భీమదుర్యోధనుల గదాయుద్ధం మొదలవనున్నదనగా, ముగ్గురు భటులు కురుక్షేత్రయుద్ధభూమికి చేరుకుంటారు. సర్వే సర్వత్రా తాండవిస్తున్న బీభత్సవిషాదాలను దాటుకొని ద్వంద్వయుద్ధం జరుగుతున్నచోటికి వస్తారు. (అందరికీ తెలిసిన) కథాప్రకారం సుశిక్షితుడైన దుర్యోధనుడి చేతిలో చావుదెబ్బలు తింటూ ఉన్న భీముడు కృష్ణుడి సూచనను అందుకొని, యుద్ధనియమాలకు విరుద్ధంగా దుర్యోధనుడి తొడలపై గదాప్రహారం చేసి అతణ్ణి నేలకూలుస్తాడు.
అంతిమఘడియల్లో ఉన్న దుర్యోధనుడు పశ్చాత్తాపానికి లోనవుతాడు. పాండవుల అంతు తేల్చుదామనుకున్న బలరాముడిని శాంతింపజేస్తాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడి రాణులైన మాలవి, పౌరవి, దుర్జయుడనే కొడుకూ రణరంగానికి చేరుకుంటారు. వాళ్ళందరినీ దుర్యోధనుడు ఓదారుస్తాడు, కొడుకుకు హితోక్తులు చెబుతాడు. అశ్వత్థామ రంగప్రవేశం చేసి పాండవులను నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేస్టాడు. దుర్యోధనుడు అతణ్ణి వారించే ప్రయత్నం చేస్తాడు. దుర్జయుణ్ణి రాజుగా ప్రకటిస్తాడు అశ్వత్థామ. దుర్యోధనుడి మరణంతో నాటకం ముగుస్తుంది.
కొన్ని విశేషాలు
ఇదీ ఉత్సృష్ట్యంకమే. కరుణరసప్రధానం. స్త్రీపాత్రల విలాపాలు ఉన్నాయి. ప్రాకృతికమైన నాయకుడు ఉన్నాడు.
స్థాపనకు ప్రధాననాటకానికీ నడుమన విష్కంభకం ఉంటుంది. రెండు అంకాల నడుమన జరిగిన కథను అప్రధానపాత్రలతో చెప్పిస్తారు విష్కంభకం/విష్కంభంలో. వేదిక మీద చూపించడానికి వీలులేని విషయాలను – ఉదాహరణకు, యుద్ధం – ఈ అప్రధానపాత్రల సంభాషణలద్వారా చెప్పిస్తారు.
భీముడు, కృష్ణుడు, మిగతా పాండవులు ఇంతముఖ్యమైన ఘట్టంలో కనిపించరు. విష్కంభకంలోని సంభాషణల్లో ప్రస్తావించబడతారంతే.
యుద్ధాన్ని చూపించలేదు కానీ ఈ నాటకంలో మరణాన్ని చూపిస్తారు. అది సంస్కృతనాటకనియమాలకు విరుద్ధమే. ఆధునికమైన విషాదాంతనాటకాలతో పోల్చదగ్గది ఊరుభంగం నాటకం
భీష్మద్రోణులు తీరాలుగా, సైంధవుడు నీరుగా, శకుని లోతైన నీటి మడుగుగా, కర్ణుడు అలలుగా, అశ్వత్థామ, కృపుడు మొసళ్ళుగా, దుర్యోధనుడు ప్రవాహంగా, కత్తులూ, బాణాలూ ఇసుక మేటలుగా ఉన్న శత్రునదిని అర్జునుడు ఏ తెప్ప సహాయంతో దాటాడో, ఆ తెప్ప — భగవంతుడైన కేశవుడు — శత్రుప్రవాహాన్ని దాటించుగాక!
గౌరవనీయులైన మీకు విన్నవించుకుంటున్నాను. అరె! ఇదేమి, నేను నా మనవి మాటలను వినిపిస్తుండగా ఏదో శబ్దంవినబడుతున్నది? సరే, చూస్తాను.
నూరుగురు కొడుకులనే కళ్ళను కోల్పోయాక, ధృతరాష్ట్రుడి పక్షాన దుర్యోధనుడొక్కడు మిగిలాక, యుధిష్ఠిరుడి పక్షాన పాండవులు, కృష్ణుడు మాత్రమే మిగిలాక, రాజుల శవాలతో నిండిన సమంతపంచకంలో – హతమైన ఏనుగులతో, గుఱ్ఱాలతో, రాజులతో, యోధులతో నిండిన ఈ యుద్ధభూమి గజిబిజి గీతలతో నిండిన చిత్రపటంలా ఉన్నది; భీమదుర్యోధనుల యుద్ధం జరుగుతుందనగా, యోధులు రాజుల ఏకైక మృత్యుగృహమనదగిన యుద్ధభూమిలోనికి ప్రవేశిస్తున్నారు.
పెద్ద పెద్ద ఏనుగుల పీనుగులు ఎగుడుదిగుడు రాళ్ళతోనున్న కొండల్లా ఉన్నాయి. అతిరథులు మరణించాక వారి రథాలు రాబందులకు గూళ్ళయ్యాయి. ప్రతి క్రియకూ మరణమే పర్యవసానమైన యుద్ధంలో ఒకరినొకరు గాయపరచుకొని, చంపుకొని భూపతులందరూ స్వర్గాన్ని చేరుకున్నారు.
శ్రేష్ఠమైన ఏనుగుల తొండాలనే యూపస్తంభాలతో, బాణాలనే పరిచిన దర్భలతో, చచ్చి పడిన ఏనుగులనే ఎత్తైన మోపులతో, వైరమనే మండుతున్న అగ్నితో, కప్పిన జెండాలనే పందిరితో, సింహనాదమనే మంత్రంతో, పడిపోయిన పశువులతోనూ, మనుషులతోనూ ఉన్న ఈ యుద్ధం యజ్ఞాన్ని పోలి ఉన్నది.
అహో ను ఖలు నిహతపతితగజతురగనరరుధిరకలిలభూమిప్రదేశస్య విక్షిప్తవర్మచర్మాతపత్రచామరతోమర శరకున్తకవచకబన్ధాదిపర్యాకులస్య శక్తిప్రాసపరశుభిణ్డిపాలశూలముసలముద్గరవరాహకర్ణకణయకర్పణ-శఙ్కుత్రాసిగదాదిభిరాయుధైరకీర్ణస్య సమన్తపఞ్చకస్య ప్రతిభయతా।
అందరూ:
అహో!
చచ్చిపడి ఉన్న ఏనుగుల, గుఱ్ఱాల, మనుషుల రక్తంత తడిసి బురదలైన నేలతో, చెల్లాచెదురై పడిఉన్న రాజచిహ్నాలైన డాళ్ళతో, ఛత్రచామరాలతో, రకరకాల ఆయుధాలతో, కాళ్ళు చేతులు లేని మొండాలతో నిండిపోయిన ఈ కురుక్షేత్రం ఎంత భయానకంగా ఉన్నది!
వీరపురుషులు చచ్చిపడిన ఏనుగులను వంతెనలుగా చేసుకొని రక్తనదులను దాటుతున్నారు. సారథులు నేలజారిన, రాజులు లేని శూన్యరథాలను గుఱ్ఱాలు అటూ ఇటూ తిప్పుతున్నాయి. తలలు తెగిన మొండాలు అలవాటు చొప్పున ముందుకు ఉరుకుతున్నాయి. మావటివాళ్ళు లేని ఏనుగులు అంతటా తిరుగుతున్నాయి.
ఇప్ప పూవుల మొగ్గలవలె పెద్దగా, పచ్చగా ఉన్న కళ్ళతో, బలి చక్రవర్తి ఏనుగుయొక్క అంకుశంలా వంపు తిరిగి, పదునుగా ఉన్న ముఖాలతో, రెక్కలను సాచి, ముక్కున గరచిన మాంసం ముక్కలతో పగడాలు పొదిగిన తాటాకు విసనకర్రలలా ఉన్నాయి, గద్దలు.
ఓహ్, ఇటువంటి అవస్థలోనూ కళను కోల్పోకుండా ప్రకాశిస్తున్నారు ఈ క్షత్రియులు.
నిర్భీతితో ఉన్న ఈ రాజన్యుల ముఖాలు – పైకి తిరిగిఉన్న కళ్ళు తుమ్మెదల గుంపుల్లా, ఎర్రని పెదవులు రేకుల దొంతరలా, కనుబొమలు కేసరాలలా,కిరీటాలు దుద్దులా, గుచ్చుకొని ఉన్న బాణాలు తూళ్ళలా – ప్రతాపమనే సూర్యుడి వల్ల వికాసాన్ని పొందిన నేల తామరల్లా ఉన్నాయి.
ద్వితీయః:
ఈదృశనామపి క్షత్రియాణాం మృత్యుః ప్రభవతీతి న శక్యం ఖలు విషమస్థైః పురుషైరాత్మబలాధానం కర్తుమ్।
భటుడు-2:
ఇటువంటి వీరులను సైతం మృత్యువు లోబరచుకోగలుగుతుంది. ఆపదలకు లోనైన వారు తమ పరాక్రమాన్ని చూపలేరు కదా.
మబ్బులు ఉరుముతున్నాయా? వజ్రాయుధపు దెబ్బలకు పర్వతాలు పొడి అయిపోతున్నాయా? భయంకరమైన శబ్దం చేస్తున్న తుఫాను గాలులు భూమిని చీల్చివేస్తున్నాయా? తనగర్భంలోనున్న మంథరపర్వతపు గుహలను గాలికి చెలరేగిన పెను అలలు తాకినప్పుడు సముద్రం వెలువరిస్తున్న శబ్దమా? సరే, వెళ్ళిచూద్దాము.
అందమైన బంగారపు రాయివంటిదీ, బలిష్టమైనదీ అయిన భీముడి ఎదను తగులుతున్న దుర్యోధనుడి గదా, ఐరావతపు తొండంలా కఠినంగా ఉండే దుర్యోధనుడి మూపును మోదుతున్న భీముడి గదా – ఆ ఇరువురి భుజస్కంధాల మధ్యనే జరుగుతున్న ప్రచండగదాప్రహారాలనుంచి ఈ శబ్దం పుడుతున్నది.
తలపై ఊగుతూ ఎగిరిపడుతున్న కిరీటంతో, క్రోధాగ్నితో నిండిన కళ్ళతో, తన కదలికలకు అనువుగా కుంచించిన శరీరంతో, ఇప్పుడే చేతులు పైకెత్తాడు. అతడి హస్తాగ్రాన ఉన్న గద – శత్రువు రక్తంతో తడిసిపోయి – కైలాసపర్వతపు అగ్రభాగాన నిప్పులు వెదజల్లుతూ ఉన్న ఇంద్రుడి వజ్రాయుధంలాగా ఉన్నది.
దుర్యోధనుడి గదాప్రహారాలవల్ల నెత్తుటితో తడిసిన శరీరంతో ఉన్న భీముణ్ణి చూడండి. చిట్లిన నుదురునుంచి రక్తం కారుతున్నది, భుజస్కంధాలు విరిగాయి. దెబ్బలు తగిలిన వక్షస్థలం చిక్కని నెత్తురుతో తడిసి ఉన్నది. గదాఘాతాలు చేసిన గాయాలు రక్తంలో తడిసి గడ్డకట్టి, ధాతుజలం అలుముకున్న శిలలతో నిండిన మేరుపర్వతంలా ఉన్నాడు.
దుర్యోధనుడు భయంకరమైన గదను విసురుతున్నాడు. పైకి ఎగురుతూ గర్జిస్తున్నాడు. వేగంగా భుజాలను వెనక్కు లాగుకుంటున్నాడు. భీముడి దెబ్బలనుంచి తప్పుకుంటున్నాడు. గుండ్రంగా తిరుగుతున్నాడు. మళ్ళీ మళ్ళీ వేటు వేస్తున్నాడు. దుర్యోధనమహారాజు గదాయుద్ధంలో నేర్పరి. భీముడేమో మహాబలవంతుడు.
నొసలు ముడిచి, నుదుటన చెమటను చేతితో విదిలిస్తూ, ‘చిత్రాంగద’ తన గదను రెండు చేతులతో పట్టుకొని, భయంకరవదనుడై, శ్రేష్ఠమైన సింహపు చూపును కలవాడై, దీనుడైన తన కుమారుడిని చూసి వాయుదేవుడు ఇచ్చిన బలాన్ని పొందినట్లు, గర్జిస్తూ, నేలమీదినుంచి మరొకసారి పైకి లేచాడు.
అరె! కోపంతో వేగంగా కదులుతున్న కళ్ళను తెరిచి, పూజ్యుడైన బలరాముడు భీమసేనుడిని పక్కకు తప్పించడాన్ని గమనిస్తూ, ఇటే వస్తున్నాడు, బలరాముడు. కిరీటం కదిలి, కంపిస్తూ ఉన్నది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. తుమ్మెదలు మకరందపానం చేస్తూ ఉన్న పూలదండను కొంచెం పక్కకు నెట్టి ఒంటిపై జారుతున్న నల్లని వస్త్రాన్ని పట్టుకొని, మేఘావృతుడైన చంద్రుడిలా ఉన్నాడు