ఈమాట » నాకు నచ్చిన పద్యం - తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన

Expand to right
Expand to left

నాకు నచ్చిన పద్యం - తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన

సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
     దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
    పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
    పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
    మను నొక విల్లెప్పుడును వహించు

ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!

ఇది తిక్కన సోమయాజి పద్యం, భారతం ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం లోనిది. ద్రౌపది కోపం అనేది తెలుస్తూనే ఉన్నది. కానీ ఇది కేవలం కోపమేనా, లేక కోపమూ,శోకమూ, ఆక్రోశమూ - విస్ఫులింగాల లాగా ఆమె హృదయంలో విజృంభించిన సర్వావేశాల సమాహారమా!నెమ్మదిగా చర్చించుకుందాం.

తిక్కన మహాభారత రచనను అసిధారావ్రతంగా నిర్వహించాడని పెద్దలు చెబుతారు. పదిహేను పర్వాలుగా ప్రవహించిన ఆ కవితా ధార లోని ప్రతి పద్యమూ అందుకు సాక్ష్యమే. నిర్వచనోత్తర రామాయణం రాసిన తరువాత, యజ్ఙం చేసి సోమయాజియై, ఆ తర్వాతనే తిక్కన భారత రచనకు ఉపక్రమించాడని అంటారు. దీనినిబట్టి అర్ధమవుతుంది, తిక్కన భారత రచనను ఎంత పవిత్రకార్యం గా భావించాడో అని. కవిత్రయం లో ద్వితీయుడైన తిక్కన కవిత్వంలో మాత్రం అద్వితీయుడు. తెలుగు పదాలను బహుళంగా వాడి కావ్యాల్లో సంస్కృతానికి సమానమైన ప్రతిపత్తిని తెలుగుకు కట్టబెట్టిన మహనీయుడు తిక్కన. కవిత్వంలో నాటకీయతకు తిక్కననే చెబుతారు. పై పద్యం దానికి సాక్ష్యం! చక్కనైన, వినగానే ప్రాణం లేచొచ్చే తెలుగు పదాలు ధారాళంగా వాడినవాడు తిక్కన. పై పద్యమే సాక్ష్యం! గుండెల్లోంచి దూసుకువచ్చే ఆవేశానికి, చిన్న చిన్న తెలుగు పదాల పలుకుబళ్ళతో ప్రవాహ వేగాన్ని సాధించిన అద్భుత శిల్పి తిక్కన. పై పద్యమే సాక్ష్యం! “తను గావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు” అని తిక్కనను గూర్చి ఎర్రన ఇచ్చిన తీర్పు - ఏ అప్పీలు లేని తీర్పు.

కురుసభకు రాయబారానికి పోయేముందు కృష్ణుడు పాండవుల అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని పై విధంగా చెప్పింది ద్రౌపది. దుశ్శాసనుడంటే ఎంత కోపం ఆమెకు! “ఈ వెండ్రుకలు బట్టి యీడ్చిన యా చేయి” అని, ఆ తర్వాత, కాదు, చేయి మాత్రమే కాదు “తనువు ఇంతలింతలు తునియలై చెదరి రూపఱి యున్న” అప్పుడు, వాటిని చూసిన తర్వాత “ఉడుకు ఆరును” గానీ, ఈ కసి, ఈ “చిచ్చు” - “అలుపాల పొనుపడునట్టి చిచ్చేయిది”? అల్పకార్యాలతో ఆరిపోయే నిప్పా యిది? పెద్ద గద నొకటి పట్టుకున్న భీముడి బాహుబలమూ, గాండీవమనే గొప్ప విల్లొకటి పట్టుకుని తిరిగే “కఱ్ఱి విక్రమంబు” - ఎందుకివి? కాల్చనా? కఱ్ఱి అనేది క్రీడి అన్న పదానికి తిక్కన సృష్టించుకున్న తెలుగు మాట. కఱ్ఱి - నల్లని వాడు. ఆర్జునుడు నల్లని వాడు. ఇప్పటికైనా, ఇన్ని కష్టాలు పడ్డ ధర్మరాజూ, నేనూ “రాజరాజు పీనుంగు”ను “కన్నార” కానబడయమైతిమేని, కృష్ణా! - అని అంటున్నది ద్రౌపది. ఏమి ఆక్రోశం! ఎంత అద్భుతంగా దానిని రూపుకట్టిందీ పద్యం!

అసలు పద్యం ఎత్తుకోవడమే చూడండి. ద్రౌపదికి కౌరవులు అనగానే దుశ్శాసనుడి చెయ్యే గుర్తుకు రావడం సహజం. ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి అని, అంతలోనే, కాదు కాదు, అన్నిటికన్నా ముందే, శరీరమంతా చిన్న చిన్న ముక్కలై చెదిరి రూపు మాసి పడివుంటే, చూసిన తర్వాత గానీ ఆరిపోని చిచ్చు ఇది, అనడంలో ఎంత దహించుకుపోయే ఆవేశం కనుపడుతోంది! అంతే కాదు దుర్యోధనుడి పీనుగను తనూ ధర్మరాజూ చూడలేక పోయినట్లైతే, భీముడి గదా, అర్జునుడి విల్లూ - ఇవి ఎందుకు, కాల్పనా? ఎంత తీసిపారేసినట్లు మాట్లాడిందో చూడండి, భీమార్జునులను గురించి.భయంకరమైన అవమానానికి గురైన ఒక కులసతి గుండెకోతకు ఎక్స్-రే చిత్రం కదా, ఈ పద్యం.

పై పద్యం రాసేటప్పుడు గణాలూ, యతులూ, వీటిని గూర్చి ఆలేచించే వుండడు, తిక్కన కవి. సాధారణ కవులు గణాలూ, యతులూ సరిచూసుకుంటూ, పదమూ, పదమూ పట్టి చూసుకుంటూ రాస్తారు. మంచి కవులు ఛందస్సు పరిధి లోనే తమ ఉపజ్ఞను వినియోగించుకుంటూ అద్భుతమైన పద్యాలు సృష్టిస్తారు. మహాకవులు ఛందస్సు ను లెక్క చేయరు, ఛందస్సే వారి నోటినుంచి వచ్చే మాట కోసం ఎదురుచూసి, ఊడిగం చేసిపోతుంది. కోపమూ, శోకమూ, ఆక్రోశమూ ముప్పిరిగొన్న ద్రౌపది సంభాషణా ప్రవాహానికి సూర్యుడూ, చంద్రుడు, మహర్షులూ తలకాయలు వొంచుకుని నిలబడ్డారు. సూర్య, ఇంద్ర, చంద్ర గణాలూ, యతులూ ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయాయో మీరే చూడండి! ఔను, ఇది స్వచ్ఛమైన సీస పద్యమే! మహాకవికి ఛందస్సు విధేయంగా ఉంటుందంటారు. తిక్కన మహాకవి. అత్యంత సామాన్యమైన చిన్న చిన్న తెలుగు పదాల్లోంచి ఎంత గరిష్ఠమైన శబ్దశక్తిని విస్ఫోటింప చేశాడో గమనించండి. పరమాణువు లోనుంచి ప్రళయాత్మకమైన శక్తిని విడుదల చేసే ఒక శబ్ద శాస్త్రవేత్తలా కనిపిస్తాడు నాకు, తిక్కన కవి.

తెలుగు సాహిత్యం మొత్తంలోనే నాకు అత్యంత ప్రియమైన పద్యం ఇది.

 

(11 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. kalidas అభిప్రాయం:

    July 2, 2007 7:21 pm


    మీరు సీస పద్యాన్ని 8 పాదాలుగ విడదీసి వ్రాస్తే బాగుండేది.

  2. Aanamdu అభిప్రాయం:

    July 14, 2007 2:31 pm

    ఎంత బాగా చెప్పారండీ. తిక్కన మహాకవి గురించి మరికొంత చెప్పి మా అజ్ఞానాన్ని తొలగించ ప్రార్థన.

    ఆనందు

  3. C.S.Rao అభిప్రాయం:

    July 18, 2007 5:44 pm

    తిక్కన గారి గొప్ప పద్యానికి బృందావన రావు గారి వ్యాఖ్యానం చాలా బావుంది.

    ద్రౌపది హోమగుండం నుండి ఆవిర్భవించిన అయోనిజ.మహారాణి.ఒక కౄరుడి దుశ్చర్యకి లోనై పరాభవాగ్ని తో ప్రతీకారం కోసం వేచిచూస్తున్న మూర్తీభవించిన పౌరుషాగ్ని.
    ఈ దుశ్చర్యకు పాలుబడిన దుశ్శాసనునికి ,చేయే కాదు శరీరం మొత్తం ఖండ ఖండాలుగా ,తుత్తునియలుగా నరకబడి యుధ్ధరంగం మీద పడి ఉండటం చూసినప్పుడే ఆమెకు,ధర్మరాజుకు మనశ్శాంతి.
    ఇక భీమార్జునలును,వారి ఆయుధాలను ఒకింత చులకనగా మాట్లాడి వారి పౌరుషాన్ని జాజ్వల్యమానం చేయదలచుకున్నది.
    ఆ మహా సాధ్వి దుఃఖావేశంతో,క్రోధావేశంతో ఉన్నప్పుడు దేవతలకు ప్రతీకలైన సూర్య,చంద్రులు,మహర్షులకు ప్రతీకలైన యతీంద్రులు అవనత శిరస్కులై ఉన్నారనడం లో అందమైన శ్లేష ఉన్నది.ద్రౌపది క్రోధావేశానికి తిక్కన కవితాశక్తికి భయపడి సూర్య,చంద్ర,ఇంద్ర,గణాలు,యతిప్రాసలు భయభక్తులతో మెత్తగా ఒదిగిపొయ్యారని శ్లేషార్ధం.
    బావుందండీ.అభినందనలు.

  4. రానారె అభిప్రాయం:

    September 4, 2007 10:21 am

    ఈ పద్యము, మీ వ్యాఖ్యానమూ చదివి చాలా ఆనందం కలిగింది. ఏదైనా రాస్తే దానిచుట్టూ ఎన్నివిషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఈ ఉదాహరణ మరొక్కసారి గుర్తుచేసింది. ధన్యవాదాలు.

  5. sivaram అభిప్రాయం:

    September 10, 2008 7:51 am

    చాలా కృతజ్ఞతలు. ఉద్యోగపర్వము లో ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు వివరిస్తే చదవాలని చాల ఆత్రుతగా ఉంది. దయ ఉంచి వాటిని తెలియచేయగలరు.

    ధన్యవాదములు,
    శివరామ ప్రతాప్ రవ్వ

  6. Srinivas Nagulapalli అభిప్రాయం:

    September 11, 2008 11:47 am

    నమస్కారం.
    నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.

    ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.

    అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!

    పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
    ***
    విధేయుడు
    Srinivas

  7. పాణిని శంఖవరం అభిప్రాయం:

    September 11, 2008 4:07 pm

    “ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”
    అన్నారు శ్రీనివాస్ నాగులపల్లిగారు.
    అందుకే కాబోలు, ఈ వ్యాసపరంపరకు శీర్షిక “మీకు నచ్చవలసిన పద్యం: …” అని లేదు!
    అన్యధా భావించకండి, మీ అభిప్రాయం చదివాక వచ్చిన చిన్ని ఆలోచన, అంతే.

  8. కొత్తపాళీ అభిప్రాయం:

    September 12, 2008 3:28 am

    పాణినిగారూ, తెలిసిన పెద్దవాళ్ళు నాకీ ఫలానా పద్యం నచ్చింది అని ఒక వ్యాసం రాయడమూ, దాన్ని ఈమాట వంటి పత్రిక ప్రచురించడమూ జరిగిందంటే ఇది మీక్కూడా నచ్చవలసిన పద్యం నాయనా అని చెప్పక చెప్పినట్లే. అఫ్కోర్సు అన్ని పద్యాలూ అందరికీ నచ్చాలని లేదనుకోండీ.

  9. Srinivas Nagulapalli అభిప్రాయం:

    September 12, 2008 7:30 am

    పాణిని గారు
    నిజమే. పద్యం నచ్చడం, నచ్చకపోవడం నాకైనా, వ్యాసకర్త కైనా ఒక్క మాటలో చెప్పడం ప్రధానం కాదు, అవసరం లేదు. ఎందుకు నచ్చిందో, నచ్చలేదో అని సాహిత్య పరంగా స్పర్శించడానికి, పంచుకోవడానికి, చర్చించడానికి మాత్రమే వ్యాసాల ఉపయోగం, అభిప్రాయాలను వ్రాయడం, ప్రచురించడం, పాఠకులు చదవడం _ పడే శ్రమ అంతానూ.

    “సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు ఈ పద్యంలో ఎంత అద్భుతంగా
    ఒదిగిపోయాయో” అన్నారు వ్యాసకర్త. అవి సాయపడే helpful, may be even necessary అంశాలు అయినా, అంత మాత్రంచేత గొప్ప పద్యానికి అవి ఏ మాత్రం అవసరమయ్యే, sufficient conditions కావేమో అని అనిపిస్తుంది.

    సోదాహరణంగా చెప్పాలంటే, మన సామెత, (ఎన్నో సామెతల పుస్తకాలలో అచ్చేసింది కూడా), ఇట్లా వ్రాస్తే
    “జగడమె ట్లావచ్చు జంగమ య్యాయంటె
    బిచ్చము పెట్టవే బొచ్చు ముంX” అన్నదాన్ని,

    సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు, ప్రాసయతులు అద్భుతంగా ఒదిగిపోయిన గొప్ప, సీస పద్య పాదం అది అని అంటామా, అనుకుంటామా!
    .
    అయ్యో, తిక్కన గారి కవిత్వాన్ని ఎత్తి చూపడానికి మనకు ఈ పద్యమే దొరికిందా అని గింజుకుంటూ వ్రాసింది మాత్రమే ఇది.
    I change little bit the saying “with friends like this who needs enemies”, to say, “with examples like this, what need for critics” for the poet !

    విధేయుడు
    Srinivas

  10. mOhana అభిప్రాయం:

    September 12, 2008 10:46 am

    తెలుగు కావ్యాలలో సామాన్యముగా వాడబడే ఛందస్సులలో చంద్రగణములు లేవు. అలా ఉన్న అక్కరలను గానీ, షట్పదలను గాని తెలుగు కవులు ఉపయోగించ లేదు (ఇటీవలి
    సత్యనారాయణగారు తప్ప). నచ్చుతాయో లేవో కానీ మంచి పద్యాలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయని ఈ కాలపువారికి విడమరచి చెప్పడం బృందావవనరావుగారు చేస్తుండే
    గొప్ప సేవ. అది ఎంతో ప్రశంసనీయం. ఒక పద్యంలో ధార ఉందో లేదో అన్నది వారివారి ఇష్టాయిష్టాలపై ఆధారపడినది. నావరకు నాకు సీసం లాటి దేశి ఛందస్సులో పదాలను గణాలకు సరిపోయేటట్లు వాడితే బాగుంటుంది. పదాలను (అర్ధ)పాదాలకు వంతెనగా పెట్టితే పాడటానికి (చదవడానికి) కష్టం అనే అభిప్రాయము గల వాడిని నేను.
    విధేయుడు - మోహన

  11. Kameswara Rao అభిప్రాయం:

    September 13, 2008 1:36 am

    శ్రీనివాస్ గారు,
    “ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”
    ఈ పద్యం ఆకట్టుకోవడం కోసం రాసిన పద్యం కాదు. మీరు చెప్పిన “వరమున బుట్టితిన్” పద్యంలో ద్రౌపది ఆత్మప్రత్యయం ఉంది. దానికి తగినట్టు పద్యం నడక ఠీవిగా సాగింది. మరి ఈ పద్యంలో ఏముంది? ద్రౌపదిలో చాలా రోజులుగా అణిగి ఉన్న విద్వేష జ్వాల ఉబకడం ఉంది. అందులో ఠీవీలేదు, ఔద్ధత్యం లేదు. తీరూ తెన్నూ లేకుండా, లోపల ఉన్న కసి ఉన్నదున్నట్టుగా కట్టలు తెంచుకోవడమే ఉంది. అది ఎవరినీ ఆకట్టుకోలేదు కదా!
    ఇక మీకిది మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళ తిట్టుకోవడంలా కనిపించడానికి కారణం ఈ పద్యాన్ని ఇలా విడిగా చదవడం అని ఊహిస్తున్నాను. ఇలాటి పద్యాల గురించి విడిగా రాయడంలో ఉన్న ఇబ్బంది ఇది. వీలైతే తిక్కన భారతంలో ఈ సన్నివేశాన్ని ఏకబిగిన చదవండి. అందులో ద్రౌపది “రక్కెస తాల్మి”తో మదిలో అణచుకున్న ఈ చిచ్చుని మీరు అనుభవించ గలిగితే, ఈ మాటల్లో మీకు ఆవేశం కనిపించదు, మనిషి లోలోతు పొరల్లో దాగి ఉన్న ఒక జాంతవమైన కసి నగ్నంగా సాక్షాత్కరిస్తుంది.
    మరి ఇట్లాంటి అనుభూతిని ఎందుకిలా సీస పద్యంలో రాయాలి, వచనంలో రాయవచ్చు కదా, మరింత శక్తివంతంగా అని సందేహం. దీనికి కచ్చితమైన సమాధానం అంటూ ఏదీ ఉండదనుకుంటాను. నాకు తోచినది, ద్రౌపది వ్యక్తిత్వంలో సహజమైన ఒక ఠీవీ హుందాతనం ఉన్నాయి, సీస పద్యానికున్న సహజమైన నడకలాగే. దాన్ని తోసిరాజని కసి కట్టలు తెంచుకుంది. సీసమూ అలాగే కట్టలుతెంచుకుంది. “సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయాయో” అనడంలో బృందావనరావుగారి ఉద్దేశం ఇదే అనుకుంటాను.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a