ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు
జీవిత విశేషాలు
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు (1877-1923) కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో జన్మించారు. భువనగిరి, నాగపూర్లలో విద్యాభ్యాసం. సంస్కృతం, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్ధికెక్కారు. మహమ్మదీయ మహాయుగం, హిందూమహాయుగం, శివాజి, హైందవ చక్రవర్తులు అన్న గ్రంథాలు రాశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల స్థాపించి, భౌతిక శాస్త్రం, దేశ చరిత్రలపై పుస్తకాలు ప్రకటించారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పేరుతో తెలుగులో మొట్టమొదటి ఎన్సైక్లోపీడియా మూడు సంపుటాలు ముద్రించారు.