ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవ కావ్యంలోని పద్యం. శివునికి తపోభంగమయ్యే ఘట్టం. పార్వతీదేవి కడకంటి చూపులతో కలిసి మరుని తూపులు శివుని మనసులో నాటుకున్నాయి. స్థాణువులో ఒక్కసారి కదలిక వచ్చింది. సర్వసంగపరిత్యాగిలో శృంగారం అంకురించింది. ఆ సమయంలో శివునిలో కలిగిన ఒక సాత్వికభావ విశేషాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈమాట ఇకనుంచీ మాసపత్రిక! ఈమాటలో కొత్త సంపాదకుల చేరిక!!

  • మారుతున్న కాలంతో పాటుగా మార్పులు తప్పవు. ఈమాట ఇకనుంచీ మాసపత్రికగా మారుతోంది! ఐతే ఏ మార్పయినా పత్రిక నాణ్యతాప్రమాణాలను మెరుగు పరచగలగాలి లేదా కనీసం నిలపగలగాలి. ఆ ఉద్దేశంతో, ఈమాటను మాసపత్రికగా ఏడాది పాటు ఒక ప్రయోగంగా ప్రచురించాలని, ఆపైన మంచిచెడ్డలు బేరీజు వేసుకుని ఈ మార్పు శాశ్వతం చేయడమా లేదా అని నిర్ణయించాలని మా ఆలోచన.
  • రచయితలు, పాఠకులు, ఈమాట మాసపత్రికగా మనగలిగేందుకు పూర్తి సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తున్నాం. పదేపదే చెప్తున్న మాటే మరొక్కసారి – ఈమాట ఉనికి మీమీదే ఆధారపడి ఉంది. మీ ప్రోత్సాహం, ఆదరాభిమానాలే ఈమాట సాహితీప్రయాణానికి వెన్నుదన్నులు.
  • బహుముఖీనమైన సాహిత్యాన్ని ఈమాట పాఠకులకు అందిస్తూ పత్రికను మరింత సమర్థవంతంగా నడిపేందుకు గాను – అవినేని భాస్కర్, గాలి త్రివిక్రమ్, సత్తెనపల్లి సుధామయి – ఈమాట సంపాదకులుగా ఈ సంచిక నుండి బాధ్యతలు స్వీకరించారు. వారికి మా హార్దిక స్వాగతం, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలుస్తున్నందుకు సంతోషం.
  • ఈ మార్పులలో భాగంగానే ఈమాటను ఒక సరికొత్త రూపంతో, సురేశ్ కొలిచాల అధ్యక్షతలో పూర్తిస్థాయి సాంకేతిక హంగులతో మీ ముందుకు తెస్తున్నాం. ఈ కొత్త రూపం మీకు నచ్చుతుందని, ఈమాటను చదవడాన్ని మరింత అనువుగా ఆహ్లాదంగా చేస్తుందని మా నమ్మకం. అన్ని సౌకర్యాలూ చక్కగా పనిచేసేలా చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. కొద్దిగా ఓపిక పట్టమని మా మనవి. ఈ కొత్తరూపంపై మీ అభిప్రాయాలకూ, ఆక్షేపణలకూ సదా స్వాగతం.

(గత కొద్దికాలంగా మాకు తమ తమ అభిప్రాయాలు చెప్తూ సలహాలిస్తూ మాకోసం వారి విలువైన కాలాన్ని వెచ్చిస్తున్న స్నేహితులు పరుచూరి శ్రీనివాస్, చామర్తి మానస, భైరవభట్ల కామేశ్వరరావు, వేల్పూరి సుజాత, తమ్మిరెడ్డి పూర్ణిమలకు మా కృతజ్ఞతలు.)

మనమున్న జీవితానికి, మనం గీసుకున్న పరిధి దాటి రావడమంటే యుద్ధంతో సమానమైపోయింది. గీతకి అవతలివైపు నుండి చేయి కనపడ్డప్పుడు, అది యుద్ధం నుండి బయటపడేసే సాయమేనేమో అనుకునే మనస్తత్వం దాదాపుగా మాయమై, అది సాయం కోసం చాచిన చేయేనని తీర్మానించుకుని, చూసీచూడనట్టు వెనుతిరగడం పరిపాటైపోయింది.

“వాడు ఆ కమల యే గదిలో వుంటే ఆ గదిలో దూరుతున్నాడు. వాడ్ని లోకువ కట్టి వాళ్ళు మనుగుడుపుల్లోనే ఆ అవపోసన కాస్తా అయిపోయిందనిపిచ్చేట్లున్నారు. నేనెంత నెత్తీ నోరూ బాదుకుంటే ఏం లాభం? మీరు బెల్లం కొట్టిన రాయి. ఇహ యీ తగూలన్నీ నా నెత్తి మీదకు నెట్టేస్తున్నారు. మీరూ మీరూ బాగుండాల. మధ్యన వియ్యపురాలి పీనుగ గయ్యాళిది అనిపించుకోవాలి నేను.”

వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవి కాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడని, అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది.

అది జరిగిన తర్వాత, చాలా నెలల పాటు, ఆ సన్నివేశం నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేది. నేనా పెద్దాయనను చిన్నబుచ్చి వుంటానా? పక్కవాడు పాదాభివందనం చేసినప్పుడు, నా నుంచి కూడా ఆయన అదే ఆశించి వుంటాడా? అసలు ఆయన పట్టించుకున్నాడా? కానీ ఇద్దరి మర్యాదలోనూ స్పష్టమైన తేడా కనబడినప్పుడు, లిప్తమాత్రంగానైనా గమనించకుండా ఉంటాడా?

వచ్చే అతిథులు అసమాన ధీరులైన కురువీరులు. అంతే కాదు, వారికంటూ ప్రత్యేకమైన రుచులు కూడా ఉన్నాయి. అందువల్ల పాకశాసనుడు పాకశాలాధిపతిని పిలిపించి పాండవకౌరవాదులలో ఎవరెవరికి ఏయే వంటకాలు వడ్డించాలో ఎవరికేది వడ్డించకూడదో చాలా వివరంగా చెప్పాడు. ఏమైనా తేడాలు వస్తే నరకానికి పంపేస్తానని హెచ్చరించాడు కూడా. అన్నీ జాగ్రత్తగా విన్న వంటపెద్దకి బెంగ పట్టుకుంది. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ గుర్తుపెట్టుకొనడం ఎలా?

రెడ్డీ అల్లుడూ అరగంటలో కారు దిగేసరికి గుడి చుట్టూ జనం పోగై ఉన్నారు వింత చూస్తూ. డబ్బులు ముట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. వినాయకుడి డబ్బా, మజాకా? సాక్షుల్లేకుండా ముట్టుకుంటే జైలూ, దేవుడి డబ్బులు ముట్టుకుంటే నరకమూను. అదీకాక ఈ హుండీ తెరవాలంటే బేంకు వారు రావాలి; దేవుడిది ధర్మఖాతా కదా? కానీ బేంకు వారు గంట పది దాటకుండా, ఆఫీసులు తీయకుండా అలా వచ్చేస్తారా? కొన్నిసార్లు వచ్చేస్తారు మరి.

వంటింటి నుంచే జీవితం ప్రారంభమైనప్పుడు
వంటింటినెలా వదిలేస్తాం
మనోద్వారాలను గెలిచే మార్గాలు
అక్కడినించే ఉన్నాయన్న
పెద్దలమాట ఉండనే ఉంది కదా
అదీ స్త్రీత్వపు మాయతెరగా కనిపించినా
అదే వాస్తవం

ఇవాళ నువ్వేది మాట్లాడినా వింటాను
సిగ్గును రెండు ముక్కలు చేసి
మనసును రెండు చెక్కలుగా కోసి
ఎందుకంటావా?
అవ్యక్తాల్నిలా ప్రేమించినందుకే
అందుకే వింటాను చెప్పు

ప్రస్తుత సంకలనం ఇక్కడ నివాసిగా స్థిరపడ్డాక రూపొందినది. ఇందులో స్నేహరాహిత్యం పట్ల కొంత దిగులు ఉన్నా ఇక్కడ, ఇండియాలోనూ జరిగిన సమకాలీన సంఘటనలకి రాజకీయమైన స్పందన ఎక్కువ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియాలో తన ప్రాసంగికతను నిరూపించుకోవాలనే తాపత్రయం కవిలో ఉన్నట్టు నాకనిపించింది.

ప్రద్యుమ్నుడికి వంటచేయడం హాబీ కాదు. తినడమే కానీ వంట చేయడం రాదని సగర్వంగానే చెప్పుకుంటాడు. భార్య ఎప్పుడైనా, చాలా అరుదుగానైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వంట చేసుకునే వాడు కాదు. ఆ పది పదిహేను రోజులు బ్రహ్మచారుల మెస్సులోనే నేపాలీ వంట తినేసేవాడు. జోర్హాట్‌లో ఆ కాలంలో వంటమనిషి దొరికేవాడు కాదు. అందుకని ఇన్‌స్టిట్యూట్ కేంటీనులో ఒక నేపాలీ వాడిని కుదుర్చుకున్నారు.

ఇక్కడ నేను శూన్యాన్ని మోస్తున్నాను
నా ఒక్కరి ఖాళీనే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరిదో
ఇక్కడ నేను శవాన్ని మోస్తున్నాను
నా ఒక్క శవాన్నే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరివో

ఊరి చివర వాడలో
ఒంటరిగా ఉంటాడు
డప్పు మోగమంటేనే
ఊరు లోకి వస్తాడు.
ఆదివారం దండోరా!
పాములోయ్ పహారా!

పద్యానికి ఆధునికస్వరాన్ని యివ్వడంతో పాటుగా, పాటని కావ్యంగా మలిచిన చాలా కొద్దిమంది కవులలో విద్వాన్ విశ్వం ఒకరు. పాటనీ పద్యాన్నీ జమిలిగా నేత నేసి, అటు పల్లెపాట లోని అమాయకత్వమూ యిటు మార్గకవిత్వం లోని ప్రౌఢత్వమూ సరిపాళ్ళలో జత చేసి, ఒక సరికొత్త పాటను వినిపించిన కవి. రాయలసీమ కన్నీటిపాటను పెన్నేటిపాటగా ఆయన మలిచిన తీరు అపూర్వం.

మంకెన పువ్వులు విచ్చే కాలం
పచ్చని ఆకులు మెరిసే కాలం
వెన్నెల పువ్వులు తురిమే కాలం
చంద్రుని చల్లని ముద్దుల కాలం
సూర్యుని వెచ్చని కౌగిలి కాలం

దగ్గరై నిలచి
సంభ్రమమో, సందిగ్ధమో అయేకన్న
ఆవిరి రూపమై
మరలే యింద్ర ధనువవడమే
అందమేమో!