కొన్ని మినీ కవితలు

రైలుబండి

కొందరికి ఆనందాన్నీ
మరికొందరి విషాదాన్నీ
మోసుకుంటూ రైలుబండి
రానూ వచ్చింది
పోనూ పోయింది

కబుర్లలో మునిగిపోయి మనం
రైలు ఉనికినే గుర్తించం!

ఆట

తూగుడు బల్లాట
ఆడుకుంటూ
సూర్య చంద్రులు!

బాల్యం

తుప్పల్లోకి పోయిన బంతి
ఎప్పటికీ మరి కనిపించదు

గోరింట

అమ్మాయిలు రాత్రి పెట్టుకున్న గోరింట
ఉదయానికి పండితే
ఆకాశం ఉదయం పెట్టుకున్న గోరింట
రాత్రికి పండుతుంది!

చుక్కలు

రాత్రంటే
ఆకాశానికి సైతం
ఎంత ఆకర్షణ
ఒళ్ళంతా
కళ్ళు చేస్తుకుంది!

మేఘం

ఎంత చిత్రమైనదీ మేఘం
సరిహద్దులెరుగని స్వేచ్ఛకలిగీ
సూర్యుణ్ణి సైతం నిలువరించగలిగీ
ఏ చల్లని స్పర్శకైనా కరిగిపోతుంది
ఎంత తడిని
తనలో దాచిందో!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...