కాగితపు అద్దం

నీతో నువ్వు ఎంతసేపు మాట్లాడుకున్నా,
మనసు చిక్కబడదు.
ఒక మంచు దీపపు కాగితం కోసం అన్వేషిస్తావు.
కాపిరాగపు పాట విని తేలికపడి,
దిగులునంతా
తేలికగా ఆ కాగితంపై పరచాలనీ,
మళ్ళీ మళ్ళీ చదువుకునేలా
కొన్ని మాటలు రాయాలనీ,
అక్షరాల నీలి ఆకుల చుట్టూ
మెత్తని పాటలు కడతావు.
అక్షరాలను పేరుస్తూ, నీ కళ్ళ తడి నీడలను వింటావు.
పాటలు కడుతూ, నీ పగిలిన గొంతును సవరించుకుంటావు,
చాలాసార్లు.
చివుక్కుమన్న మనసు పొరల్లోని మాటలు కొన్ని
ఆ గొంతులో దాచుకుంటావు.

తడి పచ్చిక పలకలపై,
మాటలు విసురుగా కదులుతాయి.
వెచ్చని దీపపు మెరుపులో
నీటి తంబూరా
దూరంగా వినపడుతుంది.

సీతాఫలపు తియ్యని గాలి ఎంత పలకరించినా,
పువ్వులు ఎంత నటించినా,
పాటల్లోని చేదు ఇంద్రజాలం తెలిసిన నువ్వు
గవ్వ పదాల చుట్టూ ఇసుక తీగల
చీకటి గిజిగాడి గూడల్లుతావు.
నిన్ను నువ్వు పాటల్లో చూసుకుంటూ
నువ్వే ఒక తడిసిన కాగితంలా కనిపిస్తావు.


జ్యోత్స్నాఫణిజ

రచయిత జ్యోత్స్నాఫణిజ గురించి:

డాక్టర్ జ్యోత్స్న ఫణిజ, ఏఆర్ఎస్డీ కళాశాల (ఢిల్లీ విశ్వవిద్యాలయం)లో ఆంగ్ల సహాయ ఆచార్యురాలు. 25 సంవత్సరాల వయస్సులో, 2016లో హైదరాబాద్‌లోని ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయంనుండి ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆమె మొదటి కవితా సంకలనం, ‘ సెరామిక్ ఈవినింగ్ ‘, 2016లో రైటర్స్ వర్క్‌షాప్ ద్వారా ప్రచురించబడింది . రచయిత్రి నివేదిత ఎన్. తో కలిసి, ఆమె దృష్టి లోపం ఉన్న కవులు మరియు కథా రచయితల సంకలనాన్ని సంపాదకత్వం వహించారు, దీని పేరు ‘ ది వరల్డ్ ఐ రైట్ ఇన్’ , ఇది 2016లో ప్రచురించబడింది. ఆమె ‘క్రిమ్సన్ ల్యాంప్’ (2015),’స్టోన్డ్ సాంగ్’ (2019) అనే రెండు కవితా సంకలనాలను తెలుగునుండి ఆంగ్లంలోకి అనువదించారు. ఆమె పాటలు పాడడంతోబాటు కథానికలు, పరిశోధనా వ్యాసాలు, సాధారణ వ్యాసాలు రాస్తుంటారు.

 ...