
సంస్కృతమ్మున కన్నఁ గష్టమ్ము హెచ్చు
ఒక్క దానఁ పరిశ్రమమున్నజాలు
దాని కిద్దానికో? రెంటఁ దగులవలయు.
ఆదిభాషయందు నంతొ యింతొ ప్రవేశ మబ్బకున్న …
తెలుగునందు మీరు దిగకుడు.
(తిరుపతి వేంకటకవులు, నానారాజసందర్శనము, ఉత్తరార్ధము, 14-16)
తెలుగు భాషాసాహిత్యాలు 20వ శతాబ్దకాలంనుండి చాలా వింతైన పరిస్థితిని ఎదుర్కొంటున్నవి. 20వ శతాబ్దపు ఉత్తరార్ధానికి పూర్వం తెలుగు కవులకు, రచయితలకు విధిగా సంస్కృత వ్యాకరణం చిన్నతనంలోనే నేర్చుకోవాల్సి వచ్చేది. కాబట్టి, వారికి సంస్కృత వ్యాకరణం క్షుణ్ణంగా వచ్చేది. సాహిత్య సృజన చాలావరకు సంస్కృత కావ్యాల అనువాదంతోనే మొదలయ్యేది, కాబట్టి సంస్కృత వ్యాకరణంలోని ప్రాథమికాంశాలు అన్నీ వారికి కరతలామలకంగా ఉండేవి. విశేషణ విశేష్యాలకు లింగ, వచన విభక్తులు తుల్యంగా ఉండాలన్నది సంస్కృత భాష వ్యాకరణలక్షణాలలో ప్రాథమికమైనది. వివిధ నామవాచకాలకు అష్టవిధ విభక్తి ప్రత్యయాలు, క్రియలకు దశవిధ లకారాలు (లట్, లిట్, లుట్ మొ॥), తిఙ్ ప్రత్యయాలు, కృత్ప్రత్యయాలు, సనాది ప్రత్యయాలు మొదలైన ప్రాథమిక విషయాలు తెలియకుండా ఎవ్వరూ సాహిత్య వ్యవసాయం మొదలుపెట్టలేదు. నన్నయ తిక్కనాదులు సంస్కృత సమాసాలను వాడితే వాటిని సంస్కృతంలోవలె లింగవచనాదుల సామ్యాన్ని విశేషణ విశేష్యాలలో చక్కగా పాటించి సంస్కృత వ్యాకరణానికి భంగం కలగకుండా ఉపయోగించారు. తెలుగు ఆదికావ్యమైన మహాభారత రచనలో మొట్టమొదటి పద్యమే పూర్తిగా సంస్కృతంలో ఉంది. నన్నయ్య ప్రవేశపెట్టిన సంస్కృతసమాస భూయిష్ఠమైన రచనను పాల్కురికి వంటి ఆనాటి దేశీయ కవులు నిరసించారు. ఉభయకవిమిత్రుడైన తిక్కన, దేశి-మార్గ కవితలకు మధ్యేమార్గంగా పయనిస్తూ, చాలా విస్తృతంగా క్రొత్త తెలుగు పదాలను, పదబంధాలను సృష్టించుకొన్నాడు. సంస్కృతం ప్రయోగించినప్పుడు మాత్రం సంస్కృత భాషామర్యాదను పూర్తిగా పాటించాడు. తరువాత వచ్చిన ఎర్రన అరణ్యపర్వశేషాన్ని పూరించి నన్నయ్య ప్రవేశపెట్టిన సంస్కృత సమాసభూయిష్ఠమైన రచనను పునరుద్ధరించాడు. శ్రీనాథుడు సంస్కృత, ప్రాకృత, శౌరసేనీ భాషలను చదవటమేగాక పాతంజల మహాభాష్యాన్ని కూలంకషంగా తరచి చూసినవాడు. ఈయన కాలంలోనే తెలుగుభాషకు తెలుగు ధాతువులనుండి కొత్త పదాలను సృష్టించే సామర్థ్యం పూర్తిగా నశించిందని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ సంస్కృత సమాసాలను యథాతథంగా తెలుగులో వాడటం, అధ్యక్ష- మొదలైన సంస్కృత నామాలకు -ఇంచు తగిలించి వాటిని తెలుగు క్రియలుగా ప్రయోగించి నూతన తత్సమధాతు నిష్పత్తికి ఈయన శ్రీకారం చుట్టాడని చెప్పుకోవచ్చు. పోతన కొంత మధురమైన కవిత్వం తెలుగులో చెప్పినా, సంస్కృత భూయిష్ఠమైన సమాసమార్గాన్నే కొనసాగించాడు. తెలుగు నుడికారాలైన ‘బూడిదలో పన్నీరు’ అన్నదాన్ని భసితక్షిప్తాజ్యము అంటూ, నెమలికన్ను అన్నదాన్ని కేకిపింఛాక్షులు అంటూ సంస్కృతీకరించి తనకు గల సంస్కృత విధేయతను చాటుకొన్నాడు. ఈ రకంగా తెలుగులో సాహిత్యవ్యవసాయం చేయాలంటే, తెలుగు, సంస్కృత భాషలు రెండింటిలోనూ వ్యాకరణం నేర్చుకోవాల్సిన అవసరం తెలుగు సాహిత్య సంప్రదాయంలో భాగంగా మారిపోయింది.
ఆధునిక కాలంలో సంస్కృతం క్షుణ్ణంగా నేర్చుకొన్న తెలుగు కవులు, రచయితలు చాలా తక్కువ. 20వ శతాబ్దపు పూర్వార్ధంలో విశ్వనాథ వంటి కవులు సంస్కృతంలో కవిత్వం రాయగల శక్తిమంతులు. శ్రీశ్రీ ఛందోబందోబస్తుల్ని నిరసించినా సంస్కృతభూయిష్టమైన ఆంధ్రాన్నే ప్రయోగించాడు. మహాప్రస్థానం, భిక్షువర్షీయసి వంటి శీర్షికలే కాకుండా “నిరుపహతి స్థలేత్యాదు లనవసరం. సదా కృతిః ప్రభవతి” అంటూ దీర్ఘసంస్కృత సమాసాలను, సంస్కృత వాక్యాలను ప్రతిభావంతంగా ప్రయోగించాడు. కానీ, ఉత్తరార్ధంలో రచనలు మొదలుపెట్టిన కవులు, రచయితలలో సంస్కృత అధ్యయనం బాగా తగ్గిపోయింది. తెలుగులో క్రొత్త పదజాలం సృష్టించాలన్నా, గంభీరమైన భావాన్ని వ్యక్తం చేయాలన్నా సంస్కృత శబ్దాలను, దీర్ఘసమాసాలను ఉపయోగించే అలవాటు మాత్రం ఆధునిక తెలుగు రచయితలు వీడలేకపోయారు. తెలుగు ధాతువులతో క్రొత్త పదాలను, క్రొత్త పదబంధాలను సృష్టించే ప్రక్రియ దాదాపు 13-14వ శతాబ్దంలోనే ఆగిపోయింది కాబట్టి, కాలానికి ఎదురీది, మోడువారిన తెలుగు కుదురులను తిరిగి వికసింపజేసి అచ్చతెలుగు క్రొన్నుడులను పుట్టించే ప్రయత్నాలు చేసినవారు చాలా తక్కువ. అట్టి ప్రయత్నాలు కొంతవరకు జరిగినా వాటికి ఆదరణ తక్కువ. దాంతో, 20వ శతాబ్దంలో చాలా వింతైన పరిస్థితి ఏర్పడింది. తెలుగులో క్రొత్తగా వ్రాయాలంటే, సంస్కృత శబ్దాలను కలగలిగి క్రొత్త పదబంధాలను తయారుచేయాలి. కానీ, ఇలా తయారుచేసే కవులు, రచయితలు సంస్కృత వ్యాకరణం నేర్చుకోలేదు కాబట్టి, ఆధునిక రచనల్లో ఎన్నో, ఎన్నెన్నో అపప్రయోగాలు, అపాణినీయాలు అసంఖ్యాకంగా దొర్లుతున్నాయి. లింగ విభక్తులకు, విశేషణ, విశేష్యాలకు మధ్యన సామ్యం తరచుగా లోపిస్తోంది. పూర్వపదం అకారేతర అచ్చులకు ఇతర, ఉదయ మొదలైన పదాలు పరంగా ఉన్నపుడు రాదగని గుణసంధి రావడం కనిపిస్తోంది. సంస్కృతంలో సహజమైన కర్మణి ప్రయోగాలు తెలుగులో అసహజం కాబట్టి, తెలుగువారు కర్మణి, కర్తరి ప్రయోగాలకు తికమకపడి పూర్తిగా వ్యతిరేక అర్థం వచ్చే సంస్కృత ప్రయోగాలను చేస్తున్నారు. సంస్కృత సమాసాల మూలార్థాన్ని అవగాహన చేసుకోకుండానే, “పద్మపత్రమివాంభసా(లా) జారిపోయే” అన్న ప్రయోగాలు, భానోదయం-, రఘోత్తమ- వంటి అపసంధులే కాకుండా, శబ్దాలంకారం కోసమో, లేక సంస్కృతశబ్దప్రయోగం వల్ల వచ్చే గొప్పదనం కోసమో, సంస్కృతంలో ఏ రకమైన అర్థమివ్వలేని దీర్ఘసమాసాలను ప్రయోగించడం కోకొల్లలుగా వెలువడుతున్న తెలుగు రచనలలోనూ, అమిత ప్రజాదరణ పొందిన సినిమా పాటలలోనూ కనిపిస్తున్నాయి.
వెయ్యి సంవత్సరాలకు పైగా పెనవేసుకొన్న తెలుగు-సంస్కృత భాషల అనుబంధం విడదీయరానిది. కాబట్టి తెలుగు రచనలలో విస్తృత సంస్కృత ప్రయోగాలు తప్పనిసరి అయినప్పుడు, తెలుగులో సాహితీ వ్యవసాయం చేయాలనుకొనే రచయితలు, కవులు తాము ప్రయోగించే సంస్కృత పదాల మూలరూపం, వ్యాకరణం తెలుసుకొని వాడటం కూడా తప్పనిసరి అవుతుంది. నిజానికి సంస్కృత వ్యాకరణంలో ప్రాథమిక సూత్రాలు, సంస్కృత వ్యాకరణ పరిభాష తెలియకుండా చిన్నయసూరి వ్రాసిన బాలవ్యాకరణం అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. తిరుపతి వేంకటకవులు చెప్పినట్టు, “సంస్కృత భాషయందు అంతో ఇంతో ప్రవేశ మబ్బకున్న, తెలుగునందు రచనకు దిగకుడు,” అని చేసిన హెచ్చరిక నేటి తరానికి కాస్త కఠినంగా అనిపించినా, శబ్దదోషాలు, అపప్రయోగాలు, అన్వయదోషాలు లేని సాహిత్య సృజనకు సంస్కృత వ్యాకరణాన్ని ప్రాథమికస్థాయిలో నైనా అధ్యయనం చేయాలన్న సూచన అనుసరణీయం.