పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    06/11/2014 10:42 pm

    వ్యాసకర్తలిద్దరూ మన్నించాలి. “అరసున్నకు పూర్వరూపమైన పూర్ణ బిందువులు తీసేయించాడు” అన్న వాక్యంలోని లేఖనదోషం సందిగ్ధతకు తారితీసింది. “అరసున్నకు పూర్వరూపమైన పూర్ణబిందువును తీసేయించాడు” అని దిద్దుకొంటే సరిపోతుంది.

    నిజానికిది సర్వాంతర్వర్తనీయమైన నియమం కాదు. మనుచరిత్ర మొదటి పద్యంలో వ్రాతప్రతిలో “కృతార్థుం జేయు” అని ఉన్నప్పుడు పద్యచ్ఛందస్సును బట్టి అక్కడ లఘువు అవసరం కనుక “కృతార్థుఁ జేయు” అని; తృతీయాశ్వాసం ఇరవైయెనిమిదవ గద్యంలో ఆ విధమైన ఛందోనిబంధం లేనందువల్ల పరిష్కర్తలు వాక్యలయను బట్టి “మిటమిటం గాయు దట్టంపుఁ బండువెన్నెల” అని గ్రహించారు. అరసున్న స్థానంలోని పూర్ణబిందువును ఒకసారి తీసుకోవటమూ, ఒకసారి తీసుకొనకపోవటమూ జరిగింది. ఇది గద్యబంధం విషయం.

    అరసున్న స్థానంలో కొన్ని వ్రాతప్రతులలో ఆంగ్లంలోని విరామచిహ్నమైన (.) చుక్కను నిలపటంకూడా ఉన్నది. “రే.గు”, “తో.చు” ఇత్యాది. దానినికూడా పరిష్కర్తలు తొలగించి, శబ్దస్వరూపానుసారం “రేఁగు”, “తోఁచు” అని ముద్రించారు. బ్రౌన్ అరసున్నలను తొలగించినందువల్ల ఆ చోట్లలో “రేగు”, “తోచు” అని అచ్చువేయటం జరిగింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తఃతః అభిప్రాయం:

    06/11/2014 5:47 pm

    శ్రీ ఏల్చూరి:

    “ఇది ఇలా వుండగా బ్రౌన్ తరవాత పుస్తకాలు అచ్చు వేసిన వాళ్లందరూ — వావిళ్ల వారు కావచ్చు, వేదం వారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు — బ్రౌన్ పరిష్కరించిన ప్రతిని వాడుకోలేదని మనకి స్పష్టంగా తెలుసు.”

    నారాయణ రావుగారి వ్యాసం లొ పై వాక్యాల లొని ‘మనకి (స్పష్టంగా) తెలుసు’ గురించి ఒక విషయం మీకు చెప్పాలనిపించి ఈ అభిప్రాయం రాస్తున్నాను.

    “ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.

    వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”

    పైమాటలు ఊర్మిళాదేవి నిద్ర:ఒక ఆలొచన అన్న పేరుతొ జనవరి 2012 ఈమాటలొ వెల్చేరువారు రాసిన వ్యాసం లోవి. వీటిలొ కూడా వారి అలవాటేమో అనిపించే ‘మనకి తెలుసు’ను చూడవచ్చు. ఆ సందర్భంలో ఈ ‘hand waiving’ని నేను తప్పుపట్టటం ‘ఈ మనం లో నేను లేన’ని చెప్పటమూ గూడా జరిగింది.

    -నమస్కారాలతో -తః తః

  3. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    06/11/2014 4:22 pm

    మాన్యులు శ్రీ శ్రీనివాస్ గారికి, నారాయణరావుగారికి, నమస్కారములతో,

    సౌమ్య వి.బి. గారు మిమ్మల్ని తెలుగు కావ్యాల పరిష్కరణవిధానం గుఱించి అడిగిన ప్రశ్నకు నా వంటి విద్యార్థులకు ఉపకరించే సూత్రాలను కొన్నైనా నిర్దేశింపగలరని ఎదురుచూశాను. అందుకింకా వ్యవధి ఉంటుందని తెలిసి కొంత నిరాశ కలిగింది. మీ బ్రౌన్ దర్శనమీమాంసను అధికరించిన మాటలను ఇప్పటికి వాయిదా వేసి, కొన్ని లఘుప్రస్తావితాల గుఱించిన నా సందేహాలను మాత్రమే విన్నవింపదలిచాను.

    (1)

    ఇది ఇలా వుండగా బ్రౌన్ తరవాత పుస్తకాలు అచ్చు వేసిన వాళ్లందరూ — వావిళ్ల వారు కావచ్చు, వేదం వారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు — బ్రౌన్ పరిష్కరించిన ప్రతిని వాడుకోలేదని మనకి స్పష్టంగా తెలుసు. అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు?

    ఈ మాటలను మీరు ఏ ఆధారంతో వ్రాశారో నాకు తెలియలేదు. బ్రౌను ‘పరిష్కరించిన ప్రతి’ అన్నారు కాబట్టి. ముఖ్యంగా మనుచరిత్రను, వసుచరిత్రను, ఆముక్తమాల్యదను అచ్చువేసిన వావిళ్ళ వారు; ఆముక్తమాల్యదను, శృంగారనైషధాన్ని ప్రకటించిన వేదం వారు ఆ, ఇంకా తదితరులు ఆయన ప్రతులను వాడుకోలేదని ‘మనకి’ ఎలా స్పష్టంగా తెలుసో నాకు తెలియలేదు.

    1927లో ప్రకటితమైన వేదం వారి ఆముక్తమాల్యదా సంజీవనీ వ్యాఖ్యకు ప్రారంభవాక్యమే ఇది: “మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఆముక్తమాల్యదం గూర్చి వ్యాఖ్యలును సూచికలును కొన్ని కలవు. అవియన్నియు కొన్నిభాగములకే వివరణోద్యమములు.”

    ఇందులో వేదం వారు పేరు చెప్పకపోయినా పేర్కొన్న వ్యాఖ్యలు – బ్రౌను హయాంలో సేకరింపబడిన గుడిపాటి వెంకటకవి తాత్పర్యబోధిని, జోగి జగన్నాథరాజు బుధమనస్తోషిణి, శ్రీనివాసకవి శ్రీనివాసీయ వ్యాఖ్య, అజ్ఞాతకర్తృకమైన ఒక టీక మొదలైనవి. అవి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. వేదం వారు ‘సూచిక’ అని పేర్కొన్నది బ్రౌను దొర సిద్ధం 1849లో చేసిన ఆముక్తమాల్యదా శబ్దసూచి. అది శబ్దరత్నాకర నిఘంటునిర్మాణంలో బహుజనపల్లి సీతారామాచార్యుల వారికి, సంజీవనీ వ్యాఖ్య నిర్మాణంలో వేదం వేంకటరాయశాస్త్రిగారికి ఎంత ఉపకరించినదీ ఆ గ్రంథాలలోని పాఠాలే మనకు సాక్ష్యామిస్తాయి. బ్రౌన్ ప్రతులు వారికి ఉపకరింపలేదనటం సరికాదు.

    వావిళ్ళ వారు బ్రౌను మనుచరిత్ర ప్రతిని ‘వాడుకొన్నారని’ మనుచరిత్రలోని వారి పాఠనిర్ణయక్రమమే వేయినోళ్ళతో చాటుతున్నది. పాఠాలను స్వీకరించి, అర్థనిర్ణయంలో మాత్రం స్వతంత్రమార్గాన్ని అవలంబించారు. మనుచరిత్ర వ్యాఖ్యలో జూలూరి అప్పయ్య గారు ద్వితీయాశ్వాసం ఆఱవ పద్యంలో “పరిమళలహరీ+ హల్లోహల” అని పదచ్ఛేదం చేసి “హల్లోహల = తొట్రువడిన వాక్కులు గల” అని అర్థాన్ని వ్రాయగా, వావిళ్ళ వారు విభేదించి “పరిమళ+లహరీ+ఈహత్+లోహల” అని పదచ్ఛేదం చేసి అర్థాన్ని వ్రాశారు. ఇటువంటివి కోకొల్లలు. బ్రౌనుగారికి అభిమానపాత్రమై బ్రౌణ్యంలోనికి ఎక్కినంతమాత్రాన వావిళ్ళ వారు ఆ అర్థాలను గ్రహింపకపోయినా, చాలా వఱకు బ్రౌను ముద్రణలోని పాఠవ్యవస్థనే అనుసరించారు.

    జాగ్రత్తగా చూస్తే, బ్రౌను మనుచరిత్ర ముద్రణలో తప్ప మఱెక్కడా కనిపించని ప్రయోగాలు (చూ. వెల్చ) శబ్దరత్నాకరంలోకి అడుగుపెట్టాయి. అది సీతారామాచార్యులవారు బ్రౌను ప్రతులను వాడుకొన్నారనటానికి నిదర్శనం. ఆయన స్వయంగా పరిష్కరించిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి ‘జైమిని భారతము’, యతిరాజులు నాయుడు గారి ‘జైమిని భారతము’ ముద్రణ – బ్రౌన్ సేకరించిన ప్రతుల మూలకంగా పరిష్కరింపబడినవని తెలుస్తుంది.

    బ్రౌను ప్రతులను వాడుకొన్న ‘ఇంకా ఇతరులు’ అనేకులే ఉన్నారు. బ్రౌను ప్రతులను వాడుకొన్న విద్వాంసులందరూ ఆయన పేరును స్మరింపలేదనటం కూడా సరికాదు. 1895లో తొలిసారి ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యాన్ని ప్రకటించిన క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రులవారు, ఆర్. వేంకటసుబ్బయ్యగారు తమ ‘పీఠిక’లో – “దొరతనమువారి లిఖితపుస్తక భాండారంబునందు మెస్తరు బ్రౌన్ దొరగారిచే సేకరింపబడి కడు హెచ్చరికతో వ్రాయింపబడిన ప్రతియొకండు మాకు దొరకె.” అని వ్రాశారు. ఈ మాటలు బ్రౌన్ గారి సేకరణపై వారికేర్పడిన కృతజ్ఞతాభావానికి సూచికలు. 1870లో కస్తూరి రంగకవి సాంబనిఘంటువు కర్నూలు జిల్లా రామళ్ళకోట నివాసి నన్నూరు వెంకటకృష్ణశాస్త్రి గారి టీకతోనూ; 1872లో ధనంజయ నిఘంటువు, 1897లో ఇరుగపదండేశుని నానార్థ రత్నమాల వాందారి పాపన్నశాస్త్రులవారి టీకతోనూ; 1898లో సుజనరంజనీ సీరీస్ వారి 4-వ సంపుటంగా గణపవరపు వేంకటకవి వేంకటేశాంధ్రము; 1898లో పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామసంగ్రహము వెలువడ్డాయి. ఇవన్నీ మద్రాసులోని బ్రౌను సేకరణ ప్రతుల ఆధారంగా వెలసినవే అని సులభంగా గ్రహింపవచ్చును.

    1900లో వీటిని మళ్ళీ ఒక సంపుటంగా రూపొందించి కోటి వేంకనార్యుని ఆంధ్రభాషార్ణవముతో కలిపి అమ్మిన పరవస్తు వేంకటరంగనాథస్వామి గారు వీటిని బ్రౌను ప్రతుల ఆధారంగానే అచ్చువేశారని — “మఱియైదు తాటియాకు ప్రతులును, మఱియొక కాకితపు బ్రతియునుగూడ నున్నవి.” అని పేర్కొన్నది బ్రౌను సంచయంలోని అయిదు ప్రతులను గుఱించే. ఇప్పటికీ అవి మద్రాసులో ఆ ప్రకారంగానే ఉన్నాయి. అంతే గాక, ఆయన — “అకారాది శబ్దసూచి (Index) కూడ ద్వరలో ముద్రింప సమకట్టి యున్నాము” అని పేర్కొన్నది బ్రౌన్ దొర వ్రాయించిన ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ మూలకమే. బ్రౌన్ దొర వ్రాయించిన ఆ ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ 216 వరుస సంఖ్యతో ఇప్పటికీ అక్కడున్నది.

    ఇవన్నీ బ్రౌను సంచయాన్ని మనవాళ్ళు వాడుకొన్నారనటానికి నేను ప్రస్తుతం నా దగ్గరున్న కొన్ని పుస్తకాలలోనుంచి మాత్రమే ఉదాహరించాను. నా దగ్గర లేనివి ఇంకా ఎన్నో ఉంటాయి.

    (2)

    అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు?

    బ్రౌన్ అనుసరించిన గ్రంథపరిష్కరణపద్ధతులేమిటో మీరు తర్వాత వివరిస్తానన్నారు. అప్పుడు వీళ్ళు దాదాపుగా అనుసరించారో లేదో నిర్ణయించటం సుళువవుతుంది.

    (3)

    తెలుగుని ఉద్ధరించే పనిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చారణలో ఆచూకీ లేని బండి-రలు, అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు.

    బ్రౌను తన ముద్రణలలో శకటరేఫలను పూర్తిగా తీసేయించాడన్నది ఎంతవఱకు నిజమో నాకు తెలియదు. మనుచరిత్రలో శకటరేఫలు అసలు లేవనటం సరికాదు. మీరు ఉదాహరించిన ప్రతినే మళ్ళీ చూడండి. నా సొంత ప్రతి ఇప్పుడు హైదరాబాదులో మా ఇంట ఉన్నది కాని, అందులో ఉన్నాయనే నాకు జ్ఞాపకం. మీరు ఉదాహరించిన ప్రతిలోని ఆ తొలిపుటలో శకటరేఫల అవసరం లేదు కాబట్టి అవి అందులో లేవు. నేను నా దగ్గరున్న జూలూరి అప్పయ్య గారి వ్యాఖ్యతో ఉన్న నా సొంత వసుచరిత్ర ప్రతిని ఈరోజు పూర్తిగా పరీక్షించి చూశాను. అందులో నియత శకటరేఫలు నియమానుసారం ఉన్నాయి. కవిత్రయ భారతం తొలినాటి బ్రౌన్ ముద్రణలో ఎట్లా ఉండినదో నేను చెప్పలేను. నా దగ్గరున్న బ్రౌన్ మలిముద్రణలో శకటరేఫ, అరసున్న – రెండూ ఉన్నాయి. మీరు చూడదలచుకొంటే ఒకటి రెండు పేజీలు ఫోటో తీసి పంపించగలను.

    అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు.

    ఈ వాక్యం నాకు బోధపడలేదు. “అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించటం” ఏమిటి?

    బ్రౌన్ దొర బండి-ర లను పాటించినా, మనుచరిత్ర, వసుచరిత్రలలో అరసున్నలను తొలగించి అచ్చువేయించిన మాట నిజమే. అయితే, 1827లో అచ్చువేయించిన ‘ఆంధ్ర గీర్వాణచ్ఛందస్సు’లో అరసున్నలను పాటించాడు, మీరూ చూడండి. ఈ రెండింటి విషయమై బ్రౌన్ ఒక స్థిరనిశ్చయంతో లేరని, వివిధపద్ధతుల ప్రయోగాలను చేస్తూ వచ్చారని – ఈ ఉదాహరణలు వెల్లడిస్తాయి.

    ఆ ప్రతులు ఎవరన్నా వాడుకోదలుచుకున్నా పాఠపరిష్కరణ విషయంలో అవి పనికిరావని చెప్పాం. అందులో అర సున్నలు, బండి రలు పాటించక పోవటం, అందుకు ప్రధాన కారణం.

    అరసున్నలు, బండి-ర లు తాళపత్ర ప్రతులలోనూ ఉండవు. బ్రౌన్ ప్రతులలో అవి లేకపోతే అదొక సమస్య కాదు. అదే సమస్య అయితే, వాటిని చేర్చటం ఒక రోజు పని. బ్రౌన్ ఎన్నుకొన్న పాఠాలకంటె తమకు లభించిన ప్రతులలో మేలైన పాఠాలున్నాయని అద్యతన పరిష్కర్తలు భావించటమే వాటిని ప్రమాణీకరించకపోవటానికి కారణం. ఎమెస్కో వారి కావ్యాల ప్రచురణకోసం పరిష్కర్త శ్రీ తీర్థం శ్రీధరమూర్తి గారు స్వీకరించిన మేలైన పాఠాలన్నీ బ్రౌన్ దొర సంచయం లోనివే. ఆ గ్రంథాలయంలోని నిబంధనల కారణంగా వారు ఆ కావ్యాలపై తమ పేరును వేసుకొనలేదు. ఆ విధమైన కారణం వల్లనే చాలామంది పరిష్కర్తలు, ముద్రాపకులు బ్రౌన్ సంచయాన్ని వాడుకొన్నా, ఆ రోజులలో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం వారి ఏవేవో నియమాల కారణంగా ఆ విషయాన్ని పేర్కొనటం జరగలేదు. అది బ్రౌన్ కృషి స్వరూపం తెలియకా కాదు; వారి కృతజ్ఞతారాహిత్యమూ కాదు; బ్రౌన్ సంచయం నిరుపయోగం కావటం వల్లనూ కాదు.

    (4)

    కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్లారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. అంతే కాదు, ఆయన అచ్చు వేసిన వసుచరిత్ర, మనుచరిత్ర మొదలైన పుస్తకాలని ఎవ్వరూ తిరిగి అచ్చు వేయలేదు.

    ఆరుద్ర గారు ఈ విషయమై వ్రాసినది సరిగా లేదు. బుచ్చయ్యగారి వ్యాఖ్య అచ్చుపడకపోవటానికి కారణం ‘పరిష్కరణ పద్ధతి’ కాక ఇంకేదో అయివుంటుంది. జూలూరి వారి వ్యాఖ్య గ్రాంథిక-వ్యావహారికాల సమ్మిశ్రణగా, ఆరుద్రగారు అన్నట్లుగా కాక -– సలక్షణమైన అలంకారాది వివేచనతో, సంస్కృత లక్షణోదాహరణలతో భవ్యంగా, భావ్యంగా ఉన్నది. ఆ తర్వాత కాలంలో సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, తంజనగరం తేవప్పెరుమాళయ్య గారి అద్భుతమైన వ్యాఖ్య, వావిళ్ళ వారి పరివర్ధిత వ్యాఖ్య మొదలైనవి వెలుగుచూశాక అంతగా రసాలంకారభావధ్వని వివృతులు లేని బుచ్చయ్యగారి వ్యాఖ్య ముద్రణ, జూలూరి వారి వ్యాఖ్య పునర్ముద్రణ అవసరం లేకపోయాయి.

    బ్రౌన్ వ్యక్తిత్వాన్ని గుఱించి మీరు వ్రాసిన విషయవిస్తరణతో ఐకధ్యం లేని అంశాలను మఱొకసారి!

    (5)

    బ్రౌన్ పరిష్కరణ సంవిధానం మీరే ఉదాహరించిన ఆంగ్లవాక్యాలను బట్టి, అది సార్థకమై, అంతర్జాతీయప్రమాణాలకు సైతం అనుగుణంగా ఉన్నట్లే నాకనిపించింది. ప్రతులను సేకరించటం, పాఠాంతరాలను గుర్తించటం, కవికి అత్యంతసమీపకాలంలో వెలసిన పాఠాన్ని గుర్తించటం, భావప్రతీతికి దోహదంచేసే మేలైన పాఠాన్ని స్వీకరించటం అన్న ఆయన ‘విధానం’ మీరన్నట్లు ఈనాటికీ మనము అనుసరిస్తున్నదే. అందులో లోపాలుంటే, అవి పరిష్కర్త వైదుష్యలుప్తికి, పరిణతప్రజ్ఞ లేమికి, కావ్యానుభవరాహిత్యానికి మాత్రమే నిదర్శనలు. విధానంలో లోపాలు కావు.

    ఈ విషయమై విద్యార్థిగా అభిమానమూ, జిజ్ఞాస ఉన్న నేను బ్రౌన్ మాటెలా ఉన్నా, ‘తెలుగు భాషకు అనువర్తించే ఆదర్శ పరిష్కరణవిధానం’ గుఱించి మీరు వ్రాయగల ప్రామాణికవ్యాసానికై ఆసక్తితో ఎదురుచూస్తుంటాను.

    సప్రశ్రయంగా,

    ఏల్చూరి మురళీధరరావు

  4. ఈమాట గురించి గురించి తఃతః అభిప్రాయం:

    06/11/2014 12:31 pm

    ఇప్పుడు rot తేరిన తెలుగు సినిమాలో ఒకప్పుడు రాటు తేరిన కళాకారుల పేర్లు : ఘంటసాల, రేలంగి, గుమ్మడి , రాజనాల, ముక్కామల, మిక్కిలినేని, వంగర, చదలవాడ – ఇవన్నీ ఇంటి పేర్లా వంటి పేర్లా? తః తః

  5. ఏనాడూ విడిపోని ముడి వేసెనె గురించి venkat.b.rao అభిప్రాయం:

    06/11/2014 11:15 am

    పైన, ఉషగారి వ్యాఖ్యలోని విమర్శ న్యాయమైనది. సంపాదకుల పని ఇక్కడే ఉంటుంది. రచయిత(త్రి) రాసేటప్పుడు అనాలోచితంగానే ఒక తరగతి పాఠకలోకాన్ని (class readership) దృష్టిలోపెట్టుకుని రాయడం జరుగుతుంటుంది, ఒక్కొకప్పుడు. తనకు తప్పుగా తోచనిది వాళ్ళలో ఎవరికీ తప్పుగా తోచదని అనుకోవడం జరుగుతుంది. సంపాదకులకు ఈ దృష్టిలోపం ఉండదు. అన్ని తరగతులవారూ పాఠకులే. అందువలన, వారందర్నీ దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి సరిదిద్దడం జరుగుతూంటుంది. ప్రింటు మీడియాలో అయితే ఇప్పటికీ ఇది ఆచరించ బడుతోంది. ఈ కథలోని ఆంగ్ల భాగాలను అనువాదంలోకి తేబడకుండా (ప్రింటు లో) ముధ్రణకు స్వీకరించే వారని నేను అనుకోలేను. ఇక్కడి పధ్ధతులలో ఇదే కొంచెం తికమకగా, ఇబ్బందికరంగా ఉంటుంది.

    వ్యాఖ్య/విమర్శలోని రెండో భాగం –
    దీనికి సమాధానం వెయ్యేళ్ళుగా దొరకడంలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు అనిపిస్తుంది. ఏ దుర్ముహూర్తాన (?!) రాజరాజు నన్నయను సంస్కృత భారతాన్ని తెలుగులో రాయమని అడిగాడోగాని, ఆ పై కొన్ని శతాబ్దాలుగా అదే పధ్ధతై పోయింది. ఆధునిక యుగంగా చెప్పుకుంటున్న కాలంలో మార్పల్లా ఆప్పుడు సంస్కృతమయితే, ఇప్పుడు ఆంగ్లం! ఆంధ్రా మిల్టననీ, ఆంధ్రా షెల్లీ/కీట్సు అనీ, ఆంధ్రా లారెన్సు అనీ…ఇలా ఆంధ్రా సో అండ్ సోలను తయారుచేసుకుని పిలుచుకుంటూ సాహిత్యవ్యాసంగం సాగిస్తున్నాం.

    స్పూర్తి పొందడంలో తప్పేమీ లేదు. కానీ, స్పూర్తే యావత్సాహిత్యమూ కాగూడదు గదా! మనవంటూ కొన్ని సాహిత్యానికి సంబంధించిన ఆలోచనలు (ideas), సృష్టీకరణలు – చెప్పే పధ్ధతిలో గానీ (చైతన్య స్రవంతి – stream of consciousness-, మర్మ వాస్తవం – magic realism – ఇట్లాంటివి) లేదా సంగతి (content) లోగానీ (Albert Camus – The Outsider; Paul Auster – The Music of chance, The New York Trilogy etc; Milan Kundera – Life is elsewhere, The unbearable lightness of being etc; ఇట్లాంటివి) – ఉండాలి గదా! కొత్తది చెప్పాలి గదా! మానవ జీవితానికి/జీవనానికి సంబంధించి ఒక కొత్త కోణాన్ని గాని, సంగతినిగాని ఆవిస్కరించి చూపని రచన ఏదైనాసరే అనైతికమైనదిగా భావించబడుతుంది. అంతర్జాతీయంగా నిలబడదు.

    తెలుగు భాషకు సంబంధించి ఇకముందన్నా ఎప్పుడు ఎవరు ఎక్కడ గొప్పగా రాయ దలుచుకున్నా తెలుగు భాష ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని రాయబోయేముందు ఇటాలియన్ భాషను గురించి ఎప్పుడన్నా ఎవరన్నా ‘తెలుగు ఆఫ్ ది వెస్ట్’ అని అన్నారా? అని ఒక్క సారి ఆలోచించుకుంటే బాగుంటుందనుకుంటాను.

    ప్రతి మనిషికీ తనదైన వ్యక్తిత్వం కావలసినట్లుగానే, మన సాహిత్యానిక్కూడా ఒక ప్రత్యేకమైన ‘సాహిత్య వ్యక్తిత్వం’ కావాలి. దాన్ని ప్రతిబింబించే పెద్ద రచనలు రావాలి (ఒకప్పుడు శ్రీశ్రీ ‘విశాఖపట్టణం’ అనే పేరుతో ఎప్పటికైనా ఒక 18 ఆశ్వాసాల గ్రంథం రాయాలని కోరుకున్నది ఇలాంటి లొపాన్ని పూరించాలన్న ఆలోచనతోనే అని నేననుకుంటాను). అది జరిగేంతవరకూ ఈ బాధలు తప్పవు… borrowed ideas తో సాహిత్యం అప్పటికి కొత్తదిగా వుండి మనకు ఆనందాన్ని ఇవ్వవచ్చునేమోగాని, అంతర్జాతీయంగా నిలవదు!

    ఆఖరున, ఇందులో ఎక్కడైనా ఎవరికైనా మనసు కష్టం కలిగించేదిలా అనిపిస్తే అది అనాలోచితంగా జరిగిందే గాని, ఎవరినీ పనికట్టుకుని నొప్పించే ఆలోచన నాకు లేదు కాబట్టి, విషయ ప్రథానంగా ఆలోచిస్తారని నమ్ముతున్నాను!

    ధన్యవాదాలు!

  6. మైదానానికి చెలియలి కట్ట గురించి Manjari Lakshmi అభిప్రాయం:

    06/11/2014 5:44 am

    ముఖ పుస్తకం అంటే ఏమిటా అని చాలా సేపు ఆలోచించాను అది కూడా ఒక తెలుగు వెబ్సైట్ అనుకున్నాను. కానీ తరువాత అర్ధమైంది ఫేస్ బుక్ కు అలా వాడారని. నాకెందుకో ఇలా పదాలు మక్కీకి మక్కీ అనువాదం కాకుండా ఏదన్నా వేరే పదం వాడితే బాగుంటుందా అనిపిస్తోంది. ఈ వ్యాసం చలం విశ్వనాధంలను బేరీజు వేసుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను.మీరు చెప్పింది నిజమే విశ్వనాధ ఫ్యూడల్ భావాలనే నెత్తి మీద పెట్టుకొని ఏదన్నా వ్యతిరేక కామెంట్ చేస్తే ఒప్పుకోని వాళ్ళు చాలామందే ఉన్నారు.

  7. గూడు గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    06/11/2014 3:48 am

    అయ్యవార్ల కార్లకు ఇబ్బందిగా వుందని వందలేళ్లనాటి మహా వృక్షాల్నే తెగనరికి పడేశాం! సాములూ సాములూ అంటే కరిగిపోతామా? జానెడులేని మల్లెతీగ ఓ లెక్కా?

  8. సెలవురోజు మొదటి ఆట గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    06/11/2014 3:39 am

    ఇలాంటి కష్టాల్ని కళారూపాల్లో వాడటం ఎప్పుడో మానేసి వాటికి సినిమా కష్టాలని నామకరణం చేసి, వాటి మీద వీలైతే సటైర్లు తయారుచేసి కామెడీ ట్రాక్కుల్లో వాడుకుంటూ (వెకిలి కామెడీకి ముడిసరుకుగా)తెలుగు కళాస్రష్టలు కళను ముష్టివాళ్లకూ వేశ్యలకూ ఇంకా అల్లాంటి ఓటు తప్ప మరే హక్కులూ లేని ప్రజలకూ ఏమాత్రం ప్రయోజనం కలిగించే ప్రమాదం నుండి ఎప్పుడో తప్పించి ‘పుణ్యం’కట్టుకున్నారు. ఇలాంటి షో లకు ఎవ్వరూ వెళ్లరు, వెళ్లినా కన్నీళ్లు కార్చరు (కనీసం ఇండియాలో).

  9. విముక్తం గురించి lyla yerneni అభిప్రాయం:

    06/10/2014 2:58 pm

    “మీరెప్పుడూ ప్రేమగానో, బాధలో ఓదార్పు కోసమో మీ అమ్మగారిని దగ్గరగా కౌగిలించుకోలేదా? మీ అక్కా చెల్లెళ్ళతో దగ్గరగా ప్రేమ పంచుకోలేదా?”
    “ఉంటే అది చూసేవారి కళ్ళలో ఉండవచ్చు.”

    Oh! Now the “Other woman” is either the mother or sister of the Heroine. Not just a friend. A new revelation.
    Which one is she? Can she possibly be both the mother and sister of the Heroine?
    Yeah! There are stories like that. కథకులు, సినిమాలు చూపిస్తే, నా కళ్లారా చూశాను.

    లైలా

  10. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అభిప్రాయం:

    06/10/2014 2:51 pm

    మిత్రులు వురుపుటూరి శ్రీనివాస్ గారికి, మీరు ఉత్తరం రాసిననందుకు సంతోషం. మీరు చూపించిన దోషాలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుంది.

    మొదటిది: ఓరియంటల్ లైబ్రరీలో పరుచూరి శ్రీనివాస్ ఏమి చూశాడో సాధ్యమైనంత స్పష్టంగానే చెప్పాం. ఆ లైబ్రరీలో ఎక్కువ సేపు గడపటానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో శ్రీనివాస్ అక్కడికి వెళ్లాడు. అప్పుడు ఆ లైబ్రరీలో రెనొవేషన్‌ జరుగుతోంది. అయితే అప్పటికీ రెండు రోజుల పాటు అక్కడ గడిపిన తరువాత శ్రీనివాస్ చూసిన విషయాలు మేము వివరంగానే చెప్పాం. మొదటిది మీరే గమనించారు. అక్కడ బ్రౌన్ రాయించిన కాగితపు ప్రతులు ఆలనా పాలనా లేకుండా పడివున్నాయి. రెండోది: ఆ ప్రతులు ఎవరన్నా వాడుకోదలుచుకున్నా పాఠపరిష్కరణ విషయంలో అవి పనికిరావని చెప్పాం. అందులో అర సున్నలు, బండి రలు పాటించక పోవటం, అందుకు ప్రధాన కారణం.

    బ్రౌన్ వెళ్లిపోయిన తరువాత మన పాత పుస్తకాలు పాత తాటాకు ప్రతుల ఆధారంగానే చాలామంది పరిష్కరించి వ్యాఖ్యానించి ప్రకటించారు. వీళ్లందరికీ పాత తాళప్రతులు దొరికాయి. ఆ ప్రతులు బ్రౌనే సంపాదించి పెట్టినవో లేకపోతే వేరే రకాలుగా చేరినవో మాకు స్పష్టంగా తెలియదు. మేము చెప్పిందల్లా ఆ తాళపత్ర ప్రతులు నశించిపోలేదనీ, ఇంకా ఉన్నాయనీ, వాటి ఆధారంగానే మన పాత గ్రంథాల పరిష్కరణ చేసుకుంటున్నామనీ, బ్రౌన్ చేయించిన కాగితపు ప్రతులు మనకు ఉపయోగపడలేదనీ — అంత మాత్రమే. ఈ విషయమై ఇంకొంత శ్రద్ధగా పరిశీలించి ఒక నిర్ధారకమైన అభిప్రాయానికి రావడానికి తెలుగు దేశంలో ఉన్న పండితులు, పరిశోధకులు ప్రయత్నించాలి. తాళపత్రగ్రంథాలకు దూరంగా ఒకరం జర్మనీలోను, మరొకరం అమెరికాలోను కూర్చుని ఇంతకన్నా నిర్ధారకంగా చెప్పలేకపోయినందుకు విచారిస్తున్నాం. మా ప్రయత్నమల్లా బ్రౌన్ లేకపోతే తెలుగు సాహిత్యం చచ్చిపోయేదే, బ్రౌన్ చేసిన పునరుద్ధరణ వల్లే బతికి ఉంది అనే లాంటి నిరాధారమైన పొగడ్తలకి అభ్యంతరం చెప్పడమే.

    ఇక పోతే బ్రౌన్ ప్రవేశ పెట్టాడని మేం అంటున్న గ్రంథ పరిష్కరణ విధానాలు ఆనాటి చదువుల కారణంగా ఏర్పడినవి, అప్పటి అవగాహనల వల్ల ఏర్పడినవి, అది అప్పటి పరిమితి — అని అనుకోవచ్చుకదా అని మీరు సందేహాన్ని వ్యక్తం చేశారు. బ్రౌన్‌కి పూర్వం తెలుగుదేశంలో ఇంగ్లీషు చదువులు బలంగా లేవు. అవి అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. మన గ్రంథ పరిష్కరణ విధానంలో బలంగా వున్నవి బ్రౌన్ మనకి అలవాటు చేసిన విధానాలే. అది ఎవర్నీ తప్పు పట్టడం కోసం రాసిన వాక్యం కాదు. తెలుగు పండితులు ఆతరవాత చాలాకాలం వరకూ కూడా ఇంగ్లీషు చదువుకోలేదు. వాళ్ల చుట్టూ వున్న ఇంగ్లీషు చదువులు ఈ విధానాలని విమర్శించడానికి కావలిసిన సాంస్కృతిక స్థైర్యం వాళ్లకి లేకుండా చేశాయి. మనకి ఇంగ్లీషు చదువుల వల్ల చాలా లాభాలు కలిగిన మాట నిజమే. అయినా నష్టాలు కూడా జరిగాయి. వాటిని గమనించడానికి, ఆ నష్టాలనుంచి మనం బయటపడడానికి, చాలా ఆలోచన, చాలా పరిశ్రమ కావాలి.

    వేమన పద్యాల పట్ల బ్రౌన్‌కున్న అభిమానాన్ని బ్రాహ్మణ వ్యతిరేకతగా మేము చూపించటం కుదరదంటున్నారు మీరు. ఈ విషయాన్నే ఇంతకు ముందు వచ్చిన ఉత్తరాల్లో ‘ఒకడు’గారు కూడా ప్రస్తావించారు. బ్రౌన్‌దృష్టిలో హిందూ మతమంటే బ్రాహ్మణులు చెప్పేదే. బ్రాహ్మణులు కాని వారు అనుసరిస్తున్న అనేక మత విధానాల పట్ల, వాళ్ల సంస్కృతి పట్ల బ్రౌన్‌కేమీ శ్రద్ధ లేదు. అతనికి జంగమ సాహిత్యం, వేమన సాహిత్యం నచ్చటానికి అందులో అతను గమనించిన బ్రాహ్మణ వ్యతిరేకత మాత్రమే నిజమైన కారణం. అతనికి క్రిస్టియన్ మతం పట్ల పట్టుదల, అందులోనూ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మతం పట్ల పట్టుదల ఉందని అతను స్పష్టంగానే చెప్పుకున్నాడు. పోతే అతనిలోని బ్రాహ్మణ వ్యతిరేకతే అతని హిందూ వ్యతిరేకత. అది వ్యక్తులుగా బ్రాహ్మణుల మీద వ్యతిరేకత కాదు. అతను తన దగ్గర పనిచేసే బ్రాహ్మణ పండితుల్ని చవకగా వాడుకున్నా, గౌరవంగానే చూశాడు. అయితే వాళ్ల దగ్గరనుంచి అతను కొత్త ఆలోచనలేమీ నేర్చుకోలేదు. మాటలకి అర్థాలు మాత్రమే నేర్చుకున్నాడు.

    మంచి ప్రశ్నలు అడిగినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు.

    – శ్రీనివాస్, నారా