పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి గన్నవరపు నరసింహముర్తి అభిప్రాయం:

    09/12/2015 3:36 pm

    ఉత్తరోత్తరము వామను డుత్కర్షము నొందుతుంటే రవిబింబ మధోగతమౌతున్నాడు. పోతన వారి యూహ అద్భుతమే ! పోతన గారు జయరథుని వర్ణనను సానబెట్టారు. శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు పోతన వలె బహుగ్రంధశీలి, వైదుష్యవరులే గాక వారి విజ్ఞానమును మనతో పంచుకొనుటకు యత్నించుట ఆనందదాయకము. శ్రీ ఏల్చూరి వారి పద్యసమీక్షతో బాటు మిగిలిన పెద్దల అభిప్రాయాలు కూడా జ్ఞానప్రదానమై యొప్పుచున్నవి. అందఱికీ వందనములు !

  2. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/12/2015 2:19 pm

    పూజ్యశ్రీ వంకాయల శివరామకృష్ణారావు గారికి
    నమస్కారములతో,

    మీ ఆశీర్మయోదితానికి ధన్యుణ్ణి. మీరన్నట్లు పద్యంలో ఉన్నది ఏ అర్థాలంకారమైనా అది భాగవత రత్నమంజూషికలోని అన్వర్థాలంకారమే.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  3. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/12/2015 2:14 pm

    ఆత్మీయులు శ్రీ మురళీ శ్యామ్ గారికి
    నమస్కారములతో,

    శ్రీశ్రీశ్రీ సీతారామ గురుదేవులకు ఆశ్రయస్థానమైన పెదముత్తేవిలో తత్సన్నిధానవర్తులై మీరు ఉండి ఉంటారని ఊహిస్తున్నాను. మీ వంటి పుణ్యధనుల అభిమానానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  4. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/12/2015 2:04 pm

    పూజ్యతములు శ్రీ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి
    నమస్కారములతో,

    రుయ్యకుని అలంకారసర్వస్వాన్ని వ్యాఖ్యానిస్తూ విమర్శినిలో జయరథుడు సారాలంకారానికి ఉదాహరించిన శ్లోకాన్ని చదువుకొన్న పోతన గారు దానిని సారాలంకారానికి అనురూపంగానే తెలుగుచేసి ఉంటారని భావించటం సులభం. అన్యధాకృతంగా అన్వయించేటపుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఆలోచింపవలసి ఉంటుంది.

    తత్త్వతః అపహ్నవం, ఉల్లేఖం, పరిణామం, భ్రాంతిమంతం, రూపకం, సందేహం అన్నవి అభేదప్రాధాన్యం కలిగిన అలంకారాలు. ఏకావళి, కారణమాల, మాలాదీపకం, సారాలంకారం శృంఖలావైచిత్ర్యమూలకాలు. సారము, ఉల్లేఖము – రెండూ అస్ఫుటప్రతీయమానాలే. కాగా, రుయ్యకునికి పూర్వం భామహుని మొదలు మమ్మటుని వరకు గల ఆలంకారికులెవరూ ఉల్లేఖాన్ని ఒక అలంకారప్రభేదంగా గుర్తింపనే లేదు. రుయ్యకుడు తన ప్రతిభామూలాన గుర్తించి, దానికి అలంకారస్థాయిని కల్పించిననాటి నుంచి విద్యానాథాదులు, అమృతానందయోగి, తదనంతరీయులు అందరూ రుయ్యకుని సూత్రబోధనే అనుసరించారు.

    రుయ్యకుడు గుర్తించిన ఉల్లేఖముయొక్క స్వరూపం ఇది: ఒక వస్తువు వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు తీరుల గోచరించి, అన్యవస్తుప్రతీతి వలని ఆ రూపబాహుళ్యం వారిచే పరిపరివిధాల ఉల్లేఖింపబడటం జరుగుతుంది. అనేకవిధాల చూచే అనేకులు లేకపోయినప్పటికీ ద్రష్ట ఒక్కడే వస్తువును అనేకవిధాల వర్ణింపవచ్చును. ఆ రాజును మన్మథుడని స్త్రీలు, కల్పవృక్షమని యాచకులు, సమవర్తి అని శత్రువులు చూస్తారు – అనటం మొదటి పద్ధతి. ఆ రాజు ధనుర్విద్య యందు భీష్ముడు, వాక్కున బృహస్పతి, కీర్తియందు అర్జునుడు – అనటం విషయభేదం వలని రెండవ పద్ధతి ఉల్లేఖం. ఇవి రెండూ చంద్రాలోకంలో జయదేవుని ఉదాహరణలు.

    ఇది తొలినాటి ఉల్లేఖాలంకార చరిత్ర. ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు అలంకారసర్వస్వంలోని శోభాకర మిశ్రుని నిర్వచనాన్ని అనుసరించి శ్లేషమూలకమైన విషయభేదాన్ని ఈ శ్రేణిలో సరిక్రొత్తగా చర్చించాడు. శ్లేష ఉల్లేఖను పరిహరిస్తుందని కొందరంటారు.

    కాలక్రమాన ఉల్లేఖలో శుద్ధోల్లేఖం, సంకీర్ణోల్లేఖం అని ప్రభేదాలు ఏర్పడ్డాయి. సంకీర్ణోల్లేఖంలో ఫలోల్లేఖం, హేతూల్లేఖం అన్న అంతర్భేదాలు; విషయభేదంతోపాటు అధికరణభేదం వల్ల ఉల్లేఖాలంకార ధ్వని అన్నవి లక్షణజాతంలో చేరాయి. అయినా, క్రొత్తను వెంటనే ఆహ్వానించలేని విశ్వేశ్వర పండితాదులు అలంకారకౌస్తుభాదులలో ఉల్లేఖానికి ప్రత్యేకమైన అస్తిత్వాన్ని తిరస్కరించి కేవలం అతిశయోక్తిప్రభేదంగా కొట్టిపారవేశారు.

    కావ్యాలంకారసంగ్రహ వ్యాఖ్యలో శ్రీ సన్నిధానం సూర్యనారాయణశాస్త్రుల వారు పై పోతనగారి పద్యాన్ని ఉల్లేఖాలంకారానికి ఉదాహరణగా ఇచ్చిన మాట నిజమే కాని, అందుకు వారు ప్రమాణీకరించిన “గ్రహీతృభేదాభావేఽపి విషయాశ్రయభేదతః, ఏకస్యానేకోల్లేఖ ముల్లేఖం ప్రచక్షతే” అన్న శ్లోకం ఎక్కడిదో వారు చెప్పలేదు. ఆ శ్లోకం అప్పయ దీక్షితుల వారి ‘చిత్రమీమాంస’ లోనిది. అప్పయ దీక్షితుల వారు కువలయానందంలో విషయభేదంతోపాటు ఆశ్రయభేదాన్ని చెప్పిననాటి నుంచి అది పండితరాయాది ముఖ్యాలంకారికులచే ప్రచారంలోకి వచ్చింది. పోతనగారికి ఈ పరిణామక్రమం పరిచితమై ఉండదు.

    ఒకవేళ పోతనగారు జయరథుని విమర్శినినే గాక అలంకారసర్వస్వానికి శ్రీవిద్యాచక్రవర్తి రచించిన సంజీవనీ వ్యాఖ్యను కూడా చదివారనుకొన్నా, దీనిని ఉల్లేఖరూపంగా అన్వయించారనుకోవటం సాధ్యం కాదు. శ్రీవిద్యాచక్రవర్తి “యదేకం తద్ధి నానేతి గృహ్యతే రుచిభేదతః” అని వ్రాసిన దళాన్ని పోతనగారు చూచి ఉంటే, ఒకే వస్తువులోని రూపగతభేదానికి “రుచ్యాదివశ”మైన నానాత్వదర్శనాన్ని ఇందులో కల్పించారనలేము. మహాకవి కదా, తమనాటికి లేని అలంకారప్రభేదాన్ని పోతనగారు ప్రయోగించి ఉండకూడదా? అంటే, జయరథుడు చూపిన సారాలంకారపు ఉదాహరణ ఎదుట ఉండగా దానిని అన్యధాకరించి ఉల్లేఖంగా అనువర్తించి ఉండరనే ఇప్పటి నా ఊహ. రుయ్యకుడే తొలిసారి చెప్పిన ఆ ఉల్లేఖాన్ని చదువుకొన్నవారే కద!

    “రవిబింబంబు ఛత్రంబై ఉపమించుటకు పాత్రమగును” అన్న ఉపక్రమం ఎటుచూసినా విషయాశ్రయభేదతః ఉల్లేఖానికి అన్వయించేందుకు క్లేశకరమే. విషయమైన రవిబింబానికి ఏది ఆశ్రయమై ఛత్రంతో సాదృశ్యమూలకసిద్ధి కలిగింది? రవిబింబం శిరోరత్నమైనప్పుడు ఛత్రత్వకల్పన జరిగిందనీ అనుకోలేము. అందువల్ల విషయాశ్రయారోపం అక్కడ సాధ్యం కాదు.

    అసలు “రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై” అని రవిబింబానికి “ఛత్రోపమాన పాత్రత్వాన్ని” ఎందుకు చెప్పవలసి వచ్చింది? అంటే, పోతనగారు రవిబింబానికి రవిబింబపు వెలుగును, వేడిమిని అపవారించటానికే ఏర్పడిన ఛత్రాన్ని పోలికకు తెచ్చేందుకు కొంత సందేహించి, శిరస్సుపైని ఉన్నదన్నంతవరకే సరిపెట్టుకొని, సమర్థింపవలసి వచ్చిందని అనిపిస్తుంది. “ఛద = అపవారణే (ఆతపాత్) ఛాదయతి” అని రామాశ్రమి. రవిబింబం రవిబింబరశ్మిని అపవారించటానికే ఏర్పడిన ఛత్రము వలె ఉన్నదన్నమాట. లేకుంటే, “ఉపమింపఁ బాత్ర మగు” అన్న దళాన్ని విడిచి మూలశ్లోకాన్ని యథాతథంగానే తెలుగుచేసి ఉండేవారు. మరి “పాత్రత్వసిద్ధి” ఎలాగంటే, అది కేవలం రశ్మివారణోపయోగి కాదని, భగవదలంకారమైన మహైశ్వర్యలాంఛనం అని గ్రహించాలి. శ్రీమహావిష్ణువు యొక్క ఉత్తరోత్తరవృద్ధి మాత్రమే కవి మనస్సులో ఉన్నదని, తత్సమయంలో రవిబింబం సంకోచాన్ని పొందటం మాత్రమే ఉద్దిష్టమని ఊహించాలి. ఉల్లేఖానుప్రాణితమైన సారమని గాక ఒకవేళ సారముచేత అనుప్రాణితమైనప్పటికీ, ఉల్లేఖానికి పాత్రం కావలసినది శ్రీమహావిష్ణువు యొక్క బ్రహ్మాండాంత సంవర్ధనమే కాని రవిబింబముయొక్క నానారూపత్వసిద్ధి కాదు. ఇది శుద్ధోల్లేఖం కాదు. ఉల్లేఖం ధ్వనిస్తున్నదనటానికి ధ్వన్యంగత్వమూ లేదు. తత్తదవస్థలయందు వామనుని ఉత్తరోత్తరస్వరూపోత్కర్షమే చిత్రితమైనందువల్ల సారమే అలంకారం.

    ఇది నా ఇప్పటి భావన. తప్పులేమైనా ఉంటే దయతో తెలియజేయగలరని ప్రార్థన.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  5. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి భాగవత గణనాధ్యాయి అభిప్రాయం:

    09/12/2015 1:02 pm

    పరమ భాగవత శ్రేష్ఠులు, పండిత వరేణ్యుల, మా గురుతుల్యులు పూజ్యశ్రీ మురళీధర రావు మహోపాధ్యాయులకు పాదాభివందనలు. అవునండి తమరు శలవిచ్చినట్లు పోతనామాత్యుల వారు “జాతీయ మహాకవి” యే. దానికి సాధికార ప్రమాణీకరణగా తమ వాక్కు ధృవీకరించింది. మరొక్క మారు ప్రణామాలు. సంస్కృత భాగవతాతిరిక్తంగా వారు చేసిన అనువాదాల మూల శ్లోకాలను సేకరించటం; సాహిత్యారాధకులకే కాదు తెలుగు భాషకు బహుళ ప్రయోజనకరం కాగలదు అని నా భావన.

    మా “జాలజనుల” పాలిటి కల్పవృక్షం అయిన “ఈమాట” వారికి ఈ ప్రచురణకు ప్రత్యేక ధన్యవాదాలు.

    గురు వాక్యాలపై వ్యాఖ్యానించ గల వాడను కాను కాని, చిన్న మనవి చేసుకొంటాను. ఈ మహా విశ్వం పండిత పామర ఆస్వాదనీయం. ‘భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన’ కదండి. సర్వజన సౌకర్యార్థమై, మన బమ్మెర వారికి చెందిన సమస్తం ఏక స్థానంలో (లేదా లోనుండి) అందుబాటులో ఉండేలా ఉంచితే బాగుంటుంది అనే భావనతో, ఇట్టి భాగవతుల ఆశీర్వచన బలంతో, సామాన్య “జాలజనుల” వరకు అందించుటలో తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడు చేస్తున్న చిరు యత్నం తమకు తెలిసినదే అనుకోండి.. ఎలాగూ సంఖ్యాపరంగా కూడా “తెలుగు జాలజనుల”లో పండితజనులు, విజ్ఞాన విశిష్ఠులు కూడ వృద్ధిచెందుతున్నారు. ఇందు నిమిత్తం ఇట్టి విశిష్ఠతమ వ్యాఖ్యానాదులను కూడ ఒక ప్రత్యేక ఏక జాలగూడు వంటి స్థానంలో చదువరుల అనుకూల్యతతో అందిస్తే, సామాన్య జాలజనులకు కాకపోయినా, విద్యార్థులకు ప్రేరణగానూ, “భాషా పరిశోధక, పరమ భాగవత, జిజ్ఞాసా జాలజనుల”కు ప్రయోజనకారిగానూ ఉంటుందేమో.

    జాలజనుల నోటిమాట అయిన ఈమాట వారికి వందనశతాలతో, తమ ఆదరాభిమానాలు ఆశ్శీస్సులు జాలగూడు తెలుగుభాగవతం.ఆర్గ్ కు అందించ మనవి

  6. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి Sivaramakrishna Vankayala అభిప్రాయం:

    09/12/2015 11:55 am

    మాన్యులు ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాఖ్య అద్భుతంగా ఉన్నది. విచిత్రం ఏమంటే కొన్ని నిమిషాలముందే ఒక వీడియోలో వామనుడు విరాడ్రూపాన్ని ధరించి, రవిబింబాన్ని ఛత్రం తో మొదలుపెట్టి చివరికి పాదపీఠిక గా చేసుకోవడం చూసాను. ఇప్పుడు ఈ సుందర వ్యాఖ్య చూశాక నా ఆనందం పరిపూర్ణమయింది.ఇందులోనున్నది యే అలంకారమైనా, అది మొత్తం భాగవతానికే అలంకారమైనది.

  7. నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి indrakanti pinakapani అభిప్రాయం:

    09/12/2015 10:54 am

    This time I couldn’t get your meaning. May be dihhajaalamkaara is due to the undue hype you created through the little longer prologue-like svara, Prastavana or may be due to lack of rasagnyatha on my side, I am I can only see a simple sahajalamkara. May be those lopaamudra suuktha reference only making the poem peculiar.

  8. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/12/2015 9:03 am

    మాన్యులు శ్రీ దంతుర్తి శర్మ గారికి
    నమస్కారములతో,

    పధ్నాలుగవ శతాబ్ది నడిమికాలంలో వంగదేశీయులైన శ్రీధరస్వామి సంస్కృత భాగవతానికి సర్వగూఢార్థవివేచనపూర్వకంగా ‘భావార్థబోధిని’ అనే టీకారూపకమైన వ్యాఖ్యను వ్రాశారు. వ్యాసహృదయాన్ని ఆవిష్కరించడంలో వారి ప్రతిభ నిరుపమానమైనది. అమోఘమైన ఆ వ్యాఖ్య తమకెంతో మెచ్చుగొలిపినందువల్ల పోతన గారు ప్రధానంగా దానిని అనుసరిస్తూ తమ అనువాదాన్ని కొనసాగించారు. శ్రీ జంధ్యాల వారి భావం అదే.

    పోతన గారికి పురాణేతిహాసాలు, కావ్య శాస్త్ర గ్రంథాలు, వ్యాఖ్యానాలు వందలకొద్దీ అందుబాటులో ఉండినవని వారి మహానువాదం చెప్పకనే చెబుతున్నది. అందువల్ల సంస్కృత భాగవతాతిరిక్తంగా వారు చేసిన అనువాదాల మూలశ్లోకాలను సేకరించటం సాహిత్యారాధకులకు ఆనందఫలదాయకమైన కృషి కాగలదని నేనన్నాను.

    మీకు తోచిన రవిబింబవర్ణన తీరుకూడా సముచితంగానే ఉన్నది. మహాకవి పద్యం కదా.

    మీ ఆదృతికి ధన్యవాదాలు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  9. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి Sivaramakrishna Vankayala అభిప్రాయం:

    09/12/2015 7:39 am

    శ్రీమాన్ ఏల్చూరి మురళీధర రావు గారి పద్యశిల్పనిర్మాణ సామర్థ్యానికి మచ్చుతునకల్లా ఉన్నాయి పై రెండు పద్యాలూ.

  10. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి G B Sastry అభిప్రాయం:

    09/12/2015 6:15 am

    ఆకారిది క్రమంలొకాకున్నా ఒక తీరున తెలుగు పుస్తకాల ఆకార వికారాలను నాణ్యత లోపాలగూర్చి గూర్చి చాలా మందికి తెలియని విలువైన సమాచారం అందించిన వ్యాసకర్తలకు అభినందనలు.

    పుస్తకాలు కొని చదవడమన్నది చిన్నతనంగా భావించి వార్తాపత్రికలనుకూడ కొనకుండా ఎదుటివాడు చదువుతుంటె తొంగిచూస్తూ చదవడమో ఇంకొంచం చనువుతీసుకు పతాక శీర్షికలు చూసిస్తామని చేతిలోంచి ఒడుపుగా లాక్కోడాలు చేసే మనతీరు వల్ల కుసింత ధర పెంచుతె కొనే నలుగురు కొనరన్న బెంగతొ ప్రచురణకర్తల జాగ్రత్తకూడా కారణమేమొ?

    అందుకె గిరీశం నోటితొ ముళ్ళపూడిగారు బయింగ్ బుక్స్ ఇస్ వర్స్ థన్ సెల్లింగ్ గర్ల్స్ అనిపించారు కూడా!

    నాకు తెలిసి చక్కటి నాణ్యతా ప్రమాణాలతొ ప్రచురించిన కవిగా మొదటి తెలుగు పుస్తకం కందుకూరి వారి జనార్దనాష్టకం బాపు గారి బొమ్మలతొ చక్కటి రంగుల్లొ నాలుగు కాలాలపాటు ఉండె కాగితం మీద అచ్చొత్తించారు. నలభై సంవత్సరాలనుండి ఎంతొ మంది చదివినాక కూద చదవడానికి వీలుగ నిలిచింది.