పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. ది ట్రాప్‌ గురించి Perugu Balasubramanyam అభిప్రాయం:

    09/07/2010 7:41 am

    ఎంత బాగా చెప్పారు పిల్లల పెంపకం గురించి వయస్సు పైబడిన వారి బాగోగులు చూడకుండ ఎంత సేపు వారి వారి ప్లానింగ్. మా కొడుకులు కూడా ఇలాగె ఆలోచిస్తారు మా కన్ను నెప్పి/పన్ను నొప్పి వాళ్ళకి ఒక చికాకుగా ఉంటుంది.

  2. ప్రేమ కవితలు గురించి jyothi అభిప్రాయం:

    09/07/2010 6:00 am

    suparundy me kavitha srinivasa rao garu

  3. తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Kameswara Rao అభిప్రాయం:

    09/07/2010 5:57 am

    హెచ్చరిక: రారాగారి వ్యాసంలాగానే, నా యీ పొడుగాటి వ్యాఖ్యలోనూ తిలక్ కవిత్వం గురించి ఏమీ లేదు. కాబట్టి తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు దీన్ని చదవనక్కర లేదు.

    తామొక చట్రంలో ఇరుక్కోడమే కాక తాము చదివిన కవులనీ కవిత్వాన్నీ కూడా అలా చట్రాల్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే అది ఎంత వెగటుగా ఉంటుందో రారాగారి ఈ విమర్శ నిరూపిస్తుంది. అంత మాత్రం చేత రారా అంటే నాకు గౌరవం లేదనీ కాదు, ఇదొక చచ్చు విమర్శ అనీ కాదు. కవుల్లాగే విమర్శకులు కూడా కాలానికీ, ఆయా కాలాలలో ప్రాచుర్యం పొందిన భావజాలాలకీ ప్రభావితులవుతారు. ఆ కాలంలో పాఠకులకి అది గొప్ప విమర్శగా అనిపించవచ్చు, వారూ చాలావరకూ ఆ చట్రాల్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత కాలాల్లో అలాంటి చట్రాల్లో లేని వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

    ఈ వ్యాసంలో నాకు తిలక్ కవిత్వం కంటే కూడా అభ్యుదయ కవిత్వం గురించిన వివర విశేషాలే ఎక్కువగా కనిపించాయి. తిలక్ అభ్యుదయ కవి కాడు అని నిరూపించడానికి అభ్యుదయ కవిత్వం గురించి అంత వివరణ అనవసరం అని నాకనిపించింది. అది కాక మిగిలినదంతా, తిలక్ భావకవి అని అంతకన్నా కూడా అథమస్థాయికి దిగజారాడని, నిరూపించడానికే సరిపోయింది. ఎంతసేపూ “అభ్యుదయ”, “భావ” కవిత్వాలు అనే చట్రాల్లోకి తిలక్ కవిత్వం ఒదుగుతుందా లేదా అనే తపనే కాని, ఒక కవిగా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ధ్యాస లేకపోవడం దురదృష్టకరం.

    “శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి బహుశా లేడేమో” అని అన్నారు కాని, శ్రీశ్రీ కున్న భావుకత్వానికీ తిలక్ భావుకత్వానికీ మధ్యనున్న ఆంతర్యం ఏమిటన్న ఆలోచన చెయ్యలేదు. ఇద్దరూ గొప్ప భావుకులే. ఇద్దరికీ గొప్ప శబ్దశక్తి ఉంది. కాని వాళ్ళిరువురూ అంత భిన్నమైన కవిత్వాన్ని ఎందుకు రాసారు?

    “దుఃఖితుల పట్లా బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కాని ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదు. ఆ కరుణ దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురనూ, కర్యవ్యోన్ముఖులనూ చేసేది కాదు. కనీసం వాళ్ళకు ఊరట కలిగించేది కూడా కాదు.” అన్నప్పుడు దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురని చేసేది మాత్రమే “అభ్యుదయ స్పందన” అవుతుందనే ఒక prejudice అందులో దాక్కుంది. పైగా “ఆ కరుణ కేవలం భావకవి కుమారుని ఏకాంత సౌందర్యంగా, కవితానంద హేతువుగా మిగిలిపోయింది” అని అన్నప్పుడు ఆ కరుణ అభ్యుదయం కాకపోతే భావుకవిత్వమే అవ్వాలన్న సంకుచిత దృష్టి కనిపిస్తోంది. తిలక్ కరుణ భావకవులకి మల్లే పూర్తిగా వ్యక్తిగతమైనది కాదు. భావకవుల్లా దుఃఖంలో అతను సౌందర్యాన్ని చూసాడనడమూ సహేతుకం కాదు. తిలక్ శ్రీశ్రీలా ఆవేశపరుడు కాదు. అందుకే అతను ఎంత భావుకుడైనా అతని కవిత్వంలో మృదుత్వం తప్ప రారా అన్న “ఉత్తేజం” కనిపించదు. శ్రీశ్రీ ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అతన్ని మరింత ఆవేశపరుణ్ణి చేసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు తిలక్ కి లేనందువల్ల అతనిలో ఆ ఆవేశం కలిగే అవకాశమూ రాలేదు. అంత మాత్రం చేత తిలక్ కరుణని ఆవేదనని భావకవుల ఏకాంత సౌందర్యంగా జమకట్టెయ్యడం తప్పు. తిలక్ పీడితతాడిత జనాలని క్రియాశీలురని చెయ్యడానికి కంకణం కట్టుకోలేదు. వాళ్ళ బాధలకి నిజాయితీగా స్పందించాడు. అది భావకవిత్వంలో ఎక్కడా మనకి కనిపించదు.

    “ప్రజాశక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్ఛందమైన సానుభూతి ఉంది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అన్నారు. తిలక్ భావకవి అని ముద్రవేసి అతని కవిత్వంలో ప్రజాశక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సానుభూతిని భావకవులందరికీ కట్టబెట్టేసారు. కాకపోతే, అసలు అంతకుముందు వచ్చిన భావకవిత్వంలో “ప్రజాశక్తుల” ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక ప్రజాశక్తులతో “తాదాత్మ్యం” అభ్యుదయ కవుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే ఉన్నది. అభ్యుదయ కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవితల్లో ఆ తాదత్మ్యం లోపించే అవి శుష్క నినాదాలుగా మిగిలిపోయాయి.

    స్త్రీ గురించి “పెద్దపులి” అనడమూ, “ప్రవహ్లిక”తో పోల్చడమూ ఏ ఇజాలకీ లొంగక పాపం రారాగారికి అస్సలు మింగుడుపడలేదు! ఆఖరికి ఏదో తనకి తెలిసిన ఒక ఆర్యోక్తితో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. ప్రతిదాన్నీ ఏదో ఒక ఇజంతో ముడిపెట్టాలన్న ఈ తహతహ ఎందుకసలు? ఒక పురుషుడిగా స్త్రీ వ్యక్తిత్వంలో తనకి తెలియని లోతులు కనిపిస్తే దాన్ని కవిగా తనదైన రీతిలో వ్యక్తం చేస్తే ఆ కవిత్వాన్ని కవిత్వంగా ఎందుకు అర్థం చేసుకోకూడదో నా మట్టి బుఱ్ఱకి తట్టటం లేదు.

    ఇక స్త్రీల వర్ణన గురించి ప్రస్తావించి, అది భావకవిత్వం కన్నా దిగజారి ప్రబంధకవిత్వ స్థాయికి చేరుకుందని కొన్ని కవితలు ఉదహరించారు.తిలక్ చేసిన అంగాంగ వర్ణనలని ఆక్షేపిస్తే నాకు పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కాని భావకవిత్వంతో పోల్చి, అంతకన్నా దిగజారిందనడం పూర్తిగా అనవసరం, అర్థ రహితం. భావకవుల కవిత్వంలో కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. బాపిరాజుగారి “నగ్న” కవితాఖండిక దీనికి మంచి ఉదాహరణ. ఇంకా కాళ్ళకూరి గోపాలరావు కవిత్వం, కవికొండల గీతాలు మొదలైనవాటిల్లో స్త్రీ అంగాంగ వర్ణన కనిపిస్తుంది. “భావకవిత్వంలో స్త్రీ” పుస్తకంలో జయప్రభగారు దీని గురించి వివరించారు. అంచేత స్త్రీల వర్ణన విషయంలో తిలక్ భావకవిత్వం కన్నా దిగజారుడుతనం చూపించాడన్నది అర్థం లేని ఆక్షేపణ.

    అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, భావకవులది “ఉదాత్త ప్రణయమ”నీ, ఇంద్రియవాంఛ, శరీరదాహం సిగ్గుమాలినతనమనీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే “అమలిన శృంగారం” అన్న “ఉదాత్తమైన” ప్రణయాన్ని భావకవుల్లోనే అందరూ ఆదరించిన దాఖలాల్లేవు. అభ్యుదయవాద చట్రంలో ఇరుక్కున్న రారాగారికి అది “ఉదాత్తంగా” కనిపించడంలో వింతలేదు, కాని తర్వాత వచ్చిన స్త్రీవాదులు దాన్ని పూర్తిగా ఖండించడం ఒక విశేషం!

    రారాగారు ఎంతగా సిద్ధాంత సర్పపరిష్వంగంలో ఇరుక్కుపోయారంటే, సూత్రాలకీ సిద్ధాంతాలకీ కట్టుబడని తిలక్ మనస్తత్వాన్ని “మానసిక అరాజకత్వం” అనేంతగా! అల్లాంటి ఇరుకుదనమే సంకుచితత్వానికీ, నిరంకుశత్వానికీ దారితీసింది . కలల గురించి కవిత్వం రాసిన కారణానికి తిలక్ ని పిచ్చాసుపత్రికి దగ్గరగా ఉన్నాడని అనేంతగా అతని విమర్శని దిగజార్చింది!

    ఇది ఏదైనా కావచ్చును కాని తిలక్ కవిత్వాన్ని గురించిన “సమీక్ష” మాత్రం ఖచ్చితంగా కాదు.

  4. పూల పల్లకి గురించి Varun అభిప్రాయం:

    09/07/2010 5:12 am

    శ్రీనివాసుగారూ,
    మీ ‘పూల పల్లకి’ చదివాక
    మా ఊర్లో
    పండువెన్నెల్లో
    రాంపాదాల రేవులో
    రావిచెట్టు క్రింద
    మెట్లు మీద కూర్చుని,
    రెండు కాళ్ళూ గోదాట్లో పడేసి
    ఆదరికి కళ్ళొదిలేయడం
    గుర్తొచ్చింది మాస్టారూ.
    Thanks a lot.

  5. నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Kameswara Rao అభిప్రాయం:

    09/06/2010 9:34 am

    ఈ పద్యం చదివితే నాకింకొక పద్యం గుర్తుకు వచ్చింది.

    రాజు కళంకమూర్తి, రతిరాజు శరీరవిహీను, డంబికా
    రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతరసీమవర్తి వి
    భ్రాజిత పూసపాడ్విజయరామనృపాలుడు రాజుగాక యీ
    రాజులు రాజులే పెనుతరాజులు గాక ధరాతలమ్మునన్

    అడిదం సూరకవి చెప్పిన ఆశువంటారు. మొల్ల పద్య స్ఫూర్తి బాగానే కనిపిస్తుందీ పద్యంలో!

    “కదలకుమీ…” : ఈ పద్యం చాలా చోట్ల ఈ యతి భంగంతోనే చూసాను! మూడవపాదం “వదలక” బదులు “బెదరక” అయితే యతి సరిపోతుంది. చిన్నప్పుడు మా క్లాసు పుస్తకంలో అలాగే చదివినట్టు గుర్తు.

  6. కుతంత్రం గురించి kavitha అభిప్రాయం:

    09/05/2010 11:08 pm

    ఎంత బాగా రాస్తారు లైలా గారూ, మీరు కథలు? సున్నితత్వం తొణికిసలాడుతూ ఉంటుంది మీ కథల్లొ…ఇంతకు ముందు ‘అతనెవరొ’ చదివినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాను.

    చక్కని ముగింపు! చాలా బాగుంది. ఆ తెలి తెలి వెలుగుల్లొ ఫెళ్ళికొడుకు ఆమెను rescue చేసి తీసుకువెళ్ళటం!

  7. తోడు గురించి రీడర్‌ అభిప్రాయం:

    09/05/2010 10:58 pm

    అమెరికా వచ్చిన భారతీయులకి వావీ, వరసా ఉండనక్కర్లేదా, ఈ కధలో? శారద ఆ పెళ్ళికి ఇష్టపడి, రామారావుని పెళ్ళి చేసుకుని వుంటే, వనజకి పినతల్లీ (సవతి తల్లీ), అత్తగారూ ఒకరే అయివుండే వారన్న మాట. అలాగే నవీన్‌కి సవతి తండ్రీ, మామగారూ ఒకరే అయి వుండే వారన్న మాట. రక్త సంబంధం లేకపోవడం వల్ల, చట్టరీత్యా నేరం కాదేమో గానీ, ఇది తప్పకుండా వరస సంక్రమం. ఇది తెలుగు సంస్కృతికి నప్పే విషయమేనా? రామారావు వనజకి ఏ మామయ్య వరసో అని రాస్తే, కధకి వచ్చే హాని ఏమీ వుండదు. అలా రాయక పోవడం వల్ల, జుగుప్స కలిగించే కధ అయింది ఇది.

  8. నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    09/05/2010 9:51 pm

    చీమలమర్రి బృందావనరావు గారి వ్యాసము బాగుంది. ఆంధ్రుల అభిమాన కవయిత్రి మొల్ల వ్రాసిన పద్యాన్ని యెన్నుకొని వ్యాస రచన అద్భుతంగా సాగించారు.

  9. నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    09/05/2010 7:38 pm

    అపారమైన తెలుగు సాహిత్య చరిత్రలో కొద్దిమంది కవులు ,బహుశా ఒక కవయిత్రి పేరు మాత్రమే ప్రసిద్ధి కెక్కాయి. కవిత్రయము,పోతన,శ్రీనాధుడు,అష్టదిగ్గజములు,మొల్ల పూర్వకవులలో ఆ అదృష్టమునకు నోచుకొన్నారు. వైయాకరుణులు పోతన కవిత్వంలో కూడా బోలెడు దోషాలు పట్టారు. నన్నయ, తిక్కనల భాషలో కూడా తప్పులు పట్టి ‘ఆర్యదోషంబు గ్రాహ్యంబు’ అని ఓ వ్యాకరణ సూత్రము తగిలించారు. అందుచేత కవయిత్రి మొల్లను స్త్రీ అనో అగ్రకులమునకు చెందక ఫొవటము వలననో ఆ కాలపు పెద్దలు గౌరవించ లేదని చెప్పడము భావ్యము కాదేమో. అది నిజమయితే అగ్రకులస్థులే ఎక్కువగా సాహిత్య పఠనం చేస్తున్న కాలంలో ఆవిడకు ఆ ఖ్యాతి ఎలా వచ్చింది?
    మొల్ల సహజ కవయిత్రి. భాషాధ్యయనము చేయలేదని, ఈశ్వర ప్రసాదముచే కవిత్వము వచ్చినదని ఆవిడ చెప్పారు. నిఘంటువు అవసరము ఎక్కువగా లేని రీతిలో తేనెసోకునటుల తియ్యని మాటలతో కవిత్వము వ్రాసారు. రాజుల వర్ణన బాగుంది. కాని నన్ను ఆకట్టుకొన్న పద్యము

    చం. కదలకుమీ ధరాతలమ, కాశ్యపి బట్టు ఫణీంద్ర ,భూవిషా
    స్పదులను బట్టు కూర్మమ ,రసాతల,భోగి ఢులీ కులీశులన్
    వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
    బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కెడిన్ .

    శ్రీరాముడు శివధనస్సు ఎత్తుతుంటే భూకంపము రాకుండా చూడమని లక్ష్మణుడు చెప్పిన పద్యము నాకు నచ్చినది. (మూడవ పాదములో యతి కలసి నట్లు లేదు. పెద్దలు వివరించ గలరు. మనకు నచ్చినప్పుడు యతి కలవక పోతే యేమి ? )

  10. శతకందసౌరభము: పరిచయం గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    09/05/2010 3:15 pm

    కందము పద్యము లందున
    అందము నెంతైన గలదు నాస్వాదింపన్
    ఎందున గని విని యెఱుగము
    అందఱి నానంద పఱచు నది మకరందమ్ .

    కృష్ణమోహన రావు గారి కంద పద్యాలు బాగున్నాయి.