శూన్యం

నీవొక్కసారి పోయావంటే –
పోయినట్టే!
నేనెంతగా వలపోసినా,
తిరిగి రావు కదా!

నా చూపులు వేల మైళ్ళు పరిగెత్తినా,
నీ నీడను తాకలేవు.
నా చేతులు చీకట్లోకి ఎంతగా చాచినా,
నీ వేళ్ళ వెచ్చదనాన్ని అందుకోలేవు.

గాలి నా చెవిలో నీ పేరును పలికినా,
అది కేవలం శూన్య ప్రతిధ్వని.
వాన చినుకులు నా కళ్ళను తడిపినా,
అది నీ చేతి స్పర్శ కాదు.

ఎన్ని కలల తోటలు నాటినా,
నువ్వు లేని పూలకు రంగు రాదు.
ఎన్ని గడియారాలు వెనక్కి తిప్పినా,
నీ అడుగుల శబ్దం
తిరిగి ఈ ముంగిట వినిపించదు.

తీరాన నిల్చున్న దీపస్తంభం లాగా
నీవు వెలిగిన వెలుగులు
ఇప్పుడో మబ్బులో మగ్గిపోయాయి –
సముద్రం పిలిచినా,
నావ ఇక తిరిగి రాదు.

గాలిలో విడిచిన గాలిపటంలా
నీ బంధం సడలిపోయింది –
నా చేతిలో ఇంకా దారం ఉన్నా,
ఆకాశం లోకాన్నే తాకుతున్నావు.

పోయిన మనిషి —
సమయం మింగిన పుస్తకానికి మల్లే,
అధ్యాయాలు ఇంకా మనసులో ఉన్నా,
పేజీలు ఇక తాకలేని దూరంలో ఉంటాయి.

ఇప్పుడు –
పాత ఫోటోలో మసకబారిన చిరునవ్వు,
చదవని లేఖలపై పేరుకున్న దుమ్ము,
పండక ముందే చెట్టుపై ఎండిపోయిన పండు –

అన్నీ నీవు లేని ఈ ఖాళీకి ప్రతిరూపాలే


బాలాజీ పోతుల

రచయిత బాలాజీ పోతుల గురించి:

నారాయణఖేడ్, సంగారెడ్డిలో నివాసం. బాలాజీ పోతుల ఒక తెలుగు రచయిత, కవి. ఆయన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతానికి చెందినవారు. ఆయన రచనలు సామాజిక, వ్యక్తిగత భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ భావోద్వేగభరితంగా, సామాజిక అంశాలను స్పృశిస్తూ ఉంటాయి.

 ...