పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి రాఘవ అభిప్రాయం:

    07/08/2010 8:26 am

    ప్రస్తుతానికి శేషేంద్రశర్మగారి సాహిత్యకౌముది చదువుతున్నాను. అందులో ఆయన ఉటంకించిన

    లతాం పుష్పవతీం స్పృష్ట్వా స్నాతో విమలవారిషు పునస్సంస్పర్శంశఙ్కీవ మన్దం చలతి మారుతః

    అన్నది గుర్తొచ్చింది, ఈ కవిత చదివితే.

  2. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి C.S.Rao అభిప్రాయం:

    07/07/2010 7:54 pm

    ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.

    వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.

    ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.

    వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.

    నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.

    కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.

    ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.

  3. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    07/07/2010 7:38 pm

    అఫ్సర్ గారంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే ఆయన సౌమ్యంగా మాట్లాడడమే కాదు, మాటల్ని ఆచి తూచి వాడతారు. అలాంటి వ్యక్తి ఇలాంటి దురుసుతనంతో కూడిన వ్యాఖ్య చేస్తారని ఊహించడం కష్టం.

    అఫ్సర్ గారి దృష్టిలో అమెరికా పాఠకులన్నా, రచయితలన్నా చాలా చాలా చిన్న చూపుందని ఇప్పుడే అర్థమయ్యింది. ఇక్కడి తెలుగు పాఠకుల, రచయితల అభిరుచులన్నీ ఫ్రోజన్ బ్రతుకులని చిటికలో నిర్ధారించేసారు.
    రామారావు గారేమన్నారు? ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ పడ్డారు. అంతే ఒక్కసారి విరుచుకు పడిపోయారు క్షణంలో అమెరికాలో ఉన్న తెలుగు పాఠక, రచయితల సమూహాన్ని ఒక్క చేత్తో ఫ్రోజన్ రాటకి కట్టేసారు. ఆంధ్రాలో పాఠకోత్తముల స్వభావాలు మారిపోయాయట. రచయితలూ మారిపోయారట. వారిని అందుకోవడానికి అమెరికా తెలుగు వారికి కొన్ని తరాలు పడుతుందట. అమెరికా తెలుగు వారికి ఇదీ అఫ్సర్ గారి కితాబు.

    ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు సాహిత్యం అమెరికాలో అందుబాటులో లేదంటే నమ్మొచ్చు. ఇంటర్నెట్ వచ్చాకా తెలుగు సాహిత్యం గురించీ, పత్రికల గురించీ తెలియదంటే ఎవరూ నమ్మరు. ఏఏ పత్రికల్లో ఏఏ వాదాల సాహిత్యం వస్తుందో, ఎవరి రచనలు అచ్చవుతాయో అందరికీ తెలుసు.

    అఫ్సర్ గారు అమెరికాలో ఈ ఫ్రోజన్ సమాజాలకి దూరంగా వుంటూ ఆంధ్రాలో తెలుగు పాఠకుల మార్పుని ఎలా తెలుసుకున్నారో తెలుసుకోవాలని ఉత్సాహంగా వుంది. ఎవరికయినా ఇంటర్నెట్టూ, లేదా ఒకరిద్దరితో ఫోను సంభాషణలూ తప్పించి వేరే మార్గాలేమిటా ఆన్నది తెలుసుకోవాలనుంది. విప్లవ రచయితల్ని తిట్టే వారూ వున్నారు. ఇతర రచయితల్నీ తూలనాడే విప్లవ మేధావులూ వున్నారు. ఇందులో ఎవరికెవరూ తీసిపోలేదు. సాహిత్యం వాదాలకీ, ప్రాంతాలకీ అంకితమై పోయింది కాబట్టే ఈ ఉనికి వివాదాలూ, నడ్డి గోకుడు గ్రూపులూ పుట్టుకొచ్చాయి. ఏ వాదమయినా మంచి కవిత్వం మంచి కవిత్వమే! దానికి ఎవరి భుజాలూ, బాకాలూ అవసరం లేదు. ఆంధ్రాలో వచ్చిన సాహితీ మార్పులు తెలుసుకోలేదని అఫ్సర్ గారు ఎలా నిర్ధారణ కొచ్చారో తెలియ పరిస్తే తెలుసుకోవాలనుంది. ఇప్పటికీ అమెరికా రచయితలకంటే ఓ మెట్టు మేమే పైనున్నామన్న బలమైన అభిప్రాయం ఆంధ్రా రచయితల్లో నాటుకుపోయింది. కథయినా, కాకరకాయయినా వారే వండాలి, వడ్డించాలన్న ధోరణి బలంగా కనిపిస్తూ వుంటుంది. బహుశా ఇదే అభిప్రాయం పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న అఫ్సర్ గారికీ స్థిరపడిందా అన్న అనుమానం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.

    చివరగా “ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో!” అని బ్లాంకెట్ స్టేట్మెంటు చేసేసారు. ఇలాంటి దురుసు వ్యాఖ్యలతో సాహిత్య సాంద్రత పెరుగుతుందేమో తెలీదు.
    అఫ్సర్ గారూ మీరు మీ గురించి చెప్పండి. శ్రద్ధగా వింటాం. కవిత్వంలో విప్లవ కక్కులు ఉన్నాయని ఒక వ్యాఖ్య వస్తే మీరు అందర్నీ దూషించడం పెద్దరికం అనిపించుకోదు. చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం. కాదంటారా? మీకు శతకోటి నమస్కారాలు.

  4. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana అభిప్రాయం:

    07/07/2010 7:31 pm

    ఇక్కడ మిగిలిన పాఠకులకు ఒక చిన్న విషయం చెప్పాలి. రామారావుగారు మే 2000 ఈమాటలో ఆముక్తమాల్యదపైన ఒక దీర్ఘమైన వ్యాసమే వ్రాసారు. చదవనివారు దానిని చదివితే బాగుంటుంది. విధేయుడు – మోహన

  5. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/07/2010 7:05 pm

    కామేశ్వరరావు గారు “ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి ఎప్పుడో ముగిసిపోయిన చర్చని మళ్ళీ లేవనెత్తడం అనవసరం, కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అని తేలిగ్గా కొట్టిపారేశారు. తెలిసిన ఫలితాన్నే ఐనా కొత్త మార్గాన సాధిస్తే దాన్ని స్వీకరించటం, మెరుగులు పెట్టటానికి ప్రయత్నించటం శాస్త్రీయ పరిశోధనల్లో సర్వసాధారణమే. ఇకపోతే, కర్తృత్వం, ముఖ్యంగా ఆముక్తమాల్యద విషయంలో, అంత black and white అని నేను అనుకోను. నన్నయ గారి విషయంలోనే భారతావతారిక పద్యాలు బహుశ నన్నయ గారు రాసినవి కావు, నారాయణభట్టు రాసివుండొచ్చు అన్న పరిశోధకులు ఎందరో వున్నారు. ఇక రాయల విషయంలో కనీసం కొన్ని పద్యాలు మరెవరైనా రాసి వుండటానికి బాగా అవకాశం వుంది. ఉదాహరణకు బాగా ప్రాముఖ్యత సంతరించుకున్న –

    తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొ కండ
    ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
    దేశభాషలందు తెలుగు లెస్స

    అన్న పద్యం రాయల పద్ధతిలోది కాదు. ఇంత సరళమైన అన్వయం వున్న పద్యాలు ఆముక్తమాల్యదలో చాలా అరుదు; ఇంత సహజమైన తెలుగు ఇక ఏ పద్యంలోనూ కనిపించదు. నాకు అనిపించేది రాయలకి తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు అని; ఆయన నన్నయాదుల రచనల్ని చదివాడని నేననుకోను. ఆముక్తమాల్యదలో పూర్వ తెలుగు కవుల ప్రభావం కనిపించదు (ఒక్క కనియెన్ వైష్ణవుడు అన్న పద్యం మాత్రం అటజని కాంచె పద్యానికి కొంత దగ్గరగా వున్నట్లనిపిస్తుంది; అది పెద్దనదే కనుక రాయలు దాన్ని విని మెచ్చుకుని వుండటానికి బాగా అవకాశం వుంది; అలాగే కొంత అనుసరించటానికీ.). రాయలు ముఖ్యంగా సంస్కృతాన్ని ఆపోశన పట్టినవాడు. ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి. తెలుగు మాటలు వాడినప్పుడు అవి సానబట్టిన గ్రాంథిక పదాలు కావు, గ్రామీణ వ్యావహారికాలు. వాక్య నిర్మాణం సహజమైంది కాదు, ప్రయత్నపూర్వకం, clumsy గా వుండేది.

    నా ఉద్దేశ్యం ఆముక్తమాల్యద మొదల్లో కొన్ని పద్యాలు, మథుర నగర వర్ణన పద్యాలు బహుశ రాయలవి కావు. టూకీగా చెప్పాలంటే, తేలిగ్గా అన్వయం ఉండి, ఇట్టే అర్థమయే పద్యాలు ఇంకెవరన్నా కొంత ఎడిట్ చేసినవో లేక పూర్తిగా రాసినవో.

    ఇలాటి విషయాల గురించి పరిశోధించటానికి statistical techniques ఎంతగానో ఉపయోగిస్తాయని నేననుకుంటున్నాను.

  6. నువ్వు గురించి kavitha అభిప్రాయం:

    07/07/2010 2:35 pm

    మేఘదూత గారూ, యథాతథంగా ప్రేమికురాలి మనసు అలాగే ఉంటుంది. ఆవిడ కంఫ్యూజన్ ని బాగా చూపించారు.

  7. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    07/07/2010 2:25 pm

    కొలిచాల గారు,

    ఈ సంచిక విషయంలో రాయల గారి వ్యాసాల వరకు రమా భరద్వాజ గారి అభిప్రాయం సరిగానే అనిపిస్తుంది. ఆ విషయాన్ని ప్రక్కన పెడితే, ఈ సంచికలో వ్యాసాల్లో ఎందుకో అందరూ సామాన్య పాఠకుడ్ని మర్చిపోయినట్టనిపించింది. ఏ బి.టెక్కో, ఇక్కడ ఎమ్. ఎస్సో చేసి నాలుగు లైన్లు కోడు రాసుకునే మీ పాఠకులకి (కనీసం మెజారిటీ) మీరు సరళవైన, నాలుగు విషయాలు ప్రోవు చేసి విపులవైన (వీలైనంత) రాయల సామ్రాజ్యపు వివరణ లేదు. నిజవే మీరిచ్చిన రెఫరెన్సులు చదువుకుంటే అవన్నీ వాటిల్లో వుంటాయేవో, కానీ ఎంతమంది మీ పాఠకులకా ఓపికుంది? ఇంత వ్రాయగలిగిన మీరే రాయల రాజ్యం గురించి (ఒక్క రాయల గురించే కాక) ఒక వ్యాసం వ్రాసుంటే మాలాటి సామాన్య పాఠకులకి మరింత ఉపయోగంగా వుండేదేవో!

    అయితే మీ కష్టాన్ని తక్కువచేయటం లేదు. మా లాటి వారి ఓపికనే నేను క్వస్చన్ చేస్తున్నా, ఇంత కష్టపడి కూడా పాఠకులకి మీరు న్యాయం చెయ్యలేదేవో అని నా అనుమానం. రాయల రాజ్యంలో కాబాలేసుకున్నారా, పైమీద గుడ్డ లేకుండా వున్నారా అనేదానికన్నా, రాయల గారు హిందూ రాజ్య సంరక్షకులా కాదా అనే వాదన కన్నా, రాయల వ్యక్తిత్వం, రాయల ప్రభుత్వ నిర్మాణం, పద్దతి, ఆ కాలపు సాంఘీక, ఆర్ధిక, పరామార్ధిక అలవాట్లు, నమ్మకాలు, ఆచరణలు అవి పలాని పలాని రెఫరెన్సులు లేకుండానో (ఉన్నా కూడా వ్యాసం చివర వ్యాస సరళికి అవరోధం కాకుండా)ఒక సరళవైన వ్యాసం ఉండుంటే మాలాటి సామాన్యులకి మా మజాగా వుండేది. తెలుగుమాట వచ్చిన మనిషెవడైనా రాయలని నెత్తినే కదా పెట్టుకుంటారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    07/07/2010 2:02 pm

    రమగారు:నేను ముందుగానే చెప్పినట్లు, నా దృష్టిలో ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం వ్యక్తుల్ని ప్రముఖంగా ప్రస్తావించడం కాదు, విజయనగర చరిత్రలో ప్రకటించబడిన పుస్తకాల్ని, వ్యాసాల్ని ఒక క్రమంలో పరిచయం చెయ్యడం. ఆ విషయంలో శ్రీనివాస్ కృతకృత్యుడయ్యాడనే నా అభిప్రాయం.

    మీరు చెప్పినట్లు జయప్రభ వాక్యాలని కోట్ చెయ్యడం ఇక్కడ పూర్తిగా అనవసరం.

    సురేశ్.

  9. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/07/2010 1:33 pm

    నేను ఇలా అంటాను కొలిచాల సురేష్ గారూ!!

    మీరు జయప్రభ గారి వాక్యాలని ఇక్కడ కోట్ చేయడంలో నాకు ఏమంత లంకె కన్పించడలేదు . అలా కోట్ చేయడానికి అంతకుమించిన ఇంకేదో కారణమ్ ఉన్నట్టుగా ఉంది తప్ప . జయప్రభ గారన్నది బహుశా గతించిన సాహితీవేత్తల అభిప్రాయాలని గురించి అయి ఉంటుంది.

    చరిత్రలో ఘనమైన పరిశోధకులుగా నేలటూరి వేంకట రమణయ్య గారినో , మల్లంపల్లి సోమశేఖర శర్మ గారినో తెలుగు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. వారి ప్రధాన పరిశోధనా రంగం చరిత్ర గనక. అలా చరిత్రకి సంబంధించి బహుశా వెల్చేరు ఇంకా షుల్మన్ లని తెలుగు ప్రజలు గుర్తించరు. వారి ప్రధాన కృషి సాహిత్యానువాదాలు మాత్రమే!! అందువలన విజయనగర చరిత్రకి సంబంధించి ఇప్పటి తరం వారికి మళ్ళీ పరిచయం చేయవలసింది తెలుగులో చారిత్రక అంశాలని వెలికి తీసిన ఆ పండితులనే !! అప్పుడు కృష్ణరాయలని గురించిన ఈ ప్రత్యేక సంచికకి ఒక నిండుదనం వచ్చి ఉండేది. ఇప్పటిలా ఈ సంచిక monotonous గా ఉండేది కాదు. అలా పరిచయం చేయగల ఒక అవకాశం ఉండికూడా చేయకుండా తమ తమ రచనలతోనే పత్రికని నింపేసుకోవడం అంటే అసలు ఆ రంగంలో ఇప్పటిదాకా ఏమీ జరగకపోతే తామే చరిత్రమీద మొదటి సారిగా focus చేసి చెప్తున్న అర్ధాలు వస్తాయి. పాఠకులంతా మీమీ అంచనాల మేరకే అనుకోవలసిన అవసరం ఉండదనుకుంటాను. పైగా కొత్త తరాల ముందు అలాంటి ఒక పొరపాటు దృశ్యాన్ని ఉంచడం అంత సబబు కూడా కాదు. ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు అలాంటి పని చేయకూడనిది. ఎంత రాసినా వెల్చేరు ని గానీ షుల్మన్ ని గానీ నాకు తెలిసీ ఎవరు ” చరిత్రకారులు” గా గుర్తించరు. వారు విజయనగర చరిత్రకి సంబంధించి ఏ అభిప్రాయాలు చెప్పినప్పటికీ!!

    జయప్రభ గారి అభిప్రాయం ప్రకారమే అయితే తప్పకుండా ప్రముఖంగా ప్రస్తావన చేయవలసింది చరిత్ర రంగంలో గణనీయమైన కృషి చేసిన మహామహులని గురించి. సాహిత్యానువాదకుల చరిత్ర వ్యాసాలని గురించి కాదు.

    రమ.

  10. పసిఁడిపల్లకి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    07/07/2010 12:24 pm

    మంచి ధారతో మాధుర్యంతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.
    ఇంత పెద్ద పద్యకవిత “ఈ మాట”లో చూడడం ఇదే మొదటిసారి,నాకైతే. ఇటువంటివి అందుకొని ఆనందించే అదృష్టవంతులకన్నా అందుకోలేని ఈనాటి ఈమాట పాఠకులే ఎక్కువేమో అని అనుమానం.

    ఎన్నో ఇతర ఉపమానాలు వాడినప్పటికీ, వరుసగా మూడు పద్యాలలో పెద్దనను కవిచంద్రుడు కవిసింహుడు కవివృషభుడు అనడం వర్ణన అందాన్ని అతిశయోక్తి కబ్జా చేసినట్టుంది.

    వ్యాసునితో పోల్చిన బ్రహ్మగా తోచిన పెద్దన, కృష్ణరాయలే చతురవచోనిధి ఆంధ్రకవితాపితామహ అనిపిల్చిన కవి, రాయల అస్తమయంతో తనకు యిచ్చిన పైసలు,సంపద, చేసిన సన్మానాలే తలుస్తూ రాయలతో పోలేక జీవచ్చవంబుగా బతుకుతున్నాననడం పెద్దన తనను చిన్నగ చేసుకున్నట్లుంది.
    ఆ పద్యం పెద్దననే కాదు ఖండికను సైతం నీరుగార్చిన ముగింపు. నాకింత చేసాడనే కాని,రాజ్యానికి ప్రజకు కల్గిన లోటు ఊసెత్తకపోవడం సామాన్యులకు అలంకారమే కాని కవిచంద్రునకు మచ్చ.

    పసిడి పోయె వెంట పల్లకియును పోయె
    రాజ్యమంతరించె రాజుతోడ
    కావ్యపరిమళాలు కాంతులీనుచు నిల్చె
    పసిడి కబ్బి నట్లు పరిమళంబు
    ===========
    విధేయుడు
    _శ్రీనివాస్‌