జి. వి. సుబ్రహ్మణ్యం
జీవిత విశేషాలు
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం (1935 – 2006) సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. వీరరసం, రసోల్లాసం, ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం గ్రంథాల రచనతో పురస్కారాలు అందుకున్నారు. నన్నయనుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారె, శివారెడ్డిల వరకూ తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ వీరు రచించిన “సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు” అన్న వ్యాస పరంపర విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. క్లాసిక్ తత్త్వాన్ని జీర్ణించుకొని, సమకాలీన చైతన్య ప్రభావంతో వినూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో కొనసాగిన కావ్య రచనా మార్గానికి “నవ్య సంప్రదాయం” అని నామకరణం చేసి ఈ వాదానికి ప్రతిష్ఠ, ప్రచారాలను కల్పించిన ఘనత వీరికి దక్కుతుంది