…చరిత్రకారుడి చేతివేళ్ళని తెగనరికి
కొత్త గతాన్ని తిరగరాస్తాయి ఫత్వాలు
ఫత్వాలకు రంగుతేడాల్లేవు
కూల్చే చేతులకు సరిహద్దులూ లేవు
అనంత కాలాల పగలకు
వొక్కక్షణికోద్రేకమే సమాధానం.
…అన్ని మరణాలూ
మట్టిలో కరిగే దేహాలు కావు
నిప్పులో లీనమయ్యే క్షణికాలు కావు
రాలిన రక్తమాంసాల్ని కలిపి కుట్టుకొని
మళ్ళీ సిద్ధమవుతాడు సూర్యుడు
కొత్తదినచర్యకి.
అలాగే, ‘శ్రీనగర్ లో మొహర్రం’ (2009?) లో,
బక్కపలచటి బ్యురాక్రాట్లా
మైదానంలోంచి ఎగురుకుంటూ వస్తాడు యముడు
వీడెప్పుడూ వన్ వే పాసింజెర్ కదా…
తొలకరివాన
కొండల్ని తలబాదుకుని ఏడుస్తుంది
వితంతువులు
చేతులారా గాజులు పగలగొట్టుకుంటున్నట్టు. (మూలం: ఆగా షాహిద్ ఆలీ).
మూలం చెప్పకపోయినా పరవాలేదు. ఈ ఒక్క చరణం కవిత్వం. ఎవరికైనా, ప్రేమతోనే! అన్న మరొక కవితలో,
నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయనినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందులే,
అని అంటూనే అఫ్సర్ నినాద కవితలు రాసాడు. బహుశా అతని నిరంతర ప్రయాణంలో ఒక మజిలీ కావచ్చు. కవితా ప్రవాహంలో ఒక మలుపు కావచ్చు.
దుఃఖ బహిష్కృతుడికి
ఏ దిగులూ లేదు
దేహాన్ని విస్తరించుకోవడం తప్ప!
నువ్వేమిటో
నీపద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,
నల్ల పలకతో వుమ్మితో కాదు
అన్నీ తుడుచుకో నెత్తుటితో!
మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకునువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆట్లో కాసింత ఆనందపు తునకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!
దీనికి తోడుగా, ‘వలస’ లోంచి మరొక కవిత చెప్పకండా ఉండలేను. ఆకుపచ్చని ఆకాశం (27 అక్టోబర్ 2000) అన్న కవితలో,
ఒక రెక్క అలా తెరిచివుంచు
నీలోకీ నిశ్శబ్దంలోకీ.
ఒక దుఃఖాన్ని అలాతెరిచే వుంచు
రెప్పలకింద పచ్చగా.
… అప్పుడప్పుడు కాసింత గోరువెచ్చగా
నీ చీకటిగదిలోకి ప్రవహించే గాలిని
కాసేపు వుండివెళ్ళమని చెప్పు.
…యుద్ధసేన తరుముకొస్తున్నప్పుడు
ఏదో ఒక మూల రవంత నిశ్శబ్దాన్ని కురవనీ
అన్ని విషాదాల్ని అన్ని చీకట్లనీ తుడిచి
దూదిపింజలా ఎగుర్తున్న మబ్బు వెంట నడవనీ
రెప్పలకింద ఆకాశం ఎలా వుంటుందో
ఇప్పుడైనా తెలిసిందా?
అఫ్సర్ నిరంతర ఆశావాదా? ఉల్లాసకరమైన నిరాశావాదా? అదేమో కాని, అఫ్సర్ కవి. లేబుళ్ళు అనవసరం. ఈ సంకలనంలో అందమైన కవితలు చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించీ ప్రస్తావించడానికి వీలు పడదు. వాటిలో కొన్ని: యిక్కడేదో వొక జాంచెట్టు.., అవునా మైక్?, సరిగంగ స్నానం, డెజావూ, ఒక సూఫి సాయంత్రం, వగైరా.
వలస సంకలనం చివర్న రాసుకున్న స్వగతంలో అఫ్సర్ తనగురించి ఇలా చెప్పుకున్నాడు: “…నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని. నేను స్త్రీని. నేను దళితుణ్ణి. నేను మైనారిటీని. నేనొకమూడో ప్రపంచాన్ని. చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట అంతరంగాన్ని. …నేను ఏకవచనం కాదు. అనేక వచనం.”
ఆఖరిగా నా మాట. అఫ్సర్ కవితా సంకలనం ‘ఊరిచివర’, తెప్పించుకొని చదవండి. 119 పేజీల్లో 48 కవితలున్నాయి. మంచి కవిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి మిగులుతుంది. సంపాదకుడు గుడిపాటి ఒక పరిచయం, యన్. వేణుగోపాల్ మరో పరిచయం – వెరసి పదిహేను పేజీల పరిచయవ్యాసాలు రాసారు.
అఫ్సర్ కవితలని ఆస్వాదించడానికి ఈ రెండు పరిచయ వ్యాసాలూ అనవసరం.
(ఊరి చివర, అఫ్సర్ కవితా సంకలనం – డిసెంబర్ 2009. సంపాదకుడు: గుడిపాటి. పాలపిట్ట ప్రచురణలు. Rs. 60/- . $5.00. దొరికేచోటు: Palapitta Books, #16-11-20/6/1/1, 403 Vijayasai residency, Saleemnagar, Malakpet, Hyderabad – 500 036.)