ఈమాట » సాహిత్య చర్చలు – పర్యవసానాలు

Expand to right
Expand to left

సాహిత్య చర్చలు – పర్యవసానాలు

గత నెల రోజులుగా తెలుగు దినపత్రిక వార్త ఆదివారం సంచికలలో సాహిత్యాన్ని గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చర్చ “మనకవులు అక్షరాస్యులేనా,” అని గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నతో మొదలైంది. దానిమీద వెల్చేరు నారాయణ రావు వివరణ గా ఒక వ్యాసం రాస్తూ మనకవులకి కవిత్వం రాయడానికి ఎటువంటి శిక్షణ వుంటోంది, అంతకన్న ముఖ్యంగా మన విమర్శకులకి విమర్శ రాయడంలో ఎలాటి తరిఫీదు వుంటోంది అన్న విషయాలు ఆలోచించమని కోరారు.

గుడిపాటి, నారాయణరావు రేకెత్తించిన విషయాలమీద ఆలోచనాయుతంగా చర్చజరిగితే చాలా లాభం వుండేది. కాని జరుగుతున్న చర్చల ధోరణి చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఈ రోజుల్లో తెలుగులో చర్చలు, ముఖ్యంగా సాహితీ చర్చలు వ్యక్తి నిందలతోటీ, కొరగాని ఆవేశాలతోటీ, గజిబిజి వాక్యాలతోటీ అంతంకావడం మనకి కొత్త కాదు. కాని, ఈ అసక్తి కరమైన ప్రశ్నలమీద చర్చ అలా కావడం, దురదృష్టమేకాదు, అన్యాయం కూడాను! వ్యక్తి నిందలూ ఆవేశ ప్రకటనలూ ఎవరికీ లాభం చెయ్యవు. ఆలోచనలకి అసలు పనికిరావు. అందుకని, కొన్ని విషయాలలో స్పష్టతకోసం ఇది రాస్తున్నాను.

మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.

మాండలికం లో రాస్తే మంచి కవిత్వం కాదు, శిష్ట భాషలో రాస్తేనే అది మంచి కవిత్వం అవుతుంది అనే వాదం తెలుగు సాహిత్యంలో వెనకబట్టి చాలాకాలం అయింది. It is passé. ఆ వాదాన్ని మళ్ళా పైకి తేవాలని ఈ చర్చలో ఒక ప్రయత్నం జరగడంతో చర్చ మరీ వక్రించి తప్పు దారి పట్టింది. తెలంగాణా భాషలో రాసినా, రాయల సీమ భాషలో రాసినా, ఉత్తరాంధ్ర భాషలో రాసినా, దళిత , వెనుకబడిన కులాల భాషలో రాసినా, ముందున్న కులాల భాషలో రాసినా, రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.

అర్థం: కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.

తెలుగులో ఇప్పుడు వొస్తున్న రకరకాల కవిత్వాలకి అన్నిటికీ ఒకే విమర్శసిద్ధాంతం వర్తించవలసిన అవసరం లేదు. ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ఆ విషయం దూరంనించి చూస్తున్న మాకు స్పష్టంగానే తెలుస్తోంది.

అయితే విమర్శల్లో ఏది మంచిది, సమర్థ మైనది, ఏది అనవసరపు ఆవేశాలతోనూ, ఊకదంపుగా గజిబిజి వాక్యాలతోనూ నిండిన అసమర్థ విమర్శ అన్న సంగతి ఆయాకవితా రంగాల్లో వున్న విమర్శకులే చెప్పాలి. తమ విమర్శకులకి కావలసిన తరిఫీదు ఎలా వుండాలో వాళ్ళే నిర్ణయించాలి.

తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.

ప్ర పంచం చిన్నదవుతోంది. ఈ ప్రపంచంలో మారుమూల ప్రాంతాలు లేవు, పట్టుదలవున్నవాళ్ళ కి అందుబాటులో లేని భాషలు లేవు. ప్రయత్నిస్తే దొరకని పుస్తకాలు లేవు. తెలంగాణాలో అచ్చయిన పుస్తకం అరునెలలు దాటే సరికి — మిగతా దేశాల సంగతి నాకు తెలియ దు కాని — అమెరికాలో తెలుగు పుస్తకాలు కొనే విశ్వవిద్యాలయాల గ్రంధాలయాల్లోదొరుకుతోంది. అంతే కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తులు పనికట్టుకొని అక్కడ అచ్చైన ప్రతి పుస్తకం తెప్పించుకోవడం నేను ఎరుగుదును. పోతే, పత్రికలు ఇంటర్నెట్ లో ఏరోజుకారోజు చదువుకోడానికి వీలవుతోంది. తెలుగు లో వొచ్చే రకరకాల వెబ్ సైట్ లలో వొచ్చే వ్యాసాలూ, విమర్శలూ సులభంగా అందుతున్నాయి. ప్ర పంచ కవిత్వ సంకలనాలలో తెలుగు కవిత్వం కనిపిస్తోంది. తెలుగు పూర్వంలాగా పేరుతెలియని మారుమూల భాష కాదు. అది ప్రపంచ భాషగా ఎదుగుతోంది. మేం కోరుకునేంత వేగంగా కాకపోయినా, నెమ్మదిగా అయినా ఎదుగుతోంది.

ఈ ఎదుగుదలని గమనించి, దానికి తోడ్పడగల శక్తి తెలుగులో రాస్తున్న కవుల చేతుల్లోనూ, విమర్శకుల చేతుల్లోనూ వుంది. కవిత్వానికీ, విమర్శకీ వాళ్ళు ఏర్పరిచే ప్రమాణాలు ప్రపంచస్థాయికి చేరుకోవాలని మా కోరిక.

తెలుగు సాహిత్యాన్ని పరిశీలనగాచూస్తున్న వాళ్ళు — అమెరికాలో — ఎక్కువమంది లేకపోయినా – కొద్ది మందైనా వున్నారు. అందులో తెలుగువాళ్ళూ, తెలుగు నేర్చుకున్న అమెరికన్లూ, ఇతర దేశాల వాళ్ళూ ఉన్నారు. వాళ్ళు చాలా విషయాలు చదువుతున్నారు. ఒకరికి తెలియని సంగతులు మరొకర్ని అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగు దేశంలో వున్నవాళ్ళతో సహా వాళ్ళు చాలా మందితో చర్చిస్తున్నారు. కొత్తసమాచారం దొరికినప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో కొందరు ఎంత జాగ్రత్తగా తెలుగు సాహిత్య చర్చలు గమనిస్తున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. గత వారం , 27 ఆగష్టు వార్త లో, తెలుగు కవులు అక్ష రాస్యులేనా అనే ప్రశ్న మీద జరుగుతున్న చర్చలో భాగంగా కాసుల ప్రతాపరెడ్డి రాసిన వ్యాసం ఇక్కడ కొందరు చదివారు. చివరి పేరాలో ఒక వాక్యం తమకి బోధపడలేదనీ, తాము నేర్చుకున్నతెలుగు వ్యాకరణం ప్రకారం అన్వయం కుదరడం లేదనీ వాళ్ళు నాకు ఆ వాక్యాన్నిచూపించారు. ఆ వాక్యం ఇది.

“తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, చర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని నేను భావించడం లేదు.”

సదరు వాక్యానికి నేను అన్వయం చెప్పలేకపోయాను.

 

(9 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Madhav Machavaram అభిప్రాయం:

    September 3, 2006 5:05 am

    ఇందులో అన్వయం చెప్పుకోలేక పోడానికీ, అర్ధం కాక పోడానికీ ఏముంది? వాక్యక్రమంలో అన్వయాలు వెతుక్కునే ఛాందసులకిది తప్పనో, ఫ్రాయిడియన్ స్లిప్పనో అనిపించచ్చు గానీ, ఇది నిజానికి చాలా లోతైన వాక్య నిర్మాణం. తెలుగు సాహత్యకుల గురించి జగద్విఖ్యాతమైన రహస్యాన్ని పునరుద్ఘాటిస్తూనే, గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నకి సమాధానమిచ్చిన, రెండువైపుల పదునున్న కత్తి లాంటి వాక్యం. ఇదీ అర్ధం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు?

  2. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    September 4, 2006 1:33 pm

    నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.

    గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు - వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … - ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.

    వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.

    వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.

    అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!

    నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం - ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.

    విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. Chimata Rajendra prasad అభిప్రాయం:

    September 5, 2006 8:42 am

    “తెలుగు పూర్వంలాగా పేరుతెలియని మారుమూల భాష కాదు. అది ప్రపంచ భాషగా ఎదుగుతోంది. మేం కోరుకునేంత వేగంగా కాకపోయినా, నెమ్మదిగా అయినా ఎదుగుతోంది” చాలా సంతోషం కలిగించింది.
    “తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, నేను భావించడం లేదు.”
    “తెలుగు సాహిత్యం లోచర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని, నేను భావించడం లేదు.” పరస్పర విరుద్ధమైన భావాలు.ముద్రారాక్షసమా?
    “ఇది నిజానికి చాలా లోతైన వాక్య నిర్మాణం. తెలుగు సాహత్యకుల గురించి జగద్విఖ్యాతమైన రహస్యాన్ని పునరుద్ఘాటిస్తూనే, గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నకి సమాధానమిచ్చిన, రెండువైపుల పదునున్న కత్తి లాంటి వాక్యం. ఇదీ అర్ధం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ”
    “తెలుగు సాహత్యకుల” శ్లేషా?!?!

  4. అనానిమస్తు అభిప్రాయం:

    September 6, 2006 1:48 pm

    చిమట గారి వ్యాఖ్యలో:
    ===>
    “తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, నేను భావించడం లేదు.”
    “తెలుగు సాహిత్యం లోచర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని, నేను భావించడం లేదు.” పరస్పర విరుద్ధమైన భావాలు.
    ===>
    సాహిత్యకారులు పునరాలోచనలో పడడానికి చర్చలు కాక మరేదైన కారణం ఉండొచ్చునని అనుకోవచ్చు కదా. పదవులు, అవార్డులు, కులాలు, ప్రాంతాలు, వాదాలు, స్నేహం వీటి వల్ల పూర్వాశ్రమంలో తమ అభిప్రాయాలు మార్చుకున్న పెద్దమనుషుల దాఖలాలేవీ మనకు లేవా?

    ఐనా ఒక వ్యాసంలో ఒక వాక్యాన్ని ఇలా out of context కోట్ చేయడం వల్ల పాఠకులకి clarity కన్నా confusion ఎక్కువ. సంపాదకీయంలో ఇలాంటివి ఉండడం అనుచితంగా ఉంది.

  5. వెల్చేరు నారాయణ రావు అభిప్రాయం:

    September 9, 2006 10:57 am

    కొడవళ్ల హనుమంత రావుగారు ఈ మాటలో వేలూరి సంపాదకీయం మీద రాసిన అభిప్రాయం/విమర్శ ఎందుకు, ఏంసాధించడానికి రాశారో నాకు అర్థం కాలేదు. కానిఅందులొ కొన్నిమాటలు వార్త లో నేను రాసిన వ్యాసానికి సంబధించినవి కాబట్టిఈ నాలుగు వాక్యాలూ ఇక్కడ రాస్తున్నాను.

    మొదటి సంగతి: గుడిపాటి అడిగిన మన కవులు అక్షరాస్యులేనా అన్న ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని, నేను ఆ ప్రశ్న తిప్పి మన విమర్శకులు అక్షరాస్యులేనా అని అడిగిన ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని నిందార్థం ఏమీ లేదని, వాళ్ళకి అ ఆ లు వొచ్చునా అని ఆ మాటకి అర్థం కాదనీ, ఇంగ్లీషులో cultural literacy, fiscal literacy అనే మాటల్లో literacy లాటిది ఈ అక్షరాస్యత అనే మాట అనీ హనుమంతరావు గారికి తెలియలేదని నేను అనుకోలేకపోతున్నాను. అది ఆయన ఊహకి అందనంత గహనమైన విషయం కాదు. నా వ్యాసం చివరదాకా చదివితే, నేను ఆ వ్యాసంలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది. ఆయన నా వ్యాసం పూర్తిగా చదవలేదనీ, నేను ఆవ్యాసంలో వేసిన ప్రశ్నలు — తెలుగులో విమర్శకులు తయారవడానికి అందుబాటులో వున్న అవకాశా లేమిటి, వాళ్ళు చదవ వలసిన పుస్తకాలు, పొందవలసిన శిక్షణ ఏమిటి — అనేవి ఆ సంగతుల మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు దృష్టిపెట్టేట్టు చెయ్యడానికి వేసిన ప్రశ్నలు అని హనుమంతరావు గారు బోధపరుచుకోలేక పోయారనీ కూడా నేను అనుకోవడం లేదు. పైగాఈ చర్చలలో ప్రధాన విషయాన్ని ఆయన గమనించలేదని అనుకోడానికీ వీలులేదు: “వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది. ” అని ఒక అభిప్రాయం చెప్పారు కాబట్టి. కాని ఆయన పరమ వినయంగా ఈవిషయాన్ని, దీనికి సంబంధించిన వివరాల్నీ వొదిలేసి ఆయనకి ఇష్టమైన మరో విషయంలోకి తన వ్యాఖ్యానాన్ని మళ్లించారు.

    ఈ దేశంలో liberal education లో భాగంగా చర్చని ప్రధాన విషయాల మీద కేంద్రీకరించే పద్ధతీ, అప్రధాన విషాయలవేపు మళ్లకుండా వుండే జాగ్రత్తలూ నేర్పుతారు. ఈ శిక్షణని హనుమంతరావు గారు పొందలేదని నేను అనుకోను. అయినా ఆయన అసలు విషయాన్ని వొదిలేసి మరొక దారి లో వ్యాఖ్యానాలు చెయ్యడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.

    తెలుగు సాహిత్యరంగంలో ఆయన కోరుకునే రకమైన పుస్తకాలు రావడంలేదు. ఆయనకి బోధపడేలా ఉదాహరణలూ దృష్టాంతాలూ ఉన్న పుస్తకాలూ, వ్యాసాలూ ఎవరో ఒకరు తప్ప ఎక్కువమంది రాయడం లేదు. ఇది ఆయన లేవనెత్తుతున్న సమస్య. ఈ సమస్య చాలా ముఖ్యమైనది, వివరంగా చర్చించదగినదీని. ఇది అయితే దీన్ని గురించి వేరే వ్యాసంలో పరిశీలన చెయ్యాలి. అంతేకాని వేలూరి వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయం మీద అలవోకగా చేసే వ్యాఖ్యానంలో భాగం చెయ్యకూడదు.

    (హనుమంతరావు గారిని ఇంతగా మథనపెడుతున్న ఈ సమస్య ని ఈమాట లో వివరంగా చర్చించడానికి వొచ్చే నెల సంచిక కోసం నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అది ఈమాటలో ప్రచురించబడితే అప్పుడు ఆ విషయం ప్రధానవిషయంగా చర్చలు కొనసాగుతాయని ఆశిస్తాను.)

    వార్తలో గుడిపాటీ, నేనూ, ఆ తరవాత ఈమాటలో వేలూరి చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబధించినది కాదు. వ్యవస్థ కి సంబంధించినది. తెలుగులో కవులూ, విమర్శకులూ శిక్షణ పొందడానికి ఎలాటి సంస్థలు ఉన్నాయి? ఈ రంగం లో ప్రమాణాలు ఎలా నిర్ణయించ బడతాయి? తెలుగు సాహిత్య రంగం కేవలం ఔత్సాహికులు ప్రధానంగా వుండే రంగంగా ఉండి పోకుండా ఇది professionalize ఎలా అవుతుంది? ఈ ప్రశ్నలు ముందు ఈరంగంలో వున్న పదిమందీ వేసుకుంటే — వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో తెలుగు సాహిత్య రంగం వ్యవస్థీకరించ బడడానికి అవసరమైన సంస్థల్ని నిర్మించే ఆలోచనలు చేస్తారని ఒక ఆశ.

    ఈ చర్చ తెలుగు దేశం లోనే జరగ వలసిన అవసరం లేదు. వేలూరి అన్నట్టుగా తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోంది. అంచేత ఇందులో మనకి కూడా జాగా వుంది.

    VNR

  6. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    September 10, 2006 1:35 pm

    వెల్చేరుతో విభేదం

    అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.

    బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.

    అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.

    నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు - ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు - ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.

    అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?

    ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:

    “Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.

    నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.

    నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.

    అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.

    “పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.

    “గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”

    శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం - ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. వెల్చేరు నారాయణ రావు అభిప్రాయం:

    September 10, 2006 3:38 pm

    మనం ఈ చర్చని ముందుకి తీసికెళ్లాలి, వెనక్కి కాదు. అంచేత గుడిపాటి లేవనెత్తిన ప్రశ్న సారాంశాన్నీ, నావ్యాసంలో చర్చకి ఉపయోగపడే ప్రధానాంశాల్నీ మాత్రమే ప్రస్తావిద్దాం. మాటకి మాట తెగులు అని తెలుగులోఒక సామెత వుంది. అది గుర్తుపెట్టుకుని క్లుప్తంగా రాద్దాం. చర్చించవలసిన విషయాలు చాలా వున్నాయి.

    వెల్చేరు నారాయణ రావు.

  8. విప్లవ్ అభిప్రాయం:

    September 10, 2006 7:29 pm

    వేలూరి చెప్పిన అయిదు విషయాలు మక్కీకి మక్కీ:

    1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”

    2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”

    3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”

    4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”

    5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”

    వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?

    కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.

    విప్లవ్

  9. Dr.Darla VenkaeswaraRao అభిప్రాయం:

    October 10, 2006 9:32 pm

    సంపాదకులకు నమస్కారం!
    తెలుగులో అర్ధవంతమయిన చర్చ జరుగుతుంది. తెలుగులో ఈ వెబ్
    నడుపుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
    డా.దార్ల వెంకటేశ్వరరావు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a