చితుకుల పాట

వీథి వీథంతా
చేతులు కలిపి
చితుకులతో
నిప్పు పాటయ్యేవారు

అవి
వెచ్చని బతుకు క్షణాలు

చుట్టూ చేరిన
మనుషులు
కురిసే జ్ఞాపకాల సెగ
అల్లుకున్న
పొగమంచు పంజరం

కథలు పుట్టేవి
వెచ్చని రెక్కల కుర్రాడు
మంచులో మునిగిన కథ
మంచు తెర మీద విరిసిన
కాంతి పూల కథ

నవ్వులు
మొలిచేవి
మా పెద్దోళ్ళు
పాత సరదాలు చెప్పి
మా లోలోపల
చిన్న ఎండను రేపేవాళ్ళు
ఎవరు నోరు విప్పినా
పొగపూలు రాలేవి

నాలుగు దిక్కుల నుంచి
చుట్టుముట్టినా
మేం దర్జాగా కూర్చుని
వేడి వేడిగా ఉండేవాళ్ళం

చలి
కోరలు
పెరికేస్తామని
తోక ముడిచేది

 


సుంకర గోపాలయ్య

రచయిత సుంకర గోపాలయ్య గురించి:

సుంకర గోపాలయ్య గత 15 సంవత్సరాలనుంచీ కవిత్వం రాస్తున్నారు. ‘మా నాయన పాట’ పేరుతో కవితాసంకలనం వెలువరించారు. ఇది రెండు ముద్రణలు పొందింది. ‘రొట్టమాకురేవు’ అవార్డు, కవి సంధ్య, పురస్కారం పెన్నా పురస్కారం, ఇలా ప్రస్తుతానికి 12 పురస్కారాలు వచ్చాయి. అన్ని పత్రికలలోనూ సాహిత్య విమర్శా వ్యాసాలు వచ్చాయి. ‘కవి సంగమం’లో కవిత్వకాంతి శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు.

 ...