4. గాంధీ గారి రైలు సంఘటన
ముందు చెప్పినట్లు, 1860 నుంచి కూలీలుగా వచ్చిన వారిలో ఎక్కువమంది నటాల్లోనే స్థిరపడి ఒక ప్రవాస సమాజంగా ఏర్పడ్డారు. అదే కాలంలో, వ్యాపారరీత్యా వచ్చిన గుజరాతీ వ్యాపారులు (అధికులు ముస్లింలు) ఈ ప్రవాస సమాజంలో భాగంగా, అగ్రస్థానంలో ఉండేవారు.
1891 లో మోహన్దాస్ కరంచంద్ గాంధీ, అప్పుడే ఇంగ్లాండ్లో బార్ పరీక్ష పాసయ్యి ఇండియాకి తిరిగి వెళ్ళారు. ఆయన లా ప్రాక్టీసు పెట్టి, పోటీ ఎక్కువగా ఉన్న ఆ రంగంలో నిలదొక్కుకోడానికి తంటాలు పడుతున్న రోజులవి. అదే సమయంలో, నటాల్లో దాదా అబ్దుల్లా (అబ్దుల్లా ఝవేరీ అని కూడా పిలుస్తారీయనను) అనే ఒక గుజరాతీ వ్యాపారికి తన వ్యాపార భాగస్వామితో (తన బంధువే!) వివాదం వచ్చింది. లావాదేవీలన్నీ గుజరాతీలో ఉండగా, కేసు వాదించాల్సింది మాత్రం బ్రిటిష్ కోర్టుల ముందు! ఈ నేపథ్యంలో దాదా అబ్దుల్లా, భారతదేశంనుంచి గాంధీగారిని పిలిపించుకున్నాడు. అలా 24 ఏళ్ళ గాంధీగారు, 1893లో సౌతాఫ్రికాలోని నటాల్ రాష్ట్రంలో డర్బన్కి వెళ్ళారు.
ఈ కేసులో వాదించడానికి డర్బన్కి 380 మైళ్ళ దూరంలో ఉన్న ప్రెటోరియా (Pretoria)కి వెళ్ళాలి. దారిలో ఉన్న చార్ల్స్టౌన్ (Charlestown) వరకూ రైలు ప్రయాణం చేయవచ్చు. ఫస్ట్క్లాస్ టికెట్టు కొనుక్కుని ప్రయాణం మొదలుపెడతారు గాంధీ. పాపం, ఆయనకి తెలియని విషయమేంటంటే తెల్లవారిని తప్ప ఎవరినీ (అంటే అక్కడి స్థానికులైన నల్లవారినీ, భారతీయుల్నీ — వారు కూలీలుగా తీసుకురాబడినా, వ్యాపారరీత్యా వచ్చినా) ఫస్ట్క్లాస్లో ప్రయాణం చేయనిచ్చేవారు కాదు. ట్రెయిన్ బయలుదేరిన కాసేపటికి గాంధీగారిని గమనించిన తెల్ల ప్రయాణీకులు టికెట్ కలెక్టర్ని పిలిపించడం, ఆ TC గాంధీగారిని మూడో క్లాస్ కంపార్ట్మెంటుకి వెళ్ళమనడం, ఆయన ససేమిరా అనడం, తరువాతి స్టేషనయిన పీటర్మరిట్జ్బర్గ్ (Pietermaritzburg) లో ఆ TC గాంధీగారిని ప్లాట్ఫామ్మీదకి నెట్టేయడం జరుగుతాయి. ఇవన్నీ గాంధీ సినిమాలో రెండవ సీనులో చూస్తాం. (సినిమాలో మొదటి సీను గాంధీగారి హత్య).
ఆ పీటర్మరిట్జ్బర్గ్ స్టేషన్ ఇప్పటికీ వాడుకలో ఉండడమే కాక, గాంధీగారిని ప్లాట్ఫాం మీదకి తోసేసిన స్థలంలో ఒక జ్ఞాపిక కూడా ఉంది. గాంధీగారు ఒక రాత్రంతా గడిపిన వెయిటింగ్ రూముని ఒక మెమోరియల్గా మార్చేరు! గాంధీగారికి వర్ణవివక్షని పరిచయం చేసింది ఆ సంఘటన. అది తన జీవితంలో ఒక పెద్ద మలుపుకి కారణమని గాంధీగారు తన The Story of My Experiments with Truthలో వ్రాసుకున్నారు. ఆ పీటర్మరిట్జ్బర్గ్ స్టేషన్నీ, ప్లాట్ఫాంనీ దర్శించగలగడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది!మేమక్కడ ఉన్నప్పుడే ఒక తమిళ కుటుంబం కూడా ఆ ప్లాట్ ఫాంని చూడడానికి వచ్చారు. ఇండియానుంచి వచ్చిన ఐటి వర్కరట. సందర్శించడానికి వచ్చిన తన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చాడతను. ఆ పెద్దవాళ్ళిద్దరూ, ప్లాట్ఫారమ్మీద ఉన్న జ్ఞాపికని గుళ్ళో విగ్రహాన్ని పూజించినట్లే పూజించారు! ఆ తరంవారికి గాంధీగారంటే అంతటి భక్తి మరి!
తమాషా ఏంటంటే, ‘గాంధీగారి స్టేషన్’ ఇంకా వాడకంలో ఉన్నా, అక్కడికి వారానికి రెండు ట్రెయిన్స్ మాత్రమే వస్తాయట. అందువల్ల స్టేషన్ అంతా ఖాళీగా, ప్రశాంతంగా ఉండడంతో, చాలాసేపు అక్కడ గడపడానికి మాకు వీలు దొరికింది. ఏ రకమైన ప్రవేశ రుసుముగానీ, పార్కింగ్ ఫీ గానీ లేదు. మాకక్కడ కనబడిన ఇద్దరు సిబ్బందిలో ఒకతను చాలా స్నేహపూర్వకంగా మాకు ఎక్కడేం ఉన్నదీ చూపెట్టాడు. కొంత టిప్పిస్తే చాలా సంతోషించాడు. సౌతాఫ్రికాలో నేను గమనించిన విషయం – ఎక్కడా చేయి చాపి డబ్బులర్థించడం లేదు. మనమిస్తే తీసుకుని చాలా కృతజ్ఞత చూపెడతారు. మనమివ్వకపోయినా వాళ్ళ తీరులో తేడా ఏమీ ఉండదు.ఈ ట్రెయిన్ స్టేషన్ చూస్తే మనకి చాలా పరిచయమున్న చోటులాగా కనబడుతుంది. మనకి ఇండియాలో అలవాటున్న బ్రిటిష్వారి ట్రెయిన్ స్టేషన్ డిౙైన్వల్ల అనుకుంటాను. కొట్టొచ్చినట్టు కనబడే ఇంకో విషయం – సౌతాఫ్రికాలో గాంధీగారి మాన్యుమెంట్స్ అన్నీ 1994 తర్వాత – ANC (ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్)/నెల్సన్ మండేలా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించినవి! గాంధీగారు ప్రారంభించిన నటాల్ ఇండియన్ కాంగ్రెస్ (NIC)కి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు మొదటినుంచి సత్సంబంధాలుండేవి.
ఈ పీటర్మరిట్జ్బర్గ్, డర్బన్నుంచి ఒక 50 మైళ్ళ దూరంలో ఉన్న నగరం. కారుంటే చాలా సులువుగా సందర్శించొచ్చు.పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత బయల్దేరి పీటర్మరిట్జ్బర్గ్కి వెళ్ళి రెండుగంటలు గడిపి తిరుగు ప్రయాణంలో ౙూలూ కల్చరల్ సెంటర్లో ఆగేం. సౌతాఫ్రికాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అస్సలు బాగోలేదు. అద్దె కారు వద్దనుకుంటే, ఒక ప్రీ-పెయిడ్ టాక్సీలాంటిది తీసుకోవాలి. ఇలాంటి సర్వీసుని అక్కడ ప్రైవేట్ రిజర్వేషన్ అంటారు. మేము ఎయిర్పోర్ట్లోనే కారు అద్దెకు తీసుకోవడంవల్ల, ఆ సౌకర్యాన్ని గురించి పెద్దగా వివరాలు కనుక్కోలేదు. డర్బన్నుంచి పీటర్మరిట్జ్బర్గ్కి వెళ్ళే ట్రెయిన్స్ ఉన్నాయిగానీ, ఆ రైళ్ళు మనల్ని చేర్చే స్టేషనూ గాంధీగారి సంఘటన జరిగిన స్టేషనూ ఒకటి కాదు. వేరే స్టేషన్లో దిగి ఊబర్లాంటిది తీసుకోవాలి.
సౌతాఫ్రికాలో రోడ్ల గురించి రెండు ముక్కలు. ఇక్కడ రోడ్ల నెట్వర్క్లో మూడు కేటగిరీలున్నాయి. నేషనల్, రీజనల్, మునిసిపల్. ఇక్కడి నేషనల్ హైవేలు అమెరికన్ ఇంటర్స్టేట్ హైవే స్థాయిలోనే ఉన్నాయి. రీజనల్వి పరవాలేదు. మునిసిపల్ రోడ్లు కొంచెం మెయింటెనెన్సు బాగోక ఒకింత మురికిగా కనబడ్డాయి. అందరూ ట్రాఫిక్ రూల్సు బాగా ఫాలో అవుతున్నట్టే అనిపించింది, ఒక్క మినహాయింపుతో. పబ్లిక్ రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంవల్ల దాని స్థానంలో ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే మినీ బస్సులు, వ్యానులు కోకొల్లలుగా ఉండి, జనసామాన్యమంతా వాటి మీదే ఆధారపడుతున్నట్టు కనబడింది. సమస్యల్లా, ఈ వ్యాన్లకి నిర్దిష్టమైన (designated) స్టాప్స్ గట్రా లేకపోవడంతో వాటిని సిటీ రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆపడమే కాకుండా, 4-లేన్ హైవేల పక్కన కూడా ఆపుతూ పాసెంజర్లని ఎక్కించుకోడం, దింపడం చేస్తుంటారు. హైవేకి ఒకవైపు వ్యాన్ దిగి రెండో వైపు ఉన్న ఇంకో వ్యాన్ని అందుకోవడానికి మొత్తం ఎనిమిది లేన్లకూ అడ్డంగా పరుగులు తీసే ప్యాసింజర్లు చాలాసార్లు కనబడ్డారు మాకు. వీరిలో ఎక్కువ భాగం తమ పనులకు వెళ్ళి వస్తున్న కార్మికవర్గం అనిపించింది. సడెన్ బ్రేక్ వేయాల్సిన అవసరం వచ్చినపుడు మా గుండెలు జారడమే కాకుండా, వారు రోజూ తమ జీవనోపాధి కోసం అంతగా ప్రాణాలకి తెగించాల్సి వచ్చే పరిస్థితులు చూసి అయ్యో అనిపించింది. ఆశ్చర్యం కలిగించే విషయం… ఈ వ్యాన్లకి వాటి గమ్యం, రూటు తెలియజేసే బోర్డులు గట్రా ఉండవు! వాటి డ్రైవర్లూ రోడ్డు పక్కన వేచి ఉన్న ప్యాసింజర్లూ పూర్తిగా చేతిగుర్తుల పైనే ఆధారపడతారు!!
5. ఫీనిక్స్ సెటిల్మెంట్
తాను వచ్చిన కేసు ముగియడంతో గాంధీగారు 1894లో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ సందర్భంగా ఆయనకు ఇచ్చిన వీడ్కోలు విందులో, బ్రిటిష్ వారు ప్రవాసుల హక్కుల్ని హరించే చట్టాలు చేస్తున్నారని, వాటిని ఎదుర్కోవడానికి గాంధీగారిలాంటి లాయర్ సహాయం అవసరమనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేయగా, ఆయన తన ప్రయాణాన్ని విరమించుకున్నారు. 1894 మే నెలలో ఆయన నటాల్ ఇండియన్ కాంగ్రెస్ (NIC) ని ప్రారంభించారు.
1903లో గాంధీగారు డర్బన్కి ఉత్తరాన వంద ఎకరాల భూమిని కొనుగోలుచేసి అక్కడ ఫీనిక్స్ సెటిల్మెంట్ అనే ఆశ్రమాన్ని నిర్మించారు. సామూహిక జీవనంలో గాంధీగారు చేసిన మొదటి ప్రయోగం ఇది. ఇక్కడ ఆయన ‘సర్వోదయ’ అని నామకరణం చేసిన తన ఇల్లు, ‘ఇండియన్ ఒపీనియన్’ అనే వీక్లీని ప్రచురించిన ముద్రణాలయం (International Printing Press) కాక ఒక పాఠశాలా, ఆసుపత్రీ, ఆశ్రమవాసులు ఉండడానికి నివాసాలూ ఉండేవట. ప్రస్తుతమున్న కాంపస్ 100 ఎకరాలు లేదు. గాంధీగారి ఇల్లు కాకుండా ఒక కాన్ఫరెన్స్ హాలు, ఓ మ్యూజియంలాంటి పెద్ద హాలు మాత్రమే ఉన్నాయి.భావసారూప్యమున్న వ్యక్తులు ఒక సమాజంగా ఏర్పడి, అతి సాధారణ జీవితం గడపడానికి ఏర్పాటు చేసుకున్నది ఈ ఫీనిక్స్ సెటిల్మెంట్. దీనికి ప్రేరణ గాంధీగారు సందర్శించిన ఒక స్థానిక Trappist Monastery అట.
తర్వాత, 1910లో గాంధీగారు టాల్స్టాయ్ ఫార్మ్ అనే పేరుతో ఇలాంటి ఆశ్రమాన్నే జొహానెస్బర్గ్ దగ్గర నిర్మించినా, ఆయన సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో తన ముఖ్యనివాసం ఇక్కడేననుకుంటాను. భారత స్వాతంత్ర్యపోరాటంలో ఆయన వాడిన సత్యాగ్రహం సౌతాఫ్రికాలో తయారుచేసి సానబెట్టిన ఆయుధమే. తర్వాతి కాలంలో గాంధీగారు స్థాపించిన సాబర్మతీ ఆశ్రమం ఈ ఫీనిక్స్ సెటిల్మెంటుకి తరువాతి అధ్యాయమేనని చెప్పనక్కర్లేదు. ఆ రకంగా భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉన్న స్థలమిది.అన్నట్టు నేనిక్కడికి రాకముందు, సత్యాగ్రహమంటే నిజమైన కోపం అనుకునేవాణ్ణి. ఇక్కడి ఎగ్జిబిట్స్నిబట్టి గాంధీగారు దీన్ని ‘సత్యాన్వేషణ’ అన్న అర్థంలో వాడారని తెలిసింది.
గాంధీగారు కుటుంబంతోపాటు 1914లో ఇండియాకి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కుమారుడు మణిలాల్ 1917లో ఇక్కడికి తిరిగి వచ్చి 1957లో మరణించేవరకు Indian Opinion పత్రికకు సంపాదకులుగా కొనసాగేరు.
1985లో స్థానిక నల్లవారికీ, ప్రవాసులకీ మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో పూర్తిగా ధ్వంసమయిన ఈ సెటిల్మెంటును, 2000లో పునర్నిర్మించారు. మొదట నిర్మించిన భవనసముదాయానికీ దీనికీ ఎంతవరకు పోలిక ఉందో నాకు తెలియదు. అన్నట్టు, ఈ కట్టడానికి దక్షిణాఫ్రికా వారసత్వ సంపద హోదా (National Heritage Resources Act (NHRA)) ఉంది.ఇక్కడికి వెళ్ళడం కష్టం కాదు. ఈ సెటిల్మెంటు డర్బన్ నగర శివార్లలోనే ఉంటుంది. మేమున్న హోటల్నుంచి 15 మైళ్ళు కూడా లేదు. కాకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతం బాగా మురికిగా కనబడింది. ఇది జూలూలు అధిక సంఖ్యలో ఉండే ఇనందా పట్టణానికి, ప్రవాసులు అధిక సంఖ్యలో ఉండే ఫీనిక్స్ పట్టణానికి మధ్యలో ఉంటుంది.
ఇనందా పట్టణంలో, ఇది ఉన్న భంబయీ అనే ప్రాంతంలో జాతి వైషమ్యాలు కొంచెం ఎక్కువట. పైన చెప్పినట్టు 1985లో, 2021లో ఇక్కడ జాతి కలహాలు జరిగాయి. అయితే, మేం దారి తప్పి సందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమీ ఇబ్బందనిపించలేదు. ఇక్కడికి సందర్శకులు ఎక్కువ రారనుకుంటాను. అన్ని గేట్లూ వేసేసి ఉన్నాయి. మేం ఫోన్ చేస్తే, ఒక ఉద్యోగి వచ్చి లోపలికి తీసుకెళ్ళారు. కారు బయట పార్క్ చేశామని చెప్పగానే కంగారుగా, వద్దు లోపలికి తీసుకురమ్మని సలహా ఇచ్చేరు. నిజానికి, సౌతాఫ్రికాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. కాపలా ఉన్న పార్కింగ్ని ప్రముఖంగా ఎడ్వర్టైజ్ చేసుకుంటాయి బిజినెస్లన్నీ.
ఫీనిక్స్ సెటిల్మెంటుని ఆనుకునే కస్తూర్బా గాంధీ ప్రైమరీ స్కూలు కనబడింది. ఈ స్కూలున్న ప్రదేశం సెటిల్మెంట్లో భాగమేమో అన్న సందేహం కలిగింది. ఐతే, ఈ స్కూలు మాత్రం 2015లో స్థాపించబడింది. అలాగే, ఫీనిక్స్ పట్టణంలో మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఒకటి ఉంది. దానికీ సెటిల్మెంటుకీ కచ్చితంగా సంబంధం లేదు.
6. హరివిల్లు దేశం (The Rainbow Nation)
1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడుగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అపార్టైట్ యుగం ముగిసింది. ముందు కాలంలో సమాజంలోని విభిన్న జాతులు, వర్ణాలు సమైక్యం కావాలన్న ఆకాంక్షతో డెస్మండ్ టూటూ సౌతాఫ్రికాని హరివిల్లు దేశం (Rainbow Nation) అని అభివర్ణించారట. సమైక్యం కావాలన్న ఆకాంక్ష గత ముప్పయ్యేళ్ళలో (చాలా స్వల్పవ్యవధి!) ఎంతవరకూ నెరవేరిందో అంచనా వేయడం నాలాంటి టూరిస్టులకి సాధ్యం కాదు. అయితే హరివిల్లులో రంగులకంటే సౌతాఫ్రికాలో జాతులూ తెగలూ ఎక్కువన్నది మాత్రం స్పష్టం!
ఉత్తర అమెరికాలో పలు స్వదేశీ తెగలు ఉన్నట్టే ఇక్కడ కనీసం అర డజను పెద్ద తెగలు ఉన్నాయి. వీటిలో ౙూలూ (Zulu), ఖోసా (Xhosa), సాంగ (Tsonga), వెండ (Venda), స్వానా (Tswana), అండబీలీ (Ndebele) లాంటివి ముఖ్యమైనవి. వీరిలో, ఎవరి భాష వారిదే! సౌతాఫ్రికాలో 12 ఆధికారిక భాషలు ఉన్నాయట. అయితే మా లోకల్ టూర్ గైడ్ చెప్పినదాని ప్రకారం స్థానికులకి (నల్లవారికి) ఇంగ్లీష్, ఆఫ్రికాన్స్ భాషలతోపాటు, ఒకటో రెండో తెగల భాషలు కూడా వస్తాయట. నిజానికి ఈ తెగలని చిన్న దేశాలుగా వర్ణించడం కరక్టేమో! ఉదాహరణకి, ఒకప్పుడు నటాల్గా పేరున్న క్వౙూలూ-నటాల్ రాష్ట్రం ౙూలూ లది. ౙూలూ తెగ పరాక్రమానికి పెట్టింది పేరు. డచ్, బ్రిటిష్ కాలనిస్టులతో జరిగిన పెక్కు త్రిముఖ పోరాటాల్లో బాగా దెబ్బతిన్న తెగ ఇది. ఒకప్పటి ప్రెసిడెంట్, జేకబ్ ౙూమా ౙూలూ నే!
మండేలా ఖోసా తెగ మనిషి. ఖోసా వారి భాష మహా విచిత్రంగా ఉంటుంది. ఇందులో రకరకాల క్లిక్కింగ్ సౌండ్స్ (clicking sounds) ఉండి, వాళ్ళు మాట్లాడుతుంటే ఒక బీట్బాక్సింగ్ కచేరీ వింటున్నట్లు ఉంటుంది. ఖోసా భాషలో ఉండే క్లిక్కింగ్ సౌండ్స్ వినడానికి ఈ యూట్యూబ్ వీడియోలు (1, 2) చూడండి. జోరుగా సాగే వీళ్ళ సంభాషణలు వింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి గొంతుల్లోంచి మల్టీట్రాక్ ఆడియో వస్తున్నట్టుంటుంది.
ముందే చెప్పినట్లు, ౙూలూలు క్వౙూలూ-నటాల్ రాష్ట్రంలో ఎక్కువ ఉంటారు. డర్బన్కి, పీటర్మరిట్జ్బర్గ్కి మధ్యలో ‘Valley of a Thousand Hills’ అనే ప్రాంతంలో ఇప్పటికీ వీళ్ళ సాంప్రదాయక గ్రామాలున్నాయి. వీళ్ళ ఆచార వ్యవహారాలు ప్రదర్శించే సాంస్కృతిక కేంద్రం ఒకటి బాగుంటుంది. అక్కడ వారి సంప్రదాయాల్ని తెలియజెప్పే ఒక ప్రదర్శనతోపాటు, వారి ఇళ్ళు కూడా చూపెట్టారు. ఈ సాంస్కృతిక కేంద్రంనుంచి దూరంగా వాళ్ళ గ్రామాలు కనబడుతుంటాయి.(మహాపట్టణం డర్బన్నుంచి ఒక పాతిక మైళ్ళ దూరంలో ఉండడంతో, అంత ప్రయాణాన్ని గిట్టుబాటు చేయడానికనుకుంటాను, ఒక చిన్న సఫారీ టూర్, ఒక మొసళ్ళ పార్క్ కూడా ఉన్నాయి ఈ కల్చరల్ సెంటర్తో కలిపి. అప్పుడే క్రూగర్ నేషనల్ పార్క్ చూసొచ్చామేమో, మేము వాటి జోలికి వెళ్ళలేదు).
ౙూలూ సంప్రదాయం ప్రకారం, పశు సంపద ఎక్కువ ఉన్న మగవాళ్ళు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చట! ప్రతి నాలుగు ఆవుల సంపదకీ ఒక భార్యని తెచ్చుకోవచ్చని చెపుతూ, కాకపోతే అంతేమంది అత్తగార్లు కూడా ఉంటారని హెచ్చరించి గెస్ట్లని నవ్వించింది మా హోస్టు. జేకబ్ ౙూమాగారి బహుభార్యాత్వం గురించి అంతర్జాతీయ వార్తల్లో చూసినట్లు గుర్తొచ్చింది నాకు.
కల్చరల్ షో పూర్తయింతర్వాత, అక్కడి కేఫ్టీరియాలో పదహారణాల ౙూలూ భోజనం కూడా చవి చూశాం. మన అన్నం స్థానంలో, మొక్కజొన్న రవ్వతో చేసిన ఉప్మాలాంటిది వాడతారు వీరు. పాప్ (pap) అంటారు దీన్ని. మాంసపు సాసేజీలతో బాటు, టొమేటోలు, ఉల్లిపాయలు, బీన్సూ ఇతరత్రా కూరగాయలతో చేసే చకలక (Chakalaka) అనే ఒక వంటకం కూడా బాగుంది. భోజనానంతరం అక్కడి సూవనీర్ షాపులో చాలాసేపు షాపింగ్ చేశాం. పూసలతోనూ, రంగురాళ్ళతోనూ చేసిన నెక్లేసులూ, చెవి దిద్దులూ, మంచి చెక్కబొమ్మలూ, ౙూలూ యోధుల లోహపు విగ్రహాలు లాంటి సూవెనీర్లు దొరికినై ఈ కల్చరల్ సెంటర్లో.7. Kruger and the Big Five
నేను ముందుగా చెప్పినట్టుగా, మేము జొహానెస్బర్గ్తో ప్రయాణం మొదలుపెట్టినా, నిజానికి నా ఇంటరెస్ట్ జోబర్గ్కంటే సఫారీ మీదా, సఫారీకంటే డర్బన్ మీదానూ !
సఫారీల్లో ప్రపంచంలో మొదటి స్థానం ఈస్ట్ ఆఫ్రికాదే. ముఖ్యంగా టాన్ౙానియా (సెరెంగెటీ), కెన్యా (ఆంబోౙెలీ) ప్రసిద్ధి కెక్కినవి. అయితే సౌతాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ వీటికి తీసిపోదు. వైశాల్యంలో ఇది దాదాపూ అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రమంత ఉంటుంది. యెల్లో స్టోన్ నేషనల్ పార్క్కి మూడింతలుంటుంది. ముఖ్యంగా దీన్లో సౌకర్యాలు బాగుంటాయని పేరు. జోబర్గ్కి 250 మైళ్ళ దూరం. అమెరికాలో అయితే దీన్ని ఈౙీ డ్రైవ్గా పరిగణిస్తాం. కానీ ఇక్కడ మాత్రం రోడ్లు బాగోవనో, రోడ్సైడ్ అసిస్టెన్స్ బాగోదనో లేక సెక్యూరిటీ దృష్ట్యానోగానీ, విమానప్రయాణాన్నే సూచించారు, ఆన్లైన్ ఫోరాల్లో. జోబర్గ్లో రెండ్రోజులు గడిపిన తర్వాత ఉదయాన్నే బయల్దేరి క్రూగర్ పార్క్ మధ్యలో ఉండే స్కుకుౙా (Skukuza) ఎయిర్పోర్టుకి ప్రయాణించేం.
ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించిన క్రూగర్ పార్కులో స్కుకుౙా అనే జనావాసం పార్కు దిగువ భాగంలో ఉంటుంది. క్రూగర్ పార్క్ అడ్మినిస్ట్రేషన్కు ఇది హెడ్క్వార్టర్స్. పార్కులోని అతి పెద్ద రెస్ట్ కాంపు ఇక్కడే ఉంది. ఈ టౌన్లో ఒక మంచి గోల్ఫ్ కోర్స్ ఉండడమే కాకుండా దీన్నొక విశిష్టమైన కాన్ఫరెన్స్ సైటుగా కూడా డెవలప్ చేశారు. ఈ కారణాలవల్లనే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ స్కుకుౙా ఎయిర్పోర్టు చాలా ముద్దొచ్చేంత బుల్లిది. ఎయిర్పోర్టులో ఒక మెయిన్ హాలుంటే, ఆ హాలు మధ్యలో సీటింగ్ ఏరియా, సీటింగ్ ఏరియా చుట్టూ అన్ని రకాల సర్వీసులూ ఉంటాయి. ఈ హాలుకి మూడు ద్వారాలున్నాయి. ఒకటి ఎంట్రన్స్. మిగతా రెండూ – ఒకటి ‘అరైవల్స్’కు, ఒకటి ‘డిపార్చర్స్’కు. ఇక బాగేజీ క్లెయిమ్ ఏరియా హాలు బయట ఒక చిన్న అరుగులాగా ఉంది. కారు రెంటల్సూ, బార్, కెఫే… అన్నీ ఉన్నాయి ఈ చిన్ని ఎయిర్పోర్టులో!ముందే రిౙర్వ్ చేసుకున్న కారు తీసుకుని స్కుకూౙా రెస్ట్ కాంప్ కెళ్ళాం.
క్రూగర్ నేషనల్ పార్కులో ఇరవైకి పైగా రెస్ట్కాంపులనబడే గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ పార్కుకొచ్చిన సందర్శకుల కోసం వసతి గృహాలు, షాపులు, రెస్టారెంట్లు వగైరా సదుపాయాలుంటాయి. ఇక్కణ్ణుంచి రకరకాల సఫారీ టూర్లు కూడా ఉంటాయి. దూరంనుంచి వచ్చే యాత్రికులకి ఈ వసతి గృహాలు అత్యవసరం! అందువల్ల, ఈ వసతి గృహాలు చాలా ముందుగా (కొన్ని నెలల ముందే) బుక్ అయిపోతాయి. నేను రెండు నెలల ముందు ప్రయత్నిస్తేనే ఒకే చోట (స్కుకూౙా రెస్ట్ కాంపులో) మూడు రోజుల వసతి దొరక్క రెండో రోజు ఇంకో కాంపులో (ప్రెటొరియస్కోప్) ఉండాల్సి వచ్చింది!
ఎయిర్పోర్టునుంచి స్కుకూౙా రెస్ట్ కాంప్ చేరి అక్కడ చెకిన్ పేపర్వర్క్ ముగించి లంచ్ టైమ్ అవ్వడంతో కేఫ్టీరియాకు వెళ్ళాం. అది చాలా సీనిక్ లొకేషన్లో ఉన్నది. ఒక నది ఒడ్డున చెట్ల మధ్యలో ఒదిగి, అక్కడి ఔట్డోర్ డైనింగ్ ఏరియా ఓ vista point లాగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. రెస్టారెంట్ మెన్యూ గొప్పగా లేదు. ఫుడ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. అయితే ఇలాంటి పార్కుల్లో అంతకు మించి ఆశించడం సబబు కాదు! మేము లంచ్ ఆర్డరిచ్చి వెయిట్ చేస్తూ చుట్టూ పరిశీలిస్తే, నదిలో ఒడ్డుకు దగ్గర్లో తచ్చాడుతున్న మొసళ్ళూ, నది ఒడ్డున మేస్తున్న ఏనుగుల సమూహం! ఏ క్షణాన్నైనా గజేంద్రమోక్షం సీను ప్రత్యక్షం కావచ్చనిపించింది. అయితే ఆ నదీ, మొసళ్ళూ మాకు కొత్తగానీ ఆ ఏనుగులకి కాదనుకుంటాను. ప్రమాదమేమీ జరక్కుండానే మా లంచ్ ముగిసింది.క్రూగర్లో (ఆ మాటకొస్తే ఏ సఫారీ లోనైనా) వన్యప్రాణుల్లో ‘బిగ్ ఫైవ్’ ని చూడడమే గొప్పగా భావిస్తారు. ఈ బిగ్ ఫైవ్ అనేది హంటింగ్ పరిభాష! తమకది పెద్దగా నచ్చదని రేంజర్స్ చెప్పారు. ఇంతకీ సైౙుల వారీగా, ఆ ఐదు జంతువులూ ఇవి:
1. ఏనుగు
2. అడవి దున్న
3. రైనో
4. సింహం
5. చిరుత
ఈ ఐదింటినీ చూడగలిగితే, సఫారీ కొచ్చినవారికి సంబరమన్నమాట. మన భారతదేశపు ఏనుగులతో పోలిస్తే ఆఫ్రికన్ ఏనుగులకి చెవులు పెద్దగా ఉంటాయి. అన్నట్టు, ఈ ఐదు జంతువుల్లో అడవిదున్న అత్యంత ప్రమాదకరమైందట! ఎందుకంటే, మిగతావన్నీ మనల్ని ముందు హెచ్చరించి దాడి చేస్తాయట — అడవిదున్న తప్ప! వీటి కొమ్ములు చాలా భయపెట్టగలవు. వీటిని వేటాడ్డానికి ప్రత్యేకమైన తుపాకులు వాడతారట — వీటి కొమ్ముల్ని మామూలు బుల్లెట్లు ఛేదించలేవు కాబట్టి. నిజానికి, మేము క్రూగర్కు వెళ్ళడానికి కొద్ది రోజుల ముందే టెక్సస్ రాష్ట్రపు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ ఒకతను వీటిని చూడ్డానికి ఓ ప్రైవేట్ వాకింగ్ టూర్కి వెళ్ళి ఓ అడవిదున్న చేసిన దాడిలో హతమయ్యాడట! అయితే అది క్రూగర్లో కాదు, వేరే సౌతాఫ్రికన్ సఫారీలో.
ఇక ఈ జంతువుల్ని చూడ్డానికి మనం కారులో స్వేచ్ఛగా పార్కంతా తిరగవచ్చు. ఈ పార్కులో మూడు రకాల రోడ్లున్నాయి. పెద్ద రోడ్లు దాదాపూ హైవే తీరులో గంటకు 60 కి.మీ. స్పీడు లిమిట్తో బాగుంటాయి. వీటిని దూరం వెళ్ళడానికి (ఒక కాంపునుంచి ఇంకో కాంపుకెళ్ళడానికి) వాడతారు. మిగతా రెండు రకాలు మట్టి రోడ్లు. మూడవరకంవి చాలా ఇరుగ్గా ఉంటాయి. విచిత్రంగా, విజిటర్స్కి చెప్పే జాగ్రత్తల్లో పార్కు మధ్యలో వాహనం దిగవద్దని ఎక్కడా చెప్పిన గుర్తు లేదు! మా ఇంగితజ్ఞానం వాడి ఎక్కడా కారు దిగకుండానే తిరిగేం. ఒక్కసారి మాత్రం, ట్రంకులో ఉన్న వస్తువేదో కావాలని కారాపమని జగదీష్ దిగి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకో 50 మీటర్ల దూరం ముందుకెళ్ళిన తర్వాత రివర్ బెడ్ మీద మాకొక సింహాల గుంపు కనబడి ఒళ్ళు చల్లబడింది!
ఇక పార్కు రేంజర్లు వారి ట్రక్కుల్లో తీసుకువెళ్ళి పార్కు గురించి, జంతుజాలం గురించి వివరించే టూర్లు తప్పనిసరిగా తీసుకోదగ్గవి. నిజానికి వాళ్ళు చూపెట్టే జంతువుల్ని మనం కారులో తిరుగుతూ కూడా చూస్తాం. కానీ వాళ్ళు చెప్పే వివరాలు బాగుంటాయి. పైగా జంతువుల్ని రాత్రి పూటో, సూర్యోదయానికి ముందో, కాలి నడకనో చూడాలంటే, ముఖ్యంగా నిశాచర జంతువుల్ని చూడాలంటే ఈ టూర్లు తప్పనిసరి. వీటిల్లో ముఖ్యంగా నాలుగు రకాల టూర్లున్నాయి.• సన్రైజ్ డ్రైవ్ (ఉదయం 5-8)
• మార్నింగ్ వాక్ (ఉదయం 5-9)
• సన్సెట్ డ్రైవ్ (సాయంత్రం 5-8)
• నైట్ డ్రైవ్ (రాత్రి 8-10)
మేము సన్సెట్ డ్రైవ్ తప్ప మిగతా వాటన్నిటినీ, వేర్వేరు రోజుల్లో తీసుకున్నాం. సన్రైజ్ డ్రైవ్, మార్నింగ్ వాక్ చాలా బాగున్నాయి. చీకట్లో తీసుకెళ్ళే టూర్లలో వాడే ట్రక్కులకి శక్తివంతమైన ఫ్లాష్ లైట్స్ అమర్చి ఉంటాయి. దానికి తోడు, ట్రక్కుకి రెండు పక్కలా కిటికీల పక్కన కూర్చున్న నలుగురికి ఫ్లాష్ లైట్లు ఇచ్చి, వాటితో పరిసరాలని పరికిస్తూ పెద్ద జంతువులు కనబడితే చెప్పమంటారు. ఫ్లాష్ లైట్ల వెలుతురు పడి పొదల మధ్యలో చీకట్లో ఉన్న ఆ జంతువుల రెటినాలు చిన్ని చిన్ని అద్దాల్లాగా మెరుస్తాయి. వాటి ఉనికిని గుర్తించడానికి ఆ చిన్ని చిట్కా భలే పనిచేస్తుంది. ఈ ప్రక్రియ అంతా చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. ఈ ట్రక్కులు అక్కడి జంతువుల నిద్ర చెడగొట్టి, వాటిని బెదరగొడతాయనిపించింది. ఐతే ఆ జంతువులకి ఈ కార్లూ ట్రక్కుల ఆకారాలు, అవి చేసే శబ్దాలు, ప్రసరించే కాంతులు బాగా పరిచితమయినవనీ, అవి ఇబ్బంది పడవనీ రేంజర్లు చెప్పారు! సూర్యోదయానికి ముందు తారు రోడ్డుమీద పడుకుని (చలికాలంలో తారు రోడ్లు వెచ్చగా ఉంటాయట) ట్రక్కు పక్కనుంచి వెళుతున్నా కదలని హయీనాలని చూసిన తర్వాత, రేంజర్లు చెప్పింది నిజమేననిపించింది!
మార్నింగ్ వాక్లో తుపాకులు పట్టుకున్న ఇద్దరు రేంజర్స్ మమ్మల్ని కొంచెం సురక్షిత ప్రాంతానికి ట్రక్కులో తీసుకెళ్ళి, అక్కడినుంచి కాలినడకన తీసుకెళ్ళారు. మేము ఒక ఏనుగుల సమూహానికి దగ్గరగా వెళ్ళగలిగేం గానీ, ఆ గుంపులోని గున్న ఏనుగు మమ్మల్ని గమనించి వాళ్ళ అమ్మకి చెప్పడంతో మొత్తం గుంపంతా పారిపోయింది. ఆ వాక్లోనే, ఈ ఏనుగులు పార్కుకి చేసే హాని గురించి తెలుసుకున్నాం. అవి చిన్న చిన్న చెట్ల కొమ్మల్ని ఇష్టానుసారం విరిచి నాశనం చేయడమే కాకుండా పెద్ద చెట్ల బెరడుని తినేసి అవి బతక్కుండా చేస్తాయట. ఆ చెట్ల బెరడులో ఉండే న్యూట్రిషనేదో వాటికి అవసరమట. క్రూగర్లో దాదాపు 30 వేల ఏనుగులు ఉన్నాయట. పార్కు భరించగలిగిన దానికంటే ఈ సంఖ్య చాలా ఎక్కువట! ఒకప్పుడైతే ఏరివేత (culling) చేసేవారటగానీ, 1994 తర్వాత వేరే పద్ధతులని అవలంబిస్తున్నారట.
సింహాన్ని మృగరాజు అని ఎందుకంటారో ఈ సఫారీ తర్వాత అర్థమయింది. ఓ సింహమో, సింహాల గుంపో ఓ పెద్ద జంతువు దేన్నైనా – అదృష్టం బాగోని ఏ జిరాఫ్నో, జీబ్రానో, కుడూ (Kudu)నో — వేటాడిందంటే ఆ ప్రదేశమంతా చాలా కోలాహలంగా తయారవుతుంది. వేటాడబడిన జంతువు తాలూకూ గుంపంతా అక్కడ్నుంచి పారిపోవడం మొదట జరిగేది. వెంటనే ఆ పరిసరాలపై పక్షుల గుంపొకటి తయారవుతుంది. ఆ వెంబడి హయీనాలు, మిగతా పరాన్నభుక్కులన్నీ మిగులూ తగులూ కోసం అక్కడికి చేరతాయి. కొద్ది గంటల్లో అక్కడ కొన్ని ఎముకలు తప్ప ఏమీ మిగలవు! ఇక సఫారీకొచ్చిన సందర్శకులకైతే, ఒక సింహం వేటాడిందన్న విషయం రేడియో ద్వారా క్షణాల్లో ఒకరినుంచి మరొకరికి చేరుతూ రేంజర్లందరికీ తెలిసిపోతుంది. దాంతో సమీపంలో ఉన్న ట్రక్కులన్నీ ఆ దిశగా శరవేగంతో దూసుకెళ్తాయి. అలా దూసుకెళుతున్న ట్రక్కుల్ని చూడగానే కార్లలో తిరుగుతున్న వారికి కూడా జరిగిన సంగతి అర్థమై, వాళ్ళు కూడా ట్రక్కులను అనుసరిస్తారు. వెరసి ఏది? దేన్ని? ఎక్కడ? ఎప్పుడు? అనే ప్రశ్నలతో నిముషాల్లో ఆ ప్రదేశమంతా చాలా ఉత్కంఠభరితంగా తయారవుతుంది. అక్కడేదో జరుగుతుంది/జరిగింది అని తప్పితే, బైనాక్యులర్స్ను ఎటు పక్కకు సారించాలి, దేనికోసం చూడాలి అన్న విషయం కొద్దిసేపటిగ్గానీ అర్థం కాదు అక్కడకు చేరిన వారికి!
మేమున్న మూడురోజుల్లో, చాలా జంతువుల్నే చూడగలిగేం. పార్కులో ఏనుగులూ, జిరాఫ్లూ, జీబ్రాలూ, హయీనాలూ, హిప్పోలూ, చాలా రకాల దుప్పులూ కోకొల్లలుగా కనబడి కనువిందు చేశాయి. అయితే మేము ‘బిగ్ ఫైవ్’ మీద పెద్దగా ఫోకస్ చెయ్యకపోవడంవల్ల, రైనోల్నీ చిరుతల్నీ చూడలేకపోయాం. అదీ కాకుండా, కొన్ని జంతువులు పార్కులో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువుంటాయట. రైనోలు ఉత్తర భాగంలో ఎక్కువట. మేము దక్షిణాన ఉన్న స్కుకూజా ప్రాంతంలోనే మూడురోజులూ ఉండడంవల్ల ఉత్తరాదిని కవర్ చేయలేకపోయేం. నేను సౌతాఫ్రికాలో డ్రైవ్ చేయగలనా లేదా అనే సందేహంవల్ల ఒకచోటే ఉండి పార్క్ వారి టూర్లు తీసుకుందామనుకున్నాను. సౌతాఫ్రికాలో ఇతర చోట్ల డ్రైవ్ చెయ్యడం సంగతెలా ఉన్నా, సఫారీ పార్కుల్లో డ్రైవ్ చేయడం చాలా సులువు. కార్లను అద్దెకు తీసుకోవడం కూడా సులువే. మార్నింగ్ వాక్లో కలిసిన ఒక ఇటాలియన్ జంట తాము స్కుకూౙా ఎయిర్పోర్టులో కారు తీసుకుని, మొదట ఉత్తరాన ఉన్న ఓ రెస్ట్ కాంపుకు వెళ్ళి ఆ తర్వాత స్కుకూౙాకి వచ్చామని చెప్పారు. మేము కూడా వారిలా చేసి ఉండవచ్చు కదా అనిపించింది. క్రూగర్లో మేము తీసుకున్న నివాసాలు బాగున్నాయి. కొంచెం పాతబడినట్లున్నా, హీటింగ్/ఏసీ, ఫ్రిజ్లాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ప్రతీ బంగళాకి పక్కనే పార్కింగ్ స్పేస్, ఎదుట బార్బెక్యూ గ్రిల్లూ ఉన్నాయి. సౌతాఫ్రికన్స్కి బార్బెక్యూ చాలా ఇష్టమట. ఇక్కడ బార్బెక్యూని “బ్రాయ్” (Braai) అంటారు. బ్రాయ్ కేంద్రబిందువుగా జరిగే సంబరాలు ఇక్కడి సంస్కృతిలో పెద్ద భాగమట. సౌతాఫ్రికాలో అన్ని కిరాణా దుకాణాలలోనూ ముందే కోసి, మసాలాలు పట్టించి బ్రాయ్కి సిద్ధం చేసిన మాంసం విరివిగా దొరుకుతుంది. అలానే బ్రాయ్కి కావలసిన బొగ్గులు, కర్ర పేళ్ళు, రాజెయ్యడానికి అవసరమైన ఇంధనంవంటి మిగతా సరంజామా అంతటినీ కలిపి చక్కటి చెక్కపెట్టెల్లో పాక్ చేసి అమ్ముతారు. ఒక చిన్న గ్రిల్ ఉంటే చాలు, నిముషాల్లో బ్రాయ్ మొదలుపెట్టొచ్చు. “When in Rome…” అంటూ మేము కూడా ఒక రాత్రి బ్రాయ్కి పూనుకున్నాం. కావల్సిన ప్లేట్లూ, కత్తులూ, ఫోర్కులూ వగైరా అన్నీ బంగళాలో ఉండడంతో మా పని తేలికయ్యింది. బొగ్గుతో నింపిన ఆ పెద్ద చెక్కపెట్టె మా గ్రిల్లులో ఎలా ఇముడుతుందో మాకు అర్థం కాక కొంత సమయం తీసుకున్నా, మంచి డిన్నర్ తయారుచేసుకుని బ్రాయ్ కల్చర్ని ఎంజాయ్ చేశాం. మేము బ్రాయ్ కోసం షాపింగ్ చేస్తూ గమనించిందేంటంటే, రెస్ట్ కాంపులోని మాంసం దుకాణంలో మేం క్రూగర్లో చూడ్డానికొచ్చిన కొన్ని జంతువుల (ఇంపాలాలు, కుడూలు, దున్నలూ వగైరా) మాంసం కూడా అమ్మకానికి ఉన్నది! జంతు జనాభా నియంత్రణ, ఇతరత్రా కారణాలవల్ల పార్కువారే చేపట్టే ఏరివేత ప్రక్రియలో ఇది భాగమని అర్థమయింది! (పైన చెప్పినట్టు ప్రస్తుతం ఏనుగులని ఇలా చేయట్లేదు).8. అపార్టైట్ (Apartheid)
గత వందేళ్ళ ప్రపంచ చరిత్రలో ఈ అపార్టైట్ – తీవ్రస్థాయి జాతి వివక్షమీది అధ్యాయం – మానవ సమాజం చదివి సిగ్గుపడాల్సినది. జొహానెస్బర్గ్లోని అపార్టైట్ మ్యూజియం గురించి చెప్పేముందు సౌతాఫ్రికాలో వలసవాదం, అది అపార్టైట్కు దారి తీసిన క్రమం టూకీగా చెప్పుకోవడం బాగుంటుంది.
17వ శతాబ్దంలో డచ్చి ఈస్టిండియా కంపెనీ వారు ఇండోనీషియాలో వలస ఏర్పాటు చేసుకొని, కలంకారీవంటి వస్త్రాల కోసం ఇండియాలో వ్యాపారస్థావరాలు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఇండియాలో వీరి మొదటి స్థావరం మన మచిలీపట్నంలోనే! తర్వాత మద్రాస్, బెంగాల్, కేరళల్లో కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికి సూయజ్ కాలువ లేకపోవడంవల్ల ఇండోనీషియానుంచి హాలెండుకు ఓడలలో వెళ్ళడానికి దాదాపు ఆరు నెలలు పట్టేది. అంత దీర్ఘప్రయాణంలో తాజా ఆహారం లేకపోవడంతో నావికులు జబ్బుల బారిన పడేవారు. అందుకని 1652 లో డచ్చివారు సరిగ్గా మార్గమధ్యంలో, సౌతాఫ్రికా దక్షిణ కొసనున్న ‘కేప్టౌన్’లో ఒక స్థావరం ఏర్పాటుచేసుకున్నారు. అక్కడ వ్యవసాయం, పశువుల పెంపకం కోసం కొంతమంది డచ్చి రైతుల్నీ, జర్మన్ సైనికుల్నీ నియమించారు. వీరు తర్వాతికాలంలో అక్కడే స్థిరపడి బోర్స్ (Boers; ఆఫ్రికాన్స్ భాషలో రైతులని అర్థం) అనీ, ఆఫ్రికానర్స్ అనీ పిలవబడ్డారు. మొదట వచ్చిన వారిలో స్త్రీలు చాలా తక్కువమంది. అందువల్ల 1650-1810 మధ్య కాలంలో డచ్చి వారు వందలమంది స్త్రీలని, చిన్నపిల్లల్నీ కూడా ఇండియా తదితర ప్రదేశాలనుంచి తీసుకువచ్చి ఇక్కడ బానిసలుగా వాడేరు. తద్వారా, ఈ ఆఫ్రికానర్ జనాభాలో ఈనాటికీ దాదాపు రెండు శాతం ఇండియన్ DNA ఉంటుందట! అన్నట్లు, ఆఫ్రికానర్స్ మాట్లాడే భాష – ఆఫ్రికాన్స్ – ఒక కలగూరగంప భాష. ఇందులో డచ్చి పాలు ఎక్కువున్నా, జర్మన్, మలయ్తోపాటూ ఆఫ్రికన్ భాషల మాటలూ ఉంటాయట.
ఇక 1806 నాటికి బ్రిటిష్ వారు రంగంలోకి దిగి, కేప్టౌన్లో ఈ ఆఫ్రికానర్స్ని ఓడించి వెళ్ళగొట్టారు. తర్వాత బ్రిటిష్ వారు నటాల్లో కూడా స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. కేప్టౌన్లో ఓడిన ఆఫ్రికానర్స్ ఉత్తరానికి తరలిపోయి ప్రస్తుతపు జొహానెస్బర్గ్లాంటి చోట్ల ఒక రెండు రాష్ట్రాలు/దేశాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, 1880ల్లో అక్కడ బంగారు, వజ్రాల నిక్షేపాలున్నట్టు కనిపెట్టారు. దాంతో బ్రిటిష్వారు అక్కడికి కూడా వచ్చి రెండవ బోరు యుద్ధంలో (1899-1902) వారిని ఓడించారు. ఈ యుద్ధకాలంలోనే, గాంధీగారు 1100మంది ప్రవాసులతో ఒక వాలంటీర్ అంబులెన్స్ సర్వీస్ నడిపి బ్రిటిష్ వారికి సహాయపడ్డారు. ఈ సహాయం చేయడంవల్ల, బ్రిటిష్వారు అక్కడ ఉన్న ఇండియన్స్కి స్థానిక నల్లవారికంటే కొంత ఎక్కువ ఆదరణ చూపిస్తారని ఆశ పడ్డారు. ఆయన ఆశల్ని వమ్ము చేస్తూ, పరమ శత్రువులైన ఆఫ్రికానర్సూ, బ్రిటిష్వారూ 1910కల్లా జాతి ప్రాతిపదిక మీద ఏకమై, జాతీయస్థాయిలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నల్లవారిని, ప్రవాసుల్నీ కూడా జాతి ఆధారిత వేర్పాటు విధానాలతో ఒకే తీరున అణచివేయడం మొదలుపెట్టారు.
అయితే ఈ బ్రిటిష్-ఆఫ్రికానర్ సంకీర్ణ ప్రభుత్వ పాలన ఎక్కువమంది ఆఫ్రికానర్లకు నచ్చలేదు. శ్వేతేతరుల మీద బ్రిటిష్ వారు మరీ మెతక ధోరణితో వ్యవహరిస్తున్నారని వారి అభియోగం! వారు ‘సౌతాఫ్రికా ఫస్ట్’ అనే నినాదంతో విడిగా పోటీ చేసి 1948 ఎలక్షన్లలో గెలిచారు. అప్పట్లో శ్వేతేతరులకి ఓటు హక్కు లేదు. అప్పుడు ఏర్పడిన ఆఫ్రికానర్ల ప్రభుత్వం శ్వేతేతరుల హక్కుల్ని పూర్తిగా తుడిచి పెడుతూ కొత్త రాజ్యాంగం వ్రాసింది. జాతి వివక్షని తీవ్రస్థాయికి తీసుకువెళ్ళిన ఈ ప్రభుత్వ విధానాలు అపార్టైట్ పేరుతో అపఖ్యాతి పొందినవి. ఈ అపార్టైట్ అనే పదానికి ఆఫ్రికాన్స్ భాషలో ‘విడిగా ఉండడం’ అని అర్థం. వివిధ జాతుల్ని విడివిడిగా ఉంచడం వీరి ప్రధానధ్యేయం. అలా చేయకపోతే శ్వేతజాతి మనుగడకే ముప్పు అని వీరి వాదన.
అపార్టైట్కి పునాది జాతి వర్గీకరణ. వీరు జాతులన్నిటినీ నాలుగు వర్గాలుగా విభజించారు:
1. తెల్ల వారు (ఆఫ్రికానర్లూ, బ్రిటిష్వారూ)
2. నల్ల వారు (ౙూలూ, ఖోసా వగైరా తెగలవారు)
3. ఇండియన్స్
4. కలర్డ్ (అన్నిరకాల మిశ్రమజాతి వారు)
ఈ నాలుగు వర్గాలు నివాసం, ఉద్యోగం, వివాహంలాంటి విషయాలన్నిటిలోనూ విడివిడిగా ఉండాలన్నది అపార్టైట్ ప్రధాన సూత్రం. ఇది ఎంత దారుణమైన విధానమంటే, తల్లీ, తండ్రీ వేర్వేరు జాతుల వారైతే, వారూ వారి పిల్లలు ఒకే ఇంట్లో ఉండడం చట్టబద్ధం కాదు. (ఈ విషయం ఆధారంగా తీసిన ‘స్కిన్’ – అనే 2008 నాటి సినిమా, చూడదగ్గది). ముందు అధ్యాయాల్లో చెప్పినట్లు, 1960లో డర్బన్ ప్రాంతపు ప్రవాసులందరూ చాట్స్వర్త్కి తరలించబడడం కూడా ఈ అపార్టైట్లో భాగమే!
ఈ అపార్టైట్ చట్టాలని సృష్టించడానికి, అమెరికన్ దక్షిణాది రాష్ట్రాల వారు వాడిన జిమ్ క్రో (Jim Crow) చట్టాల్ని వీరు అధ్యయనం చేసి, వాటిని మరింత పకడ్బందీగా తయారు చేశారట. ఈ అపార్టైట్ ముందు జిమ్ క్రో చట్టాలు దిగదుడుపే! ఉదాహరణకి, జిమ్ క్రో చట్టాల్ని అధిక సంఖ్యాకులైన తెల్లవారు అల్పసంఖ్యాకులైన నల్లవారిని అణగదొక్కడానికి వాడారు. జిమ్ క్రో చేసిన చట్టాలనుంచి నల్లవారు కనీసం ఉత్తరాది రాష్ట్రాలకి పారిపోయే వెసులుబాటు ఉండేది. అపార్టైట్లో తెల్లవారు అల్పసంఖ్యాకులు! జనాభాలో ఇరవై శాతంకంటే తక్కువ ఉన్నవారు, ఎనభై శాతం ఉన్న శ్వేతేతరులను అణగదొక్కారు! ఎంత తీవ్రంగానంటే, దేశంలోని ఎనభై ఏడు శాతం (87%) భూమి తెల్లవారి చేతిలో ఉండేది. పైపెచ్చు, నల్లవారిని బంటుస్తాన్లనే చిన్న చిన్న ‘స్వతంత్ర దేశాల’లోకి పంపి, వారిని అసలు సౌతాఫ్రికన్ పౌరులే కాదు పొమ్మన్నారు! అమెరికాలో నేటివ్ అమెరికన్స్ని వారి వారి రిజర్వేషన్లలోకి పంపి, వారు అమెరికన్ పౌరులు కాదంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు!
మండేలా నేతృత్వంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఈ అపార్టైట్ ప్రభుత్వంతో దీర్ఘకాలం పోరాడి గెలిచింది. సార్వత్రిక ఓటు హక్కు సాధించి తద్వారా 1994లో జరిగిన ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.
సౌతాఫ్రికాలో అపార్టైట్ గురించి చెప్పే మ్యూజియాలు ఇంకొన్ని ఉన్నాయిగానీ, జోబర్గ్లోదే పెద్దది. దీన్ని 2001లో తెరిచారు. నిజానికి దీన్ని సౌతాఫ్రికన్ నేషనల్ మ్యూజియమనే చెప్పుకోవచ్చు. దీనిలో అపార్టైట్ ముందున్న వర్ణవివక్ష పాలనతో మొదలుపెట్టి, అపార్టైట్ కాలంలో ప్రభుత్వం చేసిన అమానుషాలూ, ANC ఆధ్వర్యంలో జరిగిన పోరాటం, 27 ఏళ్ళపాటూ సాగిన మండేలా జైలు జీవితం, 1994లో జరిగిన మొదటి ప్రజాస్వామిక ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన ‘ట్రూత్ అండ్ రికన్సీలియేషన్ కమిటీ’ (TRC)లాంటి ముఖ్యఘట్టాలన్నీ కనబడతాయి. అలానే గాంధీగారి మీద కూడా ఒక సెక్షనుంది. జోబర్గ్లో ఖచ్చితంగా చూడాల్సిన వాటిలో ఇది మొదటిది! ఒక తమాషా విషయం! ఈ మ్యూజియంకి రెండు ద్వారాలుంటాయి. ఒక ద్వారంమీద “శ్వేత జాతీయులు మాత్రమే” అనీ, రెండవదానిమీద “శ్వేతేతరులు మాత్రమే” అనీ ఉంటుంది. మనం కొనే అడ్మిషన్ టిక్కెట్ల మీద అచ్చూ బొమ్మా పద్ధతిలో ఒక జాతిని కేటాయిస్తారు. మన టికెట్ మీద ఉన్న జాతి ద్వారాన్నే మనం వాడాలి.సొవెటో (Soweto)
1880 దశకంలో ఆ పరిసరాల్లో బంగారు నిక్షేపాలున్నట్టు కనుక్కోబడడంతో జొహానెస్బర్గ్ పుట్టిందని చెప్పుకోవచ్చు. కాలిఫోర్నియా గోల్డ్రష్లోలానే అన్ని వర్ణాల శ్రామికులూ ఇక్కడకి చేరారు. నగరం త్వరితంగా వృద్ధి చెందింది. 1910లో శ్వేతప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 1923లో ‘ది అర్బన్ ఏరియాస్ యాక్ట్’ తీసుకొచ్చి శ్వేతేతరుల్ని జోబర్గ్నుంచి వెళ్ళగొడుతూ నైరృతి దిశలో, నల్లవారికోసమని టౌన్షిప్స్ నిర్మించింది. ఈ టౌన్షిప్పుల్నే తర్వాతి కాలంలో సొవెటో (South West Townships) అన్న పేరుతో వ్యవహరించడం మొదలైంది. ఇది సౌతాఫ్రికాలోనే అతి పెద్ద నల్ల నగరంగా అభివృద్ధి చెందడమే కాక అపార్టైట్-వ్యతిరేక పోరులో కీలకపాత్ర వహించింది. నెల్సన్ మండేలా, డెస్మండ్ టూటూ ఇక్కడి వారే! నిజానికి వీరిద్దరూ ఒకే వీధిలో ఉండేవారట. ప్రపంచంలో ఇద్దరు నోబెల్ విజేతలనిచ్చిన వీధి ఇదొక్కటే అని గర్వపడతారు అక్కడి వాళ్ళు. అన్నట్టు, అమెరికన్ టీవీ ప్రేక్షకులకి సుపరిచితుడైన ట్రెవర్ నోవా (Trevor Noah) కూడా సొవెటోలో పుట్టి పెరిగినవాడే!
1970లలో అపార్టైట్-వ్యతిరేక పోరాటం చతికిలపడుతున్న వేళ ఇక్కడి పీటర్సన్ ఎలిమెంటరీ స్కూలు పిల్లలు చేసిన నిరసన, దానిపై అపార్టైట్ ప్రభుత్వం స్పందించిన తీరూ ANCని పునరుత్తేజపరిచి ధ్యేయసాధన దాకా తీసుకెళ్ళాయని చెపుతారు. టూకీగా, శ్వేతేతరుల్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా, ప్రభుత్వం స్థానిక నల్లవారికి పెద్దగా పరిచయంలేని ఆఫ్రికాన్స్ని బోధనాభాషగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఇక్కడి పీటర్సన్ స్కూలు విద్యార్థులు ఒక నిరసన ప్రదర్శన మొదలుపెట్టారట. ఆ గందరగోళంలో పోలీసు కుక్క ఒకటి నిరసనకారుల ఆగ్రహానికి బలవ్వడంతో, “ఆఫీసర్ చనిపోయారు” (officer down) అనే సాకుతో విద్యార్థుల మీద కాల్పులు జరిపి ఇద్దరు చిన్నపిల్లల్ని హతమార్చేరట పోలీసులు! ఆ సంఘటన డీలా పడుతున్న ANC శ్రేణుల్లో స్ఫూర్తి నింపిందట.రెండురోజులు మాత్రమే ఉన్న జొహానెస్బర్గ్లో, సమయాభావంవల్ల, నాకు సదభిప్రాయం లేని “ఎర్ర బస్సు” (Red Bus) టూర్ని తీసుకోవాల్సి వచ్చింది. మిగతా టూర్ గొప్పగా లేకపోయినా, సొవెటో పర్యటన మట్టుకు నచ్చింది. ఈ పర్యటనకి మా టూర్ గైడ్లుగా సొవెటో వాస్తవ్యులే ఉండడంతో, వారు అందించిన సమాచారం ప్రామాణికంగా అనిపించింది.
అక్కడ మేం చూసిన విశేషాలు:
– సొవెటోని ఆనుకుని గుట్టలుగా పేరుకున్న మైనింగ్ వ్యర్థాలు. వీటి కాలుష్య ప్రభావాలని అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.
– ఆవాసాలకి అతి దగ్గర్లో థర్మల్ పవర్ స్టేషన్. దీనిని మండేలా అధికారానికి రాగానే మూసివేసినా, ఒక చారిత్రాత్మక చేదు గుర్తుగా ఆ కూలింగ్ టవర్సును అట్టే పెట్టారు. ప్రస్తుతం ఆ టవర్స్ని వాణిజ్య ప్రకటనలకీ, బంజీ జంపింగ్కీ వాడుతున్నారు.
– ఒక సాంప్రదాయక మట్టి పాత్ర ఆకారంలో కట్టిన 2010 సాకర్ వరల్డ్కప్ స్టేడియం
– మ్యూజియంగా మార్చిన మండేలా నివాసం
మండేలా ఇంటి ఎదుట ౙూలూ డాన్సర్లు రోడ్డుపై ప్రదర్శనలిస్తూ ప్రేక్షకుల దగ్గర విరాళాలు వసూలు చేయడం కనబడింది. వీరిని మా గైడ్లు తమ టూరిస్టులనుంచి కొంత దూరం పెడుతున్నట్టు కనబడ్డారు. ఇలాంటి టూర్ గైడ్లతో తప్పితే సొవెటోకి స్వంతంగా రావడం అంత క్షేమకరం కాదని, మేము బస చేసిన హోటల్ రిసెప్షనిస్ట్ చెప్పింది.
Cradle of Humankind
జొహానెస్బర్గ్కి ఒక 50 మైళ్ళ దూరంలో ఉన్న మరొపెంగ్ గుహలు (Maropeng Caves) యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద హోదా గలవి. ఈ హోదా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చారిత్రక ప్రదేశానికి మాత్రమే ఉన్నది! మానవ పరిణామంలో హోమోసెపియన్స్కి ముందు వచ్చిన “ఆస్ట్రేలోపితకస్” (Australopithacus Africanus) జాతికి చెందిన ‘టౌంగ్ చైల్డ్’ (Taung Child)ని ఈ గుహల్లోనే 1924లో కనుగొన్నారు. ఈ “ఆస్ట్రేలోపితకస్” నాలుగునుంచీ రెండు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించార(య)ట! ఆఫ్రికాలో కనుక్కోబడ్డ ఈ జాతికీ ఆస్ట్రేలియాకీ ఉన్న బాదరాయణ సంబంధం ఏమిటంటే ఈ స్పెసిమన్ని అధ్యయనం చేసిన అనాటమీ నిపుణుడు ఆస్ట్రేలియన్ అట.ఇవి దొరికిన గుహలు మేం వెళ్ళిన సమయంలో మరమ్మతుల కోసం మూతపడి ఉన్నాయి. మ్యూజియం మాత్రం చూడగలిగేం. ఇక్కడ అస్థిపంజరాల నకళ్ళు (replicas) ఉంటాయి. నిజానికి గుహల్లో కూడా అసళ్లు (originals) ఉండవు. వాటిని చాలా భద్రంగా వాల్ట్స్(Vaults)లో దాచి ఉంచుతారుట.
9. గోల్డెన్ మైల్ (The Golden Mile)
డర్బన్లో హిందూ మహాసముద్రం పొడుగునా ఉన్న ఒక ఆరు కిలోమీటర్ల బీచిని “గోల్డెన్ మైల్” అంటారు. మేము తీసుకున్న హోటల్ ఈ బీచ్ పక్కనే ఉండి మొదటి రోజు ఉదయం లేవగానే కిటికీ పరదాలు తీస్తే అద్భుతమైన సూర్యోదయం కనబడింది. అంత అందమైన దృశ్యాన్ని కిటికీలోంచి చూడ్డం తగదనిపించి, తర్వాత రోజునుంచి త్వరగా లేచి బీచ్కి వెళ్ళిపోయేవాణ్ణి. బీచ్ అంతా చాలా శుభ్రంగా, కొద్దిపాటి వెలుతురు రాగానే మార్నింగ్ ఎక్సర్సైజ్కీ, సర్ఫింగ్కీ, స్విమ్మింగ్కీ వచ్చేవారితో చాలా కళకళలాడుతుంది. బీచ్లో ఒక నాలుగైదు పలకల వంతెనలు/రేవులు (Piers) ఉండి సూర్యోదయం చూడాలనుకునే వారికి మంచి క్లోజప్ వ్యూ ఉంటుంది. ఈ పియెర్స్నే కొంతమంది సర్ఫర్స్ నీటిలో దూకడానికి వాడుకోడం గమనించేను.ఇకపోతే, బీచిలో సైకత కళాకారుల కళాప్రదర్శన కూడా బాగుంది – విరాళాలు ఇవ్వకుండా ఫొటోలు తీసుకోవద్దనే విజ్ఞప్తితోపాటు! బీచ్ పక్కనే పెద్ద పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మొత్తం మీద నేను ఎంజాయ్ చేసిన బీచ్లలో ప్రథమస్థానం దీనిదే. ఇది నిజంగా గోల్డెన్ మైలే అనిపించింది.
గతంలో ఈ గోల్డెన్ మైల్కి దారిదోపిడీలవంటి నేరాలవల్ల చాలా చెడ్డ పేరుండేదట. అప్పట్లో దీన్ని “మగ్గర్స్ మైల్” అని కూడా వ్యవహరించేవారట. 2010 వరల్డ్ కప్ సందర్భంగా ఈ ప్రాంతాన్ని చాలా మెరుగు చేశారని చెపుతారు. మొదట్లో గమనించలేదుగానీ, ఈ బీచిలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉండడం చూసేను. అయినా కూడా, బీచ్ వదిలి రోడ్డు పక్కన సైడ్వాక్ని వాడడానికి ప్రయత్నిస్తే అంత క్షేమం అనిపించలేదు. అది బీచి సెంటర్కి కొంచెం దూరంగా ఉంది. ఆన్లైన్ ట్రావెల్ ఫోరాల్లో తమ హోటల్ బయటే మగ్గింగ్కి గురయ్యామని వాపోయే టూరిస్టుల గోడు చూడొచ్చు! అయితే, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే భయపడనక్కర లేదనిపించింది.
మండేలా సారథ్యంలో పూర్తి ప్రజాస్వామ్యం వచ్చిన ముప్ఫై ఏళ్ళకి కూడా సమాజంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా ఉండడం ఈ నేరాలకి కారణం కావచ్చు. ఇక్కడ నిరుద్యోగం ముప్పై ఐదు శాతం అని చదివేను. జొహానెస్బర్గ్లో బస్ యాత్రలో చూసిన కొన్ని ధనవంతుల భవంతులు – అవి గనుల వ్యాపారుల కుటుంబాలవి కావచ్చు – అద్భుతంగా ఉండగా, వాటికున్న కోటగోడల్లాంటి ప్రహరీ గోడలు, కెమెరాలు, రేజర్ వైరు, ఎలెక్ట్రిక్ వైరువంటి భద్రతలు కూడా అదే మోతాదులో ఉన్నాయి. అవి ఇక్కడి సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలకి అద్దం పడుతున్నాయి అనిపించింది.
10. ఉపసంహారం
నా పర్యటనలో మనసుకి హత్తుకున్నదృశ్యాల్లో ఒకటి – మేము క్రూగర్నుండి డర్బన్ వెళుతున్నప్పుడు, JNBలో మా డర్బన్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం గేటు దగ్గర వేచి ఉన్నాము. ఆ చుట్టుపక్కల మరో నాలుగైదు గేట్లు ఉంటాయేమో. అన్నిట్లోనూ డర్బన్కు వెళ్తున్న విమానాలే. అది శుక్రవారం సాయంత్రం అవడంతో వారాంతానికి ఇంటికి వెళుతున్న వ్యాపార ప్రయాణీకులతో కళకళలాడుతున్నాయి గేట్లన్నీ. ఒక పది నిమిషాల తర్వాత నాకు తట్టిన విషయం – ఆ విమానాశ్రయమంతా ఏదో బెంగుళూరులాగానో, హైదరాబాదులాగానో ఉంది. దాదాపు ప్రతి ఒక్కరూ (ప్రవాస) భారతీయులే! లైన్లలో నిల్చుని అపరిచితులు మాట్లాడుకుంటున్న తీరులో ఆత్మీయత, సాన్నిహిత్యం తెలుస్తుంది. యాదృచ్ఛికంగా నాక్కూడా ఇది మా శాన్ హోజే విమానాశ్రయంకంటే బాగా పరిచయమున్న చోటులాగా అనిపించింది.
అమెరికాలో నా వంశీకుల భవిష్యత్తు గురించి నాకు కచ్చితమైన సమాధానం దొరికిందో లేదో నాకు తెలియదు. అయితే అనేక సంభావ్య భవిష్యత్తుల్లో ఒక దాన్ని చూడగలిగానిక్కడ. And, it’s not a bad one indeed.
పరిమిత పరిశీలనతో ఒక సమాజంపై వ్యాఖ్యానం చేయడం సబబు కాదు. కానీ, నేను చూసినంతవరకు ఇక్కడి ప్రవాస సమాజం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పురోగమిస్తుంది. వారి పూర్వీకులు క్లిష్ట పరిస్థితులలో స్థిరపడిన ఈ ఖండంలో వారు తమ స్వంతమార్గాన్ని వెతుక్కోగలిగారు. గతాన్ని పట్టుకు వేలాడకుండా, వారు తమ సంప్రదాయాల్ని వీలైనంత మేర నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.
స్వాతంత్ర్యానంతరపు భారతదేశానికీ దక్షిణాఫ్రికాకీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, దశాబ్దాలుగా అణిచివేతకు గురైన శ్వేతేతరులు ఇటీవలి దాకా తమను అతి కర్కశంగా అణగతొక్కిన వారితో సహజీవనం చేయడం. మండేలా, టుటు వంటి వారి నాయకత్వంలో, దక్షిణాఫ్రికాలోని నల్లజాతీయులు 1994 తర్వాత అపారమైన క్షమాగుణాన్ని చూపించారు. ప్రస్తుతం ప్రభుత్వం అనేక రంగాల్లో నల్లవారికి రిజర్వేషన్లతో జాతుల మధ్య అసమానతలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. దురదృష్టవశాత్తు, అపార్టైట్ కాలంలో ఇతర శ్వేతేతరులతో సమానంగా వివక్షకు గురైన ప్రవాసులకు ప్రస్తుత ప్రభుత్వ విధానాలవల్ల ఊరట దొరకడం లేదు. దీన్ని “వర్ణవివక్ష సమయంలో తగినంత తెల్లగా లేకపోవడం, వర్ణవివక్ష తర్వాత తగినంత నల్లగా లేకపోవడం” అని వ్యవహరిస్తారట (“Not white enough during apartheid and not black enough post-apartheid”). అయితే వీరి పూర్వీకులు అధిగమించిన అవరోధాలతో పోలిస్తే ఇదొక లెక్కలోకి రాదనిపిస్తుంది. God speed to our South African cousins!
ఒక సవరణా, కొన్ని కృతజ్ఞతలూ..
ఈ వ్యాసం ఈమాటలో రావడంవల్ల కలిగిన లాభాల్లో ఒకటి — ఒకప్పటి ఇండెంచర్డ్ లేబరర్ మనవడూ, ఈమాట పాఠకులకి పరిచితులూ అయిన కవి శ్రీ ముకుంద రామారావుగారు పరిచయమవ్వడం. వీరి తాతయ్యా నానమ్మలు వారి యుక్తవయసులో నటాల్కి కూలీలుగా వెళ్ళి, అక్కడ పెళ్ళి చేసుకొని, పదేళ్ళ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారట. రామారావుగారు నటాల్ మాత్రమే కాకుండా ఒక 20కి పైగా గమ్యాలకి వెళ్లిన ఇండెంచర్డ్ లేబర్ మీద డేటా సంకలనం చేసి విశ్లేషించి దానిని ‘అగమ్య గమ్యాలు’ పేరుతో ప్రచురించారు. ముఖ్యంగా ఈ పుస్తకపు గ్రంథసూచి (bibliography) చాలా సమగ్రమైనది. (శ్రీ దాసరి అమరేంద్ర ప్రస్తావించిన “వీరయ్య” (కృష్ణ గుబిలి గారి పుస్తకం) ఇందులో ఉండడాన్ని గమనించాను.)
‘అగమ్య గమ్యాలు’తోపాటు ‘వీరయ్య’ పుస్తకపు excerpts చదివిన తర్వాత, బ్రిటిష్ వారు ఐదు సంవత్సరాల ఇండెంచర్ కాలపరిమితిని పాటించలేదన్న విషయం నాకు అర్థమైంది. అది ప్రభుత్వ విధానం అయి ఉండవచ్చు. కానీ, ఎస్టేట్ యజమానులు తమవద్ద పనిచేసిన కూలీలను రకరకాల సాకులతో ఇంకొక ఐదేళ్లు పనిచేయించుకోవడం చాలా సాధారణమట.
అన్నట్టు 1860 హెరిటేజ్ సెంటర్లో, ప్రవాసులు తమ కుటుంబపు ఇండెంచర్ చరిత్రను వివరిస్తూ రాసిన పుస్తకాలు కనబడ్డాయి. Tholsi Mudly వ్రాసిన “A Tibute To Our Forefathers” వాటిలో ఒకటి. కాకపోతే, హెరిటేజ్ సెంటర్ క్రెడిట్ కార్డు పేమెంట్స్ తీసుకోనందున నేను ఈ పుస్తకాలలో దేనినీ కొనలేకపోయాను.
ఈ వ్యాసం తొలి దశల్లో చదివి, ప్రోత్సాహించి, సవరణలు చేసిన మిత్రులు శ్రీ కె.వి. గిరిధరరావుగారికి కృతజ్ఞతలు.




















