పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. అన్నీ చెప్పగల భాష గురించి Prashant Gundavarapu అభిప్రాయం:

    03/24/2011 4:23 am

    ఈకవితలో, పద్మలతగారు అసలు ఏంచెప్పదలుచుకున్నదీ స్పష్టపడలేదు. తన కవిత్వపు భాషకి ఎంత పెంకితనముందో మొదటగా ఉపమించి చెప్పిన కవయిత్రి, ఏదీ? ఆ పెంకితనాన్ని మిగతా కవిత మొత్తం మీద ఎక్కడా చూపించనే లేదే.. మరి..ఇదేమి కల్పనా? ఏదో రాసేద్దామన్న తొందర తప్ప.. ఈ కవితలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని గురించి ఈమె ఒక నైపుణ్యాన్ని చూపించలేకపోయింది. శ్రీరామ్మూర్తిగారన్నట్టూ.. ఇది ఒక అతిమామూలు వ్యక్తీకరణ. “అన్నీచెప్పగల భాష” లోంచి ఏమీ చెప్పలేకపోవడమే ఈ కవిత ప్రత్యేకత అంతా! ఎందుకంటే, ఈ కవితలోని ఉపమానాల్లో ఒక పొందిక లోపించింది. ఈమె తన కవిత మొదట్లో చెప్పుకున్నట్టు తనది” పెంకితనమైన భాషే” అయితే గనక, దాని వ్యక్తీకరణే వేరు. దాని పదునే వేరు. కానీ ఈ కవిత ఊహ చాలని భావాల కలగలుపు .పాపం “ఈమాట” వారు ఏదో కొత్తవారిని ప్రోత్సహించాలని వేసినట్టుంది దీన్ని.

    కొంపదీసి, ఇలాంటి అనేక కవితల సంకలనమేనా ఏమిటి.. ఈ “అనేక పదేళ్ళ కవిత్వ సంకలనం” ఎవరా ప్రచురణకర్తలూ? అయితే, తెలుగు కవిత్వ పాఠకుల నెత్తిన ఇలాంటివి, పైగా అనేక పదేళ్ళవి… ఎన్నో ఘాటైన మొట్టికాయలేనన్నమాట.

    ప్రశాంత్ .

  2. కాలనీ భోగి గురించి Satya Petluri అభిప్రాయం:

    03/23/2011 10:20 pm

    రైల్వే కాలనీలు సహజంగా నానాజాతి సమితులు. హైదరాబాద్ కన్నా రామకృష్ణ గుంటూరు జిల్లా వాడు అయ్యే అవకాశం ఉంది.అదే ఉద్దేశం అండి !!

  3. మేఘాంగన గురించి desikachary అభిప్రాయం:

    03/23/2011 10:19 pm

    జి.సి.యస్.సిద్ధార్థగారు నా పద్యాలనుగుఱించి అనేకవిమర్శనాత్మకాభిప్రాయములను వెలిబుచ్చినారు. ఇవన్నీ పదస్వరూపం గ్రహించకనో, పద్యాలను జాగ్రత్తగా చదివి సరిగా అర్థం చేసికొనక పోవడంవల్లనో జనించిన అసమం జసమైన విమర్శనలని నా అభిప్రాయం. ఈవిధమైన విమర్శనలును విస్మరించితే వారి దృక్పథమే సరియైనదనే అభిప్రాయం ఇతర పాఠకులకు కలిగే ప్రమాదమున్నది. అందుచే వారి విమర్శలకు తగిన వివరణ నిక్కడ నేనిస్తున్నాను.

    1. “ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని” అన్నపాదములో “ఆసవమూని” అన్నది “ఆసవమాని” గా సరిదిద్దాలి. ఊని అంటే ధరించు, అదుము అని అర్థాలు. ఆను అంటే త్రాగు అని అర్థము (నాకు తెలినానంతవరకు).

    వివరణ: “ఆసవమాని” అన్నదే సరియైనది. “ఆసవమూని” అన్నది వ్రాతదోషం.

    2. “సాంయాత్రికోపమానం సరిగ్గా అతకలేదు. గగనంలో మేఘాలకీ అభ్దిలో సాంయాత్రికులకీ మధ్య సామ్యం బాగా కుదరలేదని నా అభిప్రాయం. ఆ పద్యనిర్మాణంలో లొసుగు కూడా అక్కడే ఉంది.

    వివరణ: ఈ పద్యాన్ని సరిగ్గా అన్వయం చేసుకొనలేకపోవడంవల్ల జనించిన సంశయమిది. “గగనాబ్ధిలో న సాంయాత్రికులట్లు” – అంటే ఆకాశమనే సముద్రంలో చరించే మేఘాలు సముద్రంలో చరించే సముద్రవర్తకులలాగా ఉన్నాయని ఉపమానం. “సాంయాత్రికః పోతవణిక్” – అని అమరం. ఆకాశం సముద్రాన్ని పోలితే అందులో చరించే మేఘాలు ఆ సముద్రంలో ఓడలపై చరించే వర్తకుల లాగ ఉన్నాయని భావం. గగనాన్ని అబ్ధితో పోల్చడం సర్వసామాన్యం. “పోతవణిక్” అనే వివరణ ఇక్కడ ముఖ్యం. వర్తకులు లోనున్నా, పైకి కనపడేవి ఓడలే. అట్లాగే మేఘాలున్నాయని లక్షితార్థం.

    3. “లేఖకాపేటి” పద స్వరూపం, దానికీ చిత్రకారుడికీ సంబంధం ఏంటో అర్థం కాలేదు.

    వివరణ: పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది. ఆలేఖ్యము = చిత్రము, ఆలేఖకుడు = చిత్రకారుడు, ఆలేఖనము = చిత్రరచనము,ఆలేఖకాపేటి = painter’s toolbox. కాని ఆలేఖకపదం పుల్లింగంలో అకారాంతం కావడంవల్ల, ఆలేఖికా అనే స్త్రీలింగరూపం ఆకారాంతం కావడంవల్ల పై సమాసాన్ని ఆలేఖికాపేటి అని మారుస్తే వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. అప్పుడు చిత్రకారిణి toolbox, or painter’s toolbox in general అని జాతివాచకంగా చెప్పుకోవచ్చు.

    4. బ్రతిరచించు అనేది ప్రామాణిక శబ్ద ప్రయోగమేనా –

    వివరణ: నిస్సందేహంగా. ప్రతిరచనము అంటే ఉన్న రూపానికి ప్రతిగా, అంటే దాని ప్రతిబింబంగా రచించడం. “ప్రతిసృష్టి” వంటి పదం. ప్రతి అనే అవ్యయానికి అనేకార్థా లున్నాయి. ఈ “ప్రతిరచన” “ప్రతిసృష్టి”, “ప్రతిబిమ్బం” వంటి పదాలలో ఇది సదృశార్థంలో, అంటే తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన, తత్తుల్యమైన మూర్తి అనే అర్థాలలో వర్తిస్తుంది. “పరిజ్ఞానే, పదప్రాప్తౌ, కాలహృత్యాం, నివారణే, వ్యళీకావిష్కృతౌ, తుష్టౌ, సేవాయాం, నిష్క్రమేపి చ, ప్రోత్సాహే చా వినాభావే, విఘ్నాఙ్గీ కారయోరపి, వ్యావర్తనే, వినిమయే, పునరావర్తనేపి చ, వైపరీత్యే, వినిద్రత్వే, అవేక్షాక్షేపయోరపి. సంక్షేప స్పర్ధ సాదృశ్యే, స్వీకారాభ్యవహారయోః, ఉత్తరస్తోకయత్నేషు” – అని “ప్రతి” అను అవ్యయం వివిధపదాలకు చేర్చినపుడు కలిగే అర్థపరిణామాలు చెప్పబడ్డవి.

    5. క్రింది పద్యభావం అసమగ్రం (తరువాతి పద్యంతో అన్వయం క్లిష్టం)
    అమరగఁ గేశపాశముగ శ్యామలనీరదఖండమొండు వ
    క్త్రమువలె నొక్క శ్వేతజలదంబు రహింపఁగ గాత్రవల్లిపై
    నమరిన పీతవర్ణకలితాంచలశోభితరోహితాంశుకో
    పమమయి మిశ్రవర్ణయుతవారిద మొక్కటి తారసిల్లఁగన్.

    వివరణ: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ యిది. ఈ పద్యానికి ముందు గల పద్యంలోని
    “కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
    మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
    నమరుచుం గననయ్యె నయ్యంబరాన.”

    మేఘవిద్యోతితమైన తరుణీరూపాన్ని “అమరగఁ గేశపాశముగ” అనే ఈ పద్యం విస్తరించి, మేఘాలవల్ల ఆ స్త్రీరూప మెలా ఏర్పడిందో రమ్యంగా తెలుపుతుంది. దీని తరువాతి పద్యం

    పరమేష్ఠినిఁ బనిగొనకయె
    పరమాద్భుతముగ సృజింపఁబడిన తదీయాం
    బరవిలసితవరవర్ణినిఁ
    బరికించుచు నక్కజంబు పర్విన మదితోన్.

    పై రెండు పద్యాలలోని భావాలను సంక్షేపిస్తుంది. ఈ మూడుపద్యాలను సక్రమంగా అన్వయించుకొనకపోవడమే పై ఆక్షేపణకు కారణమైంది.

    6. “కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?

    వివరణ: ఇది వైకృతపదం కాదు. శుద్ధమైన సంస్కృతపదం. కేళీ – కేళికా, అట్లే కాశీ – కాశికా, మల్లీ – మల్లికా, ఝిల్లీ – ఝిల్లికా, కాళీ – కాళికా . “కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి” – అని శ్రీనాథప్రయోగం. ఆకారాంతమైన కేళికాపదానికి (హ్రస్వ) అకారాంతమైన కేళిక వైకృతరూపం. అందుచేత ఈ ఆక్షేపణ నిరర్థకం. అన్వయం: కాలాఖ్య= కాలమనెడి, బాలక = బాలకునియొక్క, కేళికా= (బంతి) యాటవలన (యందు) , తాడిత= కొట్ట (తన్న)బడిన, కమనీయ = అందమైన, రోహిత = ఎఱ్ఱనైన, కందుకంబొ = బంతియో! అనగా, కాలమనెడు బాలకుడు బంతియాట ఆడుచు దిశాంతమునకు తన్నినట్టి ఎఱ్ఱని బంతివలె అస్తంగతుడగుచున్న సూర్యు డున్నా డని భావము. కొట్టి (తన్ని)నపుడు బంతి పైకెగిరి ఆ తర్వాత భూపతితమైనట్లు, అప్పు డాకాశంలో కొంత ఎత్తుగా నున్న రవి త్వరలో పశ్చిమాబ్ధియందు బడనున్నాడని ఇందులో ధ్వని.

    7. క్రింది ఉపమానం సరైందేనా? ఊగడానికి తిరగడానికీ లంకె ఒప్పుతుందా?

    “మందమారుతచాలితామ్రతరుశాఖ
    కరణి నల్లన నేనందుఁ దిరుగుచుండ.”

    వివరణ: ఈ అనుమానం నిరర్థకం. ఉపమాన, ఉపమేయాలకు సమానధర్మం చలనం. అన్యవస్తుప్రేరణ ఈ చలనానికి ఉభయత్రాకారణం. ఉపమానం మారుతచాలితమైనది. వనసందర్శనకుతూహలచాలితమైనది ఉపమేయం. ఈరెంటికీ అన్యవస్తుప్రేరితమగుట, చలించుట సమానధర్మములు. అంతే కాని, “తరుశాఖ” కూడ మనిషివలె నడువడం లేదే అని శల్యపరీక్షచేయడం విరసత్వానికి నిదర్శనం.

    8. “ముఖేందుబింబమును నల్పపు మేఘములట్లు గ్రమ్మె” – ఇందులో అల్పపు మేఘాలా? నల్పగు మేఘాలా? అల్ప శబ్దాన్ని పరిమాణార్థంలో కవి విరివిగా వాడుతున్నారు. అది సరికాదేమో!

    వివరణ: ఈ అనుమానం నిరర్థకం. ఇది అల్పపుమేఘమే కాని నల్పగు మేఘము కాదు. “స్తో కాల్ప క్షుల్లకా స్సూక్ష్మం శ్లక్ష్ణం దభ్రం కృశం తను” – అని అమరం. అల్పము + మేఘము = అల్పపుమేఘము – కర్మధార యంబులందు “పు, ‌ంపు “లగు – అను సూత్రప్రకారము “అల్పము” “అల్పపు”గా మారినది. ఇక్కడ దీనికి సూక్ష్మమైన మేఘము, అంటే – ఆచ్ఛాదితవస్తువును పూర్తిగా తిరోహితం చేయకుండా, మసకగా కనపడేట్టు కప్పిన పలుచనైన మేఘము అని అర్థం. అట్లే ఆ స్త్రీముఖం గూడ విచారగ్రస్తమై, కొంత కళ దప్పియున్న దని భావము.

    8. “వినిపించెను తత్కారణ
    మును నీగతి నక్కజంబు వొడమఁగ నాకున్.”- ఏ గతి?

    వివరణ: పై అనుమానం నిరర్థకం. “ఈ గతి” అంటే “వక్ష్యమాణప్రకారం” ముందు చెప్పే ప్రకారం అని అర్థం. ఆగతి యేదో అనుస్యూతంగా తరువాతి పద్యంలో చెప్పనే చెప్పబడింది.

    9. ఈ క్రింది పద్యం మొదలుకు తుదిలేదు అని నాకనిపిస్తుంది.
    “ఒక గంధర్వుఁడు మేఘమాలికలలో నూహించి నీరూపమున్
    బ్రకటోత్సాహముతోడ నీవు గల యారామస్థలిం జేరి నీ
    మొకమం దావృతమైన వంత గెడపం బూనం గలా డప్పుడే
    వికలంబౌను మదీయశాప, మిటకు న్వీతెంతు వీ వంచవై”

    వివరణ: పద్యాన్ని అర్థంచేసికొనక చేసిన ఆక్షేపణ ఇది. “ఒక గంధర్వుడు అని ముదలైన వాక్యం “గెడపం బూనం గలాడు” – అనే క్రియతో అర్థవంతంగా సమాప్తమైంది.

    10. “ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి / అన్యపురుషునితోడ మాటాడి నేను” – ఇది సాంకేతికంగా ఒప్పే కాని ఆడ హంస అలా అంటే పెడార్థం తీయడానికి ఆస్కారం కలిగించడం లేదూ?

    వివరణ: దేనికైన పెడ అర్థం తీయవచ్చును. ఎదుట గన్పడినది పురుషుడు గావున పురుషునితో మాట్లాడి బహుకాలమైనది అన్నది. అట్లే పురుషుని బదులు స్త్రీ కనపడి ఉంటే స్త్రీతో మాట్లాడి బహుకాలమైన దని ఉండేది. అంతేకాని ఆ మాటకు వక్రభాష్యంచేయడం అనవసరం.

    11. గంధర్వపతియే తన పతి అని నిర్ధారణ కాకుండానే అతని కౌగిల్లో వాలిపోతుంది హంసి – అన్య పురుషుని కోసం మొహం వాచినదానిలా. ఎందుకో?

    వివరణ: ఆ సంఘటన యాదృచ్ఛికంగా, దైవికంగా జరిగిందని సరిపెట్టుకోవాలి గాని, దానికీ వక్రభాష్యం చెప్ప రాదు. ముందే గంధర్వుడు పతి అని చెప్పితే కథలోని Suspence , పట్టు పూర్తిగా తప్పిపోతుంది.

    12. “నాకుఁ దెలియ దేరీతి గంధర్వరూప మబ్బెనో కాని” అని భలేగా కవికి కారణం చెప్పకుండా తప్పించుకున్నాడు హంసవతంసము.

    వివరణ: కథలో కొన్ని అంశాలు గుప్తంగా ఉంచుతేనే Suspenseful గా ఉండి కథ రాణిస్తుంది. ఐనా ఆ గంధర్వునికి పూర్వజన్మపరిజ్ఞానం ఉందనికూడ అనుకోలేము. “ధాతృకుటుంబిని మాదుమేలుకే యీ పథకంబుఁ బన్నెనని యెంచి” –అన్న వాక్యంలోని ఆంతర్యం సరస్వతీదేవి ముందుగా కోపగించినా, శాపానంతరం హంస మిథునం కలిసి ఉండాలనే పైవిధమైన శాపవిమోచనపథకం కల్గించిందని, అందుచేత దైవికమైన ఘటనగా ఆమె ఆ గంధర్వునిఆశ్లేషించిందని, ఈ విషయం సర్వజ్ఞురాలైన సరస్వతీదేవికి తెలిసినా, హంసమిథునానికి అంతవఱకు తెలియదని . భాగవతంలో చెప్పినట్లుగా, నవవిధభక్తిస్వరూపాలలో ప్రముఖమైన “తదంఘ్రి” సేవాభాగ్యము మఱల కలిగిందని ఆ హంసమిథునం తృప్తి. ఇదియే లైలాగారు లేవదీసిన అంశానికి గూడ జవాబు.

  4. మేఘాంగన గురించి desikachary అభిప్రాయం:

    03/23/2011 9:57 pm

    ‘కఱ్ఱచట్రంబుపై” అన్న పద్యం తేటగీతి. ఈ పద్యానికి ప్రాసనియమం లేదు. పద్యచ్ఛందస్సును సరిగా గుర్తించలేక పొరపడుతున్నారు మీరంతే కాని, పద్యరచనలో దోష మేమీ లేదు.

  5. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/23/2011 2:10 pm

    ఆంధ్రభారతి ద్వారా అంధ్రభారతి కి శేషతల్పశాయి గారు మంచి సేవ చేస్తున్నారు. వారి సైటుని ఇప్పుడే చూసాను. నేను చెప్పిన ” శబ్దార్ధ దీపిక” చాలా ముఖ్యమైన నిఘంటువు. శబ్దరత్నాకరం కన్నా కూడా… చాలా ఉపయుక్తమైనదీను. దానిని ఎవరూ పునర్ముద్రించడమూ లేదు. ఎవరైనా ఈ నిఘంటువుని గురించి తప్పక వెతికి కంప్యూటరైజ్ చేసేందుకు ప్రయత్నించాలి. శాయి గారూ !! దీనిని నేను చూసాను. ఎన్నో నిఘంటువులకన్నా ఇది ఎంతో మేలైనది. దీనిని కూడా మీరు చేర్చండి. మీ ఆంధ్రభారతిలో. అప్పుడు ఎక్కువ మేలు కలుగుతుంది అర్ధాలు తెలుసుకోదలిచిన వారికి. ముసునూరి వేంకటశాస్త్రి గారు ఈ నిఘంటువుని రూపొందించిన వారు. సికింద్రాబాదులో అచ్చయ్యింది 1957 లో. సుమారు ఒక 1500 పేజీల ఉద్గ్రంధం ఇది. ఇదివరకు ఒక సారి నేను దీని ప్రస్తావన ఈమాట లో చేసాను కూడాను. అయితే ఇవాళ ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు. మీరు తప్పక ప్రయత్నించ గలరు. ఆంధ్రభారతిని గురించి చెప్పిన మోహనగారికీ..శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. గొర్తి బ్రహ్మానందం గారూ, “శబ్దార్ధ దీపిక” మీ దగ్గర తప్పక ఉండాల్సిన నిఘంటువు సుమా !!

    రమ.

  6. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/23/2011 12:55 pm

    అందరికీ,

    శ్రుతిపేయంగా మార్చమని సంపాదకులకి మనవి చేసుకుంటున్నాను.
    శ్రుతపేయం అని రాసాను. అది నా పొరపాటే! ఈ చర్చ వల్ల రాళ్ళపల్లి వారి వ్యాసాలన్నీ మరలా తిరగేసాను. ఆయన శ్రుతిపేయమనే రాసారు.
    తప్పును సరిదిద్దినందరికీ కృతజ్ఞతలు!

    -బ్రహ్మానందం

  7. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి మోహన అభిప్రాయం:

    03/23/2011 12:11 pm

    రమగారు, శ్రీ శేషతల్పశాయిగారి కృషివలన తెలుగు నిఘంటువును పదాలకు, వాటి ప్రయోగాలకు పరిశోధించడానికి వీలవుతుంది. వారి ఆంధ్రభారతి సైటులో ( http://www.andhrabharati.com/dictionary/index.php ) ఈ పరిశోధనను చేయవచ్చును. విధేయుడు – మోహన

  8. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/23/2011 12:11 pm

    ఆంధ్రభారతి నిఘంటువు శోధన లింకు ఇక్కడ.
    శబ్దార్థ దీపిక నిఘంటువు ఇంకా కంప్యూటరీకరించబడలేదు.

  9. మేఘాంగన గురించి మోహన అభిప్రాయం:

    03/23/2011 12:05 pm

    1. కఱ్ఱ చట్రంబు పద్యము తేటగీతి, ఉపజాతియైన తేటగీతికి ప్రాస ఐచ్ఛికము, నియతము కాదు. 2. ఱ-కారానికి, ర-కారానికి ప్రాస చెల్లుతుంది. నన్నయ, నన్నెచోడుని లాటి కవులు మాత్రమే రఱల ప్రాస సాంకర్యము చేయలేదు. తరువాతి కవులు ఈ ప్రాసను అంగీకరించారు. ప్రస్తుతము రఱల ఉచ్చరణ భేదము లేదనే చెప్పాలి. విధేయుడు – మోహన

  10. అన్నీ చెప్పగల భాష గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి అభిప్రాయం:

    03/23/2011 1:11 am

    ఈ కవిత అనేక పదేళ్ళ కవిత్వ సంకలనంలో చోటు చేసుకున్నది.
    అభినందనలు