ఒక నగరం, కొన్ని పగటి కలలు

ఈ నగరంలో కరెంటు కోతలు చాలా మామూలైపోయాయి. ముఖ్యంగా వేసవి కాలంలో కరెంటు కోతలు ఇక్కడి జనాలకి అలవాటైపోయాయి. కరెంటు లేని మధ్యాహ్న సమయాల్లో చెట్లకున్న ఆకులు కూడా కదలవు. బహుశా ఈ నగరంలో చెట్లు మామూలప్పుడు కూడా అసలు ఆకుల్ని కదపనే కదపవేమో అనిపిస్తుంది. గాలి ఆడని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసే పగటివేళల్లో నిద్ర ఊరినంతా కొండచిలువలా కబళించేస్తుంది. వందలాది లాడ్జీలు ఉన్న టౌన్ హాల్ రోడ్డులో మధ్యాహ్నం పూట అస్పష్టమైన పసుపురంగు ఎండ నేలమీదికి జిగురులా కారుతున్నట్టు ఉంటుంది. తలమీద ముసుగు వేసుకుని పుచ్చకాయలు అమ్మే ఆడవాళ్ళు, చెరుకులనుండి రసాన్ని పిండి, పిప్పిని బయటకు తోస్తూనే ఉండే యంత్రం, కాకులైనా ఎగరని ఆకాశం, శబ్దం చేయని చర్చి గంట, రోడ్డును తదేకంగా చూస్తున్న విగ్రహాలు… ఇలా ఎక్కడ చూసినా ఎండ గీసిన చిత్రాలే. రోడ్డు పక్కన చిత్రకారుడు. సున్నం, బొగ్గుతో గీసిన కృష్ణుడి బొమ్మమీద విసిరేయబడిన నాణేలు ఎండకు వేడెక్కి మెఱుస్తున్నాయి. కుళ్ళిన కోడిగుడ్డు వాసనలా వేసవి మధ్యాహ్నం వ్యాపిస్తోంది. ఎండమావులు తారురోడ్లమీద ఆవిరి అలల్లా పారుతుంటే, వెయ్యేళ్ళ నాటి ఈ పురాతన దేవాలయ నగరం ఒక ముసలి వేశ్యలా తన వయసును దాచుకునే మెఱుగుపూతలతో పళ్ళికిలిస్తోంది.

పయనీర్ లాడ్జ్ – సంక్షిప్త చరిత్ర

ఇప్పటివరకు ఆ లాడ్జీలో బస చేసిన వాళ్ళ సంఖ్య కచ్చితంగా రెండు లక్షలు దాటుంటుంది. 1934లో ప్రారంభించినప్పుడు, ఆ లాడ్జీకి కస్టమర్లను పట్టుకోవడానికి రైల్వే స్టేషన్‌లో ఇద్దరు బ్రోకర్లు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో లాడ్జీలో ఉండటం అంటే చాలా అవమానకరమైన విషయం. సెంట్లు, రెమీ సోప్ పౌడర్లు అమ్మేవాళ్ళు, డ్రామా కంపెనీ బ్రోకర్లు, వేలం పాటలు పాడేవాళ్ళు ఇలాంటివాళ్ళు మాత్రమే లాడ్జీల్లో గదులు తీసుకునేవాళ్ళు. పుణ్యక్షేత్ర సందర్శనానికి వచ్చే యాత్రికులు ఎప్పుడూ అన్నసత్రాల్లోనే ఉండేవాళ్ళు. అందుకోసమే గుడి చుట్టూ నాలుగైదు అన్నసత్రాలు ఉండేవి.
దేవదానపట్టికి చెందిన పెరుమాళ్ రెడ్డి గారే ఈ లాడ్జీకి మొదటి యజమాని. ఆయన దగ్గర్నుండి పలువురి చేతులు మాఱుతూ, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్న ఒత్తక్కడై మారియప్పన్ ముఠా రుణపత్రాల ద్వారా స్వాధీనం చేసుకున్నారన్నది బయటకు రాని నిజం. పయనీర్ లాడ్జ్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐదేళ్ళకూ దాని రూపురేఖలు మాఱుతూనే ఉంటాయి.

1940ల్లో సౌరు చంద్ర తరచూ రావడమన్నది ఈ లాడ్జీకి ప్రత్యేకత. అప్పట్లో ఆ విషయం ఊరూరా మాఱుమోగిపోయేంత ప్రసిద్ధి. సాయంత్రం నాలుగు గంటలకు ఆమె ఎరుపు రంగు ఆస్టిన్ కారు లాడ్జీ వాకిట్లో వచ్చి ఆగేది. ఆమె కారు తలుపు తీయడానికనే రూమ్ బాయ్స్ కాచుకుని ఉండేవాళ్ళు. ఆమె ఎప్పుడూ ఎరుపు లేదా పసుపు రంగు బర్మా సిల్క్ చీరలే కట్టుకుని వచ్చేది. శరీర సౌందర్యాన్ని మఱింతగా పెంపొందించి చూపించే ఆ చీరల్లోని పూలు చూసేవాళ్ళ కళ్ళల్లోనే మెదులుతుండేటివి. అవన్నీ ‘సిరువయల్’ శెట్టియార్ కొనిచ్చినవని చెప్పుకునేవాళ్ళు. సౌరు చంద్ర మనిషి బాగా పొడవుగా ఉండేది. ఆమె చెప్పులు వేసుకోవడం అన్నది ఆ రోజుల్లో పెద్ద ఆశ్చర్యకరమైన విషయంగా చూసేవాళ్ళు. ఆమె జుట్టు పిఱుదుల వరకు వేలాడేది. విచిత్రంగా ఆమె ఎక్కడికి వెళ్ళినా ఒక దేవాంగపిల్లిని తనతో పాటు తీసుకెళ్ళేది. ఆ దేవాంగపిల్లి బాగా బక్కచిక్కి ఉండేది.

ఆమె బాగా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ లాడ్జీ లోపలికి నడిచేది. ఆమె వెనుక నిట్టూర్పులు, రహస్య కోరికలు రాలిపడి ఉండేవి. ఆమె వచ్చాక ఒక వాయిద్యబృందం వాయిద్యాలు పట్టుకుని గుఱ్ఱం బగ్గీలో వచ్చేది. ముఖ్యమైన కొందరు పెద్ద మనుషులకోసం మాత్రమే మేడ మీద గదిలో నృత్య కచేరీ జరుగుతుందని చెప్పుకునేవాళ్ళు. దాన్ని రుజువు చేసే రీతిలో అప్పుడప్పుడు పాటల శబ్దం వినిపించేది. సాయంత్రం నాలుగునుండి చీకటి పడే వరకు సౌరు చంద్ర అక్కడే ఉండేది. ఆమె బయటకు వెళ్ళేటప్పుడు సిరువయల్ శెట్టియార్ ఆమె కారు వరకు వచ్చి సాగనంపేవాడు. అప్పట్లో ఆ లాడ్జీలో పనిచేసే కొందరు ‘ఆమె విదేశీ బ్రాందీ తాగుతుంది’ అనీ, మగాడిలా ప్యాంటు వేసుకుని డాన్స్ చేస్తుంది’ అనీ రకరకాల కథలు చెప్పుకునేవాళ్ళు.

ఆ లాడ్జీలో బస చేసినవాళ్ళలో సౌరు చంద్రను చూడటానికోసమే వచ్చి బస చేసేవాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇక్కడ మేజువాణి చేసేప్పుడు కాకుండా మిగిలిన సమయాల్లో సౌరు చంద్ర ఏం చేస్తుంది? ఆమె ఇల్లు ఎక్కడుంది? నిజంగా లోపల మేజువాణి జరుగుతుందా? అని వందలాది ప్రశ్నలు ఆ లాడ్జ్ చుట్టూ తిరుగుతుండేవి. కానీ ఈ మర్మమే పయనీర్ లాడ్జీని బతికిస్తుండేది.

కొన్నేళ్ళకు సౌరు చంద్ర సరికొత్త ప్లైమౌత్ కార్లో వచ్చి దిగింది. ఇప్పుడు ఆమె సిరువయల్ శెట్టియార్ దగ్గరనుండి వత్తలగుండు సాయిబు వశమైందని చెప్పుకున్నారు. కానీ శెట్టియార్ లాగా సాయిబు కారుదాకా వచ్చి సాగనంపేవాడు కాదు. బదులుగా ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక బుట్టనిండా రోజా పూలను మోసుకుంటూ ఒక మనిషి ఆమె వెనుక వెళ్ళడం చాలామంది చూశారు. వత్తలగుండు సాయిబు ఎలా ఉంటాడో కూడా ఎవరూ చూడలేదు. చాలా కాలంపాటు రహస్యాల పుట్టలా ఉంది సౌరు చంద్ర.

ఒకరోజు సౌరు చంద్ర ఆ లాడ్జ్ వాకిట్లో కారు దిగుతుండగా, పొద్దున్నుండి అక్కడే పొంచి ఉన్న ఒక రిక్షావాడు గబగబా ఆమె దగ్గరకు వెళ్ళి కత్తితో పొత్తికడుపులో పొడిచాడు. ఆమె జుట్టును కొంచెం కత్తిరించుకుని వెళ్ళిపోయాడు. అది జరిగింది కూడా ఇలాంటి ఒక మధ్యాహ్నం వేళే. ఆ పొడిచిన మనిషి సౌరు చంద్ర భర్త అని, అతన్ని వదిలేసి నాట్యం చెయ్యడానికి వచ్చిందని కొందరు, సిరువయల్ శెట్టియార్ పంపిన మనిషే ఆమెను పొడిచాడని, అందుకే ఆమె జుట్టును కత్తిరించుకుని వెళ్ళాడని మఱికొందరు చెప్పుకునేవాళ్ళు.

ఆ సంఘటన జరిగిన తర్వాత సౌరు చంద్రను పొడిచిన చోటుగా ఆ లాడ్జీకి పేరు వచ్చింది. అందుకేనేమో అక్కడ బస చేసే ప్రతి ఒక్కరూ సౌరు చంద్ర గురించిన కథల్ని ఆసక్తిగా వినేవాళ్ళు. కొందరు రూమ్ బాయ్స్ మద్యం మత్తులో సౌరు చంద్ర కత్తిపోటుకు గురై కింద పడిపోయినప్పుడు తానే పట్టుకున్నానని, అప్పుడు కూడా ఆమె శరీరంనుండి రోజాపూల వాసన వచ్చిందని చెప్పేవాళ్ళు. అది రోజాపూల వాసన కాదు, తేనె, నిమ్మరసం కలిసిన వాసన అని, మేజువాణి నృత్యం చేసే ఆడవాళ్ళు ఒంటికి తేనె రాసుకుని స్నానం చేస్తారని కూడా చర్చలుకూడా పెట్టుకున్నారు.

సౌరు చంద్ర గురించి బాహాటంగా అందరికీ తెలిసిన కథలే కాకుండా, రహస్యంగా మఱికొన్ని కూడా చెప్పుకునేవాళ్ళు. అందులో ఒకటి, వత్తలగుండు సాయిబు కొడుకుతో సౌరు చంద్రకు అక్రమ సంబంధం ఏర్పడిందని, అందుకని సాయిబే ఆమెను చంపించాడని అనేవాళ్ళు. ఏది నిజం అన్న విషయం పక్కన పెడితే, ఇప్పటివరకు ఆమెను చంపిన వాడు దొరకలేదు; పైగా ఆమె చావుకు ఎవరూ న్యాయం కోరి పోరాడలేదు. కాలక్రమేణా సౌరు చంద్ర పేరు జనం నోళ్ళలో నానడం తగ్గింది. ఆ తర్వాత పయనీర్ లాడ్జ్ జూదానికి ప్రసిద్ధి చెందిన చోటుగా మాఱింది.

ముఖ్యంగా 222వ నంబరు గదిలో కొన్నేళ్ళపాటు రాత్రింబవళ్ళు జూదం నిర్విరామంగా సాగుతూనే ఉండేది. ఎక్కడెక్కడి ఊళ్ళనుండో జనం రావడం, సొమ్ము పోగొట్టుకోవడం జరుగుతుండేది. ఆ జూదం గది రెండో అంతస్తులో తూర్పు వైపు ఉండేది. అక్కడ ఒక పెద్ద గుండ్రని టేబుల్ ఉండేది. ఆ గదికి రెండు వైపులా ఉన్న గదుల్లో వేశ్యలను ఉంచేవాళ్ళు. జూదంలో గెలిచినా, ఓడినా ఆ ఒత్తిడిని తగ్గించుకోడానికి గబగబా వెళ్ళి వాళ్ళతో పడుకుని లేచేవాళ్ళు. జూదంగదిలో పనిచేసిన నీలకంఠం తాను రిటైర్ అయ్యేవరకు అక్కడ జరిగిన విషయాలను ఎవరికీ చెప్పలేదు.

జూదమాడే గదుల్లోకి స్త్రీలకు ప్రవేశం లేదన్నది ఒక అలిఖిత నియమం. ఆ నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినందుకుగాను తిరువలం జమీంధారు వేలాయుధ పాండియన్‌ను బయటకు గెంటేశారని ఒక వార్త ఉంది. దేవకోట్టైకి చెందిన రామనాథన్ ఈ పయనీర్ లాడ్జీలో జూదానికి బానిసయ్యి, తన బర్మా టేకు బంగ్లాను, గూటిబండిని పోగొట్టుకున్నాడని, అక్కడినుండే ఎవరికీ చెప్పకుండా నేరుగా రామేశ్వరం వెళ్ళి గుండు గీయించుకుని తిరిగి బర్మాకు ఓడ ఎక్కి వెళ్ళిపోయాడని చెప్పుకుంటారు.

ఆ రోజుల్లో పోలీస్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఎల్లీస్ ఒకసారి జూదంగదిలోకి వెళ్ళినప్పుడు, నిద్రలేక ఉబ్బిన కళ్ళతో, ఎండిన పెదవులతో ఆరుగురు ఆడుతుండటం, టేబుల్ నిండా డబ్బు ఉండటం చూశాడని, ఆటలో మునిగిపోయిన వాళ్ళెవరూ ఎల్లీస్ వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోలేదని, ఆ రోజు జూదంలో పాలనత్తం జమీందార్ కొండానాయకర్ ఏడున్నర లక్షల రూపాయలు సంపాదించుకున్నాడని ఇప్పటికీ చెప్పుకుంటారు.

అయితే, ఆ జూదాల లాడ్జీకి ఎల్లీస్ ఒక్కసారైనా పోలేదని, ఆయన ఒకే ఒక్క రోజు తన కానిస్టేబుళ్ళతో వెళ్ళి ఆ జూదం గదిని మూయించి అందరినీ స్టేషన్‌కు ఈడ్చుకెళ్ళాడని మణ్యం లాడ్జీ యజమాని నాగరత్నం ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదు.

ఆ తర్వాత మెల్లగా పయనీర్ లాడ్జ్, నరాల బలహీనత, శీఘ్రస్కలన సమస్యలకు చికిత్స చేసే డాక్టర్ శివపతిని కలిసే చోటుగానూ, కొన్నేళ్ళపాటు చీటీలు నడిపే కేంద్రంగానూ, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వచ్చి వాలే స్థావరంగానూ మాఱుతూ వచ్చింది.

పయనీర్ లాడ్జీలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన జంటల సంఖ్య ముప్పైకి పైనే ఉంటుంది. అందులో ఎర్ణాకుళంనుండి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సారమ్మే అతి చిన్న వయస్కురాలు. చనిపోయేటప్పుడు ఆమె వయసు పదిహేను. ఆమెతో పాటు చనిపోయిన పరమేశ్వరన్ నాయర్ వయసు నలభై ఎనిమిది. దాన్ని కూడా పోలీసులు ప్రేమ ఆత్మహత్య అనే రిపోర్టు పుస్తకంలో నమోదుచేసుకున్నారు.

పయనీర్ లాడ్జీని కొనుక్కోడానికి ఎవరూ ఇష్టపడలేదుగానీ, అది తనంతట తానుగా ప్రతి ఐదేళ్ళకూ ఒకసారి చేతులు మాఱుతూ వస్తోంది. లాడ్జ్ లోపల ఉన్న వేపచెట్టును, వరండాలో ఉన్న పాత ఫోటోలను ఏ యజమాని వచ్చినా మార్చలేదు. ఇప్పటికీ పయనీర్ లాడ్జీలో ఉండటానికనే వచ్చేవాళ్ళు కొందరున్నారు. సినిమా ఫిల్మ్ బాక్సులు తెచ్చేవాళ్ళు, వేలం చీటీలు నడిపేవాళ్ళు, చెప్పుల వ్యాపారులు, హస్తసాముద్రిక జోస్యం చూసేవాళ్ళు, వడ్డీ వ్యాపారులు ఇలా కొందరు సుమారు ఇరవై గదుల్లో శాశ్వతసభ్యులుగా ఉంటున్నారు.

పయనీర్ లాడ్జ్ కాలంతోపాటు ముందుకు వెనక్కు మెల్లగా సాగుతూనే ఉంది. నిజానికి అది ఒక జ్ఞాపకాల దొంతరలా మారింది. కొందరు ఇప్పటికీ దాని ముందు నిలబడి గతంలో ఆ గదుల్లో తాము స్త్రీలతో గడిపిన ఉల్లాస వేడుకల గురించి తలపోసుకుంటూ ఉంటారు. మఱికొందరు అక్కడ జరిగిన చీటీ పాటల గురించి, ఇంకొందరు ఎప్పుడో అక్కడ బస చేసిన కామెడీ యాక్టర్ని చూడటానికి వచ్చిన రోజుల గురించి గుర్తు చేసుకుంటారు. పయనీర్ లాడ్జీకి వయసు పైబడింది అని ఎవరూ అనరు. నిన్న మొన్న మొలిచిన టెంపుల్ టవర్లకంటే అది ఎంతో నిత్యనూతనంగా ఉందని నమ్ముతారు. దానికి కారణం అక్కడ కంటికి కనిపించకుండా తీపి వలలా అల్లుకుపోయి ఉన్న రహస్యాలే! పయనీర్ లాడ్జ్ మధ్యాహ్నసమయాలు సోడా బుడ్డిలోని నీలంరంగు గోళీలాగా బయటకూ రాకుండా, లోపలా పడిపోకుండా కదులుతూనే ఉంటాయి.

పగటి కల 1

శుభంభావుక దేవళం సందు వైపు నడుస్తున్నాడు ముత్తుస్వామి. గొడుగులు బాగుచేసే ఒక ముసలాయన తప్ప వీధిలో ఎవరూ లేరు. మధ్యాహ్నపు ఎండ తీవ్రంగా ఉండటంతో ఒంటిగంటకే వ్యాపారులు షాపులు కట్టేసి భోజనానికి వెళ్ళిపోయినట్టున్నారు. సవితా టైలర్ షాపులో మాత్రం పాటలు వినిపిస్తున్నాయి. ఇళ్ళను ఆనుకుని పడుతున్న నీడలోనే నడుచుకుంటూ వెళ్ళాడు. దూరంగా కనిపిస్తున్న గుడి విగ్రహాలు కూడా ఎండకు భయపడి కళ్ళు మూసుకుని తలదించుకుని నిలబడినట్టున్నాయి.

ముత్తుస్వామి చేతిలో ఉన్న ఐదు రూపాయల నోటు చెమటతో తడిసి నలిగిపోయింది. మీనాక్షి మెస్‌నుండి భోజనం తీసుకుని కుడి చేతిలో క్యారియర్, ఎడమ చేతిలో అరిటాకు పట్టుకుని బయటకు వచ్చిన అళగర్, ముత్తుస్వామిని చూసి ‘ఎక్కడికి వెళ్తున్నావురా?’ అని అడిగాడు. ముత్తుస్వామి సమాధానం చెప్పకుండా అళగర్ చేతిలోని ప్లాస్టిక్ కవరులో ఉన్న అప్పడాల్లో కొంచెం తుంచుకుని తింటూ ‘312 నంబరు గదికా?’ అని అడిగాడు. అళగర్ తల అడ్డంగా ఊపుతూ ‘మేనేజర్‌కి’ అన్నాడు.

అళగర్ చొక్కా జేబును తడిమి చూశాడు ముత్తుస్వామి. చిల్లర శబ్దం వినిపించింది. అళగర్ నవ్వుతూ ‘డబ్బులు నావి కావు, వెళ్ళే దార్లో బీడా కొనడానికి’ అన్నాడు. ముత్తుస్వామి ఏమీ పట్టించుకోకుండా అళగర్ జేబులో చేయి పెట్టి రూపాయి బిళ్ళను తీశాడు. అళగర్ కోపంగా ‘డబ్బులు జేబులో పెట్టరా’ అని అరిచాడు. అప్పుడు అళగర్ చేతిలోని క్యారియర్ తొణికి సాంబార్ కారడం మొదలైంది. ముత్తుస్వామి నవ్వుతూ ‘మజ్జిగ మిగిలితే ఉంచు, వచ్చి తాగుతాను’ అని ఆ రూపాయిని మళ్ళీ అళగర్ జేబులో వేసి ముందుకు నడిచాడు. ఎండను లెక్కచేయకుండా అళగర్ పాటలు పాడుకుంటూ వెళ్ళడం వినిపించింది.

ఒక సిటీ బస్సు రోడ్డుమీదున్న దుమ్మూ ధూళిని లేపుతూ ముత్తుస్వామిని దాటుకుని వెళ్ళింది. పండ్ల దుకాణాలను దాటుకున్నాక, కోటకవతలున్న ఏకాంబరం తోపుడుబండి దగ్గరకొచ్చి ఆగాడు. ఏకాంబరం ఒక ఆపిల్ పండును మురికిగుడ్డతో తుడిచి స్టిక్కర్ అంటిస్తున్నాడు. ద్రాక్షపళ్ళు కూడా ఎండ వేడికి కాలిపోతున్నాయి. రాలిపడి ఉన్న రెండు ద్రాక్షపండ్లను తీసుకుని నోట్లో వేసుకుంటూ ‘నాటు అరటి పళ్ళు ఇవ్వన్నా’ అని ఐదు రూపాయల నోటుని చాచాడు ముత్తుస్వామి.

ఏకాంబరం తలెత్తి చూసినప్పుడు ఎండ కంటికి కనిపించని కత్తిలా వీధిని కోస్తున్నట్టు అనిపించింది. మెడకింద చెమట తుడ్చుకుంటూ ఏకాంబరం డబ్బులు తీసుకుని ‘నాటు పళ్ళు లేవు, రస్తాళి తీసుకో’ అన్నాడు.

ముత్తుస్వామి ఆ మాటను పట్టించుకోకుండా, వొలిచిపెట్టిన పనస తొనలమీద ఎన్ని ఈగలు వాలాయో లెక్కపెడుతున్నాడు. ఏకాంబరం విసుగ్గా ‘రేయ్ ముత్తుస్వామి… రస్తాళి ఇవ్వనా?’ అని మళ్ళీ అడిగితే ముత్తుస్వామి తల అడ్డంగా తిప్పుతూ ‘వద్దు, డబ్బులు తిరిగి ఇచ్చేయ్’ అన్నాడు. ఏకాంబరం వంగి బుట్టలోనుండి ఒక బేరిపండును చాచి ‘ఎర్రరటి పళ్ళు తీసుకుపోరా, తేనెలా తియ్యగా ఉంటాయి’ అన్నాడు.

ముత్తుస్వామి ‘ఎంత?’ అని అడిగాడు. ‘రెండు పళ్ళు నాలుగు రూపాయలు’ అని చెబుతూ గెలనుండి రెండు పండ్లు తెంపి ఇచ్చాడు. ఆ పళ్ళను చూడగానే ముత్తుస్వామికి నవ్వొచ్చింది. వాసన చూశాడు, ఇదివరకు ఎప్పుడూ తెలియని వాసన. రెండు చేతుల్లో రెండు పళ్ళను పట్టుకుని కత్తియుద్ధం చేస్తున్నట్లు అభినయిస్తూ పయనీర్ లాడ్జ్ దారి పట్టాడు. అతను నాలుగేళ్ళుగా లాడ్జీల్లోనే పని చేస్తున్నాడు. అది కూడా ఇదే రోడ్డులో ఉన్న వేఱ్వేఱు లాడ్జీల్లో! కొన్నిసార్లు తను ఇప్పుడు ఏ లాడ్జీలో పని చేస్తున్నాడో కూడా మరిచిపోతుంటాడు. ఎందుకంటే అన్ని లాడ్జీలు బయట వేఱేగా కనిపించినా, లోపల మాత్రం అంతా ఒకేలా ఉంటాయి. లాడ్జీకి వచ్చే బస చేసేవాళ్ళందరూ ఏదో ఒక చేదు బాధను మనసులో దాచుకున్నవాళ్ళే. వాళ్ళెప్పుడూ సహజంగా ఉండరు; లేదా లాడ్జీకి రాగానే వాళ్ళ సహజత్వాన్ని కోల్పోతారు.

నిజానికి అన్ని లాడ్జీల మధ్యా కంటికి కనబడని ఒక సాలీడు వల అల్లబడి ఉంటుంది. ఏ లాడ్జీలో ఉన్నా గదులు మాత్రం అన్నీ ఒకేలా ఉంటాయి. ఏ లాడ్జీలోనైనా వారం రోజులకంటే ఎక్కువ ఉంటే, మెఱిసే రంగు రంగు వాల్ పేపర్లంటించిన గోడల వెనుక ఉన్న మురికి కనబడటం, నిట్టూర్పులు వినిపించడం మొదలవుతుంది.

లాడ్జీలంటేనే ఒక పెద్ద మూత్రశాల అని ముత్తుస్వామి అనుకునేవాడు. అన్ని గదులకు రెండు తాళం చెవులుంటాయి. నిఘా పెట్టడానికి తలుపు పైభాగంలో రంధ్రాలు ఉంటాయి. ఇక్కడ ఎవరూ ఉరి వేసుకోకూడదనే గదుల్లో దూలాలు ఉండవు… ముత్తుస్వామి ఇలా సంబంధం లేని విషయాలు ఆలోచిస్తూ ఎండలో నడుస్తున్నాడు.

పరోటా షాపు పెనం ఎండలో కాలుతోంది. పాత పేపర్ల దుకాణం మెట్ల మీద ఎవడో ఎండను లెక్క చెయ్యకుండా ముడుచుకుని పడుకుని ఉన్నాడు. అతని నోటినుండి చొంగ కారుతోంది. అరిగిపోయిన అతని నీలంరంగు చెప్పులు అటొకటి ఇటొకటి పడి ఉన్నాయి.

ముత్తుస్వామి లాడ్జీకి చేరుకున్నాడు. కరెంటు లేకపోవడంతో జనం తలుపులు తెరిచి ఉంచి విసనకర్రలతో విసురుకుంటున్నారు. మెట్ల కింద ఒక పక్క ఖాళీ బీర్ బాటిళ్ళు పేర్చి ఉన్నాయి. ముత్తుస్వామి రెండో అంతస్తుకు వెళ్తున్నప్పుడు మెట్లదారిలో ఉన్న అద్దంలో తనను తాను చూసుకున్నాడు. జుట్టు ఎర్రగా అయిపోయింది. కూల్ డ్రింక్ అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం ఇచ్చిన నల్ల బనియన్, నారింజ రంగు నిక్కరు వేసుకుని ఉన్నాడు. అద్దంలో ఎవరో మెట్లెక్కి పైకి రావడం కనిపించింది.

ముత్తుస్వామి వెంటనే సర్దుకుని వేగంగా గదుల వైపు నడవడం మొదలుపెట్టాడు. 242వ గది ముందుకు వచ్చి తలుపు తట్టే ముందు ఆ రెండు అరటి పండ్లను బనియన్‌తో తుడిచాడు. తలుపు తట్టగానే షర్టు వేసుకోని ఒక లావుపాటి మనిషి తలుపు సగం తీసి నిలబడ్డాడు. ఆ మనిషి పొట్ట చూసి ముత్తుస్వామికి నవ్వొచ్చింది. ముత్తుస్వామి తల పైకెత్తకుండానే అరటి పండ్లను చాచి, ‘తేనెలా తియ్యగా ఉంటాయి, సార్. తినండి’ అన్నాడు. ఆ మనిషి ముత్తుస్వామి చెంప మీద ఒక్కటి కొట్టి ‘నాటు పళ్ళు తీసుకురమ్మంటే ఈ చెత్త ఎందుకు తెచ్చావూ?’ అని అరిచాడు.

ముత్తుస్వామికి గూబగుయ్యిమంది. పొంగుకొచ్చిన ఏడుపు ఆపుకుంటూ ‘నాటు పండ్లు లేవు’ అన్నాడు. ఆ మనిషి ‘మిగిలిన చిల్లర ఎక్కడ్రా?’ అన్నాడు. ముత్తుస్వామి తన నిక్కర్ జేబులోనుండి యాభై పైసల బిళ్ళలు రెండు తీసి ఇచ్చాడు. ఆ మనిషి వాటిని తీసుకుని చూసి, ఒక యాబై పైసల బిళ్ళను ముత్తుస్వామి చేతిలో పెట్టి తలుపు వేసేశాడు. ముత్తుస్వామి ఎంత ఆపుకోవాలనుకున్నా లోలోపలనుండి ధుఃఖం తన్నుకొచ్చింది.

ఆ యాభై పైసల బిళ్ళ మీద మూత్రం పోయాలన్నంత కోపం వచ్చింది. ఎవరైనా చూస్తున్నారా అని చుట్టూ చూశాడు. మెట్ల ఎడమ వైపునుండి తన తోటి రూమ్‌బాయ్ చొక్కు నీళ్ళ చెంబుతో నడిచి వస్తున్నాడు. ముత్తుస్వామి మూసి ఉన్న ఆ గది తలుపు వైపు చూస్తూ మనసులోనే బండబూతులు తిట్టుకున్నాడు. చొక్కు దగ్గరకు వచ్చి ‘ఏరా ముత్తుస్వామి?’ అన్నాడు. ముత్తుస్వామి కోపంతో ‘ఆ దొంగనాయాలు కొడుతున్నాడ్రా’ అన్నాడు.

చొక్కు అది మామూలే అన్నట్లు వెళ్ళిపోతుంటే, ముత్తుస్వామి ఆ యాభై పైసల్ని జేబులో వేసుకుని, ‘ఇకపై ఏ నా కొడుకు దగ్గరా పని చేయకూడదు’ అని అనుకుంటూ వేపచెట్టు కొమ్మల వైపుకు వెళ్ళాడు. చెంప ఎర్రగా కందిపోయుంటుందేమో అనుకున్నాడు. నొప్పిగా ఉంది. కళ్ళు మూసుకున్నాడు. వేపచెట్టును దాటుకుని వస్తున్న సన్నటి గాల్లో చల్లదనం నెమ్మదిగా ముఖానికి తగులుతోంది.

ఆలోచిస్తున్నకొద్దీ ఆ మనిషి రూపం మాయమై తనను కొట్టిన మగవాళ్ళు, ఆడవాళ్ళు, తాగుబోతులు, జూదరులు, పళ్ళమ్మేవాళ్ళు… ఇలా ఒక్కొక్కరూ గుర్తుకు వచ్చారు. ఆ తర్వాత అంతా మాయమై ఎండిపోయిన వేపాకులు ఎండలో చేసే శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది.

పగటి కల 2

దుకాణం కట్టేసి లాడ్జీకి నడుస్తున్న న్యూటోన్ స్టూడియో యజమాని కందప్ప, తనను ఎవరైనా వెంబడిస్తున్నారా, చూస్తున్నారా అని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నాడు. ఆయనకు యాబై ఏళ్ళకు పైనే ఉంటాయి. లాడ్జ్ ముందు నిలబడి తమలపాకులు కొంటున్నట్లు నటిస్తూ పరిసరాలను గమనించాడు. ఒకే ఒక్క పసుపు రంగు బల్బ్ వెలుగుతోంది.

ప్రతి నెలా పళనినుండి వచ్చి పటుత్వం లోపించిన మగవాళ్ళకు చికిత్స చేసే డాక్టర్ శివపతి గదిలో మసక వెలుతురు కనిపిస్తోంది. కందప్ప నెమ్మదిగా చీకట్లోనే నడిచి ఆ గది వాకిలి ముందు నిలబడి లోపలికి చూశాడు. లోపల ఎవరూ లేరు. వెంటనే లోపలికి వెళ్ళాడు, అప్పుడే ఒడియాలమ్మే మురుగేషు, మరో మనిషీ ఏదో చూర్ణం కొనుక్కుంటూ నిలబడి ఉన్నారు. కందప్ప వాళ్ళను చూసి నవ్వాడు. ఇప్పుడు డాక్టర్ ఒక్కడే ఉన్నాడు. ఆ డాక్టర్ ఎర్రగా వంద కిలోలు తూగే భారీ మనిషిలా ఉన్నాడు. ఆయన రెండు చేతులకు రెండు వాచీలు కట్టుకుని ఉండటం వింతగా అనిపించింది.

డాక్టర్, ‘ఎన్ని రోజులనుండి ఉందీ సమస్య?’ అని అడిగాడు కందప్పను. తన సమస్య అది కాదన్నట్టు నసుగుతూ, చుట్టూ చూసి తలుపు వేయబోయాడు. డాక్టర్, ‘అవేం వద్దు, చెప్పండి’ అనగానే, తటపటాయిస్తూ, తనకు పద్దెనిమిదేళ్ళకే పెళ్ళయిందని, ఇప్పుడు వయసు యాభై రెండు అని, కూతురికి కూడా పెళ్ళి చేసేశానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ వయసులో, కొద్ది నెలలుగా, పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్న సమయాల్లో తనకు కామ కోరికలు ఎక్కువగా కలుగుతున్నాయని అన్నాడు. డాక్టర్, ‘దాన్ని ఎలా తీర్చుకుంటారు?’ అని అడగగా కందప్ప సమాధానం చెప్పలేదు.

డాక్టర్ నలభై రోజులకు మందులు ఇచ్చి, షాపుకు సెలవు ఇచ్చి కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి రమ్మన్నాడు. కందప్ప ‘రామేశ్వరం వెళ్ళొచ్చా?’ అని అడిగాడు. డాక్టర్ నవ్వుతూ, ‘కోట్టయం వెళ్ళి రండి’ అన్నాడు. కందప్పకు నవ్వొచ్చింది. డాక్టర్ అది గమనించి ‘ఇదివరకే వెళ్ళారా?’ అని అడిగాడు. కందప్ప నవ్వుతూ ‘ఒకటి రెండుసార్లు ఫ్రెండ్స్‌తో వెళ్ళొచ్చాను’ అన్నాడు. ఆ తర్వాత డాక్టరు, కందప్ప చాలాసేపు పాత కథలెన్నో మాట్లాడుకున్నారు. డాక్టర్, తాను సౌరు చంద్రకు కూడా వైద్యం చేశానని, ఆమె తన దగ్గరే బంగారు భస్మం కొని తినేదని చెప్పాడు. కందప్ప బయటకు వెళ్ళేటప్పుడు రెండు లేహ్యాలు, కొంచెం చూర్ణం కొనుక్కుని వెళ్ళాడు. గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో చీకట్లో నక్కి నక్కి వస్తున్నట్టు కనిపించింది. అది ఇత్తడి పాత్రల కొట్టు దైవనాయగం అని తెలిసినా, చీకట్లో చూడనట్టు వెళ్ళిపోయాడు కందప్ప.

పగటి కల 3

తమలపాకులు నీళ్ళల్లో కడుగుతూ, ఇవాళ ఎలాగైనా ఆ చీటీపాటలవాడ్ని ఏసేయాలి అని అనుకుంటున్నాడు అబూబకర్. బీడాకోసం వచ్చే వాళ్ళ మాటలు అతని చెవిన పడటం లేదు. ఎలాగూ కొద్దిసేపట్లో వాడు ఇక్కడికి వస్తాడు, వాడితో ఏమీ మాట్లాడకూడదు… ముండాకొడుకు ఎనిమిది వేలు మోసం చేశాడు, పొత్తికడుపులో ఒకే పోటుతో అడ్డంగా పొడిచేయాలి అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ తమలపాకు కాడలని ఇత్తడి పిడి ఉన్న కత్తితో కోస్తున్నాడు. కొబ్బరికోరు, వెండి జరీ, గుల్కండ్ ఇలా ఒక్కో డబ్బానుండి కొంచెం తీసి తమలపాకుమీద చల్లుతూ వాడు వస్తున్నాడా అని చూస్తున్నాడు. దూరంగా సైకిల్ కనిపించింది. చీటీలపాటవాడు మెస్సులో భోంచేసి బీడా కోసం వస్తున్నాడు. అతని సైకిల్‌కు వేలాడుతున్న ఆకుపచ్చ రంగు తోలు సంచీ ఊగుతోంది. అతను ఏదో ఆలోచనలో పడి అబూబకర్‌ను దాటుకుని వెళ్ళిపోయాడు. అబూబకర్‌కు ఏం చెయ్యాలో అర్థంకాలేదు. తనే చప్పట్లు కొట్టి పిలిచాడు. సైకిల్ ఆపి వెనక్కి తిరిగి చూసి ‘భోంచేసి వస్తాన’ని చెప్పి వెళ్ళిపోయాడు.

అబూబకర్ చేతికి అంటుకుని కారుతున్న గుల్కండ్‌ను కూడా తుడవకుండా చీటీపాట వాడికోసం చూస్తూ ఉండిపోయాడు. ఒక ఆవు ఎండలో రోడ్డు మీద తిరుగుతోంది. చీటీపాటలవాడు రుమాలుతో చెమటలు తుడుచుకుంటూ బీడా ఇమ్మన్నట్టు చేయి చాచాడు. అబూబకర్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన చేతిలోని కత్తిని చీటీపాటలవాడి పొత్తి కడుపులోకి దించేశాడు. కారుతున్న రక్తం పంచెను తడుపుతోంది. చీటీపాటలవాడు గట్టిగా అరిచాడు.

అబూబకర్ మళ్ళీ మళ్ళీ పొడిచేసి, కత్తిని దూరంగా విసిరి పడేసి గడగబా నడుచుకుంటూ పక్కనే ఉన్న సినిమా థియేటర్‌ లోపలికి వెళ్ళిపోయాడు. ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఫ్యాన్ కింద ఉన్న సీటు చూసుకుని కూర్చున్నాడు. ఇందాకటి భయం, గాబరాలు పోయి నవ్వొచ్చింది. సినిమా మధ్యలో ఎందుకో కారణం లేకుండా తమలపాకులు ఎండలో ఎండిపోతాయన్న ఆలోచన వచ్చింది అబూబకర్‌కు. చీకట్లో తెలిసిన ముఖాలు ఎవరైనా ఉన్నారా అని చూశాడు. ఎవరూ కనిపించలేదు. థియేటర్‌లో అసలు ఆడవాళ్ళే లేకపోవడం బాధాకరం అనిపించింది. కొద్ది నిమిషాల తర్వాత లేచి నిలబడి థియేటర్ మొత్తం తనవైపే చూసేలా గట్టిగా అరిచాడు. చీకట్లో అతని గొంతు ఒంటరిగా వినిపించింది.

పగటి కల 4

రాగిణి తలుపు గడియ వేశానా లేదా అని మళ్ళీ ఒకసారి చుసుకుంది. వినాయకం బాగా నిద్రపోతున్నాడు. సేలం నుండి బయలుదేరి రాత్రి బస్సు ఎక్కి ఇక్కడికి చేరుకున్నారు. ప్రయాణమంతా అతను మాట్లాడుతూనే వచ్చాడు. ఒక్క రోజు కలిసి జీవించేసి ఆ గదిలోనే చచ్చిపోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకే ఈ ఊరికి వచ్చి ఈ చిన్న గది తీసుకున్నారు. తెల్లవారి ఇక్కడికి రాగానే ఒకసారి ఇద్దరూ కలిశారు. ఆ తర్వాత అతను బయటకు వెళ్ళి పురుగులమందు సీసా, కొంచెం బూందీ కొనుక్కొచ్చాడు. భోజనం తెప్పించుకుని తిన్నారు. తిన్న కొద్ది నిమిషాలకే అతను నిద్రపోయాడు. ఆమె కిటికీ పట్టుకుని బయట కనిపిస్తున్న రోడ్డును చూస్తోంది. ఒక టీ షాపు ముందు ముసలామె ఇనుప బకెట్‌తో నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తోంది. ఒక బేకరీ అద్దంలో వరసగా కేకులు పేర్చి ఉన్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని నడుస్తున్నారు.

ఆమె కిటికీ మూసేసి వచ్చి వినాయకం పక్కన పడుకుంది. కొద్ది నిమిషాల్లో అతని చేతులు ఆమె మీద పాకాయి. ఆమె అతని పట్టులోకి ఒదిగిపోతున్నట్టు సర్దుకుంది. ఉక్కపోతల మధ్యే అతను ఆమె మీదకు చేరి కదలుతుండగా కరెంటు పోయింది. ఆమె ఆగిపోయిన ఫ్యాన్ వైపు చూస్తూ అలా పడి ఉండిపోయింది. పక్కకు దిగిన వినాయకం మళ్ళీ నిద్రపోయాడు. ఆమె లేచి కిటికీ తీసింది. గాలి రావడం లేదు. స్నానం చేద్దామని బాత్‌రూమ్ తలుపు నెట్టింది. లోపల ఇనుప బకెట్ బోర్లించి ఉంది. ఆమె బకెట్ తిప్పి కొళాయి తిప్పింది. నీళ్ళు రాలేదు. ముఖం కడుక్కుందామని ఇంకో టాప్ తిప్పితే అందులో గాలి మాత్రమే వచ్చింది. గదిలో ఒక్క చుక్క నీళ్ళయినా లేకపోవడం ఆమెకు చిరాకు కలిగించింది.

ఆమె తలుపు తీసి ఎవరైనా రూమ్‌బాయ్స్ ఉన్నారా అని చూసింది. ఎవరూ కనిపించడం లేరు. కారిడార్ అంతా నడిచింది. అక్కడున్న అద్దంలో తనను తాను చూసుకుంది. ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. చావడానికి ముందు స్నానం కూడా చేయలేనా అని ఆత్రం, నిరాశ కలిగాయి. అన్ని గదులూ మూసి ఉన్నాయి. ఆమె తన గదికి తిరిగి వచ్చేసరికి ఫ్యాన్ తిరుగుతోంది. కానీ వినాయకం లేడు. ఆమె కంగారుగా బయటకు వచ్చి రోడ్డును చూసింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అర్థం కాలేదు. తను మెట్ల దగ్గరే నిలబడి ఉంది కదా, తనను దాటి ఎలా వెళ్ళాడు అని అయోమయంగా ఉంది. ఆమె భయంతో గబగబా గదికి తాళం వేసి మెట్లు దిగి కిందకు వచ్చింది.

ఒకవేళ వినాయకం తిరిగి ఊరికి వెళ్ళిపోయాడా? ఆమెకు వణుకు పుట్టింది. పళ్ళు కొరుక్కుంటూ వినాయకం కోసం రోడ్డంతా వెతకడం మొదలుపెట్టింది. ఇందాక పైనుండి చూసినప్పుడు టీ షాపు ముందు కనిపించిన ముసలామె స్నానం పూర్తిచేసి తన తెల్ల జుట్టును ఆరబెట్టుకుంటూ రాగిణిని చూస్తోంది. హఠాత్తుగా ఈ క్షణంలో ఆమెకు చావడం కంటే అతన్ని వెతకడం చాలా భయంకరమైన గండంలా అనిపించింది. దిక్కుతోచని దానిలా కంగారుగా నడవడం మొదలుపెట్టింది రాగిణి.

ఎండ తగ్గింది. పయనీర్ లాడ్జ్ రిసెప్షన్‌లో ఉన్న దేవుడి పటాలకు పూలు తెచ్చే ఆవిడ తన బుట్టనుండి పూలమాలను తీసి టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. సాయంత్రం వార్తా పేపర్లను పట్టుకుని రూమ్‌బాయ్స్ తిరుగుతున్నారు. అళగర్ టీ తీసుకుని వస్తూ వేపచెట్టు నీడలో పడుకున్న ముత్తుస్వామిని లేపి భోజనం చేశావా అని అడిగాడు. ముత్తుస్వామి నవ్వుతూ ‘ఇవాళ ఎగ్ బిర్యానీ బాగా లాగించి మత్తుగా పడుకున్నాను’ అన్నాడు. అళగర్ ఆశ్చర్యపోతూ ‘హాఫ్ ప్లేటా, పావు ప్లేటా?’ అని అడిగాడు. ముత్తుస్వామి నవ్వుతూ ‘హాఫ్ ప్లేటు – 25 రూపాయలు. 118 నంబరు గదికి తీసుకొచ్చి ఇచ్చాను. ఎందుకో ఆయన నాకు ఇచ్చి తినమన్నాడు. తినగానే మత్తుగా నిద్ర ముంచుకొచ్చిందని ఇక్కడికొచ్చి పడుకున్నాను. ఏదో కల కూడా వచ్చింది, సరిగ్గా గుర్తు లేదు. నువ్వు తిన్నావా?’ అని అడుగుతూ బద్దకంగా పైకి లేచాడు.

అళగర్ నవ్వుతూ, ‘నేను కూడా ఇవాళ కొంచెం బీర్ తాగాను’ అన్నాడు. అప్పుడు ఒకామె 218వ గది నుండి బయటకు చూస్తూ ‘స్నానానికి కొళాయిలో నీళ్ళు రావా?’ అని అడిగింది. ముత్తుస్వామి సమాధానం చెప్పడానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె టేబుల్ మీద ఉన్న చిల్లర్లోనుండి ఐదు రూపాయలు తీసి అతనికి ఇచ్చి షాంపూ తీసుకురమ్మని చెప్పింది. లోపలున్న వినాయకం వైపు చూస్తూ ‘వినాయకం, నీకు ఏమైనా కావాలా?’ అని అడిగింది. అతను మంచం మీద పక్కకు తిరుగుతూ ‘రెండు సిగరెట్లు కావాలి, రాగిణి’ అన్నాడు. మఱో ఐదు రూపాయలిచ్చింది. ముత్తుస్వామి ఆ మంచం వైపుకు చూస్తున్నాడు – తలగడ నలిగిపోయుంది, తెల్లటి పరుపుమీద రాలిన నల్లటి జుట్టు పడి ఉంది. ఆమె దాన్ని గమనించింది. ముత్తుస్వామి వెళ్ళాక, వినాయకం వీపు మీద కొట్టి ‘ఐదవుతోంది, లేవండి సార్’ అంది. అతను ‘నువ్వు నిద్రపోలేదా?’ అని అడిగాడు. ఆమె అద్దంలో ముఖం చూసుకుంటూ ‘కరెంటు పోయిందనికూడా నాకు తెలియదు, బాగా నిద్రపోయాను. ఏదో పీడకల వచ్చింది, అందుకే మెలకువ వచ్చింది. స్నానం చేద్దామంటే నీళ్ళు లేవు’ అంది.

ముత్తుస్వామి చేతిలో పది రూపాయలతో లాడ్జ్ బయటకు వచ్చినప్పుడు న్యూటోన్ స్టూడియో యజమాని కందప్ప వీధిలో ముఖం కడుక్కుంటున్నాడు. ఒక బక్కచిక్కిన ఆడమనిషి అతనికి చెంబుతో నీళ్ళు ఇస్తూ పక్కనే నిలబడి ఉంది. కందప్ప ఏదో ఆలోచిస్తూ నవ్వుతూ ముఖం కడుక్కుంటున్నాడు. బీడా కొట్టు అబూబకర్ ఖాళీ డబ్బాలను బుట్టలో వేసుకుని వెళ్తుంటే, కందప్ప ‘ఈ ఎండలో నిల్చునే ఎలా వ్యాపారం చేస్తావయ్యా’ అన్నాడు. ‘వ్యాపారమా నా బొందా! నిలబడి నిద్రపోవడమే మిగిలింది’ అని తన సైకిల్‌ని తోసుకుంటూ వెళ్ళిపోయాడు.

సాయంత్రం వెలుతురు రోడ్డును శుభ్రం చేస్తున్నట్లు నెమ్మదిగా కదులుతోంది. గుడికి వెళ్ళేవాళ్ళు తూర్పు వైపుకు నడుస్తున్నారు. గడిచిపోయిన మధ్యాహ్నపు ఆనవాళ్ళు లేకుండా నగరం మళ్ళీ యథావిధిగా తన హడావుడిలో పడిపోయింది.


మూలం: ఒరు నగరం, చిల పగల్ కనవుగళ్ – నడందు సెల్లుమ్ నీరూట్రు(2006) అన్న కథా సంపుటంనుండి.


అవినేని భాస్కర్

రచయిత అవినేని భాస్కర్ గురించి:

తమిళ తెలుగు అనువాదక రచయిత అవినేని భాస్కర్. ప్రధానంగా తమిళం వంటి ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. అలాగే, తెలుగు కథలను తమిళంలోకి కూడా తన అనువాదం ద్వారా అందజేస్తూ, దక్షిణ భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలుస్తూ, అవినేని భాస్కర్ గారు తెలుగు-తమిళ సాహిత్య రంగాల్ని సుసంపన్నం చేస్తున్నాడు.

 ...


ఎస్. రామకృష్ణన్

రచయిత ఎస్. రామకృష్ణన్ గురించి:

ప్రస్తుత తమిళ సాహిత్య ప్రపంచంలో ఎస్. రామకృష్ణన్ ముఖ్యమైన రచయిత. గత ముప్పై ఐదేళ్ళుగా కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, బాలల సాహిత్యం, అనువాద రచనలూ రాస్తున్నారు. సినిమాలకు కూడా రచనలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, టీవీ మాథ్యమాల్లోనూ రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటివరకు ఈయన రచనలు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఉపపాండవం, యామమ్, ఉఱుపసి, తుయిల్, నిమిత్తం, చంచారం, ఇటక్కై, పదిన్ వంటివి ప్రసిద్ధమైన కొన్ని నవలలు. భారత దేశమంతా తిరిగి ఆ జీవితానుభవాలతో ‘దేశాంతరి’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు అతి ముఖ్యమై రచనల్లో ఒకటి. ఎనదు ఇందియా, మఱైక్కప్పట్ట ఉణ్మైగళ్ వంటివి ఈయన రాసిన చారిత్రక గ్రంథాలు. తుణైయెళుత్తు, కథావిలాసం, కేళ్విక్కుఱి, సిఱుదు వెళిచ్చం వంటివి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న రచనలు. బాలలకోసం పదిహేనుకు పైగా పుస్తకాలు రాశారు. ‘ఇయల్’ సాహిత్య సంస్థవారి జీవినసాఫల్య పురస్కారం, ఠాగూర్ పురస్కారం, పెరియార్ పురస్కారం, మాక్సిమ్ గోర్కీ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ నవలా రచయిత పురస్కారాలు ఈయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని. ఈయన రాసిన ‘చంచారం’ నవలకుగానూ 2018వ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

 ...