
భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలంనుండి తెలుగులోకి అనువాదం చేయకుండా ఆంగ్ల అనువాదం ఆధారంగా అనువాదం చేయడం ఒక రకమైన సాంస్కృతిక అపరాధంగా పరిగణించాలి. భారతదేశంలో పలు భాషాకుటుంబాలకు చెందిన భాషలు పలుప్రాంతాలలో విస్తరించి ఉన్నా, అవన్నీ కనీసం మూడువేల యేండ్లపాటు భారత-ఉపఖండంలో కలిసి అభివృద్ధి చెందడం వల్ల, పరస్పరప్రభావాలతో ఈ ఉపఖండం ఏకీకృత భాషాసాంస్కృతిక ప్రదేశంగా (Linguistic Area and Cultural Area) మారిపోయింది. దాదాపు ఒకే రకమైన వాక్యనిర్మాణం, సాహిత్య సంప్రదాయాలు; సామాన్య చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం; సమానార్థకాలైన సామెతలు, పౌరాణిక ప్రతీకలు; అన్ని భాషలలోకి చొచ్చుకుపోయిన సంస్కృత పదజాలం — ఇవన్నీ మూలభావాన్ని మరో భారతీయ భాషలోకి అనువదించడాన్ని సులభతరం చేస్తాయి. ఈ సామీప్యతను, భావ సారూప్యతను విస్మరించి, పాశ్చాత్య సాహిత్య అభిరుచులకు అనుగుణంగా మారిన ఆంగ్లానువాదాన్ని అనుసరించడం వలన మూలభావం పూర్తిగా దెబ్బతింటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ కావ్యంలోని ఒక ఉదాహరణే దీనికి నిదర్శనం. బెంగాలీ మూలంలో ‘వసంతం’ గురించి రాసిన ఒక కవితను ఆంగ్లానువాదంలో ఠాగూర్ సమ్మర్గా మార్చారు. ఎందుకంటే, ఇంగ్లీషు వారికి గ్రీష్మం అతి ఆహ్లాదకరమైన కాలం. సంవత్సరమంతా, చలిలో గడిపి, సమ్మర్-డేస్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సూచించడానికి భారతీయ సాహిత్యంలో వసంతానికి ఏ స్థానం ఉందో, ఇంగ్లీషు సంస్కృతిలో వేసవికి ఆ స్థానం ఉంది. ఈ తేడాను గమనించకుండా, ఆంగ్ల అనువాదం ఆధారంగా చేసిన తెలుగు గీతాంజలి అనువాదాలలో ‘వేసంగి’ నిట్టూర్పులతో వచ్చినట్లు వర్ణించడం ద్వారా, కవి మూల భావానికి పూర్తిగా విరుద్ధమైన భావాన్ని చెప్పి రసాభాస చేసారు పలు తెలుగు అనువాదకులు.
ఒకే గడ్డపై పుట్టిన భాషల మధ్య జరిగే భావ వ్యక్తీకరణలో ఉండే సహజత్వం, ఆ అనువాదాలకు నిండుదనాన్ని ఇస్తుంది. కన్నడంలోగాని, మలయాళంలోగానీ రచయిత మనకు అరిటాకులో ఇచ్చిన దోసె తెలుగులోనూ అరిటాకులోనే ఉంటుంది. అందుకని దోసె రుచే కాకుండా అరిటాకు వాసన కూడా మనకు పట్టుబడుతుంది. అదే ఇంగ్లీషులోకి వచ్చేసరికి అరిటాకు మాయమై పింగాణీపాత్ర ఎదురవుతుంది. తినేది దోసె కాదు, క్రేప్ అవుతుంది, లేదా ప్యాన్కేక్ అవుతుంది. అంటే, రంగు, రుచి, వాసన అన్నీ ఆంగ్ల వాతావరణానికి అనుగుణంగా మారిపోతాయి.
మరో భారతీయ భాష అయిన మూలభాష మనకు తెలియకపోయినా, ఆ మూలభాష తెలిసిన భాషాకోవిదులనో, సాహిత్యాభిమానులనో హైదరాబాదు వంటి పెద్దనగరాల్లో పట్టుకోవడం అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇప్పుడు కృత్రిమమేధ సాయంతో కూడా భారతీయ మూలభాషలోని ప్రతిపదార్థాలను వివరంగా గ్రహించవచ్చు. పాశ్చాత్య సాహిత్య అభిరుచులకు, సాహితీ-సంస్కృతులకు అనుగుణంగా రూపొందించిన ఆంగ్లానువాదాల మీద ఆధారపడటం కంటే, భారతీయ భాషలలోని సాహిత్యాన్ని నేరుగా మూలభాషలలో అధ్యయనం చేసి, భారతీయ సాహిత్య అభిరుచులకు అనుగుణంగా తెలుగులోకి అనువదించడం ఉత్తమం. జర్మన్, ఫ్రెంచ్ వంటి యూరోపియన్ భాషల అనువాదాలకు ఆంగ్ల అనువాదాల మీద పూర్తిగా ఆధారపడడం సబబే అయినా, భారతీయ భాషల రచనలలోని రంగు, రుచి, వాసన, ఆత్మ పట్టుకోవాలంటే, మూలభాషలో రచనను కొంతైనా అధ్యయనం చేయడం అనువాద రచయితల కనీస కర్తవ్యం.