గ్రీకు పురాణ గాథలు 6

ట్రాయ్ మహా సంగ్రామం

గ్రీకు పురాణ గాథలలో ప్రసిద్ధికెక్కిన ఈ మహా సంగ్రామానికి, తద్వారా జరిగిన మారణహోమానికి మూల కారణం ఏరిస్ (Eris) అనే ఒలింపియన్ దేవత అని మనం తీర్మానం చెయ్యవచ్చు. (ఏఫ్రొడైటి (Aphrodite) కొడుకు ఈరోస్ (Eros) మన మన్మథుడికి పోలిక! ఏరిస్ బంగారు ఏపిల్ పండుని పెళ్ళి పందిరిలోకి విసిరిన వ్యక్తి.)

ఒక వివాహ సందర్భంలో ఒలింపియను దేవతల అధినేత అయిన జూస్ ఒక బ్రహ్మండమైన విందు చేస్తాడు. కోరుకుని కొరివితో తలగోక్కోవడం ఎందుకని పేచీకోరు ఏరిస్‌ని ఆ విందుకి పిలవడు. జరిగిన పరాభవానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న ఏరిస్ పిలవని పేరంటంలా విందుకి రానే వచ్చింది. జూస్ ఆజ్ఞానుసారం హెర్మీస్ ఆమెని లోపలికి రాకుండా అటకాయిస్తాడు. ఏరిస్ తక్కువ తిన్నదా? బయట నుండే బంతి భోజనాల మధ్యకి ఒక బంగారు ఏపిల్ పండుని విసరి వెళ్ళిపోతుంది. ఆ పండు మీద ’మీలో అందమైన ఆడదానికి ఈ బహుమానం’ అని రాసి ఉంటుంది.

విందులో ఉన్న ముగ్గురు దేవతలు–హేరా, ఎథీనా, ఏఫ్రొడైటి, ఆ పండు నాకోసమే అంటే నాకోసమే అంటూ ఎగబడి తగువులాడుకుంటారు. తీర్పు చెప్పమని ముగ్గురూ జూస్‌ని అడుగుతారు. ఎటు తీర్పు చెప్పినా ఇబ్బందే అని జూస్ ఈ ముగ్గురికీ హెర్మీస్‌ని తోడు ఇచ్చి భూలోకంలో ఉన్న పేరిస్ దగ్గరకి పంపుతాడు. ముగ్గురిలోనూ ఏఫ్రొడైటి అందమైనదని పేరిస్ తీర్పు చెబుతాడు. దానికి బహుమానంగా పేరిస్‌ని భూలోక సుందరి హెలెన్–మెనలౌస్ భార్య–వరించేలా వరం ఇస్తుంది.

హెలెన్ కన్నతల్లి స్పార్టాకి రాణి అయిన లేడా (Leda). హంస రూపంలో జాస్ వచ్చి లేడాని అనుభవించగా హెలెన్ పుట్టిందని ఒక కథనం ఉంది. కనుక హెలెన్ దైవాంశ సంభూతురాలు. స్పార్టాకి రాజైన టిండరియుస్ (Tyndareus) హెలెన్‌ని తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. హెలెన్ అందాన్ని చూసి ఎంతోమంది రాజులు, ధీరులు ఆమెని చేపట్టటానికి ముందుకి వచ్చేరు. ఒకరి వైపు మొగ్గు చూపితే మరొకరికి కోపం వస్తుందని టిండరియుస్ భయపడ్డాడు. చివరికి ఇథాకా రాజైన ఒడీసియస్ (Odysseus) తనకి పెనెలొపిని (Penelope) ఇచ్చి పెళ్ళి చేస్తానని వాగ్దానం చేస్తే ఒక పరిష్కార మార్గం సూచిస్తానన్నాడు. ఆ మార్గం ఏమిటంటే హెలెన్ ఎవ్వరిని పెళ్ళి చేసుకున్నా సరే మిగిలిన రాజులంతా ఆ వివాహాన్ని సమర్థించాలి. అంతా ఒప్పుకున్నారు. అప్పుడు టిండరియుస్ తన కోరిక మేరకు హెలెన్‌ని మెనలౌస్‍కు (Menelaus) ఇచ్చి పెళ్ళి చేసేడు.

మెనలౌస్‌కి హెలెన్‌ని ఇవ్వడంలో రాజకీయం లేకపోలేదు. మెనలౌస్ ధనవంతుడు. అతనికి పెద్ద సైన్యం ఉంది. పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తి. పెళ్ళి విషయంలో కూడా తనంత తానుగా ఎగబడలేదు; తన అన్నగారైన అగమెమ్నాన్ (Agamemnon) ద్వారా వర్తమానం పంపేడు. ఈ అగమెమ్నాన్ మరెవరో కాదు; హెలెన్‌కి సాక్షాత్తు మరిది. ఎందుకైనా మంచిదని ఈ పెళ్ళి జరిగితే ప్రేమదేవత ఏఫ్రొడైటికి వంద గిత్తలు బలి ఇస్తానని మెనలౌస్ మొక్కుకున్నాడు కూడా. ఆ మొక్కు సంగతి మరచిపోయి ఏఫ్రొడైటి ఆగ్రహానికి గురి అవుతాడు; అది వేరే సంగతి!

ట్రాయ్ నగరపు రాయబారి వర్గంలో ఒక వ్యక్తిగా పేరిస్ చొరబడి స్పార్టాలో ప్రవేశిస్తాడు. పేరిస్ రాజప్రాసాదంలోకి ప్రవేశించేలోగా ఏఫ్రొడైటి అందాల పోటీలో తాను పేరిస్‌కి ఇచ్చిన వరం నెరవేర్చడానికిగాను ఈరోస్ (Eros) సహాయం కోరుతుంది. ఈరోస్ తన పువ్వుల బాణంతో హెలెన్‌లో కామాతురతని రెచ్చగొడతాడు. ఏఫ్రొడైటి ఇచ్చిన వరం ప్రకారం పేరిస్‌ని చూడగానే హెలెన్ ప్రేమలో పడుతుంది. హెలెన్‌ని వెంటపెట్టుకుని పేరిస్ ట్రాయ్ వెళ్ళిపోతాడు.

హెలెన్ అపహరణ అనే పని ఆ రోజుల్లో కొత్తేమీ కాదు. ఇటువంటి ’స్త్రీ గ్రహణాలు’ ఆ రోజుల్లో తరచుగా జరిగేవి. మైసినే (Mycenae) నుండి లో (Lo) అపహరణ, ఫినీషియా (Phoenicia) నుండి యూరోపా (Europa) అపహరణ కేవలం రెండు ఉదాహరణలు. కొల్చిస్ (Colchis) నుండి మెదీయాని (Medea) జేసన్ (Jason) అపహరిస్తాడు. ట్రాయ్ నగరం నుండి హెరాక్లిస్ (హెర్క్యులిస్) రాకుమారి హెసియోనెని (Hesione) అపహరించి ఆమెని టెలమాన్‍కి (Telamon) కానుకగా ఇస్తాడు. ఈ అపహరణలు జరిగినప్పుడు పర్యవసానంగా అనుకోని విపత్తులు ఏవీ రాకపోవడంతో హెలెన్‌ని దొంగిలించడానికి పేరిస్‌కి ధైర్యం వచ్చిందని చరిత్రకారుడు హెరొడోటస్ వ్యాఖ్యానిస్తాడు.

హోమర్ చెప్పిన కథనం ప్రకారం మెనలౌస్ తన స్నేహితుడైన ఒడీసియస్‌ని వెంటబెట్టుకుని ట్రాయ్ నగరంతో సంప్రదింపులు జరిపి హెలెన్‌ని వెనక్కి తెచ్చుకుందామని ప్రయత్నిస్తాడు. ఆ రాయబారం విఫలం అవుతుంది. ఇది సంగ్రామానికి నాంది అవుతుంది.

రాయబారం విఫలం అవడంతో హెలెన్ వివాహాన్ని రక్షిస్తానని మాట ఇచ్చిన అగమెమ్నాన్‌ని మాట నిలుపుకోమని మెనలౌస్ అడుగుతాడు. అప్పుడు మైసినేకి (Mycenae) రాజు అయిన అగమెమ్నాన్ గ్రీకు యోధులని సమకూర్చుకుని, వెయ్యి పడవల బలగంతో ట్రాయ్ మీదకి దండయాత్ర చేసి, నగరాన్ని ముట్టడించి, నగరాన్ని పదేళ్ళపాటు దిగ్బంధం చేస్తాడు. ఈ ఘోరమైన యుద్ధంలో ఎఖిలీస్ (Achilles), ఏజాక్స్ (Ajax) వంటి గ్రీకు యోధులు, హెక్టర్ (Hector), పేరిస్ (Paris) వంటి ట్రాయ్ యోధులు వీరస్వర్గం పొందుతారు.

యుద్ధంలో పేరిస్ మరణించిన తరువాత హెలెన్ అతని అన్నదమ్ముడైన డియ్‍ఫోబస్‌ని (Deiphobus) పెళ్ళి చేసుకుంటుంది. ట్రాయ్ నగరం పతనమైపోయిన తరువాత డియ్‍ఫోబస్‌ని వదిలేసి తిరిగి మెనలౌస్‌తో కలిసి స్పార్టా వచ్చేసి శేషజీవితం గడుపుతుంది.

యుద్ధం ముగిసిన తరువాత ఒడీసియస్ (యులిసిస్) తిరుగు ప్రయాణం చేసి ఇథాకా చేరుకుందికి పదేళ్ళు పడుతుంది. ఈ తిరుగు ప్రయాణంలో ఒడీసియస్ ఎదుర్కున్న సవాళ్ళని హోమర్ తన రెండవ గ్రంథం ఆడిస్సిలో వర్ణిస్తాడు. ఆడిస్సి రూఢ్యర్థం మహా ప్రస్థానం. ఇలియడ్ రూఢ్యర్థం కష్టకాలం.

సా. శ . పూ. 1వ శతాబ్దంలో రోమ్‌కి చెందిన కవి వర్జిల్ (Virgil) ఎనియాడ్ (Aeneid) అనే గ్రంథంలో యుద్ధం ముగిసిన తరువాత కొందరు గ్రీకు యోధులు, ఎనియస్ (Aeneas) నేతృత్వంలో సముద్రం దాటుకుని ప్రస్తుతం టునీషియాలో ఉన్న కార్తేజ్ (Carthage) వచ్చి, అక్కడ నుండి ఇటలీ వచ్చి, రోమ్ నగరం స్థాపనకి కారణభూతులు అవుతారు.

పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్ (Iliad), ఆడిస్సిలతో (Odyssey) వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! అంతే కాదు; భారతంలో ఆద్యంతం ఒక కథ ఉంది. ఆ కథ వెనుక ఒక బందుకట్టు ఉంది. భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది. ట్రాయ్ యుద్ధంలో మానవులు దేవతల చేతిలో కేవలం పావులు. భారతం మీద వ్యాఖ్యానాలు చేసిన అనేక పాశ్చాత్యులు గ్రీకు పురాణ గాథల వల్ల ప్రభావితులై గ్రీకు పురాణ కాలపు పట్టకం ద్వారా చూస్తూ చేసేరు తప్ప స్వతంత్రమైన దృక్పథంతో చేసినవారు కారని నా అభిప్రాయం.

ట్రాయ్ సంగ్రామం నిజమా? కల్పనా?

మహాభారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రాయ్ సంగ్రామం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? యుద్ధంలో కనిపించే సంఘటనలు, పాత్రలు (మనుష్యులు, దేవతలు) నిజమా? కల్పనా? ఈ యుద్ధం గురించి ఎవ్వరు రాసేరు? ఎప్పుడు రాసేరు? వగైరా, వగైరా!

ఈ యుద్ధం గురించి మనకి ఉన్న ముఖ్యమైన ఆధారాలు గ్రీకు సాహిత్యంలో కనిపిస్తాయి; కానీ ఏ ఒక్క చోటా మనకి సాధికారంగా ఆధారాలు కనబడవు. ఈ యుద్ధం నిజంగా జరిగి ఉంటే అది సా. శ. పూ. 1194-1184 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చని గ్రీకు శాస్త్రవేత్త ఎరతోస్తనీస్ (Eratosthenes) వేసిన అంచనా నమ్మదగ్గదే అనడానికి అధారాలు కనిపిస్తున్నాయని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అనగా, కంచు యుగపు చివరి దశలో అని మనం చెప్పుకోవచ్చు.

సా. శ. 1870లో జెర్మనీ దేశపు పురావస్తు పరిశోధకుడు హైన్రిక్ ష్లీమన్ (Heinrich Schliemann) పశ్చిమ టర్కీలో (ట్రాయ్ నగరపు సమీపంలో) జరిపిన తవ్వకాలలో ఒక శిథిలమైన కోట దిబ్బ, దాని చుట్టూ 25 మీటర్ల లోతు వరకు శిథిలమైన భవనాల అవశేషాలు కనిపించేయి. వాటి చుట్టూ 46 ఇతర వాటికలు కనిపించేయి. ఇటీవల జరిపిన మరికొన్ని తవ్వకాలలో కనబడ్డ ఒక పురాతన నగరం హైన్రిక్ ష్లీమన్ కనుక్కున్న నగరం కంటే పదింతలు పెద్దది అని తెలిసింది. ఈ నగరం ఉన్న ప్రాంతాలలో సా. శ. పూ. 3000 నుండి సా. శ. పూ. 1350 వరకు అవిరామంగా జనావాసాలు ఉండేవని తీర్మానించేరు. అంతేకాదు. సా. శ. పూ. 1180కి సంబంధించిన స్తరాలలో వేడికి మాడిపోయిన అవశేషాలు, మానవ ఆస్థిపంజరాలు కనిపించడంతో అవి ఏదో యుద్ధానికి సంబంధించినవే అయుంటాయని నమ్ముతున్నారు.

ఈ నగరం గురించి, అక్కడ జరిగిన యుద్ధం గురించి, ఆనోటా ఈనోటా జానపదుల నోటా 400 సంవత్సరాల తరువాత విన్న కథలని హోమర్ ఇలియడ్, ఆడిస్సి అనే రెండు ఉద్గ్రంథాలలో పొందుపరచి ఉంటాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలియడ్ సంకలనం సా. శ. పూ. 750లోను, ఆడిస్సి సంకలనం సా. శ. పూ. 725లోను పూర్తి అయి ఉంటాయి. ఇలా సంకలించబడ్డ కథల సమాహారం లిఖిత రూపం దాల్చేసరికి మరికొన్ని దశాబ్దాలో, శతాబ్దాలో పట్టి ఉండవచ్చు.

అసలు హోమర్ అనే వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని గ్రీకు మాండలికాలలో హోమర్ అంటే గుడ్డివాడు అని అర్థం వస్తుంది కనుక హోమర్ గుడ్డివాడయి ఉంటాడని కొందరి తీర్మానం. ఎందుకంటే ఆడిస్సిలో ఒక చోట ఒక అంధుడు పాత్రగా వచ్చి యుద్ధంలో విశేషాలని కథల రూపంలో చెబుతాడు. హోమర్ ఈ విధంగా తాను చెబుతున్న కథలో తానే ఒక పాత్రలా వచ్చేడని వీరి అభిప్రాయం. వ్యాసుడు కూడా భారత కథలో అక్కడక్కడ అతిథి నటుడిగా వస్తూ ఉండడం గమనార్హం.

ఈ కథని చారిత్రక పరిశోధన కోణం నుండి విశ్లేషించడం కష్టం. ఈ కథలో తారసపడే చాల పాత్రలు దైవాంశ సంభూతులు (demigods), అనగా దేవతలు, మానవులు కలవగా పుట్టినవారు. ఉదాహరణకి హెలెన్ ఒలింపియను దేవత అయిన జూస్ ఒక హంస రూపంలో వచ్చి మానవ వనిత లేడాని బలవంతం చెయ్యగా పుట్టిన సంతానం. అదే విధంగా హెలెన్‌ని పేరిస్ వశపరచుకోడానికి టైటన్ దేవత ఏఫ్రొడైటి ఇచ్చిన వరం కారణభూతం అవుతుంది. ఈ రకం సంఘటనలు నిజజీవితాలలో జరగడం అనేది మన అనుభవాలకి అతీతం. అలాగే యుద్ధం పది సంవత్సరాలు జరుగుతుంది. కంచు యుగంలో ట్రాయ్ నగరాన్ని పది రోజులు దిగ్బంధం చేసేరంటే నమ్మవచ్చేమోకాని పదేళ్ళు కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది.

ఈ సమాచారం అంతటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ట్రాయ్ అనే నగరం ఉండి ఉండవచ్చు. ఆ నగరం వద్ద పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధం జరగడానికి హెలెన్ అనే అందమైన ఆడదానిని పేరిస్ అనే యువకుడు అపహరించడం కారణం అయి ఉండవచ్చు. ఆ యుద్ధంలో గ్రీకు సైనికులు ఒక కొయ్య గుర్రంలో దాగుని దొంగచాటుగా ట్రాయ్ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని నాశనం చేసి ఉండవచ్చు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కావచ్చు. కానీ ఈ కథలో కనిపించే దేవతలు, వారికీ మానవులకీ మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు మన అనుభవ పరిధిలో నమ్మడానికి వీలు లేనివి. వీటిని కవి కల్పించిన ఉత్ప్రేక్షలు అనే అనుకోవాలి.

ఇలియడ్

హోమర్ రాసిన ఇలియడ్‌లో కథనం గ్రీసు సేనలకి, ట్రాయ్ సేనలకి మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. కవి సాహిత్యాధిదేవత అయిన మూజ్‍ని (Muse) ప్రార్థించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన ఎఖిలీస్ కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో గ్రంథ రచన ప్రారంభం అవుతుంది. యుద్ధం మొదలయి తొమ్మిదేళ్ళు గడచిన తరువాత గ్రీకు సైన్యం ట్రాయ్ మిత్రరాజ్యం అయిన క్రిసిని ముట్టడించి లొంగదీసుకుంటుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన ఇద్దరు కన్యలు–క్రిసేయిస్ (Chryseis), బ్రెసేయిస్ (Briseis)–గ్రీకుల వశం అవుతారు. గ్రీకుల సేనాధిపతి అగమెమ్నాన్ క్రిసేయిస్‌ని తనకి దక్కిన బహుమానంగా తీసుకుంటాడు. ఏఖిలీస్ బ్రెసేయిస్‌ని తీసుకుంటాడు. క్రిసేయిస్ తండ్రి క్రిసెస్–సాక్షాత్తు ఒలింపియను దేవుడైన అపాలోకి (Apollo) హితుడు–కూతురు బంధ విమోచనకి అగమెమ్నాన్‍కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పణంగా పెడతాడు కానీ అగమెమ్నాన్ లొంగడు. తన హితునికి ఎదురవుతున్న పరాజయం చూడగానే అపాలోకి కోపం వచ్చి అగమెమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపిస్తాడు.

తమ సేనలు ఎండలలో పిట్టలలా రాలిపోతూ ఉంటే చూసి కంగారుపడి, ఎఖిలీస్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్చస్ (Calchas) అనే దైవజ్ఞుడు లేచి, ఇదంతా అపాలో శాపం వల్ల జరుగుతోంది అని చెబుతాడు. అప్పుడు అగమెమ్నాన్ అయిష్టంగానే క్రిసేయిస్‌ని వదలుకుందుకి ఆమోదిస్తాడు; కానీ ఒక మెలిక పెడతాడు. ఏమిటా మెలిక? తాను క్రిసేయిస్‌ని వదులుకుంటే ఆ స్థానంలో ఎఖిలీస్ తనకి బ్రెసేయిస్‌ని ఇచ్చెయ్యాలి! ఈ వంకాయల బేరం విని ఎఖిలీస్ కోపోద్రేకుడయి, కత్తి దూసి, అగమెమ్నాన్‌తో ద్వంద్వ యుద్ధానికి తయారవుతాడు. ఒక పక్క ట్రాయ్ సేనలు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు ఒలింపియను దేవత హేరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని ఎథీనాని పంపుతుంది. నెస్టర్ సహాయంతో ఎథీనా చేసిన హితోపదేశం ఎఖిలీస్ కోపాన్ని చల్లార్చుతుంది. తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకుంటాడు. ఎఖిలీస్ తన కోపం చల్లారక ముందే తన తల్లి అయిన సముద్రపు జలకన్య థేటిస్‌ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్ నుండి సహాయం అర్థించమని అడుగుతాడు.

ఇది ఇలా ఉండగా అగమెమ్నాన్ క్రిసేయిస్‌ని ఆమె తండ్రి దగ్గరకు పంపేసి, బ్రెసేయిస్‌ని తన దగ్గరకి రప్పించుకుంటాడు. ఒడీసియస్ తన పడవలో క్రిసేయిస్‌ని తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించగా, అతను సంతృప్తి చెందినవాడై గ్రీకు సైనికులని శాపం నుండి విముక్తి చెయ్యమని అపాలోని కోరుకుంటాడు. గ్రీసుకీ ట్రాయ్‌కి మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణకి ఒప్పందం జరుగుతుంది.

గ్రీకు సేనలకి, ట్రాయ్ సేనలకి మధ్య యుద్ధం ఆగింది కానీ ఎఖిలీస్‌కి అగమెమ్నాన్‌కీ మధ్య విరోధ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దేవతల రాజైన జూస్‌ని కలుసుకోడానికి థేటిస్‌కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హేరాకి కోపం వస్తుంది; ఆమె గ్రీకుల పక్షం! కాని థేటిస్ కోరికని కాదనలేకపోయాడు, జూస్. హేరాకి కోపం రానే వచ్చింది. మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ హేరాకి హితోపదేశం చేస్తాడు.

ఈలోగా ట్రాయ్ పక్షంవారు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు జూస్ ట్రాయ్ పక్షం వహించి వారికీ సహాయం చెయ్యడానికి వస్తాడు. జూస్ ట్రాయ్ పక్షం కాయడం, ఎఖిలీస్ అస్త్ర సన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కూర్చోవడం వల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోతారు. చాల రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలౌస్‌ల మధ్య, హెక్టర్-ఏజాక్స్‌ల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రాయ్ సైన్యాలు గ్రీకు సేనావాహినిని తరిమి కొట్టాయి.

భారత యుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాలవారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఆ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రాయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీసు సేనలు పడవలలో ఎక్కి పారిపోతారు. ఆ హడావిడిలో ఒక కొయ్యగుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రాయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక అభిజ్ఞానం అనుకుంటూ దానిని ఈడుచుకుని పట్టణం లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్ళిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనావాహిని బయటకి వచ్చి ట్రాయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి పోతారు.

భారత యుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల అహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.