పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఇంక పోతారనగాను గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    11/13/2016 3:46 pm

    కనక ప్రసాద్ గారు,
    ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు మీరు ఈ కొద్ది పదాల్లో.

    -రవికిరణ్

  2. తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/13/2016 10:48 am

    రాముడు, మనోహర్, లలిత, కె.కె.రావు, మోహన, జిలేబీ, శ్యామలరావు గార్లకి
    నాగమురళి గారు అన్నఈ – కుకవి నింద – మీకు నచ్చినందుకు సంతోషం. నాకొచ్చిన అధమమైన తెలుగు ఎటువంటిదంటే ఈ కుకవి నింద అంటే ఏమిటో నిఘంటువులో చూసుకోవాల్సి వచ్చింది! బ్లాగుల్లో రోజూ కనబడే తెలుగు నాశనం అవుతోంది అనేది బ్లాగులు చదివే అందరికీ తెల్సినదే. ఎవరైనా ఇదేం తెలుగు అని అడిగితే నువ్వెవరివోయ్ చెవలాయ్ అనడం, లేకపోతే కామెంట్ అనుమతించకపోవడం చేస్తున్నారు. అది వాళ్ళిష్టం అనుకోండి కానీ భాష మాత్రం అలాగే ఉం(టోం)ది. అయినా పదో తరగతి తెలుగు మాత్రం వచ్చిన నేనెవణ్ణి వీళ్లకి సుద్దులు చెప్పడానికి? ఈ సుద్దులు అనేమాట కూడా ఆ మధ్య ఒకాయన నా ఈమాట కధకి కామెంట్ గా రాసారు. నా మట్టిబుర్రకి అవి గుర్తున్నా మళ్ళీ ఇలాంటివి రాస్తున్నాను. అంచేత తప్పంతా నాదే. ధన్యవాదములు+స్వస్తి

  3. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/13/2016 8:41 am

    పూజ్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యులవారి సన్నిధిని
    నమస్కారములతో,

    వ్యాసప్రతిపాదితార్థం మీ అనుమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషం కలిగింది. కావ్యోపసంహారవచనం వేమభూపాలుని మాటకు అనువర్తనమే గాని ఆంధ్రీకరణపద్ధతికి సూచకం కాదన్న అంశాన్ని నొక్కిచెప్పేందుకు నైషధీయచరితంలో అనౌచిత్యదోషారోపణ సాధ్యం కాదని వ్రాసిన మాట నిజమే. శ్రీహర్షుడు క్షేమేంద్రుని ఔచిత్యసిద్ధాంతాన్ని గుర్తెరిగి, దానిని ఆమోదించినవాడని చెప్పేందుకు నైషధీయచరితంలోనే సాక్ష్యాలున్నాయి. ఆధునికదృష్టితో చూచినప్పటి నిర్వేలములైన శృంగారవర్ణనలు తప్ప – లాక్షణికదృష్టితో అన్వయింపదగిన అనౌచిత్యాలు అందులో లేవనే ఇప్పటికీ నా అభిప్రాయం. అందులోని కథ, కథనం, శైలి, కల్పనలు మొదలైనవానిని గూర్చి సుశీల్ కుమార్ దే గారి వంటి పండితుల తీవ్రవిమర్శలన్నీ వ్యాసప్రతిపాదితానికి సంబంధించినవి కావు గనుక నేను ప్రస్తావింపలేదు.

    “చింతామణీ మంత్రచింతనఫలంబు” అన్న శ్రీ రావూరి దొరసామిశర్మ గారి పాఠస్వీకారం ఎట్లాగూ (8-203) లోని పద్యానికి విరుద్ధమే గాక శ్రుతకథావిరుద్ధం కూడా అవుతుంది. శ్రీహర్షుడు తన్మంత్రసిద్ధుడని నిరూపించే కావ్యభాగాలను జీవాతు వ్యాఖ్యలో మల్లినాథుడు వేయినోళ్ళతో మెచ్చుకొన్నాడు. వాటిని అన్వయించి చెప్పాడు. “అవామా వామార్ధే” శ్లోకానికి వ్యాఖ్యాతలు వివరించిన భాగాలన్నీ చూడదగినవే. ఆయన “చింతామణీ మంత్రచింతనపరుండు” కావటం వల్లనే ఆ రచన, ఆ అన్వయం సాధ్యమవుతాయి. “తల్లిదండ్రుల చింతనఫలం” అన్న అర్థంలో ఆ అన్వయం సార్థకం కానందువల్ల వేదం వారి పాఠమే స్వీకార్యమని చెప్పాలి. దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో నైషధం వ్రాతప్రతులు ఎక్కువగా బ్రతికిలేవు. పరస్పరవిరుద్ధాంశాలు ఏ వ్రాతప్రతిలో ఏ విధంగా ఉన్నాయో సరిచూస్తే కాని ఈ సమస్యను పరిష్కరింపలేము.

    మీవంటి ప్రామాణికులు ఈ వ్యాసాన్ని చదివి ఉండటమే నాకు గొప్ప విషయం. మీ స్పందన నన్ను ధన్యుణ్ణి కావించింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  4. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/13/2016 8:32 am

    పూజ్యులు డా. గన్నవరపు నరసింహమూర్తి గారికి
    మనఃపూర్వక నమఃపూర్వకంగా,

    ఎప్పటి వలె మేరలేని దయతో వ్యాసాన్ని చదివి, ఔదార్యంతో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నా ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. మీరు ప్రకటించిన పదకోశాన్ని దృష్టిలో నిలిపికొని, ఈ పర్యాయం మరింత శ్రద్దధానతతో వ్యాసరచన కావించే ప్రయత్నం చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. వ్యాసప్రతిపాదితం మీ ఆమోదానికి పాత్రమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది.

    యుష్మన్నిరంతరాశీరభిలాషి,
    ఏల్చూరి మురళీధరరావు

  5. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి desikachary అభిప్రాయం:

    11/13/2016 2:42 am

    పాండిత్యప్రకర్షతో తర్కకర్కశముగా సాగిన మురళీధరరావుగారి వ్యాసము ప్రశంసనీయము. ‘మాతృక’కు శ్రీనాథుని కుపలభ్యమానమైన తాళప్రతి యను అర్థమును జెప్పుట సమంజసముగానే యున్నది. కాని ‘ప్రమాదో ధీమతామపి’ అని యున్నదే కదా! శ్రీహర్షుని కావ్యము పరిపూర్ణముగా దోషరహితమను వాదన అంత బలముగా చేయవలసియుండినది కాదనిపించుచున్నది. ఎమస్కో శృంగారనైషధప్రతికి ఉపోద్ఘాతమును వ్రాయుచు విశ్వనాథవారు ‘నిజానికి, సంస్కృతకావ్యములో కొన్ని పచ్చి బూతులవలె కనిపించునవి యున్నవి. శ్రీనాథుడు వాని నన్నిటిని పరిహరించ లేదు. కొన్నిటిని శ్రీనాథుడును వ్రాసెను. ఎన్నని పరిహరించును?’ అన్నారు. కాని ఈదోషనిర్ణయము చేయు పండితు లీకాలములో నొక్కరైన ఉన్నారా అనునది సంశయాస్పదమే. ఎమెస్కో ప్రతి సంపాదకులైన శ్రీరావూరి దొరసామిశర్మగారు పూర్వముద్రితములైన 5 ప్రతులను, తమ యొద్ద నున్న తాళప్రతిని పరిశీలించి పాఠనిర్ణయము చేసినారు. వారు ‘కవిరాజరాజి’ అన్న ప్రథమాశ్వాసంలోని సీసపద్యంలో ‘చింతామణీమంత్రచింతనఫలంబు’ అన్న పాఠమునే గ్రహించినారు. దీనివల్ల దీనిని ‘చింతనపరుండు’ అని యెంచి చేసిన మురళీధరరావుగారి వివేచన కొంతవఱకు బలహీనపడుచున్నది. సంస్కృతనైషధములో ప్రతిసర్గ చివర ‘ఆనంద’ శబ్దయుతమైన శ్లోక మున్నమాట నిజమేకాని, గ్రంథాంతమున శ్రీనాథుడు వాడిన ‘పరమానందంబు నొందిరి’ అను పదమునుకు ఇది కారణమని ఇదమిత్థముగా చెప్పలేము. ప్రతి ఆశ్వాసాంతమునందును ఇట్టిపదము లేదు గదా! ఇతరకవులును (ఉదా: ప్రభావతీప్రద్యుమ్నము) గ్రంథాంతమున ఇట్టి పదమును వాడిరి. ఏమైనను ఈ వ్యాసము తర్కకర్కశముగా నున్న దనుటలో విప్రతిపత్తి లేదు.

  6. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/13/2016 1:27 am

    మిత్రధేయులు శ్రీ అనామకుడు గారికి
    నమస్కారములతో,

    మీ లేఖలోని ఆరోగ్యశ్రేయోభిలాషిత ఆ అవసరం ఎంతో ఉన్న నా మనసుకెంతో ఆహ్లాదాన్ని కూర్చింది. వ్యాసాన్ని ఆసాంతం చదివి ఔదార్యంతో స్పందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    మమ్మట-శ్రీహర్షుల బంధుత్వోదంత జనశ్రుతిని మొట్టమొదట 1877లో డా. బ్యూలర్ గారు తమ Kashmir Report లో వెలుగులోకి తెచ్చారు. అది ప్రసిద్ధికెక్కింది కాని, ఆయన దానిని చారిత్రికసత్యం కాజాలదని వ్రాసిన వివరాలు మాత్రం ఎందుకనో ప్రచారానికి నోచుకోలేదు. మమ్మటుని కావ్యప్రకాశాన్ని అధికరించి మాణిక్యచంద్రుని అద్భుతావహమైన సంకేత వ్యాఖ్య క్రీ.శ. 1159-1160 లో వెలువడింది. దాని సాక్ష్యాన్ని బట్టి కావ్యప్రకాశ రచనకు ఉత్తరావధి (terminus ad quem) క్రీ.శ. 1110 అని నిశ్చయింపబడుతున్నది. ఆధునిక విమర్శకులు ఆయన క్రీ.శ. 1050-1120 ల మధ్యకాలంలో జీవించినవాడని ఊహిస్తున్నారు. శ్రీహర్షుని జీవితకాలం క్రీ.శ. 1115-1185 (±) కాగా, నైషధీయ చరితం పన్నెండవ శతాబ్ది ఉత్తరార్ధంలో (బహుశః క్రీ.శ. 1165-1175 ల నడిమి కాలంలో) రచింపబడింది. మమ్మటాచార్యుడు క్రీ.శ. 1050 ప్రాంతాల జన్మించి ఉంటే తద్రచన నాటికి కనీసం 110-120 ఏళ్ళవాడై ఉంటాడు. గౌడదేశీయుడైన శ్రీహర్షుని కాశ్మీరకునిగా నిరూపింపదలచినవారెవరో ఈ కథను కల్పించి ఉంటారు. నైషధీయ చరితంలోని ‘తవ వర్త్మని వర్తతాం’ (2-62) అన్న శ్లోకాన్ని మమ్మటుడు, “నేనైతే ఈ విధంగా సవరించి ఉండేవాణ్ణి” అని చెప్పిన సవరణ కథ కూడా ఒకటున్నది. అదే నిజమైతే, మమ్మటునికి నైషధీయం అసలు అర్థమే కాలేదనుకోవాలి. అందువల్ల మేనల్లుని కృతిని చూసి దోషభూయిష్ఠమని వ్యాఖ్యానించటం, మినపరొట్టెల కథ వంటివన్నీ వట్టి కట్టుకథలు మాత్రమే అని మనము నిశ్చయింపవచ్చును.

    సంస్కృత సాహిత్యశాస్త్రచరిత్రలో మమ్మటుని కావ్యప్రకాశం తర్వాత ప్రబలిన విద్యారణ్యంలో అంతటి తాలోత్తాలమూర్తులు లేక స్వతఃప్రమాణంగా కావ్యదోషనిర్ణయం చేయగలవారు తక్కువైన మాట నిజమే. మీరన్నట్లు దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం కావ్యగుణాన్ని ఉత్కర్షించే కారణం కాదన్నమాట కూడా నిజమే. అయితే, శ్రీనాథుడు నైషధీయ చరితంలో రసౌచిత్యదృష్టితో “అనౌచిత్యపరిహారం” అవసరమని భావించిన మాట సత్యమే అయితే లోకంలో అంతకు పూర్వం ఏదో ఒక ఆధారం ఉండే ఉండాలి కదా. తానై సాహసించి మొదటిసారి ఆ మాటను అన్నాడని ఊహింపలేము. వ్యాఖ్యాతలో, లాక్షణికులో, విమర్శకులో కనీసం ఒక్కరైనా ఆ మాటను ప్రసిద్ధంగా పేర్కొని ఉండాలి. ఏవో కొన్ని అనౌచిత్యాలు ప్రచారంలో ఉండే ఉండాలి. అటువంటివేవీ కనబడవు. వ్యాఖ్యాతలు – మరీ ముఖ్యంగా చాండూ పండితుడు, మల్లినాథుడు పదే పదే ఆ కావ్యంలోని ఔచిత్యాలను తమ వ్యాఖ్యలలో ప్రశంసించటమే గాని ఒక్కటైనా అనౌచిత్యాన్ని ప్రస్తావించి ఉండకపోవటం మనకు తెలుసు. ఏవో కొన్ని అనౌచిత్యాలు ఉన్నాయని కనీసం లాక్షణికులు గాని, విమర్శకులు గాని ఇంతకాలంగా ఆ మాటను అనలేదు కదా! అని చెప్పే సందర్భంలో ఆ వాక్యప్రసక్తి ఏర్పడింది.

    శ్రీ అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులవారు ‘నైషధతత్త్వజిజ్ఞాస’లో అందులోని నాయికానాయకుల భౌతికశృంగారం, రతివర్ణన, రత్యంతచిత్రణ – అనుచితము, అశ్లీలము, అసభ్యము, గ్రామ్యము అని ఎన్నో ఉదాహరణలను చూపారు. ఆ ఉదాహరణలన్నీ మారిన దేశకాలపరిస్థితుల వల్ల ఏర్పడిన అభిప్రాయములే గాని వాస్తవంగా రసదోషవిమర్శకు ఉపకరింపవు. ఆధునిక కాలంలో నైషధీయ చరితం మితిమీరిన శృంగారవర్ణనల మూలాన అనౌచిత్యాలకు పుట్టినిల్లని వ్రాసినవారి వివరాలను నేను ప్రస్తావింపలేదు.

    మమ్మటునికి తర్వాత కావ్యదోషాలను సవిస్తరంగా పేర్కొన్న లాక్షణికులు ఎవరైనా ఉన్నారా? అని మీరడిగిన ప్రశ్నకు సమాధానం: కనీసం 40-42 మందికి పైగానే ఉంటారని పేర్లు స్ఫురిస్తున్నాయి. వారందరూ తత్పూర్వుల వలె మౌలికప్రతిపాదనలు చేసినవారు కాకపోవచ్చును కాని, ఉన్నారు. వేమభూపాలుని సాహిత్యచింతామణి ముఖ్యమైనదే. దేశ్యదోషవిమర్శను కలిగిన విశ్వేశ్వర దేశికుని చమత్కారచంద్రిక ఉన్నది. సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవసుధాకరంలో “అత్ర నలస్య దమయన్తీ కరస్పర్శహర్షేణ” అని తనకు నచ్చినందువల్ల శ్రీహర్షుని సగౌరవంగా ఉదాహరించాడు కాని, అనౌచిత్యాలను చెప్పినప్పుడు వేరే కవులను ఉదాహరించాడు. అమృతానందయోగి అలంకారసంగ్రహంలో అనౌచిత్యాలను పూర్తిగా తనదైన ధోరణిలో వివరించాడు. ఉదాహరణలను ఇవ్వలేదు. నృసింహకవి నంజరాజయశోభూషణం పైకి విద్యానాథుని అనుసరణగానే కనుపించినా, జాగ్రత్తగా చూసినప్పుడు కావ్యదోషప్రకరణంలో మునుపు లేని ఎన్నో కొత్త విశేషాలను చెప్పాడు. జయదేవ భోజరాజాది తత్పూర్వుల వైశేషికగుణ నిబంధరాంతరస్థ దోషాంకుశాదులను తన మాటలలో వ్యాఖ్యానించాడు. శబ్దగ్రామ్యాన్ని, అర్థగ్రామ్యాన్ని, అశ్లీలతను, కావ్యదోషాల దోషత్వానిత్యతను, అదోషత్వాన్ని సరికొత్తగా వివరించాడు. ధర్మసూరి సాహిత్యరత్నాకరం, అజితసేనుని అలంకారచింతామణి, కందలయార్యుని అలంకారశిరోభూషణం, కృష్ణావధూత మందారమరందం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రసిద్ధులు కాకపోవచ్చును గాని ప్రతివారు ఎన్నో కొన్ని తమ మాటలలో కావ్యదోషాలను నిర్వచించినవారే. లక్షణగ్రంథాలలో మూలకర్త చెప్పకపోయినా, ఉదాహరణలను ప్రదర్శించిన వ్యాఖ్యాతలు కూడా నైషధీయచరితాన్ని ప్రస్తావించినట్లు కనబడదు. వ్యాసప్రతిపాదితానికి ఈ విశేషాలతో సంబంధం లేనందున ఇంతవరకే ప్రస్తావించాను.

    మీ సహృదయస్పందనకు కృతజ్ఞుణ్ణి. శ్రీమతి లక్ష్మీదేవి గారి ఔదార్యపూర్వకమైన వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. బొమ్మల కొలువు గురించి Vanavil Kalaikoodam అభిప్రాయం:

    11/12/2016 3:31 pm

    Buy Bommala Koluvu Online
    http://www.navarathrigoludolls.com

  8. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/12/2016 2:41 pm

    పెద్దలందరికి నమస్కారం!

    నైషధీయచరితం ఒక్కొక్క సర్గాంతంలోనూ శ్రీహర్షుడు ‘ఆనంద’ ముద్రను నిలిపి ఉంచిన సంగతి సువిదితమే అనుకొంటాను. ఆయా సర్గాంతశ్లోకాలలో ‘ఆనంద’ శబ్దాన్ని నియతంగా ప్రయోగించటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సర్గాంతగద్యకు మారుగా తత్తుల్యమైన ఒక్కొక్క శ్లోకాన్ని వ్రాసి సర్గలను ముగించటం జరిగింది. తెలుగులో తిక్కన్నగారు ఈ సంప్రదాయాన్ని అనువర్తించి మహాభారతంలో ఒక్కొక్క పర్వాంతంలోనూ ‘ఆనంద’ ముద్రను నిలిపారు. ఆ తర్వాత యథావిధిగా మన సంప్రదాయం ప్రకారం ఆశ్వాసాంతగద్యను నిబంధించారు. (కొరవి గోపరాజు సింహాసనద్వాత్రింశిక కూడా ఈ ‘ఆనంద’ ముద్రాంకితమే.)

    శ్రీహర్షుని నియమాన్ని గుర్తెరిగినందువల్లనే కథోపసంహార వచనం చివర శ్రీనాథుడు “సకలజనంబులు పరమానందంబు నొందిరి” అని ‘ఆనంద’ పదాంకితంగా కథను ముగించినట్లు వ్యాసాన్ని ప్రకటించిన తర్వాత నాకిప్పుడు తోస్తున్నది. ఈ ప్రయోగం అక్కడ యదృఛ్ఛాఘటితం కాదనుకొంటాను.

    కథోపసంహార వచనం తర్వాత వేమభూపాలుని శ్లోకానుసారం కావ్యోపసంహార వచనాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం శ్రీనాథునికి తప్ప వేరొకరికి ఉండదు. స్వయంగా ఆయనే గ్రంథాంతంలో రెండు రకాల ముగింపులతో కలగలుపు ప్రతులను వ్రాయించటం జరిగివుండదు.

    తెలుగు కావ్యాలలో పెక్కింటిని వ్రాతప్రతులతో సరిపోల్చి పునఃపరిష్కరింపవలసిన ఆవశ్యకతను ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  9. ఫ్రాగ్మెంట్స్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    11/11/2016 2:47 pm

    మణి వడ్లమాని గారు థాంక్యూ అండి

  10. తెగులుకి శిక్ష గురించి k k rao అభిప్రాయం:

    11/11/2016 1:48 am

    శర్మ దంతుర్తి గారి కథ చాలా బాగుంది. ముఖ్యంగా ఏ.తె. చదివి హాయిగా నవ్వేను.