పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    04/27/2008 10:29 am

    ఫిలాసఫీ, సైన్సూ, సాహిత్యం

    నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.

    శ్రీనివాస్ గారూ, లైబ్నిజ్ పేరిట ఉన్న పురస్కారాల గురించి నాకు తెలియని వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఒక్క విషయం: బ్రతుకుతెరువు కోసం లైబ్నిజ్ నానా కష్టాలు పడ్డట్లు నేను వర్ణిస్తే అది నాతప్పే. జీవితాంతమూ రాజుల పంచన బ్రతికిన లైబ్నిజ్ జీవనోపాధికి రాజుల వంశ చరిత్ర రాయవలసి వచ్చినా, బ్రతుకు బాగానే గడిచింది.

    బెర్ట్రాండ్ రస్సెల్ ఎత్తుకోవడమే లైబ్నిజ్ సార్వజనిక జీనియసే కాని స్పినోజా లాగా ఉదాత్తమైన జీవితం గడిపిన వాడు కాదని ఎద్దేవా చేశాడు! లైబ్నిజ్ చనిపోయినప్పుడు సంక్రమించిన ఆస్తి చూసి మేనల్లుడి భార్య తన్మయంతో మూర్ఛపోయిందట. ఆసక్తి కలవాళ్ళు “The Courtier and the Heretic: Leibnitz, Spinoza, and the Fate of God in the Modern World,” by Matthew Stewart చదవచ్చు.

    రాజాశంకర్ గారూ, నిజం చెప్పాలంటే, ఈ వ్యాసం తలపెట్టేముందర నాకూ లైబ్నిజ్ గురించి తెలిసింది చాలా తక్కువ. వ్యాసం పంపే గడువు దాటిపోయిందని ఓ రోజు పనికి సెలవు పెడితే, తోటి పనివాళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నావా? అన్నారు. లేదు, లైబ్నిజ్ మీద వ్యాసం పూర్తిచెయ్యాలి, గడువు దాటిపోయిందన్నాను. లైబ్నిజ్ ఎవరు? ఆయనకూ కంప్యూటర్లకూ సంబంధమేమిటి? ఇంగ్లీషులోకి అనువదిస్తే మేమూ చదువుతామే అన్నారు. సైన్సు వాళ్ళకి ముందుచూపే కాని వెనుకచూపు తక్కువ.

    మీరన్న (నేనూ అలా స్ఫురించి ఉండొచ్చు) – 12వ శతాబ్దం తర్వాత, అంటే భాస్కరుడి తర్వాత, మన దేశంలతోమధ్య యుగాల్లో చెప్పుకోదగ్గ గణిత శాస్త్రవేత్తలు రాలేదు, అన్నదాన్ని సవరించాలి. అంత పెద్ద దేశంలో కనీసం ఒక మూలన, కేరళలో, గొప్పవాళ్ళు కొందరుద్భవించారు. వాళ్ళలో మాధవుడు (1340-1425) చెప్పుకోదగ్గవాడు. కలన గణితానికి న్యూటన్ కన్నా, లైబ్నిజ్ కన్నా రెండు మూడు వందల ఏళ్ళ ముందరే బీజాలు వేశాడు. అయితే అవి వెలుగులోకి రాలేదు. అమర్త్య కుమార్ దత్త రాసిన Mathematics in Ancient India వ్యాసాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి..

    లక్ష్మన్న గారు తెలుగులో సైన్సుకి సంబంధించిన నవలలు, కథలు తక్కువన్నారు. నిజమే. సైన్సు, సాహిత్యం కలవకుండా మన సైంటిస్టులూ సాహితీకారులూ తగిన శ్రద్ధ తీసుకుంటారనిపిస్తుంది. “ఆమె కన్నులలో ననంతాంబరంపు నీలినీడలు కలవు,” అంటే ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకొని ప్రేమిస్తుందనుకుంటాం కాని, “విపర్య సిద్ధాంతాన్నెరిగిన మిలమిల లాడే కన్నులు గలదానా, ఈ సంఖ్య ఏదో చెప్పగలవా?” అంటే భ్రుకుటి ముడి వేస్తుందని మనకి భయం. అయితే ఆర్యభట్టు బీజగణితం లోని విపర్యం గురించి అలాగే బోధిస్తాడు. “ఎక్కడ బయలుదేరాం మనం? కడ కెక్కడ చేరాం మనం?” అన్నాడు బైరాగి.

    అలాగని అసలు సైన్సు ప్రస్తావనే లేదనను. వాస్తవానికి నా వ్యాసాన్ని ముందర ఇలా మొదలెట్టాను:

    “తెలుగు సాహితీవేత్తల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు రాసిన ఉత్తమ నవల “అతడు-ఆమె.” ఆ నవల మూడో భాగం లో శాంతం గారి అమ్మాయి సుభకి ఇంట్లో అమ్మా నాన్నలిద్దరూ రాజకీయాల్లో ఉండటాన ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ప్రేమలోపడే వయసు కూడాను. అవి క్విట్టిండియా ఉద్యమరోజులు. అమరవీరులనందరినీ స్మరించుకుంటూ, తనుగూడా మద్రాసులో మెరికల్లాంటి నలుగురు తెలుగు అమ్మాయిలని తీసుకొని అహింసాయుతంగా తెల్లవాణ్ణి భయపెట్టి పారద్రోలే సాహసమేదన్నా చెయ్యాలనే కోరిక సుభకి గాఢంగా కలుగుతుంది. మనుషులెవరూ లేనప్పుడు ఏదన్నా వంతెనని పేల్చేయ్యాలని నిర్ణయించుకుంటుంది.

    వంతెనని పేల్చడమంటే మాటలా? దానికి కావాల్సిన ప్రేలుడు మందు సేకరించడానికి, సివిలింజనీరయిన జనార్దనాన్ని పాత వంతెనలు కూల్చి కొత్తవాటిని ఎలా కడతారు? అని నర్మగర్భంగా అడుగుతుంది. సుభని ప్రేమిస్తున్న జనార్దనం, తన పని గురించి ఆవిడ అన్ని వివరాలు అడుగుతున్నందుకు పొంగిపోయి, వివరాలు చెప్తాడు. కాని పెద్ద పెద్ద కాంగ్రెసు నాయకులు తమ కూతుర్ని వారాలు చెప్పుకొని పైకొచ్చి గవర్నమెంటుద్యోగం చేసుకునే తనకిస్తారా అని సందేహిస్తాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, తన బ్రిడ్జీలున్నాయని సరిపుచ్చుకుంటాడు. ఓ వర్తుల పరిధి లేని డెక్ వైశాల్యం ఎలా కనుక్కోవాలా అని, ఓ క్షణం పాటు తెలియక తికమకపడి, ప్రేమలో పడి మరిచిపోయాను గాని, ఏముంది, సింప్సన్స్ ఫార్ములా పెట్టి కొట్టడమే అని వెంటనే తేరుకుంటాడు.

    “జామెట్రీ కాలెక్యులస్ / అక్కయ్యకి రెండో కానుపు / తమ్ముడికి మోకాలివాపు / … / గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యల” నుండి దూరంగా “ఒకరి నడుం ఒకరు చుట్టి / ఉల్లాసంగా తిరుగుదాం,” స్వేచ్ఛగా విహరిద్దాం అన్న కవులున్నారు కాని, ప్రేమ ఫలించకపోతేనేమాయె, నా వంతెనలూ, నా కాలెక్యులస్ ఫార్ములాలు ఉన్నాయన్న కథానాయకులు అరుదు. ఏకంగా ఇంటెగ్రల్ కాలెక్యులస్కి ఓ పేజీ కేటాయించిన సాహితీ రచన బహుశా మన భాషలోనూ మరే భాషలోనూ కూడా లేదనుకుంటాను.”

    వ్యాసం దారి తప్పుతుందేమోనని తొలగించాల్సొచ్చింది. ఈ అభిప్రాయం నా వ్యాసంలాగే చాంతాడంతయింది. ఇక ముగిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి Kameswara Rao అభిప్రాయం:

    04/27/2008 7:27 am

    రాముడు అడవికి వెళతానని తల్లికి చెప్పినప్పుడు మొదటిసారిగా కౌసల్య తన దుఃఖాన్ని బయట పెడుతుంది వాల్మీకంలో.
    “నా భర్త రాజుగా ఉన్న ఇన్ని రోజులూ నేను ఎలాటి సుఖాలూ పొందలేదు. కనీసం నువ్వు రాజువయ్యాకైనా పొందుతాననుకున్నాను! నా సవతులనించి నేనెన్ని దుర్భాషలు విన్నాను పట్టమహిషినై కూడా! నా భర్త నాకు ఏ స్వాతంత్ర్యమూ ఇవ్వక చాలా తక్కువగా చూసేవాడు. కైకేయి దాసీజనం కన్నా హీనంగా నన్ను చూసేవాడు”. ఈ మాటలబట్టి కౌసల్యకి చాలా రోజులుగానే మనసులో ఆవేదన, కైకేయి అంటే ఈర్ష్యా ఉన్నాయనే అనిపిస్తుంది. ఈ మాటలనేటప్పటికి రాముడు కైకేయి వరాల వల్లే అడవికి వెళుతునాడన్న విషయం తెలుసని కూడా చెప్పలేం.

  3. దాలిగుంటలో లీయా గురించి Sree అభిప్రాయం:

    04/26/2008 5:23 pm

    Doesn’t make any sense to me.

  4. మచ్చ గురించి Sree అభిప్రాయం:

    04/26/2008 5:20 pm

    Chala bagundi. Very different.

  5. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/26/2008 4:47 pm

    రానారె అన్నారు:
    “యాదవులు తమ కంటే తక్కువవారని భావించే ఈ ‘ఘనసింహంబులకు’ రుక్మిణి తలవంపులు తెచ్చినట్లేకదండీ? ”

    కాదండి. మన్నించాలి.
    ‘ఘనసింహాలు’ రుక్మిణి పుట్టింటి వాళ్ళు కారండి. వాళ్ళు శిశుపాలుడు, జరాసంధాది రాజులు. యదు సేనల చేతిలో బాగా దెబ్బలు తిని పారిపోతూ ఆ రాజులు శిశుపాలుడికి;

    *
    బ్రతుకవచ్చు నొదల బ్రాణంబు లుండిన
    బ్రతుకు గలిగెనేని భార్య గలదు
    బ్రతికి తీవు భార్యపట్టు దైవ మెరుంగు
    వగవవలదు చైద్య! వలదు వలదు.

    అని చెప్పేసి, వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు.
    ఒకవేళ అంతకుముందు బలాబలాలు గురించి ఏమనుకున్నా, అప్పటికి యాదవులదే పై చేయి అని తేలింది.
    శిశుపాలుడికి ఇంకా నయం రుక్మిణి నివ్వలేదు. ఆమె కృష్ణుడిని ఎంచుకుని మంచి పని చేసింది, అని రుక్మిణి పుట్టింటి వాళ్ళు అప్పటికైనా తప్పు గ్రహించుకుని , లెంప లేసుకుని ఉండరూ.

    లైలా

    * ఈ పద్యమూ పోతన భాగవతము నుంచే.

  6. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి ఎన్‌. వి. రాయ్‌ అభిప్రాయం:

    04/25/2008 10:09 pm

    ” కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు. ”

    అయ్యా, బ్రహ్మానందంగారూ! నాకు వాల్మీకి బాగా తెలీదు. అందుకని ఈ ప్రశ్న.

    ఈ పై పేరగ్రాఫు నాకు సరిగా బోధపడలేదు. కౌసల్యకు కైక అంటే పీకలవరకూ మంట, కైక వరాలు అడగకముందునుంచే ఉండటం వాల్మీకిలో ఉన్నదా? లేక సినిమాలవాళ్ళు తయారు చేసారా? మూలంలో కౌసల్యావిలాపలోఅన్న భాగంలో మాత్రమే కైకేయిని కౌసల్య దూషణభాషలాడుతుంది. అది సహజమేకదా! కొడుకుని, కోడలినీ అడవులకి తోలేస్తే, కైకని కావలించుకొని అందలానికెక్కిస్తుందా? అప్పుడు తప్ప, కౌసల్యకి పీకలవరకూ కైకపై కోపం వరాలు అడగకముందునుంచీ ఉన్నట్టు వాల్మీకిలో ఎక్కడ ఉన్నది? ఒకవేళ అది సినిమాలవాళ్ళు సృష్ఠిస్తే, అదే మీ ఉద్దేశం అయితే, మీరు రాసిన పేరగ్రాఫులో మాత్రం ఆ సూచన సూటిగా రాలేదు. మీరువేసిన ఆశ్చర్యార్థకం(!) లో గూఢంగా ఆ అర్థం ఉంటే మన్నించగలరు, మరియూ దయచేసి వివరించగలరు.
    విధేయుడు,
    ఎన్. వి. రాయ్

  7. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి రానారె అభిప్రాయం:

    04/25/2008 6:21 pm

    >> “తను నమ్మిన దానికోసం కన్న వాళ్ళని ఎదిరించి కృష్ణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించి, ఎవరికీ తలవంపు లేకుండా కార్య సిద్ధి కావించిన ధీర వనిత.”

    కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వరకూ సరే అయినా, ఆమె పుట్టినింటివారికి తలవంపులు మాత్రం తప్పలేదు కదా! రుక్మిణిని కృష్ణుడు రథమెక్కించి తీసుకెళ్తున్నాడన్నవార్త విన్న ఆమె బంధువులు కుతకుతలాడిపోతూ, తమకు రోషాలు నూరిపోసుకంటూ కృష్ణుణ్ణి నిలువరించడానికి సమాయత్తమయ్యే సన్నివేశంలోని ఒక పద్యం …

    ఘనసింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్ బాలఁ దోడ్కొని గోపకుల్ చనుచున్నారదె, శౌర్యమెన్నటికి? మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే? తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్!?
    (పద్యం నాకు సరిగా గుర్తులేక తప్పులు దొర్లి వుండవచ్చు… )

    యాదవులు తమ కంటే తక్కువవారని భావించే ఈ ‘ఘనసింహంబులకు’ రుక్మిణి తలవంపులు తెచ్చినట్లేకదండీ?

  8. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    04/25/2008 11:34 am

    లైలా గారూ,

    ‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ” అని రాసారు. మన తెలుగు సినిమా వాళ్ళ దౌర్భాగ్యం వల్ల రుక్మిణి అంటే పళ్ళెంలో తులసీ దళం, వీలున్నప్పుడల్లా కృష్ణుడి పాదాభివందనం, తల దించుకుని ఒద్దిక గా ఉన్న స్త్రీ గా చూపించారు. ఇది కేవలం సత్యభామని తలబిరుసున్న వ్యక్తిగానూ, రుక్మిణి అంటే సాత్వికంగానూ చూపించి పాత్రల మధ్య విభిన్నత చూపించే ప్రయత్నంలో రుక్మిణి పాత్రని ఖూనీ చేసి పడేసారు. రుక్మిణి చాలా ధైర్యవంతురాలే కాదు, అనుకున్నది సాధించే గంభీరమైన వ్యక్తిత్వ మున్న స్త్రీ!
    తను నమ్మిన దానికోసం కన్న వాళ్ళని ఎదిరించి కృష్ణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించి, ఎవరికీ తలవంపు లేకుండా కార్య సిద్ధి కావించిన ధీర వనిత.
    సినిమాలు చేసే చెడ్డల్లో ఇదొకటి. తీసేవాళ్ళు చదవరు. చదివే వాళ్ళు తీయరు. అందుకే ఈ అపోహలని నా అభిప్రాయం.
    రామాయణంలో కౌసల్య ని కూడా రుక్మిణిని కట్టిన గుంజకే కట్టి పడేసారు. కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  9. నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/25/2008 9:00 am

    రానారె అన్నట్లుగానే, ఈ పద్య వ్యాఖ్యానం చాలా రసవత్తరంగా ఉంది.

    “తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు.”

    పై మాటలూ సబబే.

    తిమ్మ కవి భాగవతం లో లేనేలేని ఘట్టాన్ని కల్పించే ముందే, ” కులమును రూపమున్మగని కూరిమి కలదాననంచు” రుక్మిణి, సత్యభామలు ఇద్దరి మనసుల్లో రవరవలున్నాయని మనకు చెప్పి అప్పుడు పారిజాతప్పువ్వుతో నారద ప్రవేశం చేయించి అందమైన కథ అల్లారు కదా.

    పోతన భాగవతంలో, నరకాసుర వధ తర్వాత సత్యభామతో కలిసి కృష్ణుడు దేవలొకం వెళ్ళి ఆమె అడిగితే నందనవనము నుంచి పారిజాత వృక్షము దొంగిలించి తెస్తాడు. ఒకవేళ ఆయన ఆ పని చెయ్యక పోతే సత్యభామే తెచ్చుకునేది. ఆమె విలువిద్యా కౌశలం ఎంత గొప్పదో నరకసుర వధ సందర్భంగా పోతన మనకు భాగవతంలొ చూపలేదా 🙂

    భార్యల మధ్య ఈసు అంటారా – విశ్వనాథ వ్రాసిన పీఠికలో చెప్పినట్లు, – కృష్ణుడి విషయంలో అది కొద్దిగా నమ్మటం కష్టం. భాగవతంలొ నరకాసుర వధ తర్వాత చెరసాల్లో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించి వారికి ఎన్నెన్నో బహుమానాలిచ్చి, వాళ్ళను ద్వారక పంపించి అప్పుడుకదా ఆయన ఇంద్రుడిని చూడ్డానికి వెళ్ళింది. ఆ తతంగమంతా చూసి, అప్పుడు గరుత్మంతుడినెక్కి, ఆయనతో ఇంచక్కా వెళ్ళిన సత్యభామకు, అంత ఈసు ఎక్కడినించి వస్తుంది చెప్పండి. అదీ ఒక్క పూవు గురించి.
    ఐనా తిమ్మన కవి కథ మార్చి,-సవతిని గూర్చి నారదుడి రెచ్చగొట్టే మాటలు, చెలికత్తె అవి చేరవేసినప్పుడు కలిగే చిన్నతనం – వాటినుంచీ కథ పెంచుకుంటూ రసవంతంగా కథ నడిపారు.

    ‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ”

    తెలుగు సినిమాల్లో ఆ నీరసపు నటి శ్రీరంజనితో రుక్మిణి పాత్ర వేయించి, రుక్మిణి ఇమేజ్ పాడు చేశారు. పోతన భాగవతం చదివితే ఒక చక్కని ధీర ప్రణయిని, ఆదర్శనీయమైన కథానాయిక – అసలు రుక్మిణి కనబడుతుంది గదా.

    లైలా

  10. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి meenakshi అభిప్రాయం:

    04/25/2008 7:44 am

    Hanumanth Rao Garu,
    Excellent article, I was really looking very hard to find such books/articles .
    I ‘am so happy to find your articles.
    Please keep writing . you efforts are highly appreciated.