పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. భాగవతావతరణము గురించి jayaprabha అభిప్రాయం:

    05/08/2014 1:50 am

    కృష్ణ దేశికుల వారూ! గొప్పగా ఉన్నాయి పద్యాలు. అన్నీ రమణీయ శబ్ద రాజీ నటనాభిరామమే అయి! చేతమును వశము చేసుకొన్నవే అయి! రాముడిని వర్ణించిన పద్యం “మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి” అలా చదవబుధ్ధి అయ్యింది మళ్ళీ మళ్ళీ!

    “యామినీశ్వరుడు” [ఇదివరకు ఇలా అన్నారా ఎవరైనా??] “కాలనీరదం” పదాల కూర్పు చాలా బాగున్నవి. వీటిని ఇదివరకు ఎక్కడా చదివినట్టు లేదు. మొదటిసారి చదివనట్టుంది నాకు. మాధురి నిండిన మీ పద్యాలు పోతనగారి మీద మీ అనురక్తినీ మీ రామ భక్తినీ కలిపి పట్టుకుని మాగిన మావిపండులా సువాసనతో ఉన్నాయి. రుచిని నింపుకున్నాయి.

    దండాలు మీకు.

  2. భాగవతావతరణము గురించి Velceru Narayana Rao అభిప్రాయం:

    05/07/2014 7:53 pm

    మహానుభావా, మీరు మంచి పద్యం రాయగలరు. పద్యం రాసేవాళ్ళు తగ్గిపోతున్నారు. మీ పద్యం ఎక్కడ ఊపిరి ఆపాలో, ఎక్కడ గొంతుక పైస్వరం లోకి వెళ్ళాలో, ఎక్కడ మంద్రస్వరంతో చదవాలో, తెలిసి చెప్పిన పద్యం. మీకు శబ్దం మీద ఉన్న అధికారం పెద్దది. ఛందస్సు మీరు చెప్పినట్టు నడుస్తుంది. పోతన్న గారి మీద మీరు రాసిన పద్యాలు బాగున్నాయని మళ్ళీ చెప్పక్కర్లేదు. కానీ, ఒక్క చిన్న మాట. పోతన్న భాగవతం పలికాడు. ఆయన రాయలేదు. రాసేవాళ్ళైతే మీ కలాన్నో, ఘంటాన్నో ఏదో తియ్యని పదార్థంలో ముంచావా అని సరదాగా అనచ్చు. కానీ అది కూడా కొంచెం తేలికపాటి ఊహే. ఆ ఒక్క ఊహ మినహాయిస్తే మీ పద్యాల్లో నాకు మంచి తప్ప మరేమీ కనిపించలేదు. మీకు నా నమస్కారం.

    VNR

  3. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    05/07/2014 4:01 pm

    లైలాగారూ,

    >>Hope I made it to సహృదయులు list.

    Ofcourse, you are always there in the list! 🙂

    తఃతఃగారూ,

    శతకపద్యాలు చాటుసంప్రదాయంలో భాగమే. శ్రీశ్రీ సిరిసిరిమువ్వ పద్యాలు కూడా అదే బాణీలో ఉంటాయి. అయితే వ్యాప్తి విషయంలో, అవి ప్రజల నాలుకలపై కాక పుస్తకాలకే పరిమితమైపోయాయి కదా!

    వేలూరిగారూ,

    >>భీమకవి ఆదికవికన్నా ముందువాడనేనా?

    ఆ పద్యం నన్నయ్యదే అయితే, అందులో చెప్పిన భీమన వేములవాడ భీమకవే అయితే, భీమకవి నన్నయ్యకు ముందువాడో సమకాలీకుడో అవ్వాలి మరి! ఈ చాటువుకి కూడా పాఠాంతరాలున్నాయి. “కవిజీవితములు” పుస్తకంలో గురజాడ శ్రీరామమూర్తిగారిచ్చిన పాఠం ఇది:

    మతి, ప్రభ, నీగి, పేర్మి, సిరి, మానము పెంపున భీమునిన్ బృహ
    స్పతి, రవి, కర్ణు, నర్జను, గపర్ది, సుయోధను బోల్ప బూన నా
    మతకరి, తైక్ష్ణు, దుష్కులు, నమానుషు, భిక్షు, ఖలాత్ము నెంచ వా
    క్సతిపు, శశిన్, శిబిం, గొమరుసామిని, మేర్వు, నబ్ధి బోల్చెదన్

    ముందువెనకల పరిశోధన అవసరమా అనవసరమా అన్న మాట పక్కన పెడితే, ఇలాంటి చాటువుల ఆధారంగా అలాంటి నిర్ణయం చేయబూనడం కుక్కతోక పట్టుకొని గోదారి యీదడం లాంటిదని నా అభిప్రాయం. ఇంతకన్నా నా దృష్టిలో “వచియింతు వేములవాడ భీమునిభంగి” అనే కాశీఖండంలోని శ్రీనాథుని పద్యం, భీమకవి నన్నయ్య కంటే ముందువాడో, సమకాలీకుడో అయ్యే అవకాశం ఉందనడానికి (కనీసం శ్రీనాథుని కాలానికి అలాంటి నిశ్చయం ఉందనడానికి) ప్రబల సాక్ష్యం.

    మీ రెండవప్రశ్న ఏమిటో అర్థం కాలేదు.

    >>వేములవాడ భీమకవి తరువాత పద్యాలు రాసిన కవులెవరైనా, ఆరవ అక్షరం గా ‘త’ వాడారా? లేదా?

    ఈ ప్రశ్నకి మురళీధరరావుగారు సమాధానం చెప్పేశారు. అయితే మీ ఉద్దేశం తిట్టుకవిత్వానికి కాకుండా, మామూలు పద్యాలలో ఆరవ అక్షరంగా “త”కారాన్ని కవులు వాడారా లేదా అంటే, చాలా చోట్లనే వాడరనుకుంటాను. చప్పున గుర్తుకొస్తున్న పద్యాలు:
    నన్నయ్య – “మద మాతంగ తురంగ”, “నలదమయంతు లిద్దరు”
    ధూర్జటి – శ్రీవిద్యుత్కలితా (శ్రీకాళహస్తీశ్వర శతకంలో మొదటి పద్యమే!)

    దీని గురించి నేను విన్నది – ఆరింట త పెట్టి ఒకరిని తిడితే అది శాపమవుతుంది తప్ప, మామూలుగా ఆ స్థానంలో తకారాన్ని వాడడం అశుభమో ప్రమాదమో కాదు – అని.

  4. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి jayaprabha అభిప్రాయం:

    05/07/2014 2:44 pm

    వాసుదేవరావు గారూ! శాస్త్రం లోని సంగతులని అనువాదం చేయడం ఒక భాషలో రూపొందిన శాస్త్రాన్ని ఇంకోభాషలోకి చేస్తున్నప్పుడు ముఖ్యంగా అంత తేలిక కాదు. అది మీకూ తెలుసు. conceptsని అర్ధం అయ్యేలా చేయడం చాలా కస్టమే కూడా! ఎందుకంటే ఆలోచనల్లోని భిన్నత్వాలు భాషలోంచి అందాలి. ఆధునిక శాస్త్రాలు చాలావరకు పాశ్చ్యాత్యులవి. అన్ని భాషల్లోని ఒకటే అర్ధాలనిచ్చే పదాలు సమానంగా ఉండవు. పడమటి భాషలకీ తూర్పు భాషలకీ నాగరికతలలో ఉన్న తేడాలూ సిధ్ధాంతాలలో ఉన్న తేడాలూ భాషా పరమైన తేడాలూ ముఖ్యమైనవి. అనువాదకులకి ఈ రెండిటింటి పరిచయమూ సమానంగా ఉన్నప్పుడు మంచి అనువాదం చేయవచ్చును అని నేను అనుకుంటాను. మనం ఇంగ్లీషు అనువాదాలని చదువుకోగలుగుతాం! కానీ ఇంగ్లీషునించి మనం చేసుకునే అనువాదాల విషయంలో సమస్యలని ఎదుర్కొంటాం. కొత్త పదాలని తయారు చేసుకోవాలి. ప్రచారం చేసుకోవాలి. వాడుక లోకి వాటిని తెచ్చుకోవాలి. ఇలాకాక ఇంకోలా ఎలా? వేమూరిగారు తేలికగా అన్నమాటలని మీరు కొంచెం సీరియస్గా వ్యాఖ్యానించేరు. హనుమాఫలం సంగతి అలా ఉండనివ్వండి, అలా కాక ఇంకో పేరెట్టి పిలిచినా ఆ పండు తీపితనం పోదు గానీ సిధ్ధాంతాల విషయంలో మాత్రం వేలూరి వెంకటేశ్వరావు గారి బాధ సహేతుకం అయినా అనువాదాలు చేయాల్సి వస్తే మీరు కాన్సెప్ట్ ని ఎలా అనువాదం చేయాలీ మరి? లెఖ్ఖలూ సైన్సూ వీటిని చెప్పాల్సివస్తే ఏమిటి మీముందున్న మార్గాలూ తెలుగులో? మంచి అనువాదం అన్నది భావం చెడకుండానూ భాష భావాన్ని మింగకుండానూ జరగాలి కదా? అనువాదాలు జరగాలి కదా?

    సమస్య ఉన్న పదాలని ఎంచుకుని వాటికి సరి అయిన పదాన్ని అనువాదపు భాషలోకి చెయ్యడానికి ఈ ప్రభుత్వం వారు కాస్త నిపుణులైన వారి సాయం ఎందుకని తీసుకోలేరూ? నలుగురు కలిసి చర్చించుకుని ఒక పదాన్ని ఎంపిక చేసుకుని వాడవచ్చునే! అప్పుడు వేలూరి గారి ఫొటోలో మాదిరి అనువాదాలు తప్పే అవకాశం ఉంది. ఇంకా ఒక విషయాన్ని ఏ వర్గానికి అందించాలని అనుకుంటున్నామో ఆ వర్గానికి చేరువగా ఉన్న భాషని ఎంచుకోవడం ఒక విధానం. (మంచి విధానం కూడా.) ఉదాహరణకి రైతులకి సంబంధించిన సంగతి అయితే అది వారికి తెలిసే నుడికారంలో ఉండాలి. సంస్కృత పదజాలంతో రైతుకి ఏమి ఉత్సుకత ఉండునని ఆ అనువాదం చేసిన వారు గనక ఆలోచించి ఉంటే అలాంటి వాక్యాలసలు పుట్టవు. అందువలన ఇటువంటి వాటి మీద ఒక విధానమూ ఒక తనిఖీ ఉండాలి. మన దగ్గర అలాంటిది ఉందా? నాకు తెలీదు. అందరికీ అర్ధం అవడం అంటే నాకు తెలీదు గానీ ఆ విషయం తో సంబంధం ఉన్న వారందరికీ అర్ధం అవాలి అన్నది మాత్రం నిజం. అయితే అందుకు పంతుళ్ళైన మీరు ఏ మార్గాన్ని అనుసరిస్తారూ లేదా ఏ మార్గాలని సూచిస్తారూ అన్నవి కూడా ముఖ్యమే! అందుకు కృషి అయితే జరగాలి.

    ఉదాహరణకి లెఖ్ఖలు బొత్తిగా రాని నాలాంటి దానికి ఏ మేథమేటిక్ థీరంనో తెలుగులో అనువాదం చేయమని అడిగినా (నాకు తెలుగు ఎంత బాగా వచ్చినా గాని) నేను చెయ్యలేను. అసలు సిధ్ధాంతం వంట బట్టే వీలుండదు గనక. అది ఆయా రంగంలో అనుభవజ్ఞులైన వారే చేయాలి. అంచేత ఏ అనువాదానికైనా భాషతో పాటు విషయం కూడా సమానంగా తెలియాలి. అందరూ అన్ని పనులు చేయలేరు. కానీ మన దగ్గర (అనువాదాల విషయాలలో) అలా అనుకోకపోవడం వలన వేలూరి ఫొటోలో ఉన్న వాక్యాల లాంటి వాక్యాలు పుడతాయి. ఇందుకు పరిష్కారం మార్పు రావడమే! అయితే ఆ మార్పు ఎలా వస్తుందంటే మాత్రం నాకు తెలీదు. ఎందుకంటే ఇండియాలో ఏంచేసినా ఆసక్తివల్ల జరగాలి తప్పితే, అవసరం వల్ల జరగాలి తప్పితే అనుభవం వలన ఏ పనులూ జరగవు. పోనీ అని అనువాదం కోసం డబ్బులు ఇచ్చి చేయించి, నిజంగా మంచి అనువాదాన్ని తేవాలన్న సంకల్పం వల్లా జరగవు. మరెట్లా??

  5. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    05/07/2014 1:37 pm

    1.ఒక ఇంగ్లీషు వ్యాసంలో ఈ దిగువ వాక్యం కనిపిస్తే సంపాదకులు ఒప్పుకుంటారా?

    The Brahma brought the pooja saamagri into the madapam and instructed the vadhuvu and varudu to do a pradakshinam to the agnihotram. -వేమూరి

    ఒప్పుకోవటానికి అవకాశం వుంది. అది పత్రికని బట్టి, వ్యాసం వస్తువు, దాని స్థాయి/ సీరియస్ నెస్ బట్టి, ఇంగ్లిష్ మాటలు కాని పదాలను – సందర్భానుసారం- అచ్చులో ఏ ఇటాలిక్స్ లొనొ కనబడేటట్టుగా ప్రకటించటానికి అవకాశం ఉంది.

    2.అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ?

    అప్పన్న అనే ఆయన పేరు మనకి తెలియక ఆయన అందరికన్నా కాస్త పొడుగ్గా ఉండటం చూసి ఆయనకు మనం అమితాభ్ అని పీరు పెట్టుకుని అప్పన్న కన్నా అమితాభ్ పేరు బాగు లేదూ అంటె ఎలా ఉంటుందో అలా ఉంది. మరి కొన్ని విషయాల గురించి వీలైతే తర్వాత.

  6. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    05/07/2014 10:49 am

    “భాషకి ప్రధానమైన విషయం అర్ధం కావడమే!”_

    కాదు జయప్రభ గారూ. శాస్త్ర విషయాలకు వస్తే ఏ ఉపనిషత్తుల లాగానో షేక్స్పిపియర్ లాగానో అర్థమవటం కాదు. ఒక మాట /ఒక వాక్యం అది విన్న/ చదివిన వారందరికీ ఒకే రకంగా అర్థమవటం ప్రధానమైన విషయం.

    వాసుదేవ రావు

  7. ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం గురించి భాను కిరణ్ కేశరాజు అభిప్రాయం:

    05/07/2014 6:27 am

    మంచి విశ్లేషణ మానస గారూ.

  8. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి jayaprabha అభిప్రాయం:

    05/06/2014 12:42 pm

    వేలూరీ! పోనీ ఏకంగా తెలుగుని బోధనా భాషగా తీసేస్తే పోలే? అని అనబుధ్ధి అవుతున్నది సుమా! స్కూళ్లలో తెలుగన్నది ఒకటి ఉంటే కదా సమస్య మరి? మీరిచ్చిన ఫోటోలో ఉన్న లాంటి భాష బొత్తిగా ఊహ చాలని భాష. తెలుగు భాషలో ఆలోచించి చెప్పగల దక్షత ఉన్నప్పుడు సంస్కృతం కన్నా సరళమైన తెలుగు వాక్యాలలోంచి విషయాన్ని తెలియజేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు, మరీ ఇబ్బంది ఉండకపోవచ్చు అనువాదం చేస్తున్నప్పుడు. సమస్య ఏమంటే నిజంగా తెలుగు చాలినంత రావాలి. తెలుగులో క్లుప్తంగా రాయగలగడం కూడా గొప్ప విషయమే కదా? అందుకు తెలుగు వచ్చిన వాళ్ళూ కాసింత కల్పనా శక్తి, దానితోపాటుగా ఆసక్తీ కూడా ఉన్నవాళ్ళూ అనువాదకులు కావాలి.

    చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న “బొగ్గుపులుసు వాయువు” లాంటి అనువాదాలు తెలుగుకి సహజం కావు కదా. భాషకి ప్రధానమైన విషయం అర్ధం కావడమే! అర్ధం కానప్పుడు ఆ ప్రయత్నం ఎబ్బెట్టుగానే ఉంటుంది అన్నది నిజమే అయినా, బాగు లేదని అసలు ప్రయత్నమే చేయకపోతే ఎలా? ఇది నా ప్రశ్న. పైగా అనువాదం చేసేవాళ్ళు ఎక్కువగా ఇంగ్లీషులోంచి ఊహించి తెలుగులో వాక్యాలని రాయడానికి ప్రయత్నించడం కూడా ఇలాంటి ఒక ఇబ్బంది కి కారణం కావడం లేదా? మనం అయితే ఇంగ్లీషునీ లేదా సంస్కృతాన్నీ ఉపయోగిస్తున్నామే గానీ తెలుగు పదాల కోసం ఆలోచించడం లేదు. బొత్తిగా తెలుగుని జారవిడిచేస్తున్నాం! మంచి తెలుగు పదాలు ఎక్కువగా దొరికేది పల్లెల్లో. కానీ మనకి పట్టణాల ప్రభావం రోజురోజుకీ పెరిగి పోతోంది. అందుకు మీడియా ఒక ముఖ్య కారణం.

    మీడియా మంచి భాషని వాడాలి అని అనుకోవడం అత్యాశేమో గానీ నిజానికి అదొక కాదనలేని మాధ్యమం ఇవాళ. కానీ మీడియావే భాషని శరవేగంగా చంపేస్తోంది. దీన్ని ఆపగలగాలి. అందుకు మీడియా పనితీరు మీద తప్పని సరిగా విమర్శ ఉండాలి. అయితే మీడియాని విమర్శకి పెట్టడానికి మనకి మరో మీడియా లేదే? అది ఎన్నో అనర్ధాలకి కారణం అవుతోంది. విమర్శని భరించలేని స్థితికి సమాజం చేరుకోవడం కన్నా వెనకబాటుతనం ఇంకొకటి లేదు. అన్ని రంగాలకీ ఈ దుర్గుణం వ్యాపించడం వలన శుభ్రమైన ఆలోచనలు నలుగురి మధ్యకీ నిజంగా వెళ్లలేకపోతున్నాయి. తెలుగు దేశంలో బాగున్న తెలుగు ఇంకా ఉండాలి అనో తెలుగులో రేపటి పిల్లలు కూడా ఇంకా చదువుకోవాలీ అనో గనక మనం అనుకుంటేనే అసలు ఈ సమస్యలూ ఈ ప్రశ్నలూ ఈ ఆలోచనలూను. లేకపోతే ఏదీ లేదు.

  9. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి V R Veluri అభిప్రాయం:

    05/06/2014 11:38 am

    గత నాలుగున్నర దశాబ్దాలుగా సైన్సు వ్యాసాలు తెలుగులో ఏకదీక్షగా చేస్తున్న వేమూరి గారికి అభివాదం. ఆయన వ్యాసం ముఖ్య ఉద్దేశంతో (“ఆ పని ఎలా చేయాలి? అందులో ఉన్న సాధక బాధకాలు ఏమిటి?”) నాకు ఏవిధమైన పేచీ లేదు. ఈ పనిలో ఉన్న కష్టాలు వేమూరి గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని నాకు తెలుసు.

    ఇవి నా ప్రశ్నలు.

    ఈ తర్జుమా పని ఎందుకు? ఎవరికోసం? ఈ ప్రశ్నలు నన్ను గత నాలుగు దశాబ్దాలుగా బాధిస్తున్నయి. (భారతి పత్రిక వాళ్ళు అడిగిన తడవుగా ఒకప్పుడు నేనూ భౌతిక శాస్త్ర అంశాలపై ఒకటి రెండు వ్యాసాలు రాసి, ఆ తరువాత కిమ్మనకుండా విరమించుకున్నాను)

    నన్ను బాధిస్తున్న ప్రశ్నలకి సమాధానాలు మరొక వ్యాసంలో చర్చించవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీషు మాధ్యమంగా చదువులు చెప్పటానికి ఇప్పుడు ప్రతి కుగ్రామంలోనూ బడులు కుక్కగొడుగుల్లా వెలిశాయి. ప్రభుత్వం వారు నడిపే తెలుగు మాధ్యమం బడులకి వెళ్ళే పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించీ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దృక్పథంతో, నాప్రశ్నలకి సమాధానాలు వెతకవలసిన అవసరం ఉన్నదని అనుకుంటున్నాను.

    ఆఖరిగా, ఒక ఫొటో. ఈ బొమ్మ తియ్యటానికి వెనుక కథ, తీసిన తరువాత ప్రభుత్వంతో నా ఉత్తర ప్రత్య్త్తరాలు, నా అపజయం గురించి మరోసారి చెప్పుకుంటాను. ప్రభుత్వం జోక్యంతో తెలుగు చేయ్యబడ్డ ఒక ఉదాహరణ మాత్రమే ఇది. (నా దగ్గిర తెలుగులో హడావిడిగా ప్రచురించిన భౌతిక శాస్త్రం పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని పాఠం చెప్పలేక చేతులెత్తేసిన పంతుళ్ళు కూడా నాకు తెలుసు.)

    విధేయుడు,
    వేలూరి వేంకటేశ్వర రావు.

  10. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/06/2014 11:06 am

    మాన్యులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారికి నమస్కారములతో,

    మీరడిగిన మూడవ ప్రశ్నకు సమాధేయం: వాక్యంలో ఏ అక్షరం ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చెబుతూ అప్పకవి శారదాదర్పణంలోని మూలసూత్రాలను ఉదాహరించి, లక్ష్యార్థం తెలుగులోని కొన్ని పద్యాలను తొలిసారిగా ఉదాహరించాడు. ఇతరస్థానాలతోపాటు ఆ క్రమంలో ఆఱవ అక్షరం ‘త’ ఉంటే విషాక్షరంగా పరిణమించి శత్రువును మట్టుపెడుతుందని రెండు పద్యాలను పేర్కొన్నాడు:

    వీరలు చెప్పిన లక్ష్యంబు లెవ్వి యనిన మేధావిభట్టు ఆఱవచోట ‘త’కారము నిలిపి గడియకుఁ ద్రాటిచెట్టు విఱుగఁదిట్టిన చాటుధార –

    క. సాళువ పెదతిమ్మ మహీ
    పాలవరుఁడు వీఁడె వచ్చెఁ బద్యము వ్రాయన్
    గేలను లే దా కొకటియుఁ
    దాళమ! ముత్తునియ లగుచు ధరపైఁ బడుమా. (అప్పకవీయము 2-371)

    వేములవాడ భీమకవి పేరిట ప్రసిద్ధంగా ఉన్న ఆ చాటువును అప్పకవి వేఱొక పేర ఉదాహరించాడు:

    నెల్లూరి తిరుమలయ్య (వెల్లూరి అని కొన్ని వ్రాతప్రతులు) ఆఱవచోటను ‘త’కారంబు నిలిపి తన గుఱ్ఱమును దొంగిలించిన శ్రీపతిరాజు పోతరాజును నేడు దినములకుం జావఁ దిట్టిన చాటుధార –

    చ. హయమది సీత; పోతవసుధాధిపుఁ డారయ రావణుండు; ని
    శ్చయముగ నేను రాఘవుఁడ; జాహ్నవి వారిధి; మారుఁ డంజనా
    ప్రియతనయుండు; లచ్చన విభీషణుఁ; డా గుడిమెట్ట లంక – నా
    జయమును, బోతరక్కసుని చావును నేడవనాడు చూడుఁడీ. (అప్ప. 2-376)

    అందుకనే,

    “క. ఘోరతరపద్యముఖమున
    వేఱుగ నొకచోటు చూచి వెదుకఁగ నేలా
    ఆఱవకడ ‘తా’ నిల్పిన
    మాఱమ్మునఁ గ్రుమ్మునట్లు మడియు మనుజుఁడున్.” అని లక్షణవేత్త లన్నారు.

    ఆఱవ అక్షరంగా ‘త’ ఉన్న పద్యాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? అంటే, ఇది పూరె నరసకవి ఆఱింట ‘త’ నిలిపి చెప్పిన 27 పాదాల తిట్టుపద్యంలో కొద్ది భాగం:

    చ. అటు నిసుమంతఁ దిట్టవలె నంచు మదిం దలపోసి చూచినన్
    జటులనటన్నటాక్షనటజాగ్రదుదగ్రసమగ్రదృక్చమూ
    త్కటలుఠదబ్జజాండతటధట్టన ధట్టన చిట్చిటార్భటో
    ద్భటకృదదభ్రశుభ్రచరభాగ్ఘనతుంగతరంగభంగకృ
    త్పటుతరభూమధూమయుతభంగశతాంగపతంగలోపకృ
    త్కుటిలశిఖానికాయభృతకుంఠితతీక్ష్ణకృశానుభావమై
    … … … … … … … ముం
    గట శరణంచు నిల్వవలెఁ; గీర్తిని గోరిన మానవోత్తముల్
    కటువులు పల్కఁగా వల; దొకానొకవేళ నొకించు కేనియున్
    సటమట లౌదు; రూ రెఱుఁగ సాటెద; సాటితి, జాగ్రతింక; వేం
    కటగిరివాస తప్తమృదుకాంచనవాస రమేశభక్తుఁడన్.

    ఆరుద్రగారు ‘సమగ్రాంధ్రసాహిత్యం’లో మహర్షి వాల్మీకి రామాయణంలో బోయవానిపై ‘మా నిషాద ప్రతిష్ఠాం’ అని చెప్పిన శాపశ్లోకంలో ఆఱింట ‘త’ ఉన్న విషయాన్ని ఉదాహరించారు. ఇటువంటివి ఇంకా మఱికొన్ని ఉన్నాయి.

    మీ స్మరణ నాకు స్మరణోత్సవంగా అనిపించింది. మీ ఆప్యాయనానికి ధన్యవాదాలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు