోరు పారేసుకోవచ్చు ఏమంటారు?

  6. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి మోహన అభిప్రాయం:

    01/04/2016 10:46 pm

    చదువుటకు ఆసక్తి కలిగించే చక్కని వ్యాసము. మురళీధరరావుగారికి అభినందనలు.

    నాకు తోచిన సందేహాలు –

    (1) ఆ కాలములో “అష్టదిగ్గజములు” అని పిలువబడిన కవులందఱు తెలుగు కవులే. కావున ఆంధ్రకవి అని తప్ప మఱెలా ధూర్జటిని పిలువడము? సంస్కృత పదాలను పద్యమంతా ఉపయోగించినా, ఎక్కడో ఒక చోట ఒక చిన్న తెలుగు పదము ఉంటుంది కదా? ఆంధ్ర లేక తెల్గు లేక తెన్గు అని ఉపయోగించాలి అక్కడ. తెల్గుకవి కన్న ఆంధ్రకవి వినుటకు బాగుండినందువలన, ఆంధ్రకవి అని అన్నాడని నా ఉద్దేశము.

    (2) ఇక పోతే కృష్ణరాయల “దేశభాషలందు తెలుగు లెస్స” అనే పాదమునకు ఆ కాలపు రాజకీయాలు కూడ కారణమై ఉండవచ్చును అని వెల్చేరు నారాయణ రావు “Coconut and Honey: Sanskrit and Telugu in Medieval Andhra” అనే ఒక వ్యాసములో తెలిపియున్నారు.

    (3) సామాన్యముగా ఆ కాలములో కవులు తమ గ్రంథములను పూర్తిగా వ్రాసిన పిదప మాత్రమే వాటిని ఇతరులకు వినిపించేవారు అని నా భావన. దానికి కారణము వాటిలోని శైలి, కథ, కవిత్వము, చమత్కారాలు పూర్తి కాక మునుపే ఇతర కవులకు తెలియజేయుటకు ఇష్టపడరు. దానివలన లభించబోయే గౌరవము మున్నగునవి తగ్గవచ్చును. అలాటి సమయములో రాయలకు, ఇతర కవులకు అసంపూర్ణ కావ్యమును ధూర్జటి చూపించి ఉంటాడా అనే సందేహము నాకు కలిగినది.

    (4) ధూర్జటి, రుద్రకవి వీళ్లు అష్ట దిగ్గజములలో ఒకరా అనే ప్రశ్న ఇంకను నిస్సంశయముగా జవాబు లేదని నా ఉద్దేశము. నేను ఈ విషయములో పొరబడినానేమో?

    గౌరవనీయులైన రచయితకు నమస్సులతొ, విధెయుడు – మోహన

  7. అక్కరలు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    01/04/2016 6:34 pm

    మోహన రావు గారూ:

    చాలా చక్కని పరిశోధన వ్యాసం. ఇన్ని అక్కరలున్నా నా ‘అక్కర’ తీర్చగలిగేది మధ్యాక్కరే! బహుశా గణాల అమరిక కావచ్చు. రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, మళ్ళీ రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం — ad infinitum — పాటలా పాడుకోటనికి, తేలికగా గుర్తు పెట్టుకోటానికీ, పెద్ద పీట మధ్యాక్కరలకే వెయ్యాలని నా అభిప్రాయం. ఈ — Rhyme Scheme — మిగితా అక్కరలలో లేదనుకుంటాను.

    పోతే విశ్వనాథ సత్యనారాయణ గారి మధ్యాక్కరలు మరికొన్ని ఉదహరించి ఉంటే బాగుండేదేమో!

    ఉదాహరణకి ఆయన శ్రీ కాళహస్తి శతకం తీసుకోండి.

    తిరుపతికింబోయి యొడలి నగలెల్ల దీసి యిచ్చెదరు
    హర! వచ్చి నిను జూచి యొక నమస్కార మాచరించెదరు
    వెరపించుటకు మరపించుటకు గల భేదమిద్ది హర
    హర మహాదేవ! శ్రీ కాళహస్తీశ్వరా! మహాదేవ!

    పాడటానికి, గుర్తుపెట్టుకోడానికీ ఎంతసులువుగా ఉన్నదో చూడండి. చంద్రగణాల వాడుక కొన్ని అక్కరలలోనే కదా! మధ్యాక్కరలో చంద్రగణం లేకపోవటం వలన Rhyme scheme చెవికింపుగా ఉన్నదేమో!

    ఏది ఏమయినా మంచి వ్యాసం. As usual ఒళ్ళు దగ్గిర పెట్టుకొని చదవాల్సిన వ్యాసం.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  8. మా ఆవిడ – మంగళసూత్రం గురించి జిలేబి అభిప్రాయం:

    01/04/2016 3:40 pm

    ఔరా ! బులుసు వారి కథ ఎటుల గమనించక పోతిని !

    బులుసు వారు !

    చాలా బాగుంది !

    పసిడి గొలుసు రూపమై భామవా
    రి సిరినగవు కారికై వేగమై
    కసిరి పతిని మంగళా భాగ్యమై
    మిసిమి పసిడి భామినీ గాంచెనే

    చీర్స్
    జిలేబి
    (జిలేబివదన)

  9. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:

    01/04/2016 3:32 pm

    ” స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో ” పద్య మాంధ్రదేశములో బాగా ప్రాచుర్యము నొందిన పద్యము. ధూర్జటి స్తుతమతి. మతిమంతుడు గాబట్టే తన కావ్యరచనకు నాంధ్రభాష నెన్నుకున్నాడు. ఆంధ్రభాష కాబట్టి అందులో నతులిత మాథురీ మహిమను చొప్పించాడు. కాకపోతే ధూర్జటి పలికినప్పుడా యాంధ్రభాషమాధుర్య మవధులు లేకుండా సతతము ప్రవహిస్తుంది.
    శ్రీ ఏల్చూరిమురళీధర రావు గారిలో నొకపార్శ్వమున తెనాలి రామకృష్ణ దాగొని యున్నాడా నన్నట్లు ఆ పద్య చాతుర్యములో రెండు కోణాలను చక్కగా వివరించారు. శ్రీ ఏల్చూరి వారిని శ్రీ తెనాలి రామకృష్ణుని వలె సరస్వతీమాత సంస్కృతాంధ్రములు రెండిటిలోను ప్రావీణ్యత నొసగి కరుణించినది. ( వారాంగ్లము, హిందీ భాషలలో కూడా ప్రావీణ్యులే గాని అది యిక్కడ అప్రస్తుతము. ) అంతేగాక ఆయనకు విశేష పరిశోధనా శక్తి నీయుటచే మనకు చక్కని విశ్లేషణ లభ్య మయింది.
    ధూర్జటి చతుర్దశ భువనాలను సమ్మోహింప జేసే వారవనితల మన్మథతాపము నపహరించే అధరసుధారసధారలు గ్రోలుట వలన ఆయనకా మాధురీ మహిమ చేకూరుట పద్యములో సారము. మనందఱికీ తెలిసిన వారవనితలు వేశ్యావాటికలో నున్న వారవనితలు. అంటే పద్యమున కొక ప్రక్కే మన మర్ధము చేసుకున్నాము.
    శ్రీ ఏల్చూరివారు పద్యానికి మరో పార్శ్వమును వెలుగులోనికి తెచ్చి పద్య రమ్యత నినుమడించారు. ఆ వారవనితలు మాణిక్యవల్లి కుమార్తెలు. వారి మన్మధ తాపార్తి నా స్మరహరు డేనాడో హరించడమే గాక వారి జన్మజన్మల తాపాన్ని కూడా పోగొట్టాడు. వారి పెదవుల నుంచి బహిర్గతమైనవి నత్కీరుని పద్య సుధాధారలు. ఆ సుధాధారలచే తన్మయుడైన ధూర్జటికి యా అతులిత మాథురీ మహిమ చేకూరిన దనేది విశేషార్థము. ఛలోక్తి విసిరినా శ్రీతెనాలి రామకృష్ణులకు మహాకవి ధూర్జటిపైన విశేష గౌరవాభిమానములు గలవని నిరూపించి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు ప్రశంసనీయులయినారు.

  10. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి Ravi అభిప్రాయం:

    01/04/2016 1:41 pm

    This has been a question for me for a long time. Always wondered something not right. Didn’t get enough time to contemplate and research. Not withstanding the veracity and the occurrence of the event itself, That interpretation is just fantastic. I absolutely knew, there had to be a proper connotation around the event. It would seem so inappropriate and lack etiquette (especially in presence of the great king) for Rama Krishna kavi’s stature to belittle Dhurjati. Thanks a lot! you answered a lingering question that I had pushed back for 15 years now. will sleep more peacefully today 🙂 Regards