మే 2023

సాంకేతిక విప్లవం సమాజంలోని ఎన్నో రంగాలను చెప్పుకోదగ్గ రీతిలో ప్రభావితం చేసింది. సాహిత్యం దీనికి మినహాయింపేం కాదు. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇ-రీడింగ్ మునుపెన్నడూ చూడనంత స్థాయిలో పెరిగింది. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టి, ప్రపంచం యథారీతిన కొనసాగుతున్నట్టు కనిపించినా, అప్పటి ఇ-అలవాట్లు ఇప్పుడు మరింత తీవ్రంగా, మరింత బలంగా కొత్త కొత్త ముఖాలతో కనపడుతూ ఉన్నాయి. కోవిడ్ ఈ ఇ-అవసరాలను మరింత స్పష్టంగా, ఒకింత ముందుగా చెప్పిందన్న మాటే తప్ప, ఇవన్నీ ఈ రోజు కాకపోయినా రేపైనా మనం చూడవలసిన మార్పులే. మార్పు కొత్త అవసరాల నుండి పుడుతుంది. అనివార్యమవుతుంది. పుస్తకం కొనుగోళ్ళు, అందుబాటు,  చదివే అలవాట్లకు సంబంధించి, పాఠకప్రపంచం ఇప్పుడు ఎన్నో కొత్త అవసరాలతో ఉంది. వాటి వైపు దృష్టి సారించకుండా సాహిత్యాన్ని నిలబెట్టుకోగలమనుకోవడం అపోహ. ఆన్‍లైన్‌లో తెలుగు పుస్తకాల కొనుగోలు  ఇప్పటికీ తెలుగునాట చాలా మంది విద్యావంతులకి కూడా అంతగా అలవాటు కాలేదు. అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ కాకుండా, నవోదయ పుస్తకాల ఆన్‍లైన్ షాప్ తప్ప మిగతావి ఎందరికి తెలుసో కూడా అనుమానమే. ఈ సోషల్ మీడియాకు ఆవల కూడా ఒక పాఠక ప్రపంచం ఉందని గుర్తించకపోతే, మన అమ్మకాలు, కొనుగోళ్ళు, ప్రచారాలు అన్నీ ఇక్కడిక్కడికే పరిమితమైతే, మనం కొనుగోళ్ళలో ఆశించే ఊహించే అంకెలు బహుశా మనం చూడలేకపోవచ్చు. పుస్తకాలను ఎటూ ఎక్కడికీ మోసుకుపోవాల్సిన అవసరం లేకుండా, కావలసిన పుస్తకం తీరిక దొరికిన క్షణాల్లో చేతిలో తిప్పుకు పోగల సౌకర్యం నేటికి ఒక అవసరం. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ని  తనకంటూ సృష్టించుకుని, పెద్ద ఎత్తున తెలుగు ఇ-రీడింగ్ రంగంలోకి వచ్చిన కినిగె దురదృష్టవశాత్తూ మూతపడింది. పుస్తకాల కొనుగోలుకు సంబంధించి, ఇ-చదువుకు సంబంధించి, కినిగె ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు పాఠకులకు పుస్తకాలు అద్దెకు ఇవ్వడంతో సహా, ఎన్నో హంగులతో మొదలైన అట్లాంటి అప్లికేషన్ మూతపడటం అంటే, తెలుగు సాహిత్య అవసరాలకు సంబంధించి, తెలుగు పాఠకుల వినియోగానికి సంబంధించి, మన లెక్కల్లోనో అంచనాల్లోనో ప్రచారంలోనో ఏదో తప్పుందన్న అనుమానం రాకపోదు.  పాఠకుడి నుండి కినిగె ఆశించిన ఆ కాస్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా త్రోసిరాజని, ఇంకా సరళంగా, కంటికి హాయిగా ఉండేలా రూపొందించబడిన ఆప్ చదువు. అన్వీక్షికి ప్రచురణల నుండి వచ్చిన ఈ ఆప్, సహజంగానే ఈ కాలపు ఇ-రీడర్స్ అవసరాల మీద మరింత స్పష్టతతో మొదలై,  ఇ-పాఠకులను మరింతగా ఆకర్షించే దిశగా దృష్టి సారించింది. గంటల తరబడి ప్రయాణాల్లోను, తప్పని మిగతా వ్యావహారిక పనులతోనూ నిండి ఉండే మనిషికి, ఇ-బుక్స్, ఆడియో బుక్స్ ఒక వరం లాంటివి. దాసుభాషితం ఆప్ ఆ కొరత తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇంతో కొంతో పేరూ ప్రచారం ఉన్న ఈ సంస్థను కూడా ఆర్థిక కొరత ఇబ్బంది పెడుతోంది. ఇ-పుస్తకాలు, ఆడియో సాహిత్యం నేటి జీవితానికి ఒక అవసరంగా మారుతున్నాయి.  తెలుగు అంతర్జాల సాహిత్య పత్రికలు కూడా ఇప్పుడు ఆడియో వీడియో రచనలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈమాట ఎన్నో ఏళ్ళుగా అపురూపమైన ఆడియో ఫైల్స్‌ని పాఠకులకు అందించడం తెలిసిన విషయమే. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా మరిన్ని రచనలు అందుబాటులోకి తెస్తోంది. ఇన్ని మార్గాల ద్వారా ఎందుకు పాఠకుల దృష్టిని ఆకర్షించాలని ప్రశ్నిస్తే దానికి జవాబు ఒక్కటే. పుస్తకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక వాతావరణాన్ని సృష్టించడం. ఎంత విరివిగా విస్తృతంగా సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేగలిగితే వారి సాహిత్యాభిరుచి పెంచడానికి అంతలా అవకాశం ఉన్నట్టు. అంతదాకా ప్రయాణమూ పరిశ్రమా తప్పవు.