పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    12/04/2008 11:39 pm

    ఆరి గారు
    కళ్ళకు కట్టినట్లు చెప్పారు. చూసింది రాయడం వేరు. కనపడేలా చూపించే రాయడం వేరు.

    I do not know why, but this brings to my mind words of Vivekananda when some one was very enthusiastic to show him wonderful sights and sceneries in West. His response,
    “Do not show me sights. I have seen the Himalayas! I would not go ten steps to see sights; but I would go a thousand miles to see a
    (true) human being.”
    ———-
    Regards
    -Srinivas

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Upendra అభిప్రాయం:

    12/03/2008 10:54 pm

    నాగ మురళీ గారు,
    మీ వ్యాసం ఆసాంతము చదివాను. చాలా బాగుంది.

    కాని నాకు తోచిన విషయాలను చెప్పాలనే అత్యుత్సాహాన్ని మన్నిస్తారని ఆశిస్తూ

    1) చాలా మంది జ్యోతిష్యులు కేవలం రాశి, నవాంశ చక్రాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. కాని రాశి చక్రము లోని లగ్నము దాదాపు 2 గం|| , మరియు నవాంశ లగ్నము 13 ని|| పాటు మారకుండా స్ఠిరము గా ఉంటాయి. బృహత్ పరాశర హోరా శాస్త్రము లో వివిధ అంశ చక్రముల ప్రస్తావన మరియు ఏ ఏ సమయములలో ఏ చక్రమును ఉపయోగించాలి అని వివరణ ఉంది. ఆ అంశ చక్రాలలో నాఢ్యంశ ( 30 డిగ్రీలను 150 భాగాలు గా చేసి ఈ చక్రమును తయారు చేస్తారు) చక్రము ఒకటి. ఈ చక్రము లోని లగ్నము 1 ని|| కన్నా తక్కువ వ్యవధి లో మారిపోతుంది.

    నాకు తెలిసి ఈ ప్రపంచములో జాతకములను నాఢ్యంశ స్థాయి లో పరిశీలించేవారిని వేళ్ళ మీద లెక్కించవచ్చేమో?

    కవలల జాతకములను ఏ విధము గా పరిశీలించాలో ఈ వ్యాసం లో ఇచ్చారు http://www.vedicastrologer.org/050200.htm

    మరోసారి కలిసినప్పుడు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం.

    ధన్యవాదములతో
    -మీ ఉపేంద్ర

  3. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/03/2008 9:04 pm

    కామేశ్వరరావు గారికి,

    సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.

    వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.

    భూషణ్ గారికి,

    నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.

    మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి Saisahithi అభిప్రాయం:

    12/03/2008 9:40 am

    చాలా బాగుంది.
    మొదటి లైను చాలాబాగుంది. మధ్యలో ” గరీబోడి …..ఇది తెలంగాణా మాండలీకం . ఇక్కడ
    misfitting అని పిస్తోంది.

  5. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao అభిప్రాయం:

    12/03/2008 6:51 am

    హనుమగారు,

    ప్రాచీన ఆధునిక కవిత్వాలలోని అస్పష్టతని పోల్చడం నా ఉద్దేశం కాదు. రెండూ వేరువేరు తరహాలకి చెందినవి కాబట్టి వాటిని పోల్చలేము కూడా. ప్రాచీనకవిత్వంలో కూడా అస్పష్టత ఉందని, అది మీరన్న ఆధునికకవిత్వంలోని అస్పష్టతకి భిన్నమైనదని చెప్పడమే నా ఉద్దేశం. ఆధునికకవిత్వంలో అస్పష్టతకి మీరిచ్చిన ఉదాహరణ నేనన్న వాక్యగత అస్పష్టతకి మంచి ఉదాహరణే. ఇక్కడ వాక్యాలు అర్థ రహితం (వ్యాకరణ రీత్యా) కావడం మూలాన అస్పష్టత ఏర్పడుతోంది. ప్రాచీనకవిత్వంలో ఇలాటిది దాదాపుగా కనిపించని మాట వాస్తవమే.

    ప్రాచీనకవిత్వంలో అస్పష్టతకి ఇంకా మంచి ఉదాహరణలు ఉన్నాయి కాని ప్రస్తుతానికి ఇది:

    “ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె! నా
    హా! కడుదూరమిప్పు”డని యక్కున జేర్పక జంపుమాటలన్
    వ్యాకుల పెట్టుటేల? విరహాంబుధి ముంపకపోదు నన్; జలం
    బేకద నీకు; మంచిదిక నీతకు మిక్కిలి లోతు గల్గునే!

    ఇందులో అస్సలు అర్థంకాని పదాలు కానీ, అర్థంలేని వాక్యాలు కానీ ఏవీలేవు. అయినా కవి ఇక్కడ ఏవిటి చెప్పదలచుకున్నాడో స్పష్టంగా తెలియటంలేదు. ఇది విజయవిలాసంలో ఉలూచి అర్జునునితో అనే మాటలు. అర్జునుడు తనని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోకపోతే అంటున్న మాటలు. సందర్భాన్ని బట్టి ఈ పద్య తాత్పర్యం చూచాయగా తెలుస్తున్నా, దీనికి సంతృప్తికరమైన వివరణ ఎక్కడా నాకు కనిపించలేదు. హృదయోల్లాస వ్యాఖ్య రాసిన తాపీవారు కూడా ఈ పద్యంలో కవి చెపుతున్న “ఎక్కడినుండి ఎక్కడకి” తేవడం, విరహ అంబుధిలో “ముంచడం”, “ఈతకు మిక్కిలి లోతుగల్గునే” అనే జాతీయాన్ని ప్రయోగించడం మొదలైన విషయాల్లో కవి ఆంతర్యం స్పష్టం కాలేదని ఒప్పుకున్నారు. “ఈతకు మిక్కిలి లోతు చావుకి మిక్కిలి చింత ఉండవు” అనే జాతీయాన్ని ఇక్కడ ప్రస్తావించి, తనకి చావే శరణ్యం అని ఉలూచి అంటోంది అని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన చిక్కల్లా, ఈతవస్తే సముద్రంలో మునిగిపోవడం ఉండదు కదా, మరి విరహాంబుధిలో ముంచడం గురించి ఎందుకు ప్రస్తావించినట్టు?

    ఇంతకీ నేను చెప్పదలచుకున్న సారాంశమేమిటంటే, ప్రాచీన కవిత్వంలో కూడా కొన్ని చోట్ల అస్పష్టత కనిపిస్తుంది. అయితే, అది మీరు ఆధునిక కవిత్వంలో చూపిన అస్పష్టత లాంటిది కాదు. ఏది స్వచ్ఛమైనది, గాఢమైనది అన్న ప్రశ్న అనవసరం.

  6. రచయితలకు సూచనలు గురించి sammeta umadevi అభిప్రాయం:

    12/02/2008 11:25 pm

    తెలుగులో ఇలాంటి పత్రికను తెస్తున్న మీరు చాలా అభినందనీయులు. మీరు భారతదేశంలొ వారికి కూడా రచనలు పంపమని అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని మంచి రచనలు మీ పత్రికలో చదవగలమని ఆశిస్తున్నాం.

  7. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి gorusu jagadeeshwar reddy అభిప్రాయం:

    12/02/2008 11:17 pm

    శ్రీ లక్ష్మన్నగార్కి నమస్కారాలు.

    మీ స్పందన ఇప్పుడే చదివాను – గొప్ప భావోద్వేగం కల్గింది. ఎంచేతంటే “కన్నుల దాగిన అనురాగం” పాటకి రావలసిన పేరు రాలేదని నేనెప్పుడూ బాధపడుతుంటాను. ఆ పాట మీకూ ఇష్టమని తెలిసి చాలా ఆనందించాను. ఆయన పాటల్లో ముఖ్యంగా “కాలంకాని కాలంలో” (అప్పు చేసి పప్పుకూడు), “సఖీ శకుంతలా” (కులగోత్రాలు) పాటలు కూడా నన్ను ఎంతో పరవశున్ని చేస్తాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” చదివిన సింగీతం శ్రీనివాసరావుగారు ఆ మర్రోజు సోమవారం ఉదయమే నా ఫోన్‌ నంబర్ దొరకబుచ్చుకుని నాతో మాట్లాడ్డం నా స్వీట్‌ మెమోరీస్‌లో ఒకటి. ఆయనే నన్ను గుర్తు పెట్టుకుని ఈ మధ్య అమీర్‌పేట్‌ గ్రీన్‌పార్క్‌లో జరిగిన సాలూరి వారి సిడీ విడుదలకు ఆహ్వానించారు. ఆయన సినిమాల మాదిరే ఆదీ ఓ ప్రయోగం. రాజేశ్వరరావు పాడిన పాటల పల్లవులతో మొదలెట్టి చరణాల్ని మార్చి రాయించి, బాలసరస్వతి, సుశీల, వాణీ, జానకి, బాలు, సింగీతం, కీరవాణిలతో పాడించారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని రావుబాలసరస్వతిగారికి గుంటూరులో అభో-విభో పురస్కారం సందర్భంలో చూశాను.

    సాలూరి రాజేశ్వరరావుపై ఇప్పటిదాకా సావనీరు రాకపోవడం వల్ల ఆయన సంగీతం నిర్వహించిన సినమాల లిస్టు దొరకటం లేదు. ఆయన “ఫోక్‌” మ్యూజిక్‌పై ఉదా: “బొంగారల బుగ్గలున్న” (డా.చక్రవర్తి), “చెట్టులెక్కగలవా” (చెంచు.లక్ష్మి), “సన్నజాజి సొగసుంది, జున్నులాంటి మనసుంది” (కాలంమారింది)లాంటి ఎన్నో పాటలపై ఎవరైనా రాస్తే బాగుండేది.

    ఒక్కటి చెప్పనా లక్ష్మణ్ణగారూ, మనిషిగా పుట్టినందుకు రాజేశ్వర్రావు పాటల్ని వినగలిగే అదృష్టం కల్గింది కదా అనుకుంటాను.

    ధన్యవాదాలతో – గొరుసు

  8. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి తమ్మినేని యదుకులభూషణ్. అభిప్రాయం:

    12/02/2008 10:25 pm

    ఇస్మాయిల్ గారిని బాగా ఎరిగున్న వ్యక్తిగా నాలుగు మాటలు చెబుతాను.ఆయన వ్యక్తిగా చాలా ఉదారుడు. చేయనిదానికి ఘనత పొందాలనే తాపత్రయం ఆయనలో ఏనాడు లేదు. అయితే కొడవళ్ల హనుమంతరావు గారు చూపిన వ్యాసం ఇస్మాయిల్ గారి “ఇద్దరు భాష్యకారుల”కు మూలం అన్న దాంట్లో రెండవ అభిప్రాయానికి తావు లేదు.

    ఇంకో పార్శ్వం:
    తెలుగులో పుస్తక ప్రచురణ పెద్ద తలనొప్పి వ్యవహారం (దేశిబుక్స్ తరపున ఇస్మాయిల్ గారి “కవిత్వంలో నిశ్శబ్దం”, “పల్లెలో పాత ఇల్లు” మేము ప్రచురించిన సంగతి కొంత మంది పాఠకులకైన తెలిసే ఉంటుంది). ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే , ఇస్మాయిల్ గారి ఆముద్రిత కవితలు అనువాదాలు ప్రచురించే ముందు ఆయన స్వదస్తూరిలో ఒక అనువాదం దొరికింది. దాని మీద, ఆయన రష్యన్ కవయిత్రి అని రాశారు అంతే. ఊరు, పేరు ఏమీలేవు. ఆయనకు రష్యన్ లో ఇష్టులైన కవులు/కవయిత్రులు నాకు తెలుసు కాబట్టి, అందునా అది ఆ కవయిత్రి రాసిన కవితల్లో కొంత విలక్షణమైనది కాబట్టి నేను వెంటనే, గుర్తించి ఒక లఘు టిప్పణి లిఖించి ప్రచురణ పనులు చూస్తున్న కవిమిత్రులకు పంపాను. అదే రకంగా ఇంకో రెండు పోలిష్ కవితలను గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ రాయప్రోల్ కవిత్వం/జీవితం గురించి అమెరికన్ పత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు వాక్యాలు రాసి పంపాను. కానీ, ఇవేవీ పుస్తకం ప్రచురణలోకి రాలేదు.

    నేను చెప్ప దలచుకొన్నది ఏమంటే, మనవారికి పాదపీఠికలమీద పెద్ద ఖాతరీ లేదు. కవి /రచయితల శుద్ధప్రతి మొదలుకుని ప్రెస్సుకు వెళ్ళే ఆఖరి ప్రతి (gateway అంటారు మన ప్రెస్సువాళ్ళు) దాకా ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకొంటాయి. పుస్తక ప్రచురణలో కవి /రచయిత /సంపాదకుల ప్రమేయం ఉన్నా, ఒక్కొక్కసారి కొందరి అజాగ్రత్త వల్ల ఎన్నో స్ఖాలిత్యాలు. అటువంటి స్ఖాలిత్యాల ఫలితమా ఇది? ఇస్మాయిల్ గారు మొదట రాసిన ప్రతిలో దాని మూలాన్ని పేర్కొన్నారా?? అసలు మొదటి సారి ఏ పత్రికలో ప్రచురించ బడింది?? ఇవన్నీ సాహిత్య చరిత్రకారులు తేల్చవలసిన విషయాలు.

    తమ్మినేని యదుకులభూషణ్.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    12/02/2008 5:08 pm

    పోతన భాగవత ప్రభావం త్యాగరాజుపై ఖచ్చితంగా ఉంది. స్వదస్తూరీతో రాసిన ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. రాజాస్థానం వద్దనడానికి భక్తే కారణం అని చెప్పలేం. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుడిగా మొదటి సారి పిలుపొచ్చింది. అప్పటికే అక్కడ 300 మంది పైగా విద్వాంసులున్నారు. గుంపులో గోవిందా లా ఉండడం ఇష్టం లేదు. తన స్వేఛ్ఛకి భంగం అని భావించాడు. అందుకే ఒప్పుకో లేదు. రెండో సారి పిలుపులో శరభోజి తనపై కీర్తనలు కట్టమన్నాడు. అది ఇష్టంలేక వెళ్ళ లేదు. కానుకలు పంపినా ఫలితం లేక పోయింది. ఇక్కడ భక్తొకటే కాదు, ఆత్మాభిమానం కూడా ఉంది. రాముడిపై తప్ప వ్యక్తులపై కీర్తనలు కట్టడం నచ్చక వెళ్ళలేదు. ఒకే విషయం భక్తి కోణం లోంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చూస్తే ఇంకోలా తోస్తుంది.

    మీరనుకున్నట్లు కృతుల్లో చివర ముద్ర అనేది పేరుకోసం కాదు. అనాదిగా శాస్త్రీయ సంగీతంలో కృతికర్త పేరు ఉండడం రివాజుగా వస్తోంది. అన్నమయ్య తిరు వేంకట ముద్రా, క్షేత్రయ్య మువ్వ గోపాలుడి ముద్రా ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇది కేవలం ఒక పద్ధతిగానే తీసుకున్నారు తప్ప, పేరు కోసం కాదని నా అభిప్రాయం. ముద్రకీ, Modesty కీ సంబంధం లేదు. మరీ రెట్టిస్తే, తిరువారూరు త్యాగరాజ స్వామి ముద్ర అని అనుకోవచ్చు కదా?

    ఇహ ఆధ్యాత్మికత అంటారా, అది వయసు పెరిగే కొద్దీ మారుతూ వస్తుంది. మనసు కి చెప్పుకోడం అనే ప్రక్రియని మాత్రం త్యాగరాజు చాలా ఎక్కువగా ఉపయోగించాడు. మనసుకి గోడు చెప్పుకున్నంత మాత్రాన దేముడు ప్రత్యక్షమయ్యాడనే ఊహ సరికాదు. ఒకవేళ అలానే జరిగితే, త్యాగరాజొక్కడే దేముణ్ణి చూసుండాలి. ఆయనకి ప్రత్యక్ష మయ్యాడని మనం అనుకొని చెప్పడం కాదు. తను దేముణ్ణి చూసానని త్యాగరాజు ఎక్కడా చెప్పలేదు. భావనకీ, నిజానికీ చాలా తేడా వుంది.

    సంగీత సృజన పరంగా మీరు వాడిన పోలిక అస్సలు ఒప్పదు. మీ అభిమాన సంగీత కారులు ఇళయ రాజా, రహమాన్ ఉన్న రాగాల్ని వాడుకుంటూ సంగీతం ఇస్తున్నారు. త్యాగరాజు అలా కాదు. కొత్త కొత్త రాగాల్ని కనుక్కున్నాడు. సంగీతానికొక వొరవడి కూర్చాడు. రెంటికీ నక్కకీ, నాకలోకానికీ ఉన్నంత తేడావుంది.

  10. సువర్ణభూమిలో … గురించి ఆరి సీతారామయ్య అభిప్రాయం:

    12/02/2008 3:11 pm

    సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు.

    ఈ కవితలో మూడు దృశ్యాలున్నాయి. మొదటిది ఒక కొండమీది (ఒక భక్తుడు ఎన్నో మెట్లెక్కి వచ్చాడు కదా) బౌద్ధ దేవాలయం. బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్ధులు ఎదురెదురుగా కుర్చోనున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళేముందు భక్తులు కాళ్ళుకడుక్కోవటానికి ఒక పెద్ద నీళ్ళతొట్టె ఉంది. అందులో కలువలున్నాయి. ఒక కలువ మీద తేనెటీగ వాలి ఉంది. అగరొత్తుల పొగ దేవాలయం అంతా వ్యాపించి ఉంది. ఎర్ర చారల పిల్లి ఒకటి ఉంది ఆ దృశ్యంలో. కవి చూస్తుండగానే కొండ పైదాకా వచ్చిన భక్తుడొకడు పైకప్పుకు అంటుకొనిఉన్న గబ్బిలాలను అదలించాడు. మన కవి, అతని భార్య (మేము అన్నాడు కదా? అరుంధతి గారికి కవితను అంకితం ఇచ్చాడు) బంగారు బుద్ధుడికి కలువలు సమర్పించారు.

    రెండో దృశ్యం పర్యాటకులు చూసే ఒక శిధిలమైన దేవాలయం. ఒక పర్యాటక బృందానికి మన కవికి తెలియని ఏదోభాషలో గుడి గురించి చెప్తున్నాడు గైడ్. దేశం మీద జరిగిన దాడుల్లో దేవాలయంలోకూడా విధ్వంసం జరిగింది. విగ్రహాల తలలు తెగిపోయాయి. దేవాలయపు గోడలమీద ఇప్పుడు పెద్దపెద్ద చెట్లున్నాయి. వాటి వేళ్ళలో ఒక బుద్ధ విగ్రహానికి చెందిన తల ఇరుక్కుపోయి ఉంది. మొండెం మాత్రం ఇంకా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మామూలు కవికీ మంచి కవికి తేడా – ఆ పర్యాటకుల బృందంలో ఒకావిడ అక్కడకొచ్చిన కుక్క పిల్లని ఒడిలోకి తీసుకున్నది అని చెప్పటం. చరిత్రలోనుంచి మనల్ను బయటకు తీసుకొచ్చాడు కవి.

    మూడో దృశ్యం సముద్రపు నీళ్ళలోతుల్లో జంతుజాలాన్ని చూడటానికి వెళ్ళే పర్యాటకులు. కొంచెం అటూ ఇటూ అయితే ప్రమాదం. బాగా ఈత వచ్చిన వాళ్ళు పర్యాటకులను రక్షించాల్సి వస్తుంది.

    ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్‌ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.