
ప్రవాసాంధ్ర సాహిత్య దిగ్గజం, ఈమాట పత్రిక విశ్రాంత సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సదా ఈమాట పత్రికకు శ్రేయోభిలాషి అయిన డా. వేలూరి వేంకటేశ్వర రావుగారు ఫిబ్రవరి 7, 2026 ఉదయం ఈలోకం విడిచి వెళ్ళారు. అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో విశ్రాంత జీవితం గడుపుతూ, తన చివరి శ్వాస వరకు తెలుగు సాహిత్యం గురించే ఆలోచించిన వేలూరిగారికి ఇవే మా కన్నీటి నివాళులు.
ఏలూరులో చిన్నతనంలో నక్షత్రాలు, చందమామ గురించి రాసిన చిన్న పద్యం నుండి, థియోసాఫికల్ సొసైటీ స్కూలు మ్యాగజైన్ కోసం రాసిన వ్యాసాల నుండి, తెలుగు సాహిత్యరంగంలో నిశిత విమర్శకునిగా, కథారచయితగా, అనువాదకునిగా తనదైన ముద్రవేసుకొన్న ఆయన సాహితీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 20వ శతాబ్దపు సాహిత్య ఉద్దండులెందరితోనో ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయం, వెల్చేరు నారాయణరావు గారి వంటివారి స్నేహం, సాహచర్యం ఆయనలోని విమర్శకుడిని, రచయితను మరింతగా సానబెట్టాయి. ఈమాట పత్రికకు తొలినాళ్ళనుండి తన అండదండలను అందజేసిన ఆయన 2004వ సంవత్సరం నుండి 2014 దాకా ప్రధాన సంపాదకునిగా ఈమాటను నడిపించారు. “ఏదైనా గొప్ప కట్టడం నిర్మించాలంటే, ముందు దాని పునాది బలంగా ఉండాలి” అని నమ్మిన వేలూరి గారు, ‘ఈమాట’ పత్రికకు ది న్యూయార్కర్ పత్రిక తరహాలో ఒక అంతర్జాతీయ స్థాయి తీసుకురావాలని తపించేవారు. ఆయన సంపాదకత్వంలో ఈమాట పత్రిక తెలుగు సాహిత్యానికి ఒక దిక్సూచిలా నిలిచింది. పత్రికకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో ఆయన కృషి మరువలేనిది.
వేలూరి గారు కేవలం రచయితే కాదు, ఒక నిశిత విమర్శకుడు కూడా. “I have done ‘enough damage’ with eemaaTa” అని తన గురించి తాను చమత్కరించుకోగలిగిన నిరాడంబరత ఆయన సొంతం. భారతీయ ఆలంకారిక శాస్త్రాల ప్రాముఖ్యతను గుర్తించి, భారతీయ-ఆధునిక విమర్శనా విధానాల మేలుకలయికగా సాహిత్య విమర్శకు కొత్త చూపునివ్వాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రాసిన కథలు, వ్యాసాలు, ఈమాట కోసం ఆయన పడిన తపన ఈ పత్రిక పాఠకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. డా. వేలూరి వేంకటేశ్వర రావు గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈమాట కుటుంబం ఒక ఆత్మీయమిత్రుణ్ని, సమర్థుడైన మార్గదర్శిని, శ్రేయోభిలాషిని, కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయింది.